Tuesday, December 31, 2019

Malavath Poorna conquered Mt Vinson Massif in Antarctica

అంటార్కిటికా మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించిన పూర్ణ

ఏడు ఖండాలలో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్నదే భారతమాత ముద్దు బిడ్డ మాలవత్ పూర్ణ లక్ష్యం. ఆ సాధనలో ఆమెకు మరో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా  పూర్ణ అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను జయించి 2019ను ముగించింది. ఈ ఘనత తరువాత ఇప్పటికి ఆమె ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వత శిఖరాలపై అడుగు పెట్టి చరిత్ర లిఖించింది. ఈ కీర్తిని సొంతం చేసుకున్న ప్రపంచంలోనే తొలి గిరిజన మహిళగా 18 ఏళ్ల పూర్ణ నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా, 2019), మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) పూర్ణ అధిరోహించిన పర్వతాల జాబితాలో చేరాయి. 13 సంవత్సరాల 11 నెలల వయస్సులో ఆమె మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు పూర్ణ.

Monday, December 30, 2019

Uddhav Thackeray inducts son, 35 others; Ajit Pawar sworn in Dy CM

`మహా` కేబినెట్ లో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రేలకు చోటు లభించింది. రాజ్ భవన్ లో  సోమవారం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు నాసిక్ రావు తిర్పుడే, సుందరరావు సోలంకీ, రామ్ రావ్ అదిక్, గోపినాథ్ ముండే, ఆర్.ఆర్.పాటిల్, విజయ్ సింహ్ మిమితే పాటిల్ తది రులతో గవర్నర్  బి.ఎస్.కోష్యారీ ప్రమాణం చేయించారు. దారితప్పినా మళ్లీ శరద్ పవార్ తంత్రంతో ఎన్సీపీ గూటికి చేరిన ఆ పార్టీ అగ్రనేత అజిత్ పవార్ మరోసారి ఉపముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. 32 రోజుల క్రితం కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ లో కేబినెట్ సంఖ్య 36కు చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే `మహా వికాస్ అగాడి`(కూటమి)కి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లాళ్ల క్రితం హడావుడిగా అధికారానికి వచ్చిన బీజేపీ సర్కార్ లో 60 ఏళ్ల అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 80 గంటల పాటు పదవిలో ఉన్నారు. అప్పటి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు బలనిరూపణకు నిలువలేక రాజీనామా చేయడంతో ఆయన పదవి కోల్పోయారు. తిరిగి బాబాయ్ శరద్ పవార్ పంచనే చేరిన అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ గా పదవిలోకి రావడం ఇది నాల్గోసారి. తొలిసారి 2010 నవంబర్ లో ఆ తర్వాత అక్టోబర్ 2012లో ఇటీవల నవంబర్ 2019లో మళ్లీ డిసెంబర్ 2019లో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. కాగా ఠాక్రేల వారసుడు ఆదిత్య ఠాక్రే కు తండ్రి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో తాజాగా చోటు దక్కింది.

Friday, December 27, 2019

MiG 27 to pass into history, its last squadron to be decommissioned in Jodhpur on Friday

చరిత్ర పుటల్లో ఐఏఎఫ్ అస్త్రం మిగ్-27
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భాసిల్లిన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయి. 1999లో పాకిస్థాన్ మూకలతో జరిగిన కార్గిల్ యుద్ధం నుంచి భారత తురఫుముక్కగా మిగ్-27 ఇతోధిక సేవలందించింది. భారత సైన్యంతో `బహుదూర్` గా కీర్తి పొందిన ఈ రష్యా తయారీ మిగ్-27 కాలమాన క్రమంలో `ప్రాణాంతక` లోహ విహాంగంగా భయపెట్టింది. శుక్రవారం జోద్ పూర్ ఎయిర్ బేస్ నుంచి చివరి మిగ్-27 నిష్క్రమణ (డీ కమిషన్) పూర్తయింది. ఈ ఎయిర్ బేస్ నుంచి ఏడు మిగ్-27లతో స్క్వాడ్రన్ లీడర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టి డీకమిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఏడాది బాలాకోట్ పై భారత్ వైమానిక దళం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసిన అనంతరం పాక్ శత్రు విమానాలు భారత్ గగనతలంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ వర్ధమాన్ ఈ మిగ్-27 విమానంతోనే పాక్ అత్యాధునిక ఎఫ్-27 (అమెరికా తయారీ) యుద్ధ విమానాల్ని నిలువరించడమే కాకుండా ఓ ఫైటర్ క్రాఫ్ట్ ను నేల కూల్చిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో మిగ్-27 డీకమిషన్ కార్యక్రమం సందర్భంగా రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ సొంబిత్ ఘోష్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ ఎయిర్ బేస్ నుంచి ఇక మిగ్-27లు కార్యకలాపాలు నిర్వహించబోవన్నారు. ఐఏఎఫ్ సేవల నుంచి తప్పించిన ఈ విమానాల భవిష్యత్ గురించి ఇప్పటికింకా కచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదన్నారు. వీటిని దేశీయ అవసరాలకు వినియోగించడమా, ఇతర దేశాలకు తరలించడమా అనేది అనంతర కాలంలో తేలనుందని చెప్పారు.

Tuesday, December 24, 2019

Hemant meets Babulal, JVM(P) announces unconditional support

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్: జేవీఎం బేషరతు మద్దతు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన మహాఘట్ బంధన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అయిదో సీఎంగా హేమంత్ సోరెన్ నియమితులు కానున్నారు. మంగళవారం ఆయన మాజీ ముఖ్యమంత్రి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీని రాంచీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో మరాండీ ధన్వార్ నుంచి గెలుపొందగా జేవీఎం పార్టీ మొత్తం 3 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా మహాఘట్ బంధన్ లోని ఝార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 తదితర పార్టీల మద్దతుతో హేమంత్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. తాజాగా జేవీఎం(పి) బేషరతుగా మద్దతు తెలిపింది. హేమంత్ తండ్రి శిబుసోరెన్ ఝార్ఖండ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు సోరెన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1994లో శిబు సోరెన్ ప్రయివేట్ సెక్రటరీ శశినాథ్ ఝా హత్యకు గురయ్యారు. అందులో ఆయన పాత్ర నిరూపణ కావడంతో 2006లో అరెస్టయి  జీవితఖైదు అనుభవిస్తున్నారు.
బీజేపీ ఓటమితో కాంగ్రెస్ సంబరం
జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి మెజారిటీ మార్కును దాటి హేమంత్ సోరెన్‌ ముఖ్యమంత్రిగా తమ కూటమి అధికారంలోకి రానుండడంతో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది. ఝార్ఖండ్ ఏఐసీసీ కమిటీ ఇన్ ఛార్జీ  ఆర్‌పీఎన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలు, జీవనోపాధిని ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తి ఎన్నికలలో పోరాడి తాము అధికారానికి వచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజల దృష్టిని ప్రాథమిక సమస్యల నుంచి మళ్లించడానికి యత్నించి చివరకు ఓటమి పాలయ్యారని చెప్పారు.ఫలితాలు బీజేపీ అహంకార, అవినీతిమయ పాలనకు చెంపపెట్టుగా రాష్ట్ర ఎన్నికల కాంగ్రెస్ సమన్వయకర్త అజయ్ శర్మ పేర్కొన్నారు.

