Friday, December 31, 2021

Vijayawada 32 book exhibition starts tomorrow

విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం షురూ

ఆంధప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా ఏటా ఏర్పాటవుతున్న పుస్తకమహోత్సవం విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమవుతోంది. విజయవాడలో మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తోన్న ఈ పుస్తకాల పండుగ 32వది. పుస్తకప్రదర్శన 11 రోజుల పాటు లక్షల సంఖ్యలో పుస్తకప్రియులకు అందుబాటులో ఉండనుంది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల్ని అత్యంత కఠినంగా పాటించనున్నట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. 


Saturday, December 25, 2021

Telangana KTR lashes out BJP body shaming son

తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్న నెటిజన్లు

అందరివాడుగా మన్ననలు అందుకున్న తీన్మార్ మల్లన్న ఒక్క ప్రోగ్రామ్ తో బదనాం అయిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖామంత్రి కె.టి.ఆర్ తనయుడు హిమాన్ష్ పై మల్లన్న సరదాగా చేసిన కార్యక్రమం అతని కొంపముంచేసింది. కుటుంబసభ్యుల్ని అందులోనూ ఓ స్కూల్ విద్యార్థి అయిన తన కుమారుడి పట్ల మల్లన్న చేసిన కామెంట్ హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గపు పోకడలకు సోషల్ మీడియా స్వర్గంగా తయారయిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు నెటిజన్లు మూక్కుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్నారు. వై.ఎస్.ఆర్.టి.పి. అధ్యక్షురాలు షర్మిల కూడా మల్లన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పబట్టారు. రాజకీయాలు కుటుంబ సభ్యుల వరకు తీసుకురాకూడదని మహిళలు, పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని  కామెంట్లు చేయడం తప్పన్నారు.  కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత సైతం తీన్మార్ మల్లన్న వైఖరిని ఖండించారు. ఏ విషయమూ దొరక్క పిల్లాడిని అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానం చేయడం తగదన్నారు. స్వేరో నేత, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూడా మల్లన్న ట్వీట్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Friday, December 24, 2021

Shilpa Chowdary gets bail released from Chanchalaguda central jail

ఎట్టకేలకు శిల్పాచౌదరి విడుదల

 కిట్టీ పార్టీల పేరుతో కోట్లకు టోకరా వేసి అరెస్టయిన శిల్పాచౌదరి శుక్రవారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయింది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయగా ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అధిక వడ్డీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో బడావ్యక్తుల్ని కోట్ల రూపాయలకు ముంచేసిన కేసులో శిల్పా నిందితురాలు. బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం శిల్పాచౌదరికి కొన్ని షరతులు విధించింది. రూ.10వేల ష్యూరిటీ సమర్పించడంతో విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశించింది. ఎవరితోనూ ఫోన్‌లో కానీ, నేరుగా కానీ ఈ కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు గట్టిగా చెప్పింది. అలాగే ప్రతి శనివారం నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 13న దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 25న శిల్పాచౌదరి, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో మూడుసార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించినా ఆమె నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని మాత్రం చెప్పుకొచ్చింది. వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణ సందర్భంగా శిల్పా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె భర్తకు ఉప్పర్‌పల్లి కోర్టు గతంలోనూ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శిల్పాచౌదరి బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కోర్టు తిరస్కరించడం గమనార్హం.

Wednesday, December 22, 2021

once again tension prevailed in Vizianagaram district Ramatheertham temple

వేడెక్కిన రామతీర్థం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మరోసారి వేడెక్కింది. ఏడాది క్రితం జిల్లాలోని రామతీర్థం ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ పురాతన రామాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల నరికేసిన దుండగులు అశేషభక్తుల మనోభావాలను  దెబ్బతీశారు. దీనికి సంబంధించి నిందితులెవ్వర్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయిందని ఆలయ ధర్మాధికారి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత తీరిగ్గా ప్రభుత్వం ఇక్కడ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని విమర్శించారు. ఇది `సర్కస్ కాదు.. పూజ` అని గుర్తు పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ కోసం తను విరాళం ఇవ్వగా మొహం మీదే తిప్పికొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భక్తులు ఆరాధనపూర్వకంగా చెల్లించే విరాళాల్ని ప్రభుత్వం తిరస్కరించడం మానుకోవాలని సూచించారు. ఇదిలావుండగా రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు మంత్రులు వెల్లంపల్లిశ్రీనివాస్, బొత్స సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు.


