Sunday, June 30, 2019

Princess Diana almost starred in 'The Bodyguard' sequel


ఇంగ్లిష్ సినిమాలో నటించాలనుకున్న ప్రిన్సెస్ డయానా
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ లేడీ డయానా (డయానా ఫ్రాన్సెస్ స్పెన్సర్) ఓ హాలివుడ్ మూవీలో నటించాలని అనుకున్నారు. కథా చర్చలు అన్నీ పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో సినిమా నిర్మాణం ప్రారంభమవుతుందనగా దురదృష్టవశాత్తు ఆమె పారిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని హాలివుడ్ నటుడు, దర్శకుడు కెవిన్ మైఖెల్ కాస్టనర్ బయటపెట్టాడు. `పీపుల్ టి.వి. కౌచ్   సర్ఫింగ్` కార్యక్రమం (ఇంటర్వ్యూ) లో ఈ వివరాలు వెల్లడించారు. పలు విజయవంతమైన చిత్రాలను తీసిన కాస్టనర్ రెండు అకాడెమీ అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్నాడు. `రాబిన్ హుడ్: ప్రిన్సెస్ ఆఫ్ థీవ్స్`(1991), `ది బాడీ గార్డ్`(1992), `ఎ పెర్ఫెక్ట్ వరల్డ్`(1993) వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు దర్శకత్వం వహించారు. 1992లో తీసిన థ్రిల్లర్ మూవీ ది బాడీ గార్డ్ సెన్సెషనల్ హిట్ సాధించింది. ఈచిత్రంలో అమెరికా సింగర్, నటి విట్నీ హోస్టన్ నటించింది. అదే ఏడాది బాడీగార్డ్-2 చిత్రం తీయాలని కాస్టనర్ భావించారట. అందులో డయానా నటిస్తే బావుంటుందనుకున్న ఆయన నేరుగా డయానాతో ఫోన్ లో సంభాషిస్తే ఆమె అంగీకరించారట. సినిమాలో ముద్దు సన్నివేశాలుంటాయా అని డయానా ప్రశ్నించారట. అక్కడక్కడ ఒకటి, రెండు సన్నివేశాలుంటాయి.. వద్దనుకుంటే అవి లేకుండా చిత్రీకరిద్దామన్నట్లు కాస్టనర్ తెలిపారు. తనకు రాచరిక సంప్రదాయాలు కొన్ని ఉంటాయన్న విషయాన్ని డయానా ఈ సందర్భంగా తనకు చెప్పారన్నారు. బాడీగార్డ్-2 మూవీ గురించి డయానాతో నాటి తన టెలిఫోన్ సంభాషణ మధుర స్మృతుల్ని కాస్టనర్ నెమరవేసుకున్నారు. డయానా యువరాణి కాబట్టి ఆమె కు గల రాచరిక నియమాలను పరిగణనలోకి తీసుకునే సీక్వెల్ మూవీ ఆలోచించినట్లు కాస్టనర్ తెలిపారు. అప్పటికే యువరాజు చార్లెస్ తో విడిపోయిన డయానాతో తనకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇప్పించడంలో ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ యార్క్) సారా ఫెర్గుసన్ సహాయం చేశారన్నారు. దాదాపు అయిదేళ్లు శ్రమించి 1997 నాటికి స్క్రిప్ట్ పూర్తి చేసి డయానా ను కలవాలనుకున్నట్లు కాస్టనర్ తెలిపారు. అంతకు ఒక్కరోజు ముందే 1997 ఆగస్ట్ 31న డయానా (36ఏళ్లు) పారిస్ లో కారు ప్రమాదంలో దుర్మరణం చెందారన్నారు. అప్పటికి ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హారీ చాలా చిన్న పిల్లలని కాస్టనర్ పేర్కొన్నారు.

Australia thrash NewZealand by 86 runs in icc world cup: Trent got hat trick


కివీస్ ను 86 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఆసిస్
లార్డ్స్ ప్రభువులం తామేనని ఆస్ట్రేలియా నిరూపించుకుంది. న్యూజిలాండ్ కు వరల్డ్ కప్ లో తమ బౌలర్ ట్రెంట్ బోల్ట్ హ్యాట్రిక్ సాధించడం ఒక్కటే శనివారం మ్యాచ్ లో కల్గిన ఊరట.  వరల్డ్ కప్-12 లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ నం.36 లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసిస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. 244 పరుగుల ఛేదన లక్ష్యంతో కివీస్ బ్యాటింగ్ ప్రారంభించి కంగారూ బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. జట్టులో 20 పరుగుల పైబడి స్కోరు చేసిన బ్యాట్స్ మెన్ ముగ్గురే నంటేనే ఆసిస్ బౌలర్ల వాడి అర్ధమౌతోంది. మార్టిన్ గుప్తిల్(20), కెప్టెన్ కేన్ విలియమ్సన్(40), రాస్ టేలర్(30) మాత్రమే రాణించారు. ఇన్నింగ్స్ లో కెప్టెన్ విలియమ్సన్, శాంటనర్ లు చెరో సిక్సర్ కొట్టారు. కివీస్ 43.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటయింది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి కివీస్ ను ఘోరంగా దెబ్బతీశాడు. టోర్నీలో స్టార్క్ అయిదు వికెట్లు తీసుకోవడం ఇది రెండోసారి. జాసన్ బెరాండ్రాఫ్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు, పాట్ కమిన్స్, నాథన్ లయొన్, స్టీవెన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. భారీ స్కోరుపై కన్నేసి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసిస్ మొదట్లో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. వన్డౌలో వచ్చిన ఉస్మాన్ ఖవాజ(88) జట్టు ఇన్నింగ్స్ కు గోడలా నిలబడిపోయాడు. అయిదో ఓవర్ నుంచి ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడు బంతుల వరకు క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు. అతనికి అండగా మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ(71) నిలిచాడు. ఇద్దరూ ఆసిస్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోశారు. ఇన్నింగ్స్ లో ఆసిస్ బ్యాట్స్ మన్ 24 బౌండరీలు సాధించారు. అయితే ఒక్క సిక్స్ కూడా జట్టులో ఏ బ్యాట్స్ మన్ కొట్టలేకపోవడం విశేషం. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 51 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా మూడు బంతుల్లో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఔట్ చేసి వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. ట్రెంట్ బోల్ట్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ ఖవాజా, స్టార్క్ లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికి  బెరాండ్రాఫ్ ను ఎల్బీడబ్ల్యూ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. బోల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లలో ఓపెనర్ కెప్టెన్ అరాన్ ఫించ్(8) ను ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు పంపాడు. కివీస్ బౌలర్లలో లకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అలెక్స్ కేరీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Saturday, June 29, 2019