Friday, December 20, 2019

Unnao rape case life imprisonment for Ex- BJP MLA Kuldeep Singh Sengar

ఉన్నావ్ రేప్ కేసు దోషి ఎమ్మెల్యే సెంగర్ కు జీవితఖైదు
·   రూ.25 లక్షల జరిమానా
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ బాలిక అత్యాచార కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ నాయకుడు, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు జీవితఖైదు శిక్ష ఖరారయింది. దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ ప్రాణ రక్షణకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తగిన ఏర్పాట్లు చేయాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. ఉద్యోగం ఆశ చూపి ఎమ్మెల్యే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. 2017లో బాధితురాలు మైనర్ గా ఉండగా ఈ దారుణం జరిగింది. దాంతో ఎమ్మెల్యే సహా అతని సోదరుడిపైన బాలిక అపహరణ, నిర్బంధం, లైంగిక దాడి, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ బాధిత బాలిక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్యాంప్ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న బాధితురాలి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతరం కూడా బాలిక ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టి నిందితులు హత్యా యత్నం చేశారు. ఈ దుర్ఘటనలో బాధితురాలి బంధువులైన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దాంతో తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ బాధిత కుటుంబానికి సీఆర్పీఎఫ్ రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. అదే విధంగా కేసు విచారణను యూపీ న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. ఎమ్మెల్యే సెంగర్ నేరానికి సంబంధించిన సమగ్ర సాక్ష్యాలను సీబీఐ న్యాయస్థానానికి అందించడంతో నేడు శిక్ష ఖరారయింది.

Monday, December 16, 2019

On Dharna Against Jamia Crackdown, Priyanka Gandhi Says 'It's Attack on India's Soul'

ఇండియా గేట్ వద్ద ప్రియాంకగాంధీ `నిశ్శబ్ద నిరసన`

పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ సహా దేశంలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు వ్యక్తం చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ సంఘీభావం తెలిపారు. సోమవారం ఆమె కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులతో కలిసి రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 4కు ఆమె ధర్నాకు కూర్చున్నారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని `నాశనం` చేయడానికే దీన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందని ఆమె విరుచుకుపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే వారిపై దాడికి దిగడం `భారత ఆత్మపై దాడి`గా ప్రియాంక పేర్కొన్నారు. ఆదివారం జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియంతగా మారుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడతారని ప్రియాంక గాంధీ అన్నారు. ఆర్థికవ్యవస్థ, మహిళలు, విద్యార్థులపై మోదీ సర్కారు వరుసగా దాడికి పాల్పడుతోందని విమర్శించారు. హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రధాని చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ అజాద్ తీవ్రంగా ఖండించారు. జామియాలో పోలీసు ప్రవేశానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై కేసు బుక్ చేయాలని సీపీఐ ప్రధానకార్యదర్శి రాజా కోరారు. ఈ ఘటన బాధ్యులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచురీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, ఆర్జేడీ నేత మనోజ్, ఎస్పీ నాయకుడు జావేద్ అలీఖాన్, జేడీ(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొని విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండించారు.

Tuesday, December 10, 2019

Group of youth sit outside Smriti Irani`s house to meet her in support of DCW chief`s movement

స్మృతి ఇరానీ ఇంటి ఎదుట నిరసన జ్వాల
ఢిల్లీ మహిళా కమిషన్ (డి.సి.డబ్ల్యు) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ కు మద్దతు తెలుపుతూ నగర యువత మంగళవారం కదం తొక్కారు. కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి  స్మృతి ఇరానీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువతీయువకులు ధర్నాకు దిగారు. ఆమెను కలవాలని పట్టుబట్టారు. గేట్ల వద్ద మోహరించిన సెక్యూరిటీ సిబ్బందితో  పెద్ద ఎత్తున  వాగ్వాదానికి దిగారు. రేపిస్టులకు ఆర్నెల్ల లోపు ఉరిశిక్ష విధించాలని గత ఎనిమిది రోజులుగా స్వాతి నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నినాదాలు చేశారు. `అత్యాచారదోషుల్ని ఉరి తీయాలి`.. `ఆరునెలల్లో మరణశిక్ష విధించాలి` అని ఖాళీ పళ్లాలపై రాసిన నినాదాల్ని ప్రదర్శించారు. రేపిస్టుల్ని సత్వరం ఉరికంబం ఎక్కించాలని నిరశన తెల్పుతున్న స్వాతి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. మంత్రి ఇరానీ ఇంట్లో లేరని భద్రత సిబ్బంది వారిస్తున్నా ఆందోళనకారులు పట్టువీడకుండా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలువురు ఆందోళనకారుల్ని అక్కడ నుంచి బస్సుల్లో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా మరికొందరు ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో మంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఈ విషయాన్ని సత్వరం ఆమెకు చేరవేస్తామని హామీ ఇచ్చి వారికి నచ్చచెప్పారు. దాంతో శాంతించిన నిరసనకారులు ధర్నాను విరమించారు.

Friday, December 6, 2019

It`s a lesson to the rapist`s:Chiru and Balaiah


రేపిస్టులకు ఇదో గుణపాఠం: చిరంజీవి
షాద్ నగర్ ప్రాంతంలోని చటాన్ పల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన ఎన్ కౌంటర్ రేపిస్టులకు గొప్ప గుణపాఠం వంటిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. `దిశ` విషాదాంతంలోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్తను ఉదయం టీవీలో చూశానన్నారు. నిజంగా దీంతో ఆ  కుటుంబానికి సత్వర న్యాయం లభించినట్లేనని చెప్పారు. ఈ ఎదురుకాల్పులతో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభిస్తుందన్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమని మెగాస్టార్ చెప్పారు. సీపీ సజ్జనార్‌ సహా యావత్ తెలంగాణ పోలీస్‌ శాఖకు, సీఎం కేసీఆర్‌ కు చిరంజీవి అభినందనలు తెలిపారు.

దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడు:బాలకృష్ణ
మరో టాలీవుడ్ వెటరన్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ దేవుడే పోలీసుల రూపంలో వచ్చి `దిశ` నిందితులకు సరైన శిక్ష విధించాడన్నారు. ఎవరూ మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడబోరని, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తదని.. అందుకు తగిన సందేశాన్ని తాజా ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు సమాజానికి అందించినట్లు చెప్పారు. అందరికీ ఇదొక గుణపాఠం కావాలన్నారు. ``దిశ` ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందిఅని బాలకృష్ణ పేర్కొన్నారు.

Thursday, December 5, 2019

SC grants bail to Chidambaram in INX Media money laundering case


ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా ముడుపులు, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ఎదుర్కొంటూ జైలు పాలైన 74 ఏళ్ల ఈ కాంగ్రెస్ కురువృద్ధ నేతకు జస్టిస్ ఎ ఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బయట ఉంటే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చన్న హైకోర్టు వాదనను దేశ సర్వోనత న్యాయస్థానం తోసిపుచ్చింది. 105 రోజులుగా చిదంబరం తీహార్ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు ఇచ్చింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు చాలా తీవ్రమైనవని, అవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా సమాజంలోని ప్రజల విశ్వాసాన్ని సడలిస్తాయని వాదించారు. చిదంబరం తరఫున కేసులో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎ.ఎం. సింగ్వి మెహతాలు తమ వాదనలు వినిపిస్తూ ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేశారని లేదా ఏదైనా సాక్ష్యాలను దెబ్బతీశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్ళరాదని, మీడియాతో మాట్లాడకూడదని ధర్మాసనం ఆదేశించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007 లో రూ .305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఆ సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌.ఐ.పి.బి) క్లియరెన్స్‌ లు లభించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2017 మే 15 న కేసు నమోదు చేసింది. ఆగస్టు 21న ఆయనను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చిదంబరాన్ని అక్టోబర్ 16న అరెస్ట్ చేసింది. దాంతో సీబీఐ కేసులో అక్టోబర్ 22న ఆయన బెయిల్ పొందినా ఈడీ అరెస్ట్ కారణంగా తీహార్ జైలులోనే అప్పటి నుంచి ఉండిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఇవే కేసుల్లో ఆయన కుమారుడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. తీహార్ జైలులో కొద్ది రోజులున్న అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కార్తీ కూడా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని అప్పట్లో కోర్టు షరతులతోనే బెయిల్ ఇచ్చింది.

Friday, November 29, 2019

Devastated and Heartbroken about `Disha` murder:Keerthi Suresh

గుండె పగిలింది:కీర్తి సురేశ్
`జస్టిస్ ఫర్ దిశ` హత్యోందంతం విన్నాక గుండె పగిలినంత పనైందని ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేస్తూ రోజురోజుకూ క్రూరత్వం హింసాప్రవృత్తి పెరిగిపోతున్నాయని పేర్కొంది. సూపర్ సేఫ్ సిటీగా భావించే హైదరాబాద్ లోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల తల్లడిల్లుతున్నట్లు తెలిపింది. సావిత్రి యథార్థ గాథ ఆధారంగా నిర్మితమైన `మహానటి` చిత్రం లో నటించిన కీర్తి సురేశ్ బహుళ ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన మృగాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. మరో నిర్భయ ఘటనగా విశ్లేషకులు వర్ణిస్తున్న `దిశ` దారుణ హత్యపై తెలుగు పరిశ్రమ భగ్గుమంది. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, మెహ్రిన్, పూనమ్ కౌర్, గాయని చిన్మయి శ్రీపాద, హీరోలు రవితేజ, అఖిల్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, మంచుమనోజ్, సుశాంత్ తదితరులు ఈ క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ల ద్వారా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

Wednesday, November 27, 2019

'How can you always blame boys?': Director Bhagyaraj's 'genius'


భాగ్యరాజా పిచ్చివాగుడు: హోరెత్తిన నిరసనలు
వయసు పెరిగేకొద్దీ ఒద్దిక పెరిగి బుద్ధి వికసించి సమాజానికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలి. అందుకు భిన్నంగా మాట్లాడిన తమిళ దర్శక, నిర్మాత భాగ్యరాజా చివాట్లు తింటున్నాడు. కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లోనూ పలు కుటుంబ, హాస్యరస చిత్రాలను నిర్మించి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన భాగ్యరాజా మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. పురుషులకు చనువు ఇవ్వడం, ఎక్కువ సమయంపాటు రెండేసి మొబైళ్లలో చాటింగ్ చేస్తుండడమే తాజా అత్యాచార ఘటనలకు కారణంగా పేర్కొన్నాడు. అంతేకాకుండా తప్పంతా అబ్బాయిలదే అనడం తప్పు అని సూత్రీకరించాడు. ఓ పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతని ఇంటి ఇల్లాలికి ఏమి నష్టం జరగదు..కానీ అదే ఇల్లాలు అక్రమ సంబంధంలో ఉంటే కన్న పిల్లల్ని హత్య చేయడానికీ వెనుకాడదు..అంటూ పేద్ద.. తత్వవేత్తలా విశదీకరించాడు. దాంతో సామాజికమాధ్యమాల్లో అతనిపై ట్రోలింగ్ పీక్ కు చేరింది.  తాజా తమిళ సినిమా మ్యూజిక్ లాంచ్‌లో భాగ్యరాజా ఈ పిచ్చిప్రేలాపన చేశాడు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు ఇలా వ్యాఖ్యానించడం తగదని ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళా సంఘాలు భాగ్యరాజా వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.