Monday, December 13, 2021

Search continues for victims of tornadoes that killed dozens in 7 states of US

టోర్నడోల ధాటికి అమెరికా విలవిల

అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేశాయి. ఇటీవల విరుచుకుపడిన టోర్నడోల ధాటికి ఆ దేశంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలందుతున్నాయి. దాదాపు ఏడు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన టోర్నడోలు జనజీవితాన్ని ఛిద్రం చేశాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల వల్ల ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. సుడిగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భయంకరంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని  గవర్నర్‌ ఆండీ బెషియర్‌ చెప్పారు. మేఫీల్డ్‌ నగరంలో అమెజాన్‌ క్యాండిల్‌ ఫ్యాక్టరీ ధ్వంసమయింది. శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిలో 29 మంది మరణించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. కెంటకీలో మొత్తంగా 70 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 227 మైళ్ల మేర టోర్నడోల ప్రభావం కనిపించిందని గవర్నర్‌ తెలిపారు. స్థానిక అధికారులు, నేషనల్‌ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్‌ మేఫీల్డ్‌ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆర్కాన్సస్‌ రాష్ట్రంలో ఈ  ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. మోనెట్టి మానర్‌ నర్సింగ్‌ హోమ్‌ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. లేక్‌ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్‌ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టోర్నడోల బీభత్సంపై  అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Saturday, December 4, 2021

Konijeti Rosaiah passed away in Hyderabad

కాంగ్రెస్ మహానేత అజాతశత్రువు కొణిజేటి రోశయ్య (88) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో శనివారం ఉదయం 8 గంటలకు అస్వస్థత గురైన కొద్దిసేపటికే మరణించారు.  నాడి పడిపోతుండడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఇటీవల బంజారాహిల్స్ లోని స్టార్ హాస్పిటల్ లోనే ఆయన కొంతకాలం చికిత్స పొందారు. వైద్యులు రోశయ్య మరణించినట్లు ధ్రువీకరించిన అనంతరం పార్థివదేహాన్ని అమీర్ పేట, ధరంకరం రోడ్డులోని స్వగృహానికి తీసుకువచ్చారు. గాంధీభవన్ లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన భౌతికకాయన్ని పార్టీ శ్రేణులు సందర్శనార్థం ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్, సన్నిహిత సహచరులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి  రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Friday, November 5, 2021

Delay in communication of bail orders affects liberty:SC judge

బెయిల్ కాపీ జాప్యంపై సుప్రీం జడ్జి ఆగ్రహం

బెయిల్ ఆర్డర్ కాపీ అందజేతలో జాప్యాన్ని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడంగా పేర్కొన్నారు. ఈ అంశంలో దిద్దుబాటు చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని హితవు చెప్పారు. జైలు అధికారులకు సత్వరం బెయిల్ ఆర్డర్ కాపీలను అందించక అలసత్వం వహించడం వల్ల విచారణలో ఉన్న ఖైదీలపై మానసికంగా ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికే దేశంలోని ఆయా జిల్లా కోర్టుల్లో 2.97 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. వీటిలో 77 శాతం కేసులు ఏడాదిలోపువేనన్నారు.

Sunday, October 10, 2021

happy birthday s s rajamouli@20

దర్శకధీర@20

రాజమౌళి ఈ పేరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్. తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి మహోన్నతంగా ప్రపంచానికి చూపించిన ఘనుడు. బాహుబలి-1,2 సినిమాలను నభూతో నభవిష్యతి అనే రీతిలో మలిచిన గ్రేట్ మేకర్. జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నం.1 చిత్రంతో పరిశ్రమలో మెగా ఫోన్ చేతపట్టాడు. ఓటమి మాట తన డిక్షనరీలో లేదని నిరూపించిన ఈ జక్కన పుట్టినరోజు ఈరోజు. రాజమౌళి దర్శకుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీయార్, రామ్ చరణ్‌లతో  రౌద్రం రణం రుధిరం’ (RRR) అనే భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరపై తళుకులీననున్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. చరిత్రలో అసలు కలవని  కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఫాంటసీ కథలకు క్లాస్, మాస్ పల్స్ జోడించి హిట్లు మీద హిట్లు కొడుతూ తనకు తనే సాటిగా దూసుకెళ్తున్నాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ `మహాభారతం` తన చివరి చిత్రంగా తీస్తానని పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా బహుబలి చిత్రాల్ని తలదన్నే మరో చిత్రరాజమవుతుందనడంలో సందేహమే లేదు.

