Thursday, October 31, 2019

President, HM Amith shah pay floral tributes to Sardar patel on his birth anniversary at Patel Chowk


సర్దార్ పటేల్ పాదాల చెంత 370 రద్దు నిర్ణయం: మోదీ
మహానేత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 114వ జయంతిని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘనంగా  నివాళులర్పించారు. గురువారం పటేల్ చౌక్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి హర్దీప్ పురి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లు  దివంగత నేత పటేల్ సేవల్ని శ్లాఘించి పుష్పాంజలి ఘటించారు.  స్వాతంత్ర్యానికి పూర్వం వేర్వేరుగా ఉన్న వందలాది సంస్థానాల్ని దేశంలో విలీనం చేసి అఖండ భారత సంస్థాపనకు పటేల్ సాగించిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ పగ్గాలు చేపట్టాక 2014 నుంచి సర్దార్ పటేల్ జయంతిని ఏక్తా దివస్ (ఐక్యత, సమగ్రత దినోత్సవం) గా పాటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని పటేల్ కు అంకితమిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ మహానేత పాదాల చెంత ఈ నిర్ణయాన్ని ఉంచుతున్నానంటూ మోదీ పుష్పాంజలి ఘటించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ (కెవాడియా-గుజరాత్) వద్ద ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ శతాబ్దాలకు పూర్వం దేశాన్ని చాణక్యుడు ఏకతాటిపై నిలిపారని మళ్లీ ఆ ఘనతను సర్దార్ పటేల్ సొంతం చేసుకున్నారన్నారు.

Tuesday, October 29, 2019

ISIS leader abu bakr al Baghdadi died in an operation by American special forces


ఆత్మాహుతికి ముందు వలవలా ఏడ్చిన ఐసిస్ ఉగ్రనేత బాగ్దాదీ
కరడుగట్టిన ఉగ్రవాది సైతం మరణపు అంచులకు చేరినప్పుడు విలవిల్లాడక తప్పదు. ఇదే విషయం నరరూప రాక్షసులుగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ (48) చివరి క్షణాల్లో రుజువయింది. టర్కీకి సమీపంలోని తూర్పు సిరియాకు చెందిన బరిషా గ్రామంలో ఓ గుహలో దాగిన బాగ్దాదీని అమెరికా ప్రత్యేక బలగాలు చుట్టుముట్టాయి. యుద్ధ తంత్రంలో ఆరితేరిన శునకాలతో సరికొత్తగా అమెరికా సేనలు బాగ్దాదీ పైకి దాడికి ఉపక్రమించాయి. లొంగిపోవాల్సిందిగా అతణ్ని హెచ్చరించాయి. చుట్టూ సేనలు అరివీరభయంకరమైన పులుల్లాంటి జాగిలాలు లంఘిస్తూ మీదకు ఉరుకుతుంటే అంతటి భయంకరమైన ఉగ్రవాది బాగ్దాదీ సైతం పరుగులు పెడుతూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. మాటువేసి బాగ్దాదీ జాడ కనుగొన్న అమెరికా సంకీర్ణ దళాలు రెండు వారాలు క్రితమే పక్కా ప్రాణాళికతో `ఆపరేషన్ కైల ముల్లర్` కు శ్రీకారం చుట్టాయి. ఈ మొత్తం ఆపరేషన్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి లైవ్ లో వీక్షించారు. తప్పించుకోలేని పరిస్థితుల్లో బాగ్దాదీ తనను తను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు సహా బాగ్దాదీ తునాతునకలై పోయాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారా అమెరికా భద్రతా బలగాలు బాగ్దాదీ మృతిని ధ్రువీకరించాయి. పాకిస్థాన్ లోని అబోథాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా సీషెల్స్ కమెండోలు హతమార్చినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబమా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన చందంగానే తాజాగా బాగ్దాదీని మట్టుబెట్టే దృశ్యాల్ని ట్రంప్ లైవ్ ద్వారా వీక్షించారు. బాగ్దాదీ హతమయ్యాడనే వార్తలు ధ్రువీకరణయ్యాక ఆ విషయాల్ని ట్రంప్ సోమవారం ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. సేవాసంస్థలో భాగస్వామి అయిన అమెరికాకు చెందిన కైల ముల్లర్ వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తించేందుకు టర్కీ నుంచి అలెప్పోకు వెళ్తుండగా ఐసిస్ ఉగ్రవాదులు ఆమెను అపహరించారు. బాగ్దాదీ ఆమెపై తొలుత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు ఉగ్రవాదుల చెరలో మగ్గిన ముల్లర్ అనంతరం మరణించినట్లు అమెరికా పేర్కొంది. ఎన్నాళ్ల నుంచో ఐసిస్ పీచమణిచేందుకు కంకణం కట్టుకున్న అమెరికా ఆదివారం `ఆపరేషన్ కైలముల్లర్` ద్వారా ఆ సంస్థ అధినేతను అంతమొందించి మరోసారి తన సత్తా చాటింది.