Monday, November 25, 2019

More women abused than not, in US


మహిళలపై వేధింపులు అమెరికాలోనే ఎక్కువ 
భూతల స్వర్గం అమెరికాలోనూ ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల వెల్లడైన సర్వేల ప్రకారం అగ్రరాజ్యంలో సుమారు 70% మంది మహిళలు తమ భాగస్వాముల వేధింపులకు లోనవుతున్నట్లు తేలింది. అమెరికాలో అత్యధిక శాతం మహిళలు తమ పార్టనర్ల ద్వారా శారీరక, లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ (యూఎన్ వుమెన్) సోమవారం ఓ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థినులు ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక అకృత్యం లేదా దుష్ప్రవర్తనలను చవిచూస్తున్నారని పేర్కొంది. ఇతరత్రా మహిళలపై వేధింపులకు లెక్కేలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేల్లో వివిధ దేశాల్లో భాగస్వాముల ద్వారా హింసకు గురవుతున్న మహిళల శాతం అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా తర్వాత ఆఫ్రికా దేశాల్లో హింసకు గురౌతున్న మహిళలు 65 శాతం ఉండొచ్చని అంచనా. దక్షిణాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ శాతం 40 వరకు చేరుకుందని తెలుస్తోంది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (`ఆరెంజ్ డే`) సందర్భంగా ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ తక్షణం ఈ ఆటవిక రుగ్మతకు చరమగీతం పాడాలన్నారు. మహిళలపై హింస వీడడం, లింగ సమానత్వం దిశగా ముందుకు సాగడం యావత్ విశ్వాన్ని స్థిరమైన అభివృద్ధి వద్ద నిలుపుతుందని చెప్పారు. `శతాబ్దాలుగా పురుష ఆధిక్య సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక హింస పాతుకుపోయింది. అత్యాచార సంస్కృతికి ఆజ్యం పోసింది. లింగ అసమానతలనన్నవి శక్తి అసమతుల్యతకు సంబంధించిన ప్రశ్న అని మనం మర్చిపోకూడదు` అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా మహిళలు పురుషులతో సమానంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి ఏటా నవంబర్ 25న `ఆరెంజ్ డే` పాటిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని యూఎన్ మాజీ ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తన పదవీ కాలంలో ప్రారంభించారు.

Sunday, November 24, 2019

Virat Kohli Credits Sourav Ganguly For Winning Habit and said `Learnt To Stand Up, Give It Back`


గంగూలీ జట్టు నుంచే మాకు గెలుపు అలవాటు అబ్బింది:కోహ్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆదివారం కోల్ కతాలో టెస్ట్ సీరిస్ ట్రోఫీని అందుకుంటున్న సందర్భంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ సారథ్యంలో భారత టీమ్ సాధించిన విజయాల బాటలోనే ప్రస్తుత తమ జట్టు ముందుకు సాగుతోందని కోహ్లీ పేర్కొన్నాడు. గెలుపు అలవాటు దాదా జట్టు నుంచే పుణికిపుచ్చుకున్నామని సవినయంగా తెలిపాడు. మూడు నాల్గేళ్లగా ఏ జట్టుపైనైనా భారత్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శననే చేస్తున్నారన్నాడు. ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు తొలి పింక్ బాల్ టెస్ట్ ను అమోఘంగా ఆదరించారంటూ కోహ్లీ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బంగ్లాదేశ్ జట్టుపై స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సీరిస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడోరోజే విజయభేరి మోగించి టెస్ట్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కోల్ కతాలో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీ రెండు రికార్డుల్ని నమోదు చేశాడు. కెప్టెన్ గా అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన వారి జాబితాకెక్కాడు.  దాంతో పాటు టెస్ట్ సెంచరీ(136) సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఇషాంత్, షమీ, ఉమేశ్ ల ధాటికి కేవలం 106 పరుగులకే 10 వికెట్లు సమర్పించుకుంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 347/9 డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లాకు భంగపాటు తప్పలేదు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో పుష్కరకాలం తర్వాత అయిదు వికెట్లు దక్కించుకున్నఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచి పండగ చేసుకున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉమేశ్ అయిదు వికెట్లు పడగొట్టడంతో  బంగ్లా జట్టు 195లకే ఆలౌటయి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ ను ఇషాంత్, ఉమేశ్ లే చక్కబెట్టేశారు. మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ కావడంతో బ్యాటింగ్ కొనసాగించలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టి-20 సీరిస్‌లో భారత్ 2-1తో బంగ్లాదేశ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

Friday, November 22, 2019

Sri Lanka's new president picks his brothers into the interim cabinet

మధ్యంతర కేబినెట్‌ను నియమించిన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
శ్రీలంక నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తాత్కాలిక కేబినెట్‌ను నియమించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మధ్యంతర కేబినెట్ లోకి తన ఇద్దరు సోదరులను తీసుకున్నారు. కొత్త కేబినెట్‌లో ప్రధాని పదవికి ఎంపికైన మహీంద రాజపక్స(74)ను రక్షణ, ఆర్థిక మంత్రిగా కూడా నియమించారు. సోదరులలో పెద్దవాడు చమల్ రాజపక్స(77)ను వాణిజ్య, ఆహార భద్రత మంత్రిగా ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల మంత్రివర్గంలో వీరితో పాటు ఇద్దరు తమిళులు, ఒక మహిళ ఉన్నారు. ప్రముఖ మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధన (70) విదేశాంగ మంత్రిగా ఎంపికయ్యారు. ప్రస్తుత పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేసి తాజా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే వరకు ఈ కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు జరగాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయకపోతే ఆయనను తొలగించలేరు. అలాగే దేశాధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సే కేబినెట్ అధిపతి అయినప్పటికీ మంత్రిత్వ శాఖలను నిర్వహించలేరు. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా గడువుకు ముందే తాజా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మధ్యంతర కేబినెట్ నియామకాన్ని చేపట్టారు. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 52 ఏళ్ల సజిత్ ప్రేమదాసను 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. గతంలో గోటబయ సైనిక బలగాల అధినేతగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దేశం  పార్లమెంట్ ఎన్నికల ముంగిట నిలిచిందని స్పీకర్ కరు జయసూర్య ఇటీవల పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నారు. `ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా, పార్లమెంటరీ ఎన్నికల గురించి పార్లమెంట్ సభ్యులు, స్పీకర్, పార్టీ నాయకులతో చర్చిస్తాం` అని విక్రమసింఘే కార్యాలయం సోమవారమే ఒక ప్రకటన జారీ చేసింది.

