Friday, November 29, 2019

Devastated and Heartbroken about `Disha` murder:Keerthi Suresh

గుండె పగిలింది:కీర్తి సురేశ్
`జస్టిస్ ఫర్ దిశ` హత్యోందంతం విన్నాక గుండె పగిలినంత పనైందని ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆమె ట్వీట్ చేస్తూ రోజురోజుకూ క్రూరత్వం హింసాప్రవృత్తి పెరిగిపోతున్నాయని పేర్కొంది. సూపర్ సేఫ్ సిటీగా భావించే హైదరాబాద్ లోనే ఇలాంటి దారుణం జరగడం పట్ల తల్లడిల్లుతున్నట్లు తెలిపింది. సావిత్రి యథార్థ గాథ ఆధారంగా నిర్మితమైన `మహానటి` చిత్రం లో నటించిన కీర్తి సురేశ్ బహుళ ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన మృగాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. మరో నిర్భయ ఘటనగా విశ్లేషకులు వర్ణిస్తున్న `దిశ` దారుణ హత్యపై తెలుగు పరిశ్రమ భగ్గుమంది. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీ ఖన్నా, మెహ్రిన్, పూనమ్ కౌర్, గాయని చిన్మయి శ్రీపాద, హీరోలు రవితేజ, అఖిల్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, మంచుమనోజ్, సుశాంత్ తదితరులు ఈ క్రూరత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ల ద్వారా ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

Wednesday, November 27, 2019

'How can you always blame boys?': Director Bhagyaraj's 'genius'


భాగ్యరాజా పిచ్చివాగుడు: హోరెత్తిన నిరసనలు
వయసు పెరిగేకొద్దీ ఒద్దిక పెరిగి బుద్ధి వికసించి సమాజానికి ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలి. అందుకు భిన్నంగా మాట్లాడిన తమిళ దర్శక, నిర్మాత భాగ్యరాజా చివాట్లు తింటున్నాడు. కోలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లోనూ పలు కుటుంబ, హాస్యరస చిత్రాలను నిర్మించి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన భాగ్యరాజా మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. పురుషులకు చనువు ఇవ్వడం, ఎక్కువ సమయంపాటు రెండేసి మొబైళ్లలో చాటింగ్ చేస్తుండడమే తాజా అత్యాచార ఘటనలకు కారణంగా పేర్కొన్నాడు. అంతేకాకుండా తప్పంతా అబ్బాయిలదే అనడం తప్పు అని సూత్రీకరించాడు. ఓ పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకుంటే అతని ఇంటి ఇల్లాలికి ఏమి నష్టం జరగదు..కానీ అదే ఇల్లాలు అక్రమ సంబంధంలో ఉంటే కన్న పిల్లల్ని హత్య చేయడానికీ వెనుకాడదు..అంటూ పేద్ద.. తత్వవేత్తలా విశదీకరించాడు. దాంతో సామాజికమాధ్యమాల్లో అతనిపై ట్రోలింగ్ పీక్ కు చేరింది.  తాజా తమిళ సినిమా మ్యూజిక్ లాంచ్‌లో భాగ్యరాజా ఈ పిచ్చిప్రేలాపన చేశాడు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుడు ఇలా వ్యాఖ్యానించడం తగదని ప్రముఖ గాయని చిన్నయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో మహిళా సంఘాలు భాగ్యరాజా వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.

Monday, November 25, 2019

More women abused than not, in US


మహిళలపై వేధింపులు అమెరికాలోనే ఎక్కువ 
భూతల స్వర్గం అమెరికాలోనూ ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల వెల్లడైన సర్వేల ప్రకారం అగ్రరాజ్యంలో సుమారు 70% మంది మహిళలు తమ భాగస్వాముల వేధింపులకు లోనవుతున్నట్లు తేలింది. అమెరికాలో అత్యధిక శాతం మహిళలు తమ పార్టనర్ల ద్వారా శారీరక, లైంగిక వేధింపుల బారిన పడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మహిళా సంస్థ (యూఎన్ వుమెన్) సోమవారం ఓ నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థినులు ప్రతి నలుగురిలో ఒకరు లైంగిక అకృత్యం లేదా దుష్ప్రవర్తనలను చవిచూస్తున్నారని పేర్కొంది. ఇతరత్రా మహిళలపై వేధింపులకు లెక్కేలేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వేల్లో వివిధ దేశాల్లో భాగస్వాముల ద్వారా హింసకు గురవుతున్న మహిళల శాతం అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా తర్వాత ఆఫ్రికా దేశాల్లో హింసకు గురౌతున్న మహిళలు 65 శాతం ఉండొచ్చని అంచనా. దక్షిణాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ శాతం 40 వరకు చేరుకుందని తెలుస్తోంది. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (`ఆరెంజ్ డే`) సందర్భంగా ఈరోజు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ తక్షణం ఈ ఆటవిక రుగ్మతకు చరమగీతం పాడాలన్నారు. మహిళలపై హింస వీడడం, లింగ సమానత్వం దిశగా ముందుకు సాగడం యావత్ విశ్వాన్ని స్థిరమైన అభివృద్ధి వద్ద నిలుపుతుందని చెప్పారు. `శతాబ్దాలుగా పురుష ఆధిక్య సమాజంలో మహిళలు, బాలికలపై లైంగిక హింస పాతుకుపోయింది. అత్యాచార సంస్కృతికి ఆజ్యం పోసింది. లింగ అసమానతలనన్నవి శక్తి అసమతుల్యతకు సంబంధించిన ప్రశ్న అని మనం మర్చిపోకూడదు` అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా మహిళలు పురుషులతో సమానంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఐక్యరాజ్యసమితి ఏటా నవంబర్ 25న `ఆరెంజ్ డే` పాటిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని యూఎన్ మాజీ ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ తన పదవీ కాలంలో ప్రారంభించారు.