Thursday, September 2, 2021

Pawan Kalyan birthday Chiranjeevi and tollywood celebrities best wishes

పవన్ కల్యాణ్@50

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజుని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం ఆయన బర్త్ డే  సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి `తమ్ముడు నిప్పు కణం` అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. `సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను` అంటూ ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్, అనసూయ, శ్రీముఖిలతో పాటు పలువురు పవన్‌కి విషెస్ అందించారు. `హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. అన్ని విషయాల్లో మీకు మంచి జరగాలని, విజయం వరించాలని కోరుకుంటున్నా` అని వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు పవన్, రానాల తాజా సినిమా భీమ్లా నాయక్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ ని చిత్ర యూనిట్ అభిమానులకు బర్త్ డే కానుకగా విడుదల చేసింది. ఆ సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Sunday, August 29, 2021

Silver Girl Has Given A Gift To Nation': Bhavina Patel's Table Tennis Medal

భవినా పతకంతో దేశం గర్విస్తోంది: రాహుల్

టోక్యో పారా ఒలింపిక్స్ లో భవినా బెన్ పటేల్ సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఆదివారం ఆమె టేబుల్ టెన్నిస్ లో రజత పతకాన్ని సాధించారు. పారా ఒలింపిక్స్ లో భారత్ కు లభించిన రెండో పతకమిది. టీటీ క్లాస్-4 విభాగంలో బంగారు పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన భవినా చైనా క్రీడాకారిణి యింగ్ జో చేతిలో 0-3తో ఓటమి పాలయ్యారు. అయినా ఆమె సాధించిన విజయం పట్ల దేశం గర్విస్తోందని రాహుల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా భవినా సాధించిన పతకం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ చారిత్రక విజయంగా ట్విటర్ లో పేర్కొన్నారు.

Thursday, August 26, 2021

`Immediate Task Is Evacuation`: Centre At All-Party Meet On Afghanistan

మనవాళ్లని వెనక్కితేవడమే తక్షణ లక్ష్యం: జైశంకర్

అఫ్గనిస్థాన్ లో చిక్కుకున్న మనవాళ్లనందర్నీ త్వరగా వెనక్కి తీసుకురావడమే తక్షణ లక్ష్యమని కేంద్రప్రభుత్వం పేర్కొంది. తాలిబన్ల ఆకస్మిక పాలన అమలులోకి వచ్చిన నేపథ్యంలో అఫ్గనిస్థాన్ లో తాజా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన ప్రజలతో పాటు సుమారు 15వేల మంది భారతీయులు అక్కడ నుంచి స్వదేశానికి చేరుకోవాలని ఎదురుచూస్తున్నారు. తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 31 పార్టీలకు చెందిన ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లతో పాటు రాజ్యసభ, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నాయకుడు టీఆర్ బాలు, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులు పాల్గొన్నారు. అఫ్గన్ సంక్షోభం గురించి మోదీ తాజాగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లతో ఫోన్ లో మాట్లాడినట్లు జైశంకర్ తెలిపారు. మనవాళ్లని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఇందుకుగాను ఈ-వీసా పాలసీని అమలులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరలో భారతీయులందర్నీ స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Saturday, August 7, 2021

India stands 47th position at Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు 47వ స్థానం

ఏడాది ఆలస్యంగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య పెరిగింది. చివరి రోజు శనివారం దక్కిన రెండు పతకాలతో కలిపి మొత్తం ఏడు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. నీరజ్ చోప్రా జావెలిన్ లో బంగారు పతకం గెలుచుకోగా భజరంగ్ కు కాంస్యం లభించింది. 100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. దాంతో ఈసారి ఒలింపిక్స్ లో భారత్ కు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు దక్కాయి. మీరాబాయి చాను, రవి దహియాలు రజతాలు గెలుచుకోగా, తెలుగు తేజం షట్లర్ పీవీ సింధు, లవ్లీనా, భారత పురుషుల హాకీ టీమ్ లకు కాంస్య పతకాలు లభించాయి. మరో మూడు నాలుగు పతకాలు త్రుటిలో చేజారిపోయాయి గానీ లేదంటే ఈ ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య రెండంకెల స్కోరు దాటి ఉండేది.

