Sunday, August 29, 2021

Silver Girl Has Given A Gift To Nation': Bhavina Patel's Table Tennis Medal

భవినా పతకంతో దేశం గర్విస్తోంది: రాహుల్

టోక్యో పారా ఒలింపిక్స్ లో భవినా బెన్ పటేల్ సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఆదివారం ఆమె టేబుల్ టెన్నిస్ లో రజత పతకాన్ని సాధించారు. పారా ఒలింపిక్స్ లో భారత్ కు లభించిన రెండో పతకమిది. టీటీ క్లాస్-4 విభాగంలో బంగారు పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భవినా చైనా క్రీడాకారిణి యింగ్ జో చేతిలో 0-3తో ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సాధించిన విజయం పట్ల దేశం గర్విస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా భవినా సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చారిత్రక విజయంగా ట్విటర్ లో పేర్కొన్నారు.

Thursday, August 26, 2021

`Immediate Task Is Evacuation`: Centre At All-Party Meet On Afghanistan

మనవాళ్లని వెనక్కితేవడమే తక్షణ లక్ష్యం: జైశంకర్

అఫ్గనిస్థాన్ లో చిక్కుకున్న మనవాళ్లనందర్నీ త్వరగా వెనక్కి తీసుకురావడమే తక్షణ లక్ష్యమని కేంద్రప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ల ఆకస్మిక పాలన అమలులోకి వచ్చిన నేపథ్యంలో అఫ్గనిస్థాన్ లో తాజా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన ప్రజలతో పాటు సుమారు 15వేల మంది భారతీయులు అక్కడ నుంచి స్వదేశానికి చేరుకోవాలని ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 31 పార్టీలకు చెందిన ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లతో పాటు రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులు పాల్గొన్నారు. అఫ్గన్ సంక్షోభం గురించి మోదీ తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో ఫోన్ లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు. మనవాళ్లని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఇందుకుగాను ఈ-వీసా పాలసీని అమలులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో భారతీయులందర్నీ స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Saturday, August 7, 2021

India stands 47th position at Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 47వ స్థానం

ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య పెరిగింది. చివరి రోజు శనివారం దక్కిన రెండు పతకాలతో కలిపి మొత్తం ఏడు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. నీరజ్ చోప్రా జావెలిన్ లో బంగారు పతకం గెలుచుకోగా భజరంగ్ కు కాంస్యం లభించింది. 100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. దాంతో ఈసారి ఒలింపిక్స్ లో భారత్ కు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు దక్కాయి. మీరాబాయి చాను, రవి దహియాలు రజతాలు గెలుచుకోగా, తెలుగు తేజం షట్లర్ పీవీ సింధు, లవ్లీనా, భారత పురుషుల హాకీ టీమ్ లకు కాంస్య పతకాలు లభించాయి. మరో మూడు నాలుగు పతకాలు త్రుటిలో చేజారిపోయాయి గానీ లేదంటే ఈ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య రెండంకెల స్కోరు దాటి ఉండేది.