Tuesday, November 19, 2019

Rajya Sabha Chairman ordered review of new Military Style Uniform of Marshals


మార్షల్స్ సైనిక యూనిఫాంపై సమీక్ష: ఉపరాష్ట్రపతి
రాజ్యసభలో కొత్తగా అమలులోకి వచ్చిన మార్షల్స్ యూనిఫాంపై పున:సమీక్షకు చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. సైనిక దుస్తుల తరహాలో మార్షల్స్ యూనిఫాం ఉండడంపై కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న సభాపతి ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సచివాలయం వివిధ సలహాలు పరిశీలించాక మార్షల్స్ కు కొత్త యూనిఫాం అమలు చేసింది. అయితే సైనికయేతర సిబ్బంది సైనిక యూనిఫాంను కాపీ చేయడం, ధరించడం చట్టవిరుద్ధం, భద్రతాపరమైన ప్రమాదమంటూ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మార్షల్స్ సైనిక దుస్తులు, టోపీ, తలపాగాలను ధరించడంపై  మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం కోరుతూ ట్వీట్ చేశారు. ఆయనకు పలువురు రిటైర్డ్ డిఫెన్స్ అధికారులు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంకయ్య ఈ విషయమై రాజ్యసభ సచివాలయం పున:సమీక్షిస్తుందని సభకు తెలిపారు.

Friday, November 15, 2019

Delhi court directs city police to give 10 days pre-arrest notice to Shehla Rashid in sedition case


షెహ్లా అరెస్ట్ కు 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి
దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా రషీద్ కు ఢిల్లీ కోర్టు బాసటగా నిలిచింది. ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐ.ఒ) కోర్టుకు తెలియజేయడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఆమెకు 10 రోజుల ముందే విషయాన్ని తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆగస్ట్ 17న ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల్లో విద్వేషభావాల్ని రెచ్చగొట్టేలా షెహ్లా పోస్టులు చేశారని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా భారత సైన్యం అక్కడ విచారణల పేరిట యువతను అర్ధరాత్రిళ్లు తరలించుకు వెళ్లి ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ఆమె ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షెహ్లా వరుస పోస్టులు పెడుతూ అల్లర్లు ప్రేరేపించేందుకు యత్నించినట్లు కేసు పెట్టారు. ఇదిలావుండగా అరెస్ట్ ను తప్పించుకోవడానికి ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని షెహ్లా న్యాయవాదులు తెలిపినా అడిషినల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.

Tuesday, November 12, 2019

President rule in Maharastra today onwards


`మహా`లో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తక్షణం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికలు ఫలితాలు విడుదలై 19రోజులు గడిచినా బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాలేకపోవడంతో గవర్నర్ నివేదన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తాము తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరింత గడువు ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోష్యారి సిఫార్సు చేయడంపై శివసేన నిప్పులు చెరిగింది. ఇందుకు సంబంధించి శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన 56 స్థానాలు దక్కించుకోగా ఎన్సీపీ 54, పొత్తు పార్టీ కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. బీజేపీ-శివసేనలు చెరి రెండేళ్లు సీఎంగా అధికారం చలాయించడంపై నెలకొన్న ప్రతిష్టంభనతో తాజాగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెరపైకి వచ్చింది. ఎన్నికల పొత్తు సమయంలోనే తాము ఈ మేరకు ప్రతిపాదిస్తే బీజేపీ అంగీకరించిందని శివసేన పేర్కొంటోంది. అందుకు ప్రస్తుతం బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని స్థాపించలేక పోయాయి. ఇదిలావుండగా గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించింది. మంగళవారం ఏఐసీసీ సమాచార శాఖ ఇన్ చార్జీ రణ్ దీప్ సింగ్ సుర్జీవాలా విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ వైఖరిని ఘాటుగా విమర్శించారు. సీపీఎం పోలిట్ బ్యూరో కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తీవ్రంగా ఖండించింది.

Thursday, November 7, 2019

Telangana registers No.1 spot in STD`s due to the causes of Unsafe sex, diabetes


సుఖ వ్యాధుల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమం

తెలంగాణలో ప్రజారోగ్యం అథమ స్థానంలో ఉందనే చేదు నిజం మరోసారి స్పష్టమయింది. సుఖ వ్యాధుల్లో ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 నివేదిక ప్రకారం తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లు నిలిచాయి. అసురక్షిత లైంగిక కార్యకలాపాలు, మధుమేహం ఇందుకు కారణాలని తేలింది. 2018 లెక్కల ప్రకారం తెలంగాణలో 14,940 సుఖ వ్యాధిగ్రస్తులు నమోదయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పురుషుల సంఖ్య 4,824 కాగా మహిళలు 10,116 మంది ఉన్నట్లు వెల్లడయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 12,484 (3,197(పు), 9,287(మ)); మధ్యప్రదేశ్ లో 8,140 (2,042(పు), 6,098(మ); కర్ణాటకలో 3,685 (1,226(పు),2,459(మ); రాజస్థాన్ లో 2,869 (1,161(పు), 1,708(మ)) మంది సుఖ వ్యాధి గ్రస్తులున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తొలి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలడం నివ్వెరపరస్తోంది. అందులోనూ ఈ సుఖవ్యాధుల బారిన పడిన వారిలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉండడం కలవరం కల్గిస్తోంది. ఈ సాంక్రమిక సుఖవ్యాధి(ఎస్.టి.ఐ) బారిన పడిన వారికే ఎక్కువగా హెచ్.ఐ.వి (ఎయిడ్స్) సోకే ప్రమాదం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణ మొత్తం జనాభాలో 15 నుంచి 20% మంది మధుమేహవ్యాధి పీడితులుండడం వల్ల ఈ ఎస్.టి.ఐ. రోగుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా నమోదవ్వడానికి ప్రధాన కారణమని భారతీయ వైద్య సంఘం (ఐ.ఎం.ఎ) కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.


Friday, November 1, 2019

Rajnath Singh pays tribute to former PM Shastri


నిరుపమాన యోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి: రాజ్ నాథ్
పాకిస్థాన్ తో యుద్ధ సమయంలో భారత్ ను సమైక్యంగా పటిష్టంగా నిలిపిన యోధుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్లాఘించారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ లో పర్యటిస్తున్న రక్షణమంత్రి ఈ సందర్భంగా శుక్రవారం శాస్త్రి స్ట్రీట్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాక్ ల యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ పిలుపు ఓ ప్రభంజనంలా యావత్ దేశాన్ని కదిలించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. యుద్ధానంతరం 1966 లో యూఎస్ఎస్ఆర్ మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ ల మధ్య తాష్కెంట్ లో ఒప్పందం కుదిరింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 11న శాస్త్రీజీ ఆకస్మికంగా కన్నుమూశారు. శాస్త్రీజీ జీవనశైలి, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమని రాజ్ నాథ్ కొనియాడారు. శాస్త్రీజీ స్మృత్యర్థం నిర్మించిన పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భారత్ పైన, హిందీ భాష పట్ల కనబర్చిన ప్రేమకు రక్షణ మంత్రి ముగ్ధులయ్యారు. ఈనెల 2,3 తేదీల్లో జరగనున్న ప్రభుత్వాధినేతల (సీహెచ్జీ) సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. అదేవిధంగా భారత్, ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల పైన చర్చలు జరుపుతారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) కీలక సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొననున్నారు.