Monday, July 19, 2021

AP CM YSJagan Polavaram project tour highlights review development works

 సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా తొలుత ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి సీఎం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి జగన్ స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. తర్వాత జగన్‌  పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం పరిశీలించాకా పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. గడువులోగా పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరాలని సూచించారు.

Wednesday, June 23, 2021

IRCTC offers one day Tirumala tour package just for Rs 990

ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్'

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్న వారికి శుభవార్త. కేవలం రూ.990కే తిరుమల ప్రయాణంతో పాటు స్వామి వారి దర్శనభాగ్యం దక్కనుంది. భారతీయ రైల్వే ఐఆర్‌సీటీసీ 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోనూ కాస్త తగ్గిన నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా కరోనా భయంతో ఎక్కడికీ వెళ్లలేకపోయిన ప్రజలు తీర్థయాత్రలు, టూర్ల పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి వారు ముందుగా 'డివైన్ బాలాజీ దర్శన్' ప్యాకేజీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఈ ప్యాకేజీ కింద భక్తులను ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌లో పికప్ చేసుకుని తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా మధ్యాహ్నం 1 గంట లోపే శ్రీవారిని దర్శించుకుంటారు.  తిరుమలలోనే భోజనం చేశాక భక్తులు తిరుచానూర్ బయల్దేరుతారు. తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం పూర్తైన తర్వాత భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగబెడతారు. దాంతో వన్డే తిరుమల టూర్ ముగుస్తుంది.

Saturday, June 19, 2021

Milkha Singh to get state funeral

మిల్కాసింగ్ కు కన్నీటి వీడ్కోలు

ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్‌ కు శనివారం చండీగఢ్ లో పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 91 ఏళ్ల ఈ పరుగుల వీరుడికి కుటుంబ సభ్యులు కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. క్రీడా ప్రపంచం ఆయనను ది ఫ్లయింగ్ సిక్కుఅని ప్రేమగా పిలుచుకునేది. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగుసార్లు స్వర్ణ పతకాలు గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. ఆయన మృతి పట్ల యావత్ భారత క్రీడాలోకం తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐదు రోజుల క్రితం మిల్కా భార్య, మాజీ భారత వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ కౌర్ కరోనాతో మొహాలి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.  మిల్కాకు  గోల్ఫ్ దిగ్గజం కుమారుడు జీవ్ మిల్కా సింగ్, కుమార్తెలు మోనా సింగ్, సోనియా సింగ్, అలీజా గ్రోవర్ ఉన్నారు. ఆయనకు మే 20 న కరోనా పాజిటివ్ అని తేలడంతో మే 24 న మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మే 30 న మిల్కా డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో జూన్ 3 న ఆసుపత్రిలో చేర్చారు. ఈ భారత మాజీ అథ్లెట్ కు గురువారం కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే మరుసటి రోజే ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.

Friday, June 18, 2021

Curfew relaxation 6A.M- 6P.M in A.P

21 నుంచి ఉ.6 - సా.6 కర్ఫ్యూ బ్రేక్

లాక్ డౌన్ వేళల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్యా దిగివస్తుండడంతో సర్కారు ఈ మేరకు సడలింపులకు మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కరోనా కేసులపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 1,07,764 శాంపిల్స్ ని పరీక్షించగా 6,341 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాలు మినహా మిగిలిన 10 జిల్లాల్లో కేసుల ఉధృతి అదుపులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా(1,247), చిత్తూరు జిల్లా(919), పశ్చిమగోదావరి జిల్లా(791) పాజిటివ్ కేసులతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోన్న కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేయాలని నిశ్చయించింది. ఈ నెల 21 సోమవారం నుంచి ఉదయం 6 - సాయంత్రం6 వరకు లాక్ డౌన్ సడలింపు ప్రకటించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సాయంత్రం 5కు మూసివేయాలి. జనం 6  గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఆ మేరకు సిబ్బందిని కార్యాలయ విధుల్లో వినియోగించుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కర్ఫ్యూ యథావిధిగా కొనసాగనుంది. సడలింపు  ఉదయం 6 - మధ్యాహ్నం 2 వరకు అమలులో ఉంటుంది.