Pakistan win against afghanistan in a nail biter finish icc world cup


ఉత్కంఠ పోరులో అఫ్గనిస్థాన్ పై పాకిస్థాన్ గెలుపు
పాకిస్థాన్ అనుభవం ముందు అఫ్గనిస్థాన్ తేలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.36 హెడింగ్లే లీడ్స్ వేదికపై శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో అఫ్గనిస్థాన్ పై విజయం సాధించింది. ఇంకా రెండు బంతులుండగానే పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఇమాద్ వసీం(49), వహాబ్ రియాజ్ (9బంతుల్లో15 పరుగులు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అఫ్గనిస్థాన్ ఈ టోర్నీలో గెలుపు వాకిట వరకు వచ్చి బోల్తా కొట్టిన మూడో మ్యాచ్ ఇది. టాస్ గెలిచిన అఫ్గనిస్థాన్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. జట్టులో అస్ఘర్ అఫ్గన్, నజీబుల్లా జద్రాన్లు చెరో 42 పరుగులు చేశారు. జట్టులో వీరిదే అత్యధిక స్కోరు. ఓపెనర్ రహ్మత్ షా(35), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇక్రమ్ అలీ ఖిల్(24) మాత్రమే జట్టులో 20 పరుగులకు పైగా స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇమాద్ వసీం, వహబ్ రియాజ్ లు చెరో 2 వికెట్లు తీయగా షాదబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ కు విజయం అలవోకగా రాలేదు. పరుగులేమీ చేయకుండానే పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్(0) వికెట్ కోల్పోయింది. ముజ్బుర్ రెహ్మాన్ అతణ్ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. బాబర్ ఆజం(45), ఇమామ్ ఉల్ హక్(36), ఇమాద్ వసీం(49), హరీస్ సొహాయిల్(27) రాణించారు. 46వ ఓవర్ వరకు పాక్ వికెట్లను తీస్తూ అఫ్గన్ బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. అప్పటికి పాక్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు. చివర్లో బౌలింగ్ ఫీల్డింగ్ ఒక్కసారిగా పట్టుతప్పడం వహబ్ రియాజ్, ఇమాద్ వసీంలు బ్యాట్ ఝళిపించడంతో అఫ్గన్ ఓటమి పాలయింది. పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ గుల్బుద్దీన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో విఫలమయ్యాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ కి దిగి కేవలం 15 పరుగులే చేశాడు. బౌలింగ్ లో వికెట్ లేమీ తీయకుండా అందరికంటే ఎక్కువగా 73 పరుగులిచ్చాడు. ముజ్బుర్ రెహ్మన్ 34/2 మహ్మద్ నబీ 23/2 రషీద్ ఖాన్ 50/1 వికెట్లు పడగొట్టారు. ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

at least 15 dead as wall collapses in pune



పుణెలో అపార్ట్ మెంట్ గోడ కూలి 15 మంది దుర్మరణం
మహారాష్ట్ర లోని పుణెలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. కొంద్వా ప్రాంతంలో  శనివారం ఓ బహుళ అంతస్తుల నివాస భవన సముదాయం సరిహద్దు గోడ కూలిన ఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. చనిపోయిన వారంతా కూలీలని తెలుస్తోంది. భవనం ప్రహరీ సమీపంలో వేరే భవన నిర్మాణ పనులు ఇటీవల చేపట్టారు. అల్కాన్ స్టయిలిస్ అనే ఈ బహుళ అంతస్తుల భవనానికి చెందిన సరిహద్దు గోడ కింద కూలీలు గుడారాలు వేసుకుని ఉంటున్నట్లు తెలిసింది. 20 అడుగుల ప్రహరీ  ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ శిథిలాల కింద నలిగిపోయిన కూలీలు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన మధ్యరాత్రి 2.30 సమయంలో చోటు చేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు, జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద కొనప్రాణాలతో కొట్టామిట్టాడుతున్న ముగ్గుర్ని రక్షించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన కూలీలు బిహార్, బెంగాల్ లకు చెందిన వారిగా పుణె కలెక్టర్ నావల్ కిశోర్ రామ్ తెలిపారు. శనివారం రోజంతా నగరంలో వర్షం కురిసింది. అది కూడా ప్రమాద కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ సంతాపం తెలిపారు. చనిపోయిన ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల బంధువులకు సానుభూతిని తెల్పుతూ ట్వీట్ చేశారు. కతిహార్(బిహార్)కు చెందిన కూలీల దుర్మరణం పట్ల సీఎం నితీశ్ కుమార్ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. చనిపోయిన ఒక్కొక్కరికి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. అపార్ట్ మంట్ చుట్టుపక్కల జరుగుతున్న అన్ని నిర్మాణాలు నిలుపుచేయాలని పుణె మేయర్ ముక్తా తిలక్ ఆదేశాలిచ్చారు. ఈ దుర్ఘటనకు కారకుల్ని విడిచిపెట్టబోమని విపత్తు నివారణ, సహాయక శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ప్రమాద వార్త అందగానే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. పుణె కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Friday, June 28, 2019

South Africa unanimous win over srilaka by 9 wickets inicc world cup


శ్రీలంకను ఉతికి ఆరేసిన దక్షిణాఫ్రికా:9 వికెట్ల విజయం
నాకౌట్ అవకాశాలు ఆవిరైన వేళ దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ లో తన పూర్వవైభవాన్ని ప్రదర్శిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 డర్హమ్ లోని ఎమిరేట్స్ రివర్ సైడ్ మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ నం.35లో 9 వికెట్ల తేడాతో లంక సింహాలపై సఫారీలు అద్భుతమైన గెలుపు అందుకున్నారు. టాస్ గెలిచిన ద.ఆఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్  శ్రీలంకను బ్యాటింగ్ కు దించాడు. నిర్ణీత 50 ఓవర్లకు గాను శ్రీలంక 49.3 ఓవర్లలో 203 స్వల్ప పరుగులకే ఆలౌటయింది. ఏమాత్రం కష్టతరం కానీ లక్ష్యం 204 పరుగుల్ని సఫారీలు సునాయాసంగా ఛేదించారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడారు. లంకకు దక్కిన ఏకైక వికెట్ ను లసిత్ మలింగ చేజిక్కించుకున్నాడు. ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వాంటన్ డీకాక్(15) క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ హషిం అమ్లా(80*), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(96*) ప్రాక్టీస్ సెషన్ మాదిరిగా అలవోకగా బ్యాటింగ్ చేస్తూ37.2 ఓవర్లలోనే గెలుపునకు కావాల్సిన పరుగులు రాబట్టారు. అమ్లా 105 బంతుల్ని, డూప్లెసిస్ 103 బంతుల్ని ఎదుర్కొని జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించారు. డూప్లెసిస్ సెంచరీ మిస్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ బౌలర్ల మీద అపార నమ్మకంతో బ్యాటింగ్ ను అశ్రద్ధ చేసినట్లు కనిపించింది. మరో వైపు సఫారీ పేస్ బౌలర్లు క్రిస్ మోరిస్, డ్వయిన్ ప్రెటోరిస్, కగిసొ రబాడ బాణాల్లా సంధించిన బంతులకు లంక బ్యాట్స్ మెన్ బ్యాట్ లు ఎత్తేశారు. లంక బ్యాట్స్ మెన్ లో ముగ్గురు మినహా అందరూ రెండంకెల స్కోరును అందుకున్నారు. అయితే చాలా బంతుల్ని వృథా చేయడమే కాకుండా అవుటై తర్వాత వచ్చే బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెంచేశారు. కుశాల్ మెండిస్, జీవన్ మెండిస్ అతి నెమ్మదిగా ఆడి డాట్ బాల్స్ కు కారకులయ్యారు. కెప్టెన్ దిముత్ కరుణరత్న మ్యాచ్ తొలి బంతికే రబాడ బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), వన్డౌన్ అవిశ్కా ఫెర్నాడో లు సాధించిన చెరో 30 పరుగులే జట్టులో అత్యధిక స్కోరు. దీన్ని బట్టే శ్రీలంక బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో స్పష్టమౌతోంది. జట్టులో కుశాల్ మెండిస్(23), ధనంజయ డిసిల్వ(24), తిసారా పెరీరా(21) లు మాత్రమే 20 పరుగులు స్కోరు దాటిన బ్యాట్స్ మెన్. ద.ఆఫ్రికా బౌలర్లలో రబాడ 36/2, మోరిస్ 46/3 ప్రిటోరిస్ 25/3 ఆండిలే ఫెహ్లుక్వాయో 38/1 జేపీ డుమిని 15/1 వికెట్లను పడగొట్టారు. అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్ తో పొదుపుగా పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన సఫారీ బౌలర్ ప్రిటోరిస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