Thursday, October 31, 2019

President, HM Amith shah pay floral tributes to Sardar patel on his birth anniversary at Patel Chowk


సర్దార్ పటేల్ పాదాల చెంత 370 రద్దు నిర్ణయం: మోదీ
మహానేత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 114వ జయంతిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘనంగా  నివాళులర్పించారు. గురువారం పటేల్ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లు  దివంగత నేత పటేల్ సేవల్ని శ్లాఘించి పుష్పాంజలి ఘటించారు.  స్వాతంత్ర్యానికి పూర్వం వేర్వేరుగా ఉన్న వందలాది సంస్థానాల్ని దేశంలో విలీనం చేసి అఖండ భారత సంస్థాపనకు పటేల్ సాగించిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక 2014 నుంచి సర్దార్ పటేల్ జయంతిని ఏక్తా దివస్ (ఐక్యత, సమగ్రత దినోత్సవం) గా పాటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని పటేల్ కు అంకితమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మహానేత పాదాల చెంత ఈ నిర్ణయాన్ని ఉంచుతున్నానంటూ మోదీ పుష్పాంజలి ఘటించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (కెవాడియా-గుజరాత్) వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ శతాబ్దాలకు పూర్వం దేశాన్ని చాణక్యుడు ఏకతాటిపై నిలిపారని మళ్లీ ఆ ఘనతను సర్దార్ పటేల్ సొంతం చేసుకున్నారన్నారు.

Tuesday, October 29, 2019

ISIS leader abu bakr al Baghdadi died in an operation by American special forces


ఆత్మాహుతికి ముందు వలవలా ఏడ్చిన ఐసిస్ ఉగ్రనేత బాగ్దాదీ
కరడుగట్టిన ఉగ్రవాది సైతం మరణపు అంచులకు చేరినప్పుడు విలవిల్లాడక తప్పదు. ఇదే విషయం నరరూప రాక్షసులుగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ (48) చివరి క్షణాల్లో రుజువయింది. టర్కీకి సమీపంలోని తూర్పు సిరియాకు చెందిన బరిషా గ్రామంలో ఓ గుహలో దాగిన బాగ్దాదీని అమెరికా ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. యుద్ధ తంత్రంలో ఆరితేరిన శునకాలతో సరికొత్తగా అమెరికా సేనలు బాగ్దాదీ పైకి దాడికి ఉపక్రమించాయి. లొంగిపోవాల్సిందిగా అతణ్ని హెచ్చరించాయి. చుట్టూ సేనలు అరివీరభయంకరమైన పులుల్లాంటి జాగిలాలు లంఘిస్తూ మీదకు ఉరుకుతుంటే అంతటి భయంకరమైన ఉగ్రవాది బాగ్దాదీ సైతం పరుగులు పెడుతూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మాటువేసి బాగ్దాదీ జాడ కనుగొన్న అమెరికా సంకీర్ణ దళాలు రెండు వారాలు క్రితమే పక్కా ప్రాణాళికతో `ఆపరేషన్ కైల ముల్లర్` కు శ్రీకారం చుట్టాయి. ఈ మొత్తం ఆపరేషన్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి లైవ్ లో వీక్షించారు. తప్పించుకోలేని పరిస్థితుల్లో బాగ్దాదీ తనను తను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు సహా బాగ్దాదీ తునాతునకలై పోయాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అమెరికా భద్రతా బలగాలు బాగ్దాదీ మృతిని ధ్రువీకరించాయి. పాకిస్థాన్ లోని అబోథాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సీషెల్స్ కమెండోలు హతమార్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబమా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన చందంగానే తాజాగా బాగ్దాదీని మట్టుబెట్టే దృశ్యాల్ని ట్రంప్ లైవ్ ద్వారా వీక్షించారు. బాగ్దాదీ హతమయ్యాడనే వార్తలు ధ్రువీకరణయ్యాక ఆ విషయాల్ని ట్రంప్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. సేవాసంస్థలో భాగస్వామి అయిన అమెరికాకు చెందిన కైల ముల్లర్ వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించారు. బాగ్దాదీ ఆమెపై తొలుత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు ఉగ్రవాదుల చెరలో మగ్గిన ముల్లర్ అనంతరం మరణించినట్లు అమెరికా పేర్కొంది. ఎన్నాళ్ల నుంచో ఐసిస్ పీచమణిచేందుకు కంకణం కట్టుకున్న అమెరికా ఆదివారం `ఆపరేషన్ కైలముల్లర్` ద్వారా ఆ సంస్థ అధినేతను అంతమొందించి మరోసారి తన సత్తా చాటింది.

Monday, October 28, 2019

Unemployment fuels unrest in Arab states: IMF


గల్ఫ్ దేశాల్లో అశాంతిని రగిలిస్తోన్న నిరుద్యోగిత:ఐఎంఎఫ్
గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగా అశాంతి నెలకొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. సోమవారం ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్ని కల్గి ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ వరకు పరిణామ క్రమాల్ని అనుసరించి ఈ మేరకు ఐఎంఎఫ్ నివేదిక రూపొందించింది. ఈ దేశాల్లో అభివృద్ధి సూచి తక్కువగా ఉండడానికి కారణం నిరుద్యోగితేనని ఐఎంఎఫ్ మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏసియా డైరెక్టర్ జిహద్ అజర్ తెలిపారు. అభివృద్ధి సూచీలో పెంపుదల నమోదు కావడానికి ఈ దేశాలు తొలుత నిరుద్యోగిత నివారణ చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. ఇక్కడ యువత నిరుద్యోగిత శాతం 25 నుంచి 30 వరకు ఉన్నట్లు చెప్పారు. ఈ అవరోధాన్ని అధిగమిస్తే అభివృద్ధిలో 1-2 శాతం పెంపు సాధ్యమౌతుందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగానే అశాంతి, అలజడి వాతావరణాలు నెలకొంటున్నాయని ఐఎంఎఫ్ విశదీకరించింది. ఇక్కడ నిరుద్యోగిత 11 శాతం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, యువత ఉద్యోగాలకు దూరమయ్యారంది. 2018 నాటికి 18 శాతం మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, యెమన్, లిబియాల్లో అంతర్యుద్ధాలూ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినట్లు ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ప్రజలపై రుణభారం 85 శాతానికి మించినట్లు తెలిపింది. లెబనాన్, సూడాన్ ల్లో అయితే రుణభార శాతం 150కి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామిక్ దేశాల్లో గతంలో జీడీపీ 9.5గా నమోదు కాగా 2018 నాటికి -4.8గా తిరోగమనం బాట పట్టినట్లు ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యం, చమురు ధరల అస్థిరత, రాజకీయ పరిస్థితులు కూడా తాజా దుస్థితికి కారణాలుగా ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.