Monday, October 28, 2019

Unemployment fuels unrest in Arab states: IMF


గల్ఫ్ దేశాల్లో అశాంతిని రగిలిస్తోన్న నిరుద్యోగిత:ఐఎంఎఫ్
గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగా అశాంతి నెలకొంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. సోమవారం ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్ని కల్గి ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ వరకు పరిణామ క్రమాల్ని అనుసరించి ఈ మేరకు ఐఎంఎఫ్ నివేదిక రూపొందించింది. ఈ దేశాల్లో అభివృద్ధి సూచి తక్కువగా ఉండడానికి కారణం నిరుద్యోగితేనని ఐఎంఎఫ్ మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏసియా డైరెక్టర్ జిహద్ అజర్ తెలిపారు. అభివృద్ధి సూచీలో పెంపుదల నమోదు కావడానికి ఈ దేశాలు తొలుత నిరుద్యోగిత నివారణ చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. ఇక్కడ యువత నిరుద్యోగిత శాతం 25 నుంచి 30 వరకు ఉన్నట్లు చెప్పారు. ఈ అవరోధాన్ని అధిగమిస్తే అభివృద్ధిలో 1-2 శాతం పెంపు సాధ్యమౌతుందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో నిరుద్యోగిత కారణంగానే అశాంతి, అలజడి వాతావరణాలు నెలకొంటున్నాయని ఐఎంఎఫ్ విశదీకరించింది. ఇక్కడ నిరుద్యోగిత 11 శాతం ఉందని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, యువత ఉద్యోగాలకు దూరమయ్యారంది. 2018 నాటికి 18 శాతం మంది మహిళలు నిరుద్యోగులుగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. సిరియా, యెమన్, లిబియాల్లో అంతర్యుద్ధాలూ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినట్లు ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అదేవిధంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే ప్రజలపై రుణభారం 85 శాతానికి మించినట్లు తెలిపింది. లెబనాన్, సూడాన్ ల్లో అయితే రుణభార శాతం 150కి పైగా ఉన్నట్లు పేర్కొంది. ఇస్లామిక్ దేశాల్లో గతంలో జీడీపీ 9.5గా నమోదు కాగా 2018 నాటికి -4.8గా తిరోగమనం బాట పట్టినట్లు ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థికమాంద్యం, చమురు ధరల అస్థిరత, రాజకీయ పరిస్థితులు కూడా తాజా దుస్థితికి కారణాలుగా ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించింది.

Friday, October 25, 2019

AP Government released exgratia to the Royal Vasishta Boat victim families


కచ్చులూరు లాంచీ మృతుల కుటుంబాలకు పరిహారం విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచీ మునకలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్ 15న పాపికొండల విహార యాత్రకు బయలుదేరిన పర్యాటకులు లాంచీ మునిగిన దుర్ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద విహారయాత్రికులు ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట బోటు మునిగిపోగా 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారాన్ని ఏపీ సర్కారు ప్రకటించింది. తాజాగా రెండ్రోజుల క్రితమే మునిగిన లాంచీని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఘటనా స్థలం నుంచి వెలికితీసింది. ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేరకు తొలివిడతలో శుక్రవారం 12 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున పరిహారాన్ని విడుదల చేసింది. ఏపీ సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ఫండ్ నుంచి ఈ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు చెక్కు అందనుంది. బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పరిహారాన్ని పంపిణీ చేయనున్నారు.