Big brands bet on World Cup fever in India, where cricket is `religion`


ప్రపంచ పండుగలా కొనసాగుతున్న ఐసీసీ వరల్డ్ కప్
ప్రస్తుతం ప్రపంచమంతా ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ పండుగలో లీనమైపోయింది. సుమారు 100 కోట్ల 50 లక్షల మంది వరల్డ్ కప్ క్రికెట్ ను తిలకిస్తున్నారు. ప్రత్యక్షంగా, టెలివిజన్, రేడియో, మొబైల్ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ ల్ని వీరంతా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ ల వీక్షకుల సంఖ్య కంటే 15 రెట్లు అధికంగా వరల్డ్ కప్ మ్యాచ్ ల్ని వీక్షిస్తున్నారు. ప్రపంచంలో క్రికెట్ ఇప్పుడు కేవలం ఓ ఆట కాదు.. మతం. ప్రపంచం నలుమూలలా సాకర్ ఆడే దేశాలు కోకొల్లలు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్ బాల్ అసోసియేషన్(ఫిఫా) గుర్తింపు పొందిన దేశాలు 79. టోర్నీలో అర్హత సాధించిన దేశాలు పాల్గొంటాయి. 2018 రష్యా(మాస్కో)లో జరిగిన గత ఫిపా వరల్డ్ కప్ లో 32 దేశాలు ఆడాయి. కానీ వరల్డ్ కప్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 20 లోపే. అందులో క్వాలిఫై అయిన 10 దేశాలు ఐసీసీ వరల్డ్ కప్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ ల్ని ఒక్క భారత ఉపఖండంలోనే సుమారు 80 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు ప్రాయోజికులు(స్పాన్సర్స్), వాణిజ్య ప్రకటన దారులు (మీడియా బయ్యర్స్) అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే క్రికెట్ ను వాణిజ్య సంస్థలు చక్కగా ఉపయోగించుకుని తమ వ్యాపారాల అభివృద్ధికి బాటగా మలుచుకుని ముందుకెళ్తున్నాయి. క్రికెట్ ఆసరాగా ప్రకటనల రంగం ప్రపంచ వ్యాప్తంగా టి.వి, రేడియో, పత్రికలు, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రచారపర్వంతో దూసుకెళ్తోంది. క్రికెట్ అభిమానులే తమ వినియోగదారులుగా రకరకాల ఆఫర్లతో ఊరిస్తూ మార్కెట్ ను వ్యాపార, వాణిజ్య సంస్థలు ఊపేస్తున్నాయి. లైవ్ ఫాన్ ఈవెంట్స్ తదితరాలతో వ్యాపార అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రవాణా సంస్థ ఉబర్ మొదలుకొని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్, తినుబండారాల సంస్థ మాండెలెజ్ వరకు అన్ని సంస్థలు క్రికెట్ అభిమానులే ఆలంబనగా వ్యాపారాభివృద్ధితో పండుగ చేసుకుంటున్నాయి.


Thursday, June 27, 2019

Nine girls among 11 killed in road accident on mughal road in jammu&kashmir


జమ్ముకశ్మీర్లో ఘోర దుర్ఘటన:9మంది విద్యార్థినుల సహా 11మంది మృతి  
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 11 మంది అసువులు బాశారు. దుర్ఘటన గురువారం లాల్ గులాం ప్రాంతంలో చోటు చేసుకుంది. పూంచ్ నుంచి సోఫియాన్ కు ప్రయాణిస్తున్న టెంపో రహదారిపై పక్కకు జారిపోయి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో  9 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పీర్ కి గలీ ప్రాంతంలో చారిత్రక మొఘల్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ ప్రాంతం దక్షిణ కశ్మీర్ సోఫియాన్ జిల్లాలో ఉంది. సూరాన్ కోట్ కు చెందిన ఓ ప్రయివేట్ కంప్యూటర్ విద్యా సంస్థ కు చెందిన విద్యార్థినులు విహారయాత్రకు బయలుదేరి ప్రమాదం బారిన పడ్డారు. వీరంతా ధోబిజాన్ దిశగా టెంపోలో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందగానే ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారవర్గాలు వెంటనే సహాయక చర్యల్ని చేపట్టాయి. అయిదుగురు క్షతగ్రాతుల్ని హుటాహుటిన శ్రీనగర్ లోని ఎస్.ఎం.హెచ్.ఎస్. ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు సోఫియాన్ జిల్లా ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. క్షతగ్రాతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

IAF's Jaguar fighter jet suffers bird hit, lands safely


భారత వాయుసేన విమానానికి తప్పిన ముప్పు
పైలట్ చాకచక్యంతో భారత వాయుసేన (ఐఏఎఫ్) విమానానికి త్రుటిలో ముప్పు తప్పింది. గురువారం ఉదయం అంబాలా ఎయిర్ బేస్ (హర్యానా) నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ జాగ్వర్ ను గాల్లో పక్షి ఢీకొంది. టేకాఫ్ అయిన వెంటనే ఘటన చోటు చేసుకుంది. దాంతో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి చెందిన రెండు ఇంధన ట్యాంకులు, ఎక్స్ టర్నల్ స్టోర్ లోని 10 కేజీల శిక్షణకు ఉపయోగించే బాంబుల్ని జాగ్వర్ నుంచి కిందకి జారవిడిచాడు. విమానానికి ఏదైనా ప్రమాదం వాటిల్లినా, ఇంజన్లలో ఏదైనా అనివార్య సమస్య తలెత్తినా ఇదే విధానాన్ని పైలట్లు పాటించాల్సి ఉంటుంది. కచ్చితంగా అదే విధంగా జాగ్వర్ బరువును తగ్గించి సురక్షితంగా విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకువచ్చారని ఐఏఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. పైలట్ జార విడిచిన బాంబుల్ని ఆ తర్వాత స్వాధీనం చేసుకున్నామన్నాయి. తొలుత అంబాలా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) రజనీశ్ కుమార్ నగరంలో ఆకాశం నుంచి విమానం ద్వారా బాంబులు కిందకు పడినట్లు ధ్రువీకరించారు. ఈ వ్యవహారంపై ఐఏఎఫ్ విచారణకు (కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ) ఆదేశించింది.

Wednesday, June 26, 2019

Pakistan win over unbeaten Newzealand by 6wickets in icc world cup


అజేయ కివీస్ పై పాక్ అలవోక విజయం
వరల్డ్ కప్ లో నేనూ ఉన్నాను అని పాకిస్థాన్ నిరూపించుకుంది. ఇంతవరకు టోర్నీలో ఓటమి ఎరుగని న్యూజిలాండ్ ను 6 వికెట్ల తేడాతో కంగు తినిపించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 బర్మింగ్ హమ్ ఎడ్గబస్టన్ వేదికపై బుధవారం జరిగిన మ్యాచ్ నం.33లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఎదుట కేవలం238 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంచింది. దాంతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. పాక్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. ఈ వరల్డ్ కప్ లో పాక్ బ్యాట్స్ మన్ తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. బాబర్ ఆజం 127 బంతుల్లో 11 బౌండరీల సాయంతో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(19), ఫకర్ జమాన్(9) వికెట్లను త్వరగా పడగొట్టిన తృప్తి మాత్రమే న్యూజిలాండ్ కు దక్కింది. అప్పటికే అర్ధ శతకం భాగస్వామ్యంతో పాతుకుపోయిన బాబార్, సెకండ్ డౌన్ మహ్మద్ హఫీజ్ జోడీలను విడదీయడానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఫ్ స్పిన్ బౌలర్ అవతారమెత్తాల్సి వచ్చింది. తొలి ఓవర్ లోనే కివీస్ కెప్టెన్ ..హఫీజ్ ను భారీ షాట్ కు ఊరించి అవుట్ చేశాడు. సరిగ్గా ఇన్నింగ్స్ సగంలో(24.5 ఓవర్) విలియమ్సన్ ఎత్తు ఫలించిన తర్వాత పాక్ మరో వికెట్ ను కివీస్ బౌలర్లు పడగొట్టలేకపోయారు. లెగ్ స్పినర్ శాంటనర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో పొదుపుగా 38 పరుగులే ఇచ్చినా ఫలితం లేకపోయింది. అతని బౌలింగ్ లో బాబర్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండుసార్లూ కీపర్ టామ్ లాథమ్ తప్పిదం వల్లే బతికిపోయాడు. ఒకసారి క్యాచ్ అవుట్ నుంచి మరోసారి స్టంపౌట్ నుంచి బాబార్ కు లైఫ్ లు లభించాయి. అప్పటికే పాక్ విజయం ఖరారైన సమయంలో 68 పరుగులు చేసిన హరిస్ సోహాయిల్ గుఫ్తిల్ త్రో తో రనౌట్ గా వెనుదిరిగాడు. విన్నింగ్ షాట్ ను కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టి పాక్ కు అవసరమైన విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన విలియమ్సన్ 39 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 10 ఓవర్లలో 48 పరుగులిచ్చి ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ పడగొట్టాడు. 8.1 ఓవర్లలో 50 పరుగులిచ్చిన లకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను చూస్తే టోర్నీలో ఇంతకుముందు ఆడిన కివీస్ బ్యాట్స్ మెన్ వీళ్లేనా అనిపించేలా రన్స్ తీశారు. మరో వైపు పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే 69 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు. చివర్లో జేమ్స్ నీషం112 బంతుల్లో 97* పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయినా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో మూలస్తంభంలా నిలిచాడు. అతనికి తోడుగా కోలిన్ డే గ్రాండ్ హోమ్ 71 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్, మహ్మద్ అమీర్ చెరో వికెట్ తీసుకున్నారు.   