Friday, October 25, 2019

AP Government released exgratia to the Royal Vasishta Boat victim families


కచ్చులూరు లాంచీ మృతుల కుటుంబాలకు పరిహారం విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచీ మునకలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్ 15న పాపికొండల విహార యాత్రకు బయలుదేరిన పర్యాటకులు లాంచీ మునిగిన దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద విహారయాత్రికులు ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట బోటు మునిగిపోగా 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ఏపీ సర్కారు ప్రకటించింది. తాజాగా రెండ్రోజుల క్రితమే మునిగిన లాంచీని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఘటనా స్థలం నుంచి వెలికితీసింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు తొలివిడతలో శుక్రవారం 12 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేసింది. ఏపీ సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ఫండ్ నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు చెక్కు అందనుంది. బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.

Wednesday, October 23, 2019

39 bodies found in truck container in London


లండన్ సరకు రవాణా లారీలో గుట్టలుగా శవాలు
ఒళ్లు గగుర్పొడిచే ఘటన బుధవారం లండన్ లో చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ సరకు రవాణా లారీ(కంటైనర్)లో 39 శవాల్ని పోలీసులు కనుగొనడంతో కలకలం రేగింది. లండన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 1.40కి గ్రేస్ లోని వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో ఈ శవాల లారీని గుర్తించారు. బల్గేరియా రిజిస్ట్రేషన్ కల్గిన ఈ భారీ లారీ జీబ్రుగే నుంచి బయలుదేరి థేమ్స్ నదీ పరీవాహక ప్రాంత పట్టణం తుర్రాక్ చేరుకుంది. అక్కడ 35 నిమిషాల సేపు ఆగిన లారీ మళ్లీ నగరం దిశగా ప్రయాణించినట్లు ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. లారీలో భారీ రిఫ్రిజిరేటర్ ను గుర్తించారు. అందులో పెద్ద సంఖ్యలో భయానకంగా ఉన్న శవాల్ని కనుగొన్నారు. ఇందులో 38 మంది వయోజనుల మృతదేహాలతోపాటు ఓ బాలుడి శవం బయటపడింది. వీరంతా దారుణ హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. లారీలో గల ఫ్రిజ్ -25 డిగ్రీల సెల్సియస్ స్థితిలో ఉంది. అందులో ఈ హతుల శవాలను ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల ఈ లారీ డ్రైవర్ ఉత్తర ఐర్లాండ్ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. అతణ్ని అరెస్ట్ చేశారు. హతులంతా బల్గేరియా వాసులని భావిస్తున్నారు. లోహంతో తయారైన గాలిచొరబడని లారీలో  తొలుత ఈ 39 మందిని ఉంచి లాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఫ్రిజ్ లో కుక్కిఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం హతుల వివరాలను వెలికితీయడమేనని ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. ఈ లారీకి సంబంధించిన ఏ విషయమైనా తమకు తెలపాలని ప్రత్యక్షసాక్షులకు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మారినన్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇది `అనూహ్యమైన విషాదం.. నిజంగా హృదయ విదారకం`అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. కేసును ప్రత్యేక నేరపరిశోధన విభాగం దర్యాప్తు చేస్తోంది.

Sunday, October 20, 2019

Cycle rally held in Jammu to promote clean, green Diwali


స్వచ్ఛ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో సైకిల్ ర్యాలీ
క్లీన్ అండ్ గ్లీన్ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదంపూర్ నుంచి జమ్ము వరకు 65 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. ఉదంపూర్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పదుల సంఖ్యలో సైక్లిలిస్టులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కమిషనర్ పీయూష్ సంఘ్లా పాల్గొనగా ఆయన వెంట పలువురు యువతులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఉదంపూర్ నగర వీధుల గుండా కొనసాగిన ర్యాలీ స్లతియా చౌక్, కోర్టు రోడ్డు, రామ్ నగర్ చౌక్, గోల్ మార్కెట్, బస్టాండ్, మినీ స్టేడియంల మీదుగా జాతీయ రహదారిపై ముందుకు సాగుతూ జమ్మూ నగరం చేరుకుంది. మార్గం మధ్యలో కత్రా వద్ద కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ర్యాలీలో పాల్గొనవారిని కలిసి అభినందించారు. ఏటా ఈ తరహా ర్యాలీలను ఉదంపూర్ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తుండడం విశేషం. స్వచ్ఛ దీపావళిని నిర్వహించుకుందామనే పిలుపుతో పాటు బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిల్ని రక్షిద్దాం.. అమ్మాయిల్ని చదివిద్దాం) అనే చైతన్యాన్ని కల్గించే ఉద్దేశంతో ర్యాలీ జరిగింది.

Saturday, October 19, 2019

At least 10 killed in dam collapse in Russia`s Krasnoyarsk region


రష్యాలో డ్యాం కూలి 10మంది దుర్మణం
రష్యాలో ఓ డ్యాం కుప్పకూలిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సైబీరియా ప్రాంతంలోని క్రస్నోయార్స్క్ కరాయ్ లో శనివారం వేకువజాము 2 గంటలకు జరిగింది. డ్యాం ఒక్కసారిగా బద్ధలుకావడంతో 10 మంది కొట్టుకుపోయి తీవ్రగాయాలపాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జాడ తెలియడం లేదని అత్యవసర విభాగ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సుకేటిన్కినో కాలనీలో గల బంగారు గనులకు నీటి సరఫరా కోసం నిర్మించిన రిజర్వాయర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్పుత్నిక్ వార్త సంస్థ తెలిపింది. దాంతో డ్యాం నుంచి పోటెత్తిన వరద నీటితో కాలనీ ముంపునకు గురయింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సెబా నదిలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Friday, October 18, 2019

CJI Gogoi recommends Justice S A Bobde as his successor


సీజేఐగా బోబ్డే పేరును సిఫార్సు చేసిన గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సీనియర్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే పేరును ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ ఆయన కేంద్రానికి శుక్రవారం లేఖ రాశారు. సంప్రదాయాన్ని అనుసరించి గొగొయ్ తన వారసుడిగా బోబ్డే ను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కేంద్రం ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల బోబ్డే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సుప్రీం జస్టిస్ గా 12 ఏప్రిల్ 2013 నుంచి వ్యవహరిస్తున్న బోబ్డే పదవీ కాలం 23 ఏప్రిల్ 2021 వరకు ఉంది. ఆయన గతంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబయి, నాగ్ పూర్)లో చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం గొగొయ్ తర్వాత సుప్రీంకోర్టులో బోబ్డేనే అందరికంటే సీనియర్. గొగొయ్ 46వ సీజేఐగా 8 అక్టోబర్ 2018న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 17 నవంబర్ లో ముగియనుంది.