Wednesday, October 23, 2019

39 bodies found in truck container in London


లండన్ సరకు రవాణా లారీలో గుట్టలుగా శవాలు
ఒళ్లు గగుర్పొడిచే ఘటన బుధవారం లండన్ లో చోటు చేసుకుంది. బల్గేరియా నుంచి నగరంలోకి ప్రవేశించిన ఓ సరకు రవాణా లారీ(కంటైనర్)లో 39 శవాల్ని పోలీసులు కనుగొనడంతో కలకలం రేగింది. లండన్ కాలమానం ప్రకారం ఈ ఉదయం 1.40కి గ్రేస్ లోని వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో ఈ శవాల లారీని గుర్తించారు. బల్గేరియా రిజిస్ట్రేషన్ కల్గిన ఈ భారీ లారీ జీబ్రుగే నుంచి బయలుదేరి థేమ్స్ నదీ పరీవాహక ప్రాంత పట్టణం తుర్రాక్ చేరుకుంది. అక్కడ 35 నిమిషాల సేపు ఆగిన లారీ మళ్లీ నగరం దిశగా ప్రయాణించినట్లు ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. లారీలో భారీ రిఫ్రిజిరేటర్ ను గుర్తించారు. అందులో పెద్ద సంఖ్యలో భయానకంగా ఉన్న శవాల్ని కనుగొన్నారు. ఇందులో 38 మంది వయోజనుల మృతదేహాలతోపాటు ఓ బాలుడి శవం బయటపడింది. వీరంతా దారుణ హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. లారీలో గల ఫ్రిజ్ -25 డిగ్రీల సెల్సియస్ స్థితిలో ఉంది. అందులో ఈ హతుల శవాలను ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 25 ఏళ్ల ఈ లారీ డ్రైవర్ ఉత్తర ఐర్లాండ్ వాసిగా పోలీసులు పేర్కొన్నారు. అతణ్ని అరెస్ట్ చేశారు. హతులంతా బల్గేరియా వాసులని భావిస్తున్నారు. లోహంతో తయారైన గాలిచొరబడని లారీలో  తొలుత ఈ 39 మందిని ఉంచి లాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరంతా మరణించిన తర్వాత ఫ్రిజ్ లో కుక్కిఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తమ ముందున్న తక్షణ కర్తవ్యం హతుల వివరాలను వెలికితీయడమేనని ఎస్సెక్స్ పోలీసులు తెలిపారు. ఈ లారీకి సంబంధించిన ఏ విషయమైనా తమకు తెలపాలని ప్రత్యక్షసాక్షులకు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మారినన్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇది `అనూహ్యమైన విషాదం.. నిజంగా హృదయ విదారకం`అని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. కేసును ప్రత్యేక నేరపరిశోధన విభాగం దర్యాప్తు చేస్తోంది.

Sunday, October 20, 2019

Cycle rally held in Jammu to promote clean, green Diwali


స్వచ్ఛ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో సైకిల్ ర్యాలీ
క్లీన్ అండ్ గ్లీన్ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదంపూర్ నుంచి జమ్ము వరకు 65 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. ఉదంపూర్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పదుల సంఖ్యలో సైక్లిలిస్టులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కమిషనర్ పీయూష్ సంఘ్లా పాల్గొనగా ఆయన వెంట పలువురు యువతులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఉదంపూర్ నగర వీధుల గుండా కొనసాగిన ర్యాలీ స్లతియా చౌక్, కోర్టు రోడ్డు, రామ్ నగర్ చౌక్, గోల్ మార్కెట్, బస్టాండ్, మినీ స్టేడియంల మీదుగా జాతీయ రహదారిపై ముందుకు సాగుతూ జమ్మూ నగరం చేరుకుంది. మార్గం మధ్యలో కత్రా వద్ద కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ర్యాలీలో పాల్గొనవారిని కలిసి అభినందించారు. ఏటా ఈ తరహా ర్యాలీలను ఉదంపూర్ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తుండడం విశేషం. స్వచ్ఛ దీపావళిని నిర్వహించుకుందామనే పిలుపుతో పాటు బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిల్ని రక్షిద్దాం.. అమ్మాయిల్ని చదివిద్దాం) అనే చైతన్యాన్ని కల్గించే ఉద్దేశంతో ర్యాలీ జరిగింది.