Thank you for keeping me in your hearts: Shah Rukh on clocking 27 years in Bollywood


27 ఏళ్లు గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు:షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ తన సినీ నట జీవితం ప్రారంభమై 27 ఏళ్లు గడిచిన సందర్భంగా అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపాడు. దీవానా హిందీ చిత్రం ఇదే రోజున విడుదలయి సూపర్ హిట్ అయింది. రాజ్ కన్వర్ ద్వారా కింగ్ ఖాన్ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాద్ షా గా ఎదిగాడు. ఈ సందర్భంగా 53 ఏళ్ల షారుఖ్ ట్విటర్ లో ఓ వీడియో విడుదల చేశాడు. తెల్లని టీషర్ట్ , నల్లని ప్యాంట్ ధరించి దీవానా చిత్రంలో పోషించిన పాత్రలో మాదిరిగానే బైక్ పై ప్రయాణిస్తూ తాజా వీడియోలో అభిమానుల్ని అలరించాడు. `హిందీ చలనచిత్ర పరిశ్రమకు, అభిమానులకు వేనవేలు ధన్యవాదాలు.. మీరు చూపించిన అభిమానం ద్వారా భూమిపై నా సగ జీవిత కాలం వెండితెరపై గడపగలిగాను.. మిమ్మల్ని సదా వినోదంలో ముంచెత్తెందుకు ప్రయత్నించాను..కొన్ని సార్లు విజయాలు, మరొకొన్ని మార్లు అపజయాలు ఎదుర్కొన్నాను. మరికొన్నేళ్లూ నట జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను.` అని ఆ పోస్టులో షారుఖ్ పేర్కొన్నాడు. దీవానాలో మోటార్ సైకిల్ పై Koi Na Koi Chahiye అని పాడుతూ మీ గుండెల్లో చోటు సంపాదించుకున్నాను. అందుకు మోటార్ సైకిల్ కంపెనీకి నా ధన్యవాదాలు. కానీ ఈసారి మోటారు బైక్ పై హెల్మెట్ ధరించే నడుపుతాను.. ప్రేమతో మీ షారుఖ్ అని కింగ్ ఖాన్ ఆ పోస్టులో విలువైన వ్యాఖ్యలు రాశాడు.

Tuesday, June 25, 2019

Australia Formidable Victory by 64 Runs over England


ఇంగ్లాండ్‌పై 64 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం
ఐసీసీ వరల్డ్ కప్-12 ఫెవరెట్ జట్ల పోరాటంలో ఆతిథ్య ఇంగ్లాండ్ పై డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ నం.32లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఓపెనర్లు కెప్టెన్ ఆరన్ ఫించ్(100) టోర్నీ రెండో సెంచరీ, డేవిడ్ వార్నర్(53) హాఫ్ సెంచరీల అండతో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అనంతరం 286 పరుగుల ఛేదన లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్  తొలి ఓవర్ రెండో బంతికే పరుగులేమీ లేకుండానే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ ను జాసన్ బెరండ్రాఫ్ క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. వన్డౌన్ జోయ్ రూట్ (8)ని మూడో ఓవర్లో స్టార్క్ ఎల్బీడబ్లూ చేసి ఇంగ్లాండ్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. కెప్టెన్ మోర్గాన్(4) ను అయిదో ఓవర్లో స్టార్కే పెవిలియన్ బాట పట్టించాడు. 13వ ఓవర్ వరకు నిలదొక్కుకున్న మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో(27)ను జాసన్ అవుట్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 53 పరుగులే. ఆ తర్వాత అయిదో వికెట్ కి బెన్ స్టోక్స్(89), కీపర్ బ్యాట్స్ మన్ జాస్ బట్లర్(25) 14 ఓవర్లలో 71 పరుగులు జోడించారు. స్టోయినిస్ బౌలింగ్ లో ఖవాజా క్యాచ్ పట్టగా బట్లర్ క్రీజ్ వదిలాడు. అప్పటికే 27 ఓవర్లకు ఇంగ్లాండ్ 5 వికెట్లను కోల్పోయి 124 పరుగులే చేసింది. 37వ ఓవర్ లో బెన్ స్టోక్స్ ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో మిణుమిణుకుమంటున్న ఇంగ్లాండ్ విజయావకాశాలు పూర్తిగా మాయమైపోయాయి. మిడిల్ ఆర్డర్ లో క్రిస్ వోక్స్(26), చివరి వరుస బ్యాటర్లలో అదిల్ రషీద్(25)లు పోరాడినా ఫలితం దక్కలేదు. ఇంగ్లాండ్ జట్టు 44.4 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటయింది. ఆసిస్ బౌలర్లలో జాసన్ 44 పరుగులిచ్చి 5 వికెట్లు మిషెల్ స్టార్క్ 43 పరుగులకు 4 వికెట్లు పంచుకోగా మార్కస్ స్టోయినిస్ 29 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. కిక్కిరిసిన లార్డ్స్ మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ తిలకిస్తున్న ప్రేక్షకులతో పాటు ప్రపంచ క్రికెట్ అభిమానులందర్ని ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీరు నిరాశ పరిచింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, డేవిడ్ వార్నర్ తొలి వికెట్ కు 22.4 ఓవర్లలో 123 పరుగులతో శుభారంభం చేశారు. ఉస్మాన్ ఖవాజా(23), స్టీవెన్ స్మిత్(38), చివర్లో కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ(38) జట్టు భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. అప్పటికే స్మిత్ క్రీజ్ లో వెనక్కి మళ్లినా మార్కస్ స్టోయినస్(8) లేని రెండో పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. స్టోయినిస్ వికెట్ల మధ్య పరిగెత్తిన తీరుపట్ల స్మిత్ విస్మయానికి గురయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు తీసుకోగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఫించ్ నిలిచాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో సెమీస్ కు చేరిన తొలి జట్టయింది.

