Saturday, October 31, 2020

Government directs private schools to cut tuition fee by 30%

30% ఫీజుల కోతకు సర్కారు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు, కాలేజీ ఫీజుల్లో కోత విధిస్తూ శుభవార్తను అందించింది. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ (ఎ.పి.ఎస్.ఇ.ఆర్.ఎం.సి) సిఫారసు ఆధారంగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి (2020-21) ఫీజుల్లో 30% తగ్గించి వసూలు చేయాలని ఆదేశించింది. విద్యా సంవత్సరానికి గాను ట్యూషన్ ఫీజులో 70 శాతం మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు తెలియపర్చింది.
కోవిడ్ -
19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వెసులుబాటు తప్పనిసరి అయినందునే ఈమేరకు ఆదేశాలిచ్చినట్లు జగన్ సర్కారు స్పష్టం చేసింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు 2020-21 సంవత్సరానికి సమీక్షించి ఫీజులు నిర్ణయించాలని ఎ.పి.ఎస్‌.ఇ.ఆర్‌.ఎం.సి. ఇంతకుముందే ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఈ  మే 26 న నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాక సంబంధిత డేటాను సమర్పించాలని యాజమాన్యాల్ని ఆదేశించింది. ఇదిలావుండగా తాజా ఆదేశాలను లెక్కజేయకుండా పూర్తి ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.                                                                  
నవంబర్ 2 నుంచి 9,10 తరగతులు, ఇంటర్‌కు క్లాస్‌లు జరుగుతాయి. 23 నుంచి 6,7,8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాస్‌లు ప్రారంభమవుతాయి. రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తామని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.