Saturday, October 19, 2019

At least 10 killed in dam collapse in Russia`s Krasnoyarsk region


రష్యాలో డ్యాం కూలి 10మంది దుర్మణం
రష్యాలో ఓ డ్యాం కుప్పకూలిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సైబీరియా ప్రాంతంలోని క్రస్నోయార్స్క్ కరాయ్ లో శనివారం వేకువజాము 2 గంటలకు జరిగింది. డ్యాం ఒక్కసారిగా బద్ధలుకావడంతో 10 మంది కొట్టుకుపోయి తీవ్రగాయాలపాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జాడ తెలియడం లేదని అత్యవసర విభాగ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సుకేటిన్కినో కాలనీలో గల బంగారు గనులకు నీటి సరఫరా కోసం నిర్మించిన రిజర్వాయర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్పుత్నిక్ వార్త సంస్థ తెలిపింది. దాంతో డ్యాం నుంచి పోటెత్తిన వరద నీటితో కాలనీ ముంపునకు గురయింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సెబా నదిలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Friday, October 18, 2019

CJI Gogoi recommends Justice S A Bobde as his successor


సీజేఐగా బోబ్డే పేరును సిఫార్సు చేసిన గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సీనియర్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే పేరును ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ ఆయన కేంద్రానికి శుక్రవారం లేఖ రాశారు. సంప్రదాయాన్ని అనుసరించి గొగొయ్ తన వారసుడిగా బోబ్డే ను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కేంద్రం ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల బోబ్డే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సుప్రీం జస్టిస్ గా 12 ఏప్రిల్ 2013 నుంచి వ్యవహరిస్తున్న బోబ్డే పదవీ కాలం 23 ఏప్రిల్ 2021 వరకు ఉంది. ఆయన గతంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబయి, నాగ్ పూర్)లో చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం గొగొయ్ తర్వాత సుప్రీంకోర్టులో బోబ్డేనే అందరికంటే సీనియర్. గొగొయ్ 46వ సీజేఐగా 8 అక్టోబర్ 2018న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 17 నవంబర్ లో ముగియనుంది.

Sunday, October 13, 2019

India, Japan to hold joint military exercise from Oct 19


19 నుంచి భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు
ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసాల్లో భారత జపాన్ లు సంయుక్తంగా పాల్గొననున్నాయి. ఈనెల 19 నుంచి నవంబర్ 2 వరకు ఉభయదేశాలకు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మ-గార్డియన్ (ధర్మ సంరక్షణ) పేరిట ఈ సైనిక విన్యాసాల్ని మిజోరంలోని వైరెంగ్టేలో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేజీఎస్డీఎఫ్) లకు చెందిన 25 మంది చొప్పున సైనికులు పాల్గొనబోతున్నారు.  ఆయా దేశాలలో వివిధ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాన్ని ఉభయ దేశాల సైనికులు ఈ సందర్భంగా పంచుకోనున్నారు. ప్రపంచ ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాలు భద్రతా సవాళ్ల ను అధిగమించేందుకు ఏర్పాటవుతున్న ఈ విన్యాసాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో తలెత్తుతోన్న ఉగ్రవాదం.. నిరోధక చర్యలపై ప్లాటూన్ స్థాయి లో సైనికులు ఉమ్మడి శిక్షణ పొందనున్నారు. వివిధ దేశాలతో భారతదేశం చేపట్టిన సైనిక విన్యాసాల శిక్షణ క్రమంలో తాజా కార్యక్రమం  కీలకమైనదని అధికారిక ప్రకటన పేర్కొంది.