only one family was spoken about and got all attention says modi



`కాంగ్రెస్ సభ్యుల కంటికి ఒకే ఒక కుటుంబం కనిపిస్తుంది`: ప్రధాని ఎద్దేవా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనపై ధ్వజమెత్తారు. మంగళవారం లోక్ సభలో ఆయన ప్రసంగిస్తూ కేవలం ఒక కుటుంబం చుట్టూనే కాంగ్రెస్ పార్టీ పరిభ్రమిస్తుందని వారి మాటే వేద వాక్కుగా పాటిస్తోందని విమర్శించారు. ఉభయసభలను ఉద్దేశించి  రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో సోమవారం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రాజన్ చౌధురి మాట్లాడుతూ కాంగ్రెస్ మహానేతలు పండిట్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశానికి చేసిన సేవలు వివరించారు. ఆ సందర్భంలోనే ప్రధాని మోదీ గొప్ప మార్కెట్ నైపుణ్యం గల వ్యాపారవేత్తగా అధిర్ పేర్కొన్నారు. ఆయన తన ఉత్పత్తుల్ని బాగా అమ్మకోగలిగాడని కాంగ్రెస్ కు అది చేతకాక ఓటమి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సభలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సభ్యులు, గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వ ప్రధానులపై ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ సభ్యులకు ఏరోజూ ప్రధానిగా వాజ్ పేయి హయాంలో జరిగిన అభివృద్ధి గుర్తుకు రాలేదన్నారు. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని కాంగ్రెస్ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల హయాంలో కార్యక్రమాల గురించి ఏ ఒక్క కాంగ్రెస్ సభ్యుడు ప్రస్తుతించిన దాఖలా లేదని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే రోజు జూన్ 25న ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులు తనకింకా గుర్తున్నాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఆఖరికి న్యాయవ్యవస్థను ఆమె గుప్పిట పట్టి పాలించారని ఘాటుగా విమర్శించారు. 44 ఏళ్ల నాడు ఎమర్జెన్సీ చీకటి పాలనకు యావత్ దేశం ఆత్మ క్షోభించిందన్నారు. ప్రధాని మోదీ ఈ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు లోక్ సభ ఎంపీలుగా ఎన్నికైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. కొత్త భారత దేశ నిర్మాణానికి బీజేపీ తపన పడుతోందన్నారు. దేశ ప్రజలు సమైక్యత, భద్రత, సురక్షితలను కోరుకుంటున్నారని అందుకే మరోసారి బీజేపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారని మోదీ వ్యాఖ్యానించారు.

Monday, June 24, 2019

bangla tigers win over afghanistan by 62 runs in icc world cup


అఫ్గానిస్థాన్ ను 62 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్
ప్రస్తుత వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మరోసారి తన పట్టును ప్రదర్శిస్తూ అఫ్గనిస్థాన్ పై ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.31 సాథాంప్టన్ రోజ్ బౌల్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో అఫ్గనిస్థాన్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచిన అఫ్గన్ టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. అఫ్గానిస్థాన్ తొలుత తడబాటు లేకుండానే ఇన్నింగ్స్ కొనసాగించింది. తొలి వికెట్ కు ఓపెనర్లు కెప్టెన్ గుల్బుద్దీన్ నయిబ్(47), రహ్మత్ షా(24) 10.5 ఓవర్లలో 49 పరుగులు స్కోర్ చేశారు. రహ్మత్ షా ను బంగ్లా ఆల్ రౌండర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షాకిబ్ అవుట్ చేశాడు. తర్వాత హష్మతుల్లా షాహిదీ(11)ని మొసాదిక్ హొస్సేన్ బోల్తా కొట్టించాడు. కీపర్ రహీం స్టంప్ చేయగా షాహిదీ వెనుదిరిగాడు. ఆ తర్వాత 28వ ఓవర్ లో షాకిబ్ వరుసగా గుల్బుద్దీన్ , 20 పరుగులు చేసిన అస్ఘర్ అఫ్గాన్ లను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. అఫ్గన్ స్టార్ బ్యాట్స్ మన్ మహ్మద్ నబీ(0)ని క్లీన్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ చేర్చాడు. చివర్లో కుదురుకుంటున్న నజీబుల్లా జర్దాన్(23)ని కూడా షాకిబ్ బోల్తా కొట్టించాడు. కీపర్ రహీం స్టంపౌట్ చేయగా అతను క్రీజ్ నుంచి నిష్క్రమించాడు. 10 ఓవర్లలో షాకిబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వరుస బ్యాటర్లు ఒక్కొక్కరు వెనుదిరగ్గా సామివుల్లా షిన్వారి(49*) నాటౌట్ గా మిగిలాడు. అఫ్గనిస్థాన్ 47 ఓవర్లకే ఆలౌటై సరిగ్గా 200 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్లు లిటన్ దాస్(16), తమిమ్ ఇక్బాల్(36) పరుగులు చేశారు. షాకిబ్ అల్ హసన్(51) మరో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. కీపర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం(83) జట్టులో అత్యధిక స్కోరు సాధించాడు. చివర్లో మహ్మదుల్లా(27), మొసాదిక్ హొస్సేన్(35) జట్టు పెద్ద స్కోరు చేసేందుకు తోడ్పడ్డారు. అఫ్గన్ బౌలర్లలో ముజ్బుర్ రహ్మన్ 3 వికెట్లు, కెప్టెన్ గుల్బుద్దీన్ నయిబ్ 2 వికెట్లు, దవ్లత్ జద్రాన్, మహ్మద్ నబీలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో అఫ్గనిస్థాన్ ఇప్పటికి ఆడిన 7 మ్యాచ్ ల్లో ఓటమి పాలయింది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్ లపై గెలుపుతో బంగ్లాదేశ్ తన విజయాల సంఖ్యను మూడుకు పెంచుకుంది.



seven killed over 200 injured as train derails in Bangladesh


బంగ్లాదేశ్ రైలు ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం 200 మందికి గాయాలు
బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరో 200 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రాజధాని ఢాకా నుంచి సిల్హెట్ కు బయలుదేరి ప్రమాదానికి గురయింది. మౌలోవిబజార్ జిల్లాలోని కులావుర సమీపంలో కల్వర్ట్ వంతెన పాక్షికంగా కూలిపోవడంతో రైలులో ఆరుబోగీలు కింద పడిపోయాయి. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి 11.40 సమయంలో బరాంచల్ వద్ద జరిగింది. చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మహిళలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దర్ని గుర్తించారు. మోన్వార్ పెర్విన్(48), ఫాహ్మిద అక్తర్(20) మృతి చెందారు. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి సుమారు 15 మందిని కాపాడారు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని తెలుస్తోంది. గాయపడిన 62 మందికి కులావుర ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి ఇళ్లకు పంపించేశారు. 24 మందిని సిల్హెట్ ఎంఏజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దాంతో సిల్హెట్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాళిని, జయంతిక ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఈ కల్వర్టు వంతెన మార్గంలో లైన్ మరమ్మతుల పాలవ్వడం లేదా ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో లోపం వల్ల దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నామని రైల్వేశాఖ కార్యదర్శి మొఫాజల్ హోస్సెన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ దుర్ఘటన పై దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. 

Sunday, June 23, 2019

Pakistan shows ability by 49 runs win over south africa in world cup


జట్టుగా రాణించి సఫారీలపై గెలిచిన పాకిస్థాన్
ఇంటా బయట విమర్శల జడివానలో తడిసిముద్దయిన పాకిస్థాన్ బుద్ధి తెచ్చుకుని జట్టుగా రాణించి దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్-12 లండన్ లార్డ్స్ మైదానంలో ఆదివారం మ్యాచ్ నం.30లో దక్షిణాఫ్రికా జట్టుపై 49 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో సఫారీలు చతికిలబడి టోర్నీ నుంచే నిష్క్రమించారు. 2003 తర్వాత ద.ఆఫ్రికా నాకౌట్ దశకు చేరలేకపోవడం ఇదే తొలిసారి. 309 పరుగుల లక్ష్య ఛేదనకు ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు ఓపెనర్ హషీమ్ అమ్లా(2) త్వరగా అవుటవ్వడంతో తొలి దెబ్బ తగిలింది. మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీకాక్(47), కెప్టెన్ వన్డౌన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(63), రాసీవాన్డెర్ డస్సన్(36), అండైల్ ఫెహ్లుక్వాయొ(46) మాత్రమే రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేయగల్గింది. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదబ్ ఖాన్ చెరో 3 వికెట్లు, స్టార్ పేసర్ మహ్మద్ అమిర్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ చెరో 44 పరుగులు చేశారు. తొలి వికెట్ కు 14.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. ఫకర్ జమాన్ తర్వాత రెండో వికెట్ గా ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో నెంబర్ బ్యాటర్ బాబర్ అజం(69), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హరిస్ సోహాయిల్(89) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. సఫారీల స్టార్ స్ట్రయిక్ బౌలర్ కగిసొ రబాడ ఈ మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు. 65 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మరో వైపు నిగిడి 64 పరుగులచ్చినా 3 వికెట్లు తీశాడు. టాప్ స్పినర్ ఇమ్రాన్ తాహిర్ 41 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. క్వాయో, మార్క్రమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో పాక్ సెమీస్ అవకాశాల మాటెలా ఉన్నా స్వదేశానికి సురక్షితంగా ఆ జట్టు ఆటగాళ్లు చేరుకోవడానికి మార్గం సుగమం కానుంది.