Friday, June 11, 2021

CJI NV Ramana to Tour AP&TS

స్వామి కృపతోనే సీజేఐ స్థాయి

శ్రీవేంకటేశ్వరస్వామి దయ వలనే తను ఈరోజు  అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఆలయానికి విచ్చేసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద జస్టిస్ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకకులు వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకస్వాములు వారికి శ్రీవారి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఈ సాయంత్రం తెలంగాణ రాజ్ భవన్ కు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఆయన తొలిసారి హైదరాబాద్‌కు విచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసై జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్ పోర్టులో జస్టిస్ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి చీఫ్ జస్టిస్ కారులో తెలంగాణ రాజ్ భవన్‌కు చేరుకున్నారు.

Wednesday, June 9, 2021

Telugu people gave me life Navneet Kaur

శభాష్ సోనూసూద్:నవనీత్ కౌర్

నాటి తెలుగు హీరోయిన్ ప్రస్తుత లోక్ సభ ఎంపీ నవనీత్ కౌర్  రియల్ హీరో సోనూసూద్ సేవల్ని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా నేపథ్యంలో ఆయన బాధితులకు అందించిన చేయూత తమబోటి రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచి ఎంపీ అయిన నవనీత్‌ కౌర్‌ కులధ్రువీకరణ పత్రం వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఎంపీ పదవికి గండం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఓ టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం. తెలుగు ఇండస్ట్రీ లైఫ్‌ ఇచ్చిందన్నారు. కోవిడ్‌ సమయంలో చాలా మంది విద్యార్థులకు హెల్ప్‌ చేశాను. పార్టీలకతీతంగా పార్లమెంట్‌లో గళం వినిపిస్తున్నా అని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పలు దక్షిణాది చిత్రాల్లో నవీనత్ తళుక్కున మెరిశారు. తెలుగులో బాలకృష్ణజగపతి బాబు వంటి స్టార్లతో పాటు అల్లరినరేశ్వడ్డే నవీన్ తదితర హీరోలతో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అదేవిధంగా తమిళకన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా రాణించారు.  రాజకీయాల్లోకి వచ్చాక పూర్తిగా ప్రజాసేవలోనే నిమగ్నమయినట్లు తెలిపారు. తన భర్త ఎమ్మెల్యే కావడంతో రాజకీయాలపై మరింత ఆసక్తి పెరిగిందన్నారు. అదేవిధంగా మా కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది.. ప్రజల సహకారం వల్లే రాజకీయాల్లో కొనసాగుతున్నా అని నవనీత్ గర్వంగా చెప్పారు. అమరావతిలో ఇండిపెండెంట్‌గా గెలవాలంటే అంత సులువు కాదు.ప్రజాభిమానమే తనను గెలిపించిందన్నారు. గోవిందాసునీల్‌శెట్టి తన తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. 

Wednesday, June 2, 2021

Petrol Diesel rates hike in Telangana

టీఎస్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్

తెలంగాణలో పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. ఓ వైపు కరోనా లాక్ డౌన్ మరోవైపు ధరాఘాతంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో పాటు వంట నూనె, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధరల సెగ జనాలకు తాకుతోంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు ఒక రోజు పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు.. స్థిరంగానూ కొనసాగవచ్చు. అందుకే పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Thursday, May 27, 2021