Saturday, October 5, 2019

Durga pooja revellers use umberellas as rain plays spoilsport on the day of maha saptami in kolkatta


గొడుగులతో దుర్గామాత వేడుకల్లో పాల్గొన కోల్ కతా వాసులు
పశ్చిమబెంగాల్ లో శనివారం మహాసప్తమి వేడుకల్ని భక్తులు సంబరంగా జరుపుకున్నారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా కోలకతాలో భక్తులు పెద్ద సంఖ్యలో గొడుగులు వేసుకుని మరీ వేడుకల్లో పాల్గొన్నారు. రుతుపవనాలు ఇంకా తిరోగమనం ప్రారంభించకపోవడంతో, పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజా ఉత్సవాలపై ఉరుములతో కూడిన వర్షాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ వర్షాలు దశమి రోజున కూడా కురవొచ్చని వాతావరణ శాఖ శనివారం పేర్కొంది. ఈశాన్య జార్ఖండ్ మీదుగా ఒక తుపాను, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలలో మరో తుపాను విరుచుకు పడొచ్చని తెలిపింది. దీనివల్ల  పశ్చిమ బెంగాల్‌లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నాలుగ్రోజుల పాటు జరుగనున్న దుర్గా మాత పూజలపై వర్షాల ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ రోజు మహాసప్తమి  సందర్భంగా ఓ వైపు జోరుగా వాన కురుస్తున్నా భక్తులు యథావిధిగా పూజలకు హాజరుకావడం విశేషం.

Friday, October 4, 2019

Shooting down chopper on Feb 27 was 'big mistake', action against officers: IAF chief


ఐఏఎఫ్ సొంత హెలికాప్టర్ నే కూల్చేయడం పెద్ద తప్పు: భదౌరియా
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ లో ఉగ్రతండాలపై మెరుపుదాడులు జరిపిన మరుసటి రోజున సొంత హెలికాప్టర్ నే క్షిపణితో కూల్చేసి ఐఏఎఫ్ గ్రౌండ్ సిబ్బంది చాలా పెద్ద తప్పు చేశారని ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా అన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారిగా విలేకర్లతో మాట్లాడారు.  జమ్ముకశ్మీర్ నౌషెరా సెక్టార్ లోని బుద్గామ్‌లో ఫిబ్రవరి 27న చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోనున్నామన్నారు. భారత-పాకిస్థాన్ ల గగనతలంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఐఏఎఫ్ మిగ్-17 ప్రయాణిస్తోంది. హెలికాప్టర్‌లోని ఐఎఫ్ఎఫ్ ('ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫ్రెండ్ లేదా శత్రువు'వ్యవస్థ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం,  గ్రౌండ్ సిబ్బంది, ఛాపర్ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపం కారణంగా శత్రు విమానంగా భావించి క్షిపణితో సొంత చాపర్ నే కూల్చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వాయుసేన సిబ్బందితో పాటు ఓ పౌరుడు దుర్మరణం చెందారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఐఏఎఫ్ చాపర్ శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలోని గగనతలంలో ఉండగా అధికారులు తిరిగి రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు. తిరిగి వస్తున్న చాపర్ ను గ్రౌండ్ సిబ్బంది శత్రు విమానంగా భావించి క్షిపణి దాడి చేశారు. ఇందుకు బాధ్యులైన నలుగురు అధికారులపై ఇప్పటికే పరిపాలనా చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీనియర్ అధికారులపై కోర్టు మార్షల్ ప్రొసీజర్స్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తున్నట్లు భదౌరియా తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మే ప్రారంభంలో, శ్రీనగర్ బేస్  ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ (ఏఓసీ) ను వాయుసేన బదిలీ చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కారదని చీఫ్ మార్షల్ భదౌరియా ఈ సందర్భంగా హెచ్చరించారు.

Thursday, October 3, 2019

Sarad Pawar kicks off poll campaign in Junnar; hits out at BJP


ప్రచార శంఖం పూరించిన శరద్ పవార్
మహారాష్ట్ర దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించారు. గురువారం ఆయన తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి గెలుపు కోసం జునార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా వారిని సీబీఐ, ఈడీ కేసుల్లో ఇరికిస్తున్నారని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలు పాలు చేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించడమే కాక  రాజకీయ మైలేజ్ వచ్చే అంశాలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని ఆరోపించారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పవార్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ పాలన ఘోరంగా ఉందని ఫడ్నవిస్ జమానాలో శాంతిభద్రతల పరిస్థితి వెంటిలేటర్ పైకి చేరుకుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు.ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను అనాలోచితంగా రద్దు చేయడం అనంతరం జీఎస్టీ కొరడా ఝళిపించడంతో వ్యాపార, వాణిజ్యరంగాలు దెబ్బతిన్నాయని దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పవార్ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత మాట అటుంచి దేశంలోని ప్రతి వ్యక్తి నోట్ల కోసం సతమతమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ పోరాడి గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.  