Cop burns alive as car catches fire after collision


కూతురు నిశ్చితార్థానికి వస్తుండగా కారు ప్రమాదం: ఎస్.ఐ. సజీవదహనం

విధులు ముగించుకుని కూతురు వివాహ నిశ్చితార్థానికి బయలుదేరిన ఓ ఎస్.ఐ. కారు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా లీమా చౌహాన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్న అశోక్ తివారీ ఆదివారం ఈ ఘోర ప్రమాదంలో మృత్యు ఒడికి చేరారు. అలహాబాద్ నుంచి కారులో బయలుదేరిన ఆయన భోపాల్ మీదుగా ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతున్న ఆనందంలో ఉన్న ఆయనను దుర్ఘటన బలి తీసుకుంది. రాజ్ గఢ్ జిల్లా పాన్ వాడి గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారులో మంటలు వ్యాపించాయి. కారుతో పాటు ఎస్.ఐ.ను మంటలు చుట్టుముట్టడంతో మృతి చెందారు. ట్రక్కు ఢీకొన్న క్రమంలోనే కారులో మంటలు ప్రజ్వరిల్లినట్లు ఎస్.డి.ఒ.పి (సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్) నాగేంద్ర సింగ్ బియాస్ తెలిపారు.

Six Indians arrested for smuggling gold in Sri Lanka



కొలంబోలో బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురి అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టయ్యారు. వీరంతా భారత్ కు చెందిన వారని సమాచారం. ఆదివారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల్లో వీరు పట్టబడ్డారు. నిందితులు తమ బ్యాగులు, ప్యాంటుల్లో బంగారు బిస్కెట్లు దాచి ఉంచడం సోదాల్లో బట్టబయలయింది. వీటి విలువ రూ.30 లక్షలుంటుందని అంచనా. నిందితులందరూ 36-53 వయసు లోపు వారని డెయిలీ మిర్రర్ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ దందాపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సునీల్ జయరత్నే తెలిపారు.



Saturday, June 22, 2019

tough fight goes between westindies and newzealand in icc world cup match

ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండిస్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రపంచ క్రికెట్ అభిమానులు మరోసారి కళ్లారా వీక్షించారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓడినా వెస్టిండిస్ బ్యాటింగ్ ను ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. తొలుత గేల్ చెలరేగితే ఆ తర్వాత కార్లస్ బ్రాత్ వెయిట్ విజృంభించిన తీరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.29 మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వెస్టిండిస్ దాదాపు ఓడించినంత పని చేసింది. వెస్టిండిస్ టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు పోగొట్టుకుని 291 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148) టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ 292 పరుగుల లక్ష్య ఛేదనకు ఏమాత్రం వెరవలేదు. చాన్నాళ్లకు ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 6 సిక్సర్లు, 8 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 84 బంతుల్లోనే 87 పరుగులు చేసి అయిదో వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కీపర్ షాయ్ హోప్(1), నికోలస్ పూరన్(1) ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(0) మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత షిమ్రాన్ హెట్మయర్(54), కార్లోస్ బ్రాత్ వెయిట్(101) ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అపురూపమనే చెప్పాలి. ముఖ్యంగా బ్రాత్ వెయిట్ 82 బంతుల్లోనే 5 సిక్సర్లు, 9 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. సిక్సర్లు, బౌండరీలతోనే వెయిట్ 66 పరుగుల సాధించాడంటేనే అతని విజృంభణ ఏస్థాయిలో ఉందో చెప్పొచ్చు. చివర్లో 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో అందరూ వెస్టిండిస్ గెలుస్తుందనే అనుకున్నారు. ఒకే ఒక వికెట్ మిగిలి ఉన్నదశలో వెయిట్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. నీషం బౌలింగ్ లో బౌల్ట్ క్యాచ్ పట్టగా వెయిట్ వెనుదిరగడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 4 వికెట్లు, లొకీ ఫెర్గుసన్ కు 3 వికెట్లు లభించగా మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, కోలిన్డె గ్రాండ్ హోమ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(0), కోలిన్ మన్రో(0) డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పుడు క్రీజ్ లో కొచ్చిన కెప్టెన్ విలియమ్సన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. అతనికి రాస్ టేలర్(69) అండగా నిలవగా నీషమ్ (28) చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 4 వికెట్లు, కార్లోస్ బ్రాత్ వెయిట్ 2 వికెట్లు పడగొట్టారు.

Priyanka congratulates shruti mishra on her selection to indian squad for asian jr championship


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రుతి మిశ్రాను అభినందించిన ప్రియాంక
ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్ షిప్ కు గాను భారత జట్టుకు ఎంపికైన శ్రుతి మిశ్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభినందించారు. ఈ చాంపియన్ షిప్ చైనాలో ప్రారంభం కానుంది. యూపీ రాజధాని లక్నో కు చెందిన శ్రుతి ఎంపిక కావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి కూడా అయిన ప్రియాంక ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపారు. `బాగా శ్రమిస్తే విజయం నీ వెంట..నీకు నీ జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలు` అని ఆ పోస్ట్ లో ప్రియాంక రాశారు.

union bank ATM robbery bid foiled in Mathura


మధుర లో ఏటీఎం చోరీ యత్నం భగ్నం
ఉత్తరప్రదేశ్ లోని మధురలో శుక్రవారం అర్ధరాత్రి దుండగులు ఏటీఎం చోరీకి చేసిన యత్నం పోలీసుల రాకతో భగ్నమయింది. పోలీసు గస్తీ వాహనాన్ని చూసి దొంగలు పారిపోయారు. ఈ ఘటన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. స్థానిక కృష్ణ విహార్ కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లక్ష్యంగా దొంగలు చోరీకి శతథా ప్రయత్నించారు. మెషిన్ ఎంతకూ తెరుచుకోకపోవడంతో గ్యాస్ కట్టర్లతో కత్తిరించాలనుకున్నారు. అదీ సాధ్యం కాలేదు. చివరకు మెషిన్ ను పెకిలించుకు పోవాలనుకుంటున్న సమయంలో శబ్దాలకు అనుమానం వచ్చిన పోలీసు గస్తీ వాహనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో దొంగలు పలాయనం చిత్తగించినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ కుమార్ తెలిపారు.


Friday, June 21, 2019

ram vilas paswan files nomination for by election to rajya sabha

రాజ్యసభ కు నామినేషన్ వేసిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 

బిహార్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి లోక్ జనశక్తి (ఎల్.జె.ఎస్) పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు  కార్యక్రమంలో  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి నందకిశోర్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్ ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ బిహార్ పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ జూన్ 28. వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే జులై 5న ఓటింగ్ తేదీని నిర్ణయిస్తారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం హజిపూర్ నుంచి ఈసారి లోక్ సభకు ఆయన చిన్న సొదరుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. పరాస్ బిహార్ రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుంచి 2014 మధ్య కాలంలో హజిపూర్ నియోజకవర్గం నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తొలుత జనతా పార్టీ తరఫున 1977, 1980ల్లో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,91,96,98,99ల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆయన లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించి హజిపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆ స్థానానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు.