For Rs.18000 man flies single to UAE on 360 seat plane

విమానంలో.. ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు.. ముంబాయి టు దుబాయ్ .. గగనవిహారం.. అదేనండి ప్రయాణం. గల్ఫ్ యువరాజులు, షేక్ లకు తప్పా వేరెవ్వరికీ సాధ్యం కాని ప్రయాణం ఇటీవల అతని సొంతమయింది. కలలో తప్పా సాధ్యం కాని అదృష్టం ఆ యువకుడికి దక్కింది. 360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడిగా అతగాడు ప్రయాణించాడు. కరోనా బెడద వల్ల ఈ భాగ్యం అతనికి లభించింది. అదీ కారు చౌకగా.. లక్షలు ఖర్చు పెట్టినా దక్కని ప్రయాణం కేవలం రూ.18 వేల టికెట్ తోనే సాధ్యమయింది. అతని పేరు భవేష్ జవేరి.. వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈఓ గా పని చేస్తున్నాడు. బోయింగ్ 777  ఎమిరేట్స్ విమానంలో ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుందట. కానీ కరోనా నిబంధనల వల్ల జవేరి ఒక్కడే ముంబయి నుంచి బయలుదేరిన విమానంలో అనుభవించు రాజా అని పాడుకుంటూ ఖుషీగా ప్రయాణించాడు. దౌత్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్నవారు, అరబ్ జాతీయులు..అన్ని అనుమతులు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దాంతో ఆ రోజు ఈ అర్హతలన్నీ ఉన్న ఏకైక ప్రయాణికుడు జవేరీ కావడంతో అతనికే ఆ అవకాశం దొరికింది. దాంతో నచ్చిన సీటులోకి మారుతూ విమాన సిబ్బందితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జవేరీ జాలీగా దుబాయ్ చేరుకున్నాడు.

Wednesday, May 26, 2021

Water From the Sea Enters Residential Areas in Bengal’s East Midnapore Ahead of Cyclone Yaas Landfall

యాస్​ తుపాను అలజడి

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుపానుగా మారి అలజడి రేపుతోంది​. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతం తీరానికి చేరువయినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. ఉత్తర ధమ్రాదక్షిణ బాలసోర్ (ఒడిశా) మధ్య యాస్​ తీరందాటనుంది. దీని  ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీళ్లు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నాయి. ఏపీలో కూడా యాస్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దుగరాజపట్నం (నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంది. సముద్రపు అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడుతున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండ్రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని రాష్ట్ర అధికార వర్గాలు ఆదేశించాయి. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రానికి చేరుకున్న 15 ఎన్డీఎఫ్ బృందాలు సహాయరక్షణ చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.

Monday, May 17, 2021

TTD vigilance officers found huge cash from begger`s house in Tirupati

ఈ యాచకుడు లక్షాధికారి!

కరోనాతో చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో బయటపడిన డబ్బుల కట్టలు సంచలనం రేపాయి. సోమవారం తిరుపతిలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విజిలెన్స్ అధికారుల దాడిలో ఈ విషయం వెలుగుచూసింది. తిరుమల స్వామి వారి సన్నిధిలో ఏళ్ల తరబడి భిక్షాటన చేసిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి గతేడాది కరోనాతో చనిపోయాడు. గతంలో ఈ యాచకుడు తిరుమలలోనే గుడిసె వేసుకుని భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేవాడు. అయితే టీటీడీ కొండపై ఈ విధంగా జీవనం సాగిస్తున్న వారినందర్ని తిరుపతికి తరలించి ఇళ్లను నిర్మించి ఇచ్చింది.  ఆ విధంగా రోజువారీ శ్రీనివాసాచారి తిరుమల నుంచి రాత్రికి తిరుపతి చేరుకుని టీటీడీ కేటాయించిన ఇంట్లో నివసించేవాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడని ఇరుగుపొరుగులు తెలిపారు. కరోనాతో చనిపోవడంతో అతనికిచ్చిన ఇంటిని వేరేవారికి కేటాయించేందుకు విజిలెన్స్ తనిఖీ కోసం ఆ ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లిన అధికారులకు  పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపించడంతో అవాక్కయ్యారు. టీటీడీ స్వాధీనం చేసుకున్న ఆ సొమ్ము రూ.10 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