Wednesday, October 2, 2019

Gandhi jayanthi: Air India paints Gandhi portrait onits aircraft


ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై గాంధీజీ బొమ్మ
మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తన విమానంపై బాపూజీ బొమ్మను చిత్రీకరించి నడుపుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగంలో ఉన్న గాంధీజీ పెయింటింగ్ ప్రయాణికుల్ని ఆకట్టుకుంది. సుమారు 11 అడుగుల పొడవు, 4.9 అడుగుల వెడల్పుతో గాంధీజీ పెయింటింగ్ ను ఈ ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై అందంగా చిత్రీకరించారు. ఎయిర్ ఇండియా లోగో కింద చిత్రీకరించిన గాంధీజీ పెయింటింగ్ చూపరుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్ లైన్స్ హౌస్ మెయింటెనెన్స్ సిబ్బంది ఈ బొమ్మ చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశారు. ఇదిలావుండగా సెంట్రల్ రైల్వే జోన్ (ముంబయి ప్రధాన కేంద్రం) లోని డీజిల్ రైల్వే ఇంజన్లపై ఇదేవిధంగా మహాత్ముని బొమ్మను చిత్రీకరించారు. 22 లోకోమోటివ్ ఇంజన్లకు ఒకవైపున గాంధీ బొమ్మలను పెయింటింగ్ చేశారు. జాతీయ పతాకం పై అందంగా బాపూజీ బొమ్మను చిత్రీకరించి ఆ ఇంజన్లతో కూడిన రైళ్లను సెంట్రల్ రైల్వే జోన్లో ఈరోజు నడుపుతున్నారు.

BJP should first pursue path of truth and then talk about Mahatma Gandhi: Priyanka


బీజేపీ సత్యం చెప్పి.. అప్పుడు గాంధీజీ గురించి మాట్లాడాలి:ప్రియాంక
భారతీయ జనతా పార్టీ ముందు సత్యం పలకడం అలవాటు చేసుకుని ఆ తర్వాతే మహాత్మాగాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొనే ముందు విలేకర్లతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో తొలుత పాటించాల్సింది నిజం చెప్పడం.. ఆ అంశాన్ని బీజేపీ గుర్తించి ఆచరించాలని ఆ తర్వాతే ఆయన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మౌన పాదయాత్రతో తన బలాన్ని ప్రదర్శించేందుకు సమాయత్తమయింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై అత్యాచారం జరిపారని ఆరోపించిన న్యాయ విద్యార్థికి మద్దతుగా ర్యాలీకి యత్నించిన సుమారు 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలను సోమవారం యూపీ సర్కారు అరెస్ట్ చేసింది. బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమైన దశలో పోలీసులు వారిని నిర్బంధించారు. ఈ అరెస్టుల్ని ప్రియాంక తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో `మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయి.. వాటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి గొంతెత్తిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.` యూపీ సర్కార్ నిరంకుశ వైఖరిపై తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రియాంక హెచ్చరించారు.

Tuesday, October 1, 2019

Kejriwal greets president Ramnath Kovind on his birthday


రాష్ట్రపతి కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశంలో పలువురు నాయకులు మంగళవారం ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిజీకి జన్మదిన శుభాకాంక్షలు..దేశ సేవలో అంకితమయ్యేందుకు ఆయనను దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి..అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జన్మదినం రోజున రాష్ట్రపతి వారణాసిలో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో ఆయన 1 అక్టోబర్ 1945లో జన్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన కోవింద్ యునైటెడ్ ప్రొగెసివ్ అలయెన్స్ (యూపీఏ) అభ్యర్థి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2017 జులై25 న ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరిన తర్వాత బిహార్ గవర్నర్ గా పనిచేశారు.