Australia beat Bangladesh by 48 runs warner hits 166


ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరో మెట్టు పైకెదిగింది. ఆసియా క్రికెట్ లో భారత్ సరసన నిలిచే స్థాయి తమకే ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరూపించుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.26 నాటింగ్ హామ్ వేదికపై గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై బంగ్లాదేశ్ పోరాడి 48 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కనబర్చిన తెగువ ఆ జట్టు ఓడినా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్పికర్ రహీం సెంచరీ (102*), ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (62), షాకిబ్ అల్ హసన్(41), మహ్మదుల్లా(69) పరుగులతో చివరి  వరకు విజయం కోసం పోరాడారు. వెస్టిండీస్ పై గెలుపును ఈ మ్యాచ్ లో రిపీట్ చేస్తుందా అన్నట్లుగా బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయిదో వికెట్ గా మహ్మదుల్లా అవుటయ్యా సరికి రహీంతో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 44 ఓవర్లు ముగిసే సరికి 302 పరుగులు నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 333 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ కోల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అడమ్ జంపా ఓ వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరే లక్ష్యంగా పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయి 5 సిక్సర్లు, 14 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(53), ఉస్మాన్ ఖవాజా(89)లు అర్ధ సెంచరీ లతో కదం తొక్కారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మాక్స్ వెల్ కూడా 10 బంతుల్లోనే 32 పరుగులు రాబట్టాడు. మార్కస్ స్టోయినిస్ 17 పరుగులతో కీపర్ అలెక్స్ కేరీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు, ముస్తాఫైజర్ రహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  వార్నర్ గెలుచుకున్నాడు.

Thursday, June 20, 2019

raising issue of rahul`s use of mobile during president address frivolous:congress



రాహుల్ పార్లమెంట్ లో ఫోన్ చూసుకుంటున్నారంటూ..
బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది:కాంగ్రెస్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో బిజీ అయిపోయారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవిగా పేర్కొంది. గురువారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా రాహుల్ 20 నిమిషాల సేపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో మాట్లాడారని అరగంటకు పైగా ఫోన్ చూసుకుంటూ గడపారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో రాహుల్ తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమైపోయారన్నారు. పలు విషయాలపై గంభీరంగా రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కనీసం ఆ అంశాలపై రాహుల్ దృష్టి పెట్టలేదన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై దృష్టి పెట్టిన రాహుల్ వాటిపైనే తమ నాయకురాలు సోనియాతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృత్యర్థం మౌనం పాటిస్తున్న సందర్భంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యారంటూ బీజేపీ సభ్యుడు పరేశ్ రావల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో షేర్ చేసిన వీడియో, ఫొటోలు నకిలీ వంటూ నెటిజెన్లు రావల్ పై మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ ఫోన్ చేసుకుంటున్నట్లున్న దృశ్యంతో పాటు మరో పక్క ప్రధాని మోదీ గౌరవ వందనం చేస్తున్న ఫొటోను జత చేసి రావల్ ఫేస్ బుక్ పోస్టులో ఫొటో పెట్టారు. ఈ ఫొటోను చూస్తేనే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నాయకత్వంలో ఎంత తేడా ఉందో సుస్పష్టమౌతోందని కామెంట్ రాశారు. అయితే రాహుల్ ఫోన్ చూసుకుంటున్నట్లున్న ఫొటో నకిలీదిగా తేల్చిన కొందరు నెటిజన్లు `ఇది బుద్ధిమాలిన పని..నకిలీ వార్తాహరుడు పరేశ్ రావల్ మన ఎంపీ కావడం సిగ్గు చేటు` అని పేర్కొన్నారు.

Wednesday, June 19, 2019

Captain Williamson leads Newzealand to consecutive win


దక్షిణాఫ్రికాపై సెంచరీతో జట్టును గెలిపించిన కివీస్ కెప్టెన్
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కు దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వరల్డ్ కప్-12 ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం ద.ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ నం.25లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 49 ఓవర్లలో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేశారు. ఓపెనర్ హషీం అమ్లా (55), మిడిల్ ఆర్డర్ లో రస్సీ వేండర్ డస్సెన్ (67) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో లకీ ఫెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డె గ్రాండ్ హోమ్, మిషెల్ శాంటనర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 242 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ చక్కటి గేమ్ ప్లాన్ తో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కోలిన్ మన్రో(9) వికెట్ ను న్యూజిలాండ్ కోల్పోయింది. రబాడ కాట్ అండ్ బౌల్డ్ గా మన్రోను పెవిలియన్ చేర్చాడు. వన్డౌన్లో బ్యాటింగ్ కు దిగిన విలియమ్సన్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలించాడు. మరో ఓపెనర్ గుఫ్తిల్ (35) కెప్టెన్ కు అండగా క్రీజ్ లో నిలిచాడు. రెండో వికెట్ కు 15 ఓవర్లలో వీరిద్దరు 60 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 72 పరుగుల వద్ద అండిల్ ఫెహ్లుక్వయో బౌలింగ్ లో హిట్ వికెట్ గా గుప్తిల్ వెనుదిరిగాడు. అప్పటి నుంచి బాధ్యతంతా విలియమ్సన్ భుజాలపై పడింది. మరో రెండు పరుగుల స్కోరు తర్వాత రాస్ టేలర్(1) మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్(1) కూడా యాక్షన్ రిప్లే మాదిరిగా మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కే క్యాచ్ ఇఛ్చి అదే ఓవర్లో పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. జేమ్స్ నీషమ్ (23) మోరిస్ బౌలింగ్ లో అమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 32.2 ఓవర్లలో 137 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ తో జత కలిసిన కోలిన్ గ్రాండ్ హోమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 60 పరుగులు చేసి చివరి ఓవర్లలో నిగిడి బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి క్రీజ్ ను వదిలాడు. విజయం అంచుల వరకు వచ్చిన కివీస్ ను గెలిపించే బాధ్యత విలియమ్సన్ తీసుకున్నాడు. 48 ఓవర్ చివరి బంతికి స్లిప్స్ దిశగా బౌండరీ సాధించాడు. చివరి ఓవర్ 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని మిషెల్ శాంటనెర్ సింగిల్ తీయడంతో స్ట్రయికింగ్ వచ్చిన విలియమ్సన్.. అండిల్ వేసిన స్లో డెలివరీని సిక్సర్ గా మలిచి వరల్డ్ కప్ లో తొలి సెంచరీ(103*) చేశాడు. గెలుపునకు కావాల్సిన చివరి రన్ ను సింగిల్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను గెలుచుకున్నాడు. కివీస్ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 లక్షాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ద.ఆఫ్రికాకు సెమీస్ అవకాశాలు చేజారినట్టే. సఫారీ బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు, కగిసొ రబాడ, లంగి నిగిడి, అండెల్ తలో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ గా 3000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సరసన విలియమ్సన్ చేరాడు.