Sunday, November 24, 2019

Virat Kohli Credits Sourav Ganguly For Winning Habit and said `Learnt To Stand Up, Give It Back`


గంగూలీ జట్టు నుంచే మాకు గెలుపు అలవాటు అబ్బింది:కోహ్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి ఇండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆదివారం కోల్ కతాలో టెస్ట్ సీరిస్ ట్రోఫీని అందుకుంటున్న సందర్భంగా కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ సారథ్యంలో భారత టీమ్ సాధించిన విజయాల బాటలోనే ప్రస్తుత తమ జట్టు ముందుకు సాగుతోందని కోహ్లీ పేర్కొన్నాడు. గెలుపు అలవాటు దాదా జట్టు నుంచే పుణికిపుచ్చుకున్నామని సవినయంగా తెలిపాడు. మూడు నాల్గేళ్లగా ఏ జట్టుపైనైనా భారత్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శననే చేస్తున్నారన్నాడు. ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు తొలి పింక్ బాల్ టెస్ట్ ను అమోఘంగా ఆదరించారంటూ కోహ్లీ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. బంగ్లాదేశ్ జట్టుపై స్వదేశంలో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ ల సీరిస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి డే అండ్ నైట్ (పింక్ బాల్) టెస్ట్ లో భారత్ జట్టు బంగ్లా జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడోరోజే విజయభేరి మోగించి టెస్ట్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కోల్ కతాలో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో కోహ్లీ రెండు రికార్డుల్ని నమోదు చేశాడు. కెప్టెన్ గా అత్యంత వేగంగా 5వేల పరుగులు చేసిన వారి జాబితాకెక్కాడు.  దాంతో పాటు టెస్ట్ సెంచరీ(136) సాధించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్లు ఇషాంత్, షమీ, ఉమేశ్ ల ధాటికి కేవలం 106 పరుగులకే 10 వికెట్లు సమర్పించుకుంది. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 347/9 డిక్లేర్ చేయగా రెండో ఇన్నింగ్స్ లోనూ బంగ్లాకు భంగపాటు తప్పలేదు. బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో పుష్కరకాలం తర్వాత అయిదు వికెట్లు దక్కించుకున్నఇషాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు వెన్నువిరిచి పండగ చేసుకున్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉమేశ్ అయిదు వికెట్లు పడగొట్టడంతో  బంగ్లా జట్టు 195లకే ఆలౌటయి ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. బంగ్లా రెండో ఇన్నింగ్స్ ను ఇషాంత్, ఉమేశ్ లే చక్కబెట్టేశారు. మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్ కావడంతో బ్యాటింగ్ కొనసాగించలేదు. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టి-20 సీరిస్‌లో భారత్ 2-1తో బంగ్లాదేశ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.

Friday, November 22, 2019

Sri Lanka's new president picks his brothers into the interim cabinet

మధ్యంతర కేబినెట్‌ను నియమించిన శ్రీలంక కొత్త అధ్యక్షుడు
శ్రీలంక నూతన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం తాత్కాలిక కేబినెట్‌ను నియమించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన మధ్యంతర కేబినెట్ లోకి తన ఇద్దరు సోదరులను తీసుకున్నారు. కొత్త కేబినెట్‌లో ప్రధాని పదవికి ఎంపికైన మహీంద రాజపక్స(74)ను రక్షణ, ఆర్థిక మంత్రిగా కూడా నియమించారు. సోదరులలో పెద్దవాడు చమల్ రాజపక్స(77)ను వాణిజ్య, ఆహార భద్రత మంత్రిగా ఎంపిక చేశారు. 16 మంది