Sunday, October 13, 2019

India, Japan to hold joint military exercise from Oct 19


19 నుంచి భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు
ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసాల్లో భారత జపాన్ లు సంయుక్తంగా పాల్గొననున్నాయి. ఈనెల 19 నుంచి నవంబర్ 2 వరకు ఉభయదేశాలకు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మ-గార్డియన్ (ధర్మ సంరక్షణ) పేరిట ఈ సైనిక విన్యాసాల్ని మిజోరంలోని వైరెంగ్టేలో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేజీఎస్డీఎఫ్) లకు చెందిన 25 మంది చొప్పున సైనికులు పాల్గొనబోతున్నారు.  ఆయా దేశాలలో వివిధ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాన్ని ఉభయ దేశాల సైనికులు ఈ సందర్భంగా పంచుకోనున్నారు. ప్రపంచ ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాలు భద్రతా సవాళ్ల ను అధిగమించేందుకు ఏర్పాటవుతున్న ఈ విన్యాసాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో తలెత్తుతోన్న ఉగ్రవాదం.. నిరోధక చర్యలపై ప్లాటూన్ స్థాయి లో సైనికులు ఉమ్మడి శిక్షణ పొందనున్నారు. వివిధ దేశాలతో భారతదేశం చేపట్టిన సైనిక విన్యాసాల శిక్షణ క్రమంలో తాజా కార్యక్రమం  కీలకమైనదని అధికారిక ప్రకటన పేర్కొంది.

Saturday, October 5, 2019

Durga pooja revellers use umberellas as rain plays spoilsport on the day of maha saptami in kolkatta


గొడుగులతో దుర్గామాత వేడుకల్లో పాల్గొన కోల్ కతా వాసులు
పశ్చిమబెంగాల్ లో శనివారం మహాసప్తమి వేడుకల్ని భక్తులు సంబరంగా జరుపుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా కోలకతాలో భక్తులు పెద్ద సంఖ్యలో గొడుగులు వేసుకుని మరీ వేడుకల్లో పాల్గొన్నారు. రుతుపవనాలు ఇంకా తిరోగమనం ప్రారంభించకపోవడంతో, పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజా ఉత్సవాలపై ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ వర్షాలు దశమి రోజున కూడా కురవొచ్చని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈశాన్య జార్ఖండ్ మీదుగా ఒక తుపాను, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలలో మరో తుపాను విరుచుకు పడొచ్చని తెలిపింది. దీనివల్ల  పశ్చిమ బెంగాల్‌లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నాలుగ్రోజుల పాటు జరుగనున్న దుర్గా మాత పూజలపై వర్షాల ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ రోజు మహాసప్తమి  సందర్భంగా ఓ వైపు జోరుగా వాన కురుస్తున్నా భక్తులు యథావిధిగా పూజలకు హాజరుకావడం విశేషం.

Friday, October 4, 2019

Shooting down chopper on Feb 27 was 'big mistake', action against officers: IAF chief


ఐఏఎఫ్ సొంత హెలికాప్టర్ నే కూల్చేయడం పెద్ద తప్పు: భదౌరియా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ లో ఉగ్రతండాలపై మెరుపుదాడులు జరిపిన మరుసటి రోజున సొంత హెలికాప్టర్ నే క్షిపణితో కూల్చేసి ఐఏఎఫ్ గ్రౌండ్ సిబ్బంది చాలా పెద్ద తప్పు చేశారని ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా విలేకర్లతో మాట్లాడారు.  జమ్ముకశ్మీర్ నౌషెరా సెక్టార్ లోని బుద్గామ్‌లో ఫిబ్రవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నామన్నారు. భారత-పాకిస్థాన్ ల గగనతలంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఐఏఎఫ్ మిగ్-17 ప్రయాణిస్తోంది. హెలికాప్టర్‌లోని ఐఎఫ్ఎఫ్ ('ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ లేదా శత్రువు'వ్యవస్థ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం,  గ్రౌండ్ సిబ్బంది, ఛాపర్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా శత్రు విమానంగా భావించి క్షిపణితో సొంత చాపర్ నే కూల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బందితో పాటు ఓ పౌరుడు దుర్మరణం చెందారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఐఏఎఫ్ చాపర్ శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలో ఉండగా అధికారులు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తిరిగి వస్తున్న చాపర్ ను గ్రౌండ్ సిబ్బంది శత్రు విమానంగా భావించి క్షిపణి దాడి చేశారు. ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై ఇప్పటికే పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రొసీజర్స్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మే ప్రారంభంలో, శ్రీనగర్ బేస్  ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) ను వాయుసేన బదిలీ చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కారదని చీఫ్ మార్షల్ భదౌరియా ఈ సందర్భంగా హెచ్చరించారు.

Thursday, October 3, 2019

Sarad Pawar kicks off poll campaign in Junnar; hits out at BJP


ప్రచార శంఖం పూరించిన శరద్ పవార్
మహారాష్ట్ర దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించారు. గురువారం ఆయన తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి గెలుపు కోసం జునార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా వారిని సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరికిస్తున్నారని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలు పాలు చేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించడమే కాక  రాజకీయ మైలేజ్ వచ్చే అంశాలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పవార్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ పాలన ఘోరంగా ఉందని ఫడ్నవిస్ జమానాలో శాంతిభద్రతల పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరుకుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను అనాలోచితంగా రద్దు చేయడం అనంతరం జీఎస్టీ కొరడా ఝళిపించడంతో వ్యాపార, వాణిజ్యరంగాలు దెబ్బతిన్నాయని దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పవార్ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత మాట అటుంచి దేశంలోని ప్రతి వ్యక్తి నోట్ల కోసం సతమతమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ పోరాడి గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.