South Africa mp racially abused at tourist site


వర్ణ వివక్షకు గురైన దక్షిణాఫ్రికా ఎంపీ ఫుంజైల్ వాండమే
దక్షిణాఫ్రికాలో ఇంకా జాత్యాహంకార ధోరణులు పూర్తిగా సమసి పోలేదనడానికి సాక్షాత్తు ఆ దేశ పార్లమెంట్ ఎంపీకే ఎదురైన అవమానం ఉదాహరణగా నిలుస్తోంది. డెమోక్రటిక్ అలయెన్స్ కు చెందిన ప్రతిపక్ష సభ్యురాలు ఫుంజైల్ వాండమే ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోలీసుల్ని ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఆమె దేశ రాజధాని కెప్ టౌన్ లోగల ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం విక్టోరియా ఆల్ఫ్రెడ్ వాటర్ ఫ్రంట్ (వీ&ఏ వాటర్ ఫ్రంట్) సందర్శనకు వెళ్లినప్పుడు తనకు ఈ దుస్సంఘటన ఎదురైందన్నారు. అక్కడ గల షాపింగ్ మాల్ లో రద్దీ నెలకొనడంతో వరుసలో ఓ తెల్లజాతీయురాలి వెనుక నిలబడ్డానని వాండమే తెలిపారు. ఇంతలో ఆమెతో వచ్చిన తెల్లజాతి వ్యక్తి తనను పక్కకు లాగేశాడన్నారు. ఎందుకని ప్రశ్నించిన తనను నువ్వు నల్ల జాతీయురాలివి అంటూ దుర్భాషలాడినట్లు వాండమే తెలిపారు. వాగ్వాదంలో తనపై దాడికి యత్నించడంతో ఆత్మరక్షణార్థం అతని మొహంపై పిడిగుద్దులు కురిపించినట్లు చెప్పారు. ఈ మేరకు వీడియోను ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ షాపింగ్ మాల్ యాజమాన్యానికి `మీరు వర్ణ వివక్షకు మద్దతు ఇస్తున్నట్లయితే బయట బోర్డు తగిలించండి.. నేను మాత్రం ఈ తరహా వివక్షకు ఎవరు పాల్పడినా సహించను` అంటూ వాండమే ఘాటుగా లేఖ రాశారు. దాంతో ఆ షాపింగ్ మాల్ యాజమాన్యంతో పాటు వీ&ఏ వాటర్ ఫ్రంట్ నిర్వాహకులు ఎంపీని క్షమాపణలు వేడుకున్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) అధికారంలో ఉండగా డెమోక్రటిక్ అలయెన్స్ (డీఏ) ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష డీఏ లో వాండమే అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. ఆమె గ్రాహమ్స్ టౌన్ లో గల రోడ్స్ యూనివర్సిటీ నుంచి 2007లో డిగ్రీ పట్టా పొందారు.

Modi wishes good health, long life to Rahul Gandhi on his birthday



రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో అభినందనల వెల్లువ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన 49 జన్మదిన వేడుకల్ని ఘనంగా అభిమానుల మధ్య జరుపుకున్నారు. బుధవారం ఆయనను తల్లి సోనియాగాంధీ తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. చెల్లెలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ పుష్పగుచ్ఛాలు అందజేసి పుట్టిన రోజు అభినందనలు తెలిపారు.  ప్రధాని మోదీ ట్విటర్ లో రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెల్పుతూ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుని రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు తమ ప్రియతమ నేత జన్మదినాన్ని పరస్పరం శుభాకాంక్షలు తెల్పుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. తనకు పుట్టిన రోజు అభినందనలు చెప్పిన అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.

Tuesday, June 18, 2019

Earthquakes in china kills 11, injuries over 100



చైనాలో భూకంపం 11 మంది దుర్మరణం
చైనాలో సోమవారం అర్ధరాత్రి రెండు ప్రాంతాల్లో తీవ్ర భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడగా మరో 122 మంది తీవ్రగాయాలపాలయ్యారు. చైనా నైరుతి ప్రాంతంలోని సిచువాన్ ప్రావిన్స్ యుబిన్ కౌంటీలో సోమవారం రాత్రి 11.55 ప్రాంతంలో తొలి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదయింది. భూమి లోపల 16 కి.మీ. లోతున భూకంపకేంద్రాన్ని గుర్తించిన్నట్లు చైనా ఎర్త్ క్వాక్ నెట్ వర్క్స్ సెంటర్ (సీఈఎన్సీ) వర్గాలు తెలిపాయి. రాజధాని చెంగ్డ్యూతో పాటు మరో నగరం చోంగ్వింగ్ భూకంపాల తీవ్రతకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రజలు ఫ్రాణభయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. రెండో భూకంపం 5.2 తీవ్రతతో సంభవించినట్లు చాంగ్వింగ్ కౌంటీలోని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. సిచువాన్ ప్రావిన్స్ లో 2008 నాటి తీవ్ర భూకంపంలో సుమారు 70వేల మంది మృత్యువాత పడ్డారు. ఇళ్లు కూలిపోయిన ఘటనలో జనం ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అత్యవసర సహాయక బృందాలు, సైనిక, పోలీసు సిబ్బంది శిథిలాల తొలగింపు పనుల్ని చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Mamata to skip tomorrow`s all party heads meet in delhi



ప్రధాని సారథ్యంలోని అఖిల పక్ష సమావేశానికి మమతా డుమ్మా!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని అఖిల పక్ష అధినేతల సమావేశానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకానని తేల్చి చెప్పారు. బుధవారం జరుగనున్న ఈ సమావేశానికి ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన పార్టీల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ముందుగా నిర్ణయమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తను ఈ సమావేశానికి హాజరుకాబోవడం లేదని మమతా మంగళవారం తెలిపారు. జూన్ 15న జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం మమతా హాజరుకాని సంగతి తెలిసిందే. `ఒకే దేశం.. ఒకే ఎన్నికలు` అనే అంశంపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్రానికి సూచించారు. ఈ విషయమై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరగాలని కోరారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు అంటూ హడావుడిగా నిర్ణయం తీసుకుని అమలుచేసే అంశం కాదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. తగినంత వ్యవధి తీసుకుని అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరిగాకే ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందన్నారు. చాలా ముఖ్యమైన విషయమైనందున కూలంకుషంగా ఆలోచించాకే నిర్మాణాత్మక సూచనల్ని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చేస్తుందన్నారు. 2022లో జరుగనున్న దేశ 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో, ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల్లో టీఎంసీ హృదయపూర్వకంగా పాల్గొంటుందని మమతా తెలిపారు.


UP govt to now issue press releases in Sanskrit also


సంస్కృత భాషను ప్రోత్సహించే చర్యలు చేపట్టిన యూపీ
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత పురాతన భాషయిన సంస్కృతాన్ని ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ ప్రకటనల్ని హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇకపై సంస్కృతంలో కూడా ఇవ్వాలని మంగళవారం నిర్ణయించింది. ఇప్పటికే ఆరాష్ట్ర సమాచార శాఖ జూన్17 సోమవారం సంస్కృతంలో తొలి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ప్రజలకు అందించే ముఖ్యమైన ప్రభుత్వ సమాచారం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగాలను సంస్కృతంలో కూడా విడుదల చేయనున్నట్లు సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్నో లోని రాష్ట్రీయ సాంస్క్రీట్ సంస్థాన్ సీఎం ప్రసంగాల్ని సంస్కృతంలో తర్జుమా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం యోగి ప్రసంగాన్ని సంస్కృతంలోనూ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన మీదట ఇప్పుడు అదే ఒరవడిని రాష్ట్రంలోనూ కొనసాగించాలని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. సంస్కృతం భారతీయుల డీఎన్ఏ..అయితే ఆ భాషను కేవలం పండితులకే పరిమితం చేశామని ముఖ్యమంత్రి యోగి సోమవారం ఓ సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. యూపీలో ఇప్పటికే సంస్కృత భాష పునర్జీవానికి కృషి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో 25 పత్రికా సంచికలు (పిరియాడికల్స్) సంస్కృతంలొనే వెలువడుతుండడం విశేషం. ప్రపంచంలోని సుమారు 850 భాషల పుట్టుకకు మాతృక గానో, ప్రేరణ గానో సంస్కృతం నిలవడం దేశం గర్వించదగ్గ పరిణామం. రాజభాషగా శతాబ్దాల పాటు వర్ధిల్లిన సంస్కృతం భారత్ కు ఎనలేని కీర్తిని తెచ్చిందనడంలో సందేహం లేదు.