Tuesday, May 11, 2021

Italian woman given six doses of Pfizer vaccine by mistake

ఇటలీ మహిళకు ఒకేసారి ఆరుడోసుల వ్యాక్సిన్

ఆమె అదృష్టం బాగుండి బతికి బట్టకట్టింది. కరోనా మహమ్మారి బెడద నుంచి తప్పించుకోవడానికని వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే ఆరుడోసుల్ని ఒకేసారి ఎక్కించేశారు. ఈ ఘటన ఇటలీలో ఆదివారం జరిగింది. ఓ నర్సు ఒత్తిడిలో ఉందో.. ఏమరుపాటు గానో వ్యాక్సిన్ వేసింది. తర్వాత వైల్ ను పరిశీలించగా ఖాళీగా ఉంది. పక్కన 5 ఖాళీ సిరంజీలు దర్శనమిచ్చాయి. అప్పటికి గానీ ఆ నర్సుకు జరిగిన తప్పిదం తెలిసిరాలేదు. అంటే వైల్ లో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ఆరు డోసుల్ని ఒకే సిరంజిలో లోడ్ చేసి మహిళకు ఇంజెక్ట్ చేసింది. పొరపాటు తెలుసుకున్న నర్సు వెంటనే ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళను వెంటనే ఇన్ పెషెంట్ గా చేర్చుకుని వైద్యం అందించారు. ఆమె ఆరోగ్యం 24 గంటల తర్వాత కుదుటపడ్డంతో వైద్య సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు వారాల పాటు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ప్రత్యేక వైద్యుల్ని నియమించారు. ఫైజర్ వ్యాక్సిన్ అధిక మోతాదును పరీక్షించడానికి మునుపటి అధ్యయనాలు నాలుగు మోతాదులకే పరిమితం చేయబడ్డాయి.  అంతకన్నా ఎక్కువ మోతాదులో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయిల్ లో నిషేధం. ఇటువంటి ఘటనే ఈ ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు ఇదేవిధంగా ఓ వృద్ధ మహిళకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల్ని ఒకేసారి ఇచ్చింది. సదరు నర్సు సెల్ ఫోన్ మెసేజ్ లు చూసుకుంటూ ఓ డోసు తీసుకుని అక్కడే కూర్చున్న మహిళకు మరో డోసు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే ఆ మహిళకు ఎటువంటి అనారోగ్యం కల్గకపోవడంతో అక్కడ వైద్యసిబ్బంది హమ్మయ్య అనుకున్నారు.

Friday, May 7, 2021

Australia PM says India travel ban to end on May 15

15 వరకే భారత్-ఆస్ట్రేలియా  ప్రయాణ నిషేధం  

భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్ల ప్రయాణ నిషేధాన్ని ఈనెల 15 దాటి పొడిగించబోమని ఆదేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. శుక్రవారం జాతీయ భద్రతా కమిటీ భేటీ తర్వాత మోరిసన్ ఈ మేరకు ప్రకటించారు. మే15 తర్వాత నిషేధాన్ని పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తేదీ వరకు మాత్రం బయోసెక్యూరిటీ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తిరిగి రప్పించే విమానాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా తమ పౌరులు స్వదేశానికి తిరిగి రాకుండా తాత్కాలిక నిషేధాన్ని విధించింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఈ నిషేధం అనివార్యమయింది. ఆసిస్ తిరిగి రావడానికి 14 రోజుల ముందు వరకు భారతదేశంలో గడిపినట్లయితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా 66,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.37,89,112) జరిమానా విధిస్తామని మోరిసన్  ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు ఈ15వ తేదీతో ముగియనున్నాయి.

Sunday, May 2, 2021

Inter Exams postponed in AP

ఏపీలో ఇంటర్ పరీక్షల వాయిదా

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం.. పరీక్షలు నిర్వహించి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వం  హైకోర్టు సూచన ప్రకారం మెట్టుదిగివచ్చింది. కోవిడ్ తాజా కల్లోలం దరిమిలా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 30 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సి ఉందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పరీక్షల్ని వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టింది. తీర్పు సోమవారం (మే3)న వెలువడాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగా ఆదివారమే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ మేరకు ప్రకటన చేస్తూ పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. 

