Tuesday, February 18, 2020

Another Usain Bolt in kambala Nishanth Shetty the record of Srinivas Gowda

ఉసేన్ బోల్ట్ ను తలదన్నే కంబళ వీరులు..
వారం వ్యవధిలోనే ప్రపంచ ప్రఖ్యాత, ఒలింపిక్స్ పతకాల విజేత జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ రికార్డు రెండుసార్లు బద్ధలయింది. అయితే స్ప్రింట్ ఈవెంట్ లో కాదు.. కర్ణాటకలో ఏటా జరిగే సంప్రదాయ కంబళ క్రీడల్లో గత వారం బోల్ట్ ను తలదన్నెలా తన ఎడ్లతో శ్రీనివాస్ గౌడ్ మెరుపు వేగంతో పరిగెత్తగా మంగళవారం అతని రికార్డును నిషాంత్ శెట్టి బద్ధలు కొట్టాడు. ఈ ఇద్దరికి స్ప్రింట్ ఈవెంట్లలో తగిన తర్ఫీదు ఇప్పిస్తే ఒలింపిక్స్ పరుగులో పతకాల పంట ఖాయమని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ఎలుగెత్తి చాటుతున్నారు. దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది ఈ కంబళ పోటీలు నిర్వహిస్తారు. గౌడ కులస్థులు ఈ పోటీల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. కంబళ ఆటలో పోటీదారుడు (బఫెల్లో జాకీ) బురద నీటిలో తన రెండు దున్నపోతులు లేదా ఎడ్లతో పరిగెడతాడు. ఎవరైతే వీటిని వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలు. కర్ణాటకలో వ్యవసాయదారులే ఎక్కువగా ఈ పోటీలో పాల్గొనడం రివాజు. బురద నెలలో ఎడ్లతో రివ్వున లక్ష్యం దిశగా దూసుకుపోవడం పోటీదారులతో పాటు ప్రేక్షకులకు థ్రిల్ కల్గిస్తుంది. శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అంటే 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే చేరుకున్నాడు. ఇది జమైకా పరుగుల యంత్రం బోల్ట్‌ రికార్డు కన్నా 0.03 సెకన్లు తక్కువ. తాజాగా నిశాంత్ శెట్టి ఈ రికార్డును బద్ధలు కొట్టాడు. బోల్ట్ కంటే 0.07 సెకన్లు, శ్రీనివాస్ గౌడ్ కంటే 0.04 సెకన్ల ముందే పరుగును పూర్తి చేశాడు. నిషాంత్ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు. అంటే 100 మీటర్ల పరుగును 9.51 సెకన్లలోనే పూర్తి చేసినట్లు లెక్క.