Thursday, April 29, 2021

West Bengal assembly election crude bombs-hurled in central Kolkata amid last phase of polls

పశ్చిమబెంగాల్ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు

పశ్చిమబెంగాల్ తుది దశ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. గురువారం ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని మహాజతి సదన్ ప్రాంతంలో ఆగంతకులు నాటుబాంబులు విసరడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం నడిబొడ్డున గల సెంట్రల్ అవెన్యూలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధారాలు సేకరించి దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. జోరాసంకో  నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మీనా దేవి పురోహిత్ పోలింగ్ బూత్‌లలో పర్యటిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరారు. తన వాహనానికి అత్యంత సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించినట్లు పురోహిత్ తెలిపారు. "నా కారుపై బాంబులు విసిరినప్పటికీ నేను భయపడను. నేను ఖచ్చితంగా బూత్‌లను సందర్శిస్తాను" అని ఆమె చెప్పారు. "వారు నన్ను చంపడానికి ప్రయత్నించారు .. ఓటర్లను భయపెట్టడానికి ఇది ఒక కుట్ర" అని పురోహిత్ ఆరోపించారు. ఘటనా స్థలంలో భారీ పోలీసు బృందాన్ని మోహరించినట్లు కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో జోరసంకోతో సహా కోల్‌కతాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్  సాయంత్రం 6.30 వరకు కొనసాగనుంది.

Wednesday, April 28, 2021

Cowin Aarogya Setu crash as citizens rush to register for Corona Vaccines

కోవిన్ పోర్టల్‌ క్రాష్! 

దేశంలోని యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులే అని కేంద్రం ప్రకటించడంతో ఎక్కువ మంది ఒకేసారి రిజిస్ట్రేషన్‌కి ప్రయత్నించారు. దాంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న భయోత్పాతంతో ఒక్కసారిగా అందరిలోనూ వేక్సినేషన్ విషయమై చురుకు పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 60 కోట్ల  పైచిలుకు మందికి కరోనా వ్యాక్సినేషన్ జరగ్గా అందులో 25 శాతం సుమారు 15 కోట్ల మందికి  మనదేశంలో కరోనా టీకా వేశారు. భారత ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌ కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయాలతో 18 ఏళ్ల పైబడిన యువత పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు కోవిన్ పోర్టల్‌‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్దఎత్తుల లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. దాంతో లోడ్ తట్టుకోలేక సర్వర్లు క్రాష్ అయినట్లు సమాచారం.

Friday, April 23, 2021

Hyderabad chicken and mutton shops will be closed on April 25th sunday due to Mahavir birth anniversary

ఈ సండే ముక్కా చుక్క బంద్

హైదరాబాద్ మహానగర వాసులు ఈ ఆదివారం ముక్క, చుక్కకు దూరం కానున్నారు. మహవీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 25న  మాంసం, మందు దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ ఈ ఆదివారం మూసేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించేలా వెటర్నరీ విభాగం అధికారులు బాధ్యత తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. గత ఏడాది కరోనా టైమ్ లో చికెన్ పై దుష్ప్రచారం జరిగింది. మాంసాహారం వల్లే కరోనా వస్తుందంటూ వదంతులు వ్యాపించడంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.50 కి పడిపోయింది. కోడి, గుడ్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. దాంతో నెలల పాటు ఫౌల్ట్రీ రంగం కుదేలయిపోయింది. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు చికెన్, గుడ్లు తినడం ద్వారానే పోషకాలు లభించి కరోనాను తేలిగ్గా జయించొచ్చని ప్రచారాన్ని చేపట్టాయి. మళ్లీ జనం కోడి, గుడ్లను తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.280 వరకు చేరుకోగా, మాంసం కిలో రూ.500 పైచిలుకు పలుకుతోంది. మద్యం విషయానికి వస్తే ఏరోజుకారోజు పైపైకే అన్నచందంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Monday, April 19, 2021

Mahesh Babu tweets TS CM KCR get well soon recovery

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మహేష్ బాబు ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్ కు సోమవారం నిర్వహించిన ఆర్టీ పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పలు సందర్భాల్లో కేసీఆర్ భేటీ అయ్యారు. దాంతో ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన గజ్వేల్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 10 రోజుల పాటు ఆయన అక్కడే అవసరమైన చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటారని వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు తెలిపారు. కేసీఆర్ గొప్ప పోరాటయోధుడని ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఎవరూ ఆందోళన చెందవద్దంటూ తనయుడు కేటీరామారావు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో యావత్ తెలుగుపరిశ్రమ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కేటీఆర్ తో వ్యక్తిగత స్నేహమున్న మహేశ్ బాబు వెంటనే స్పందించి సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేసినట్లు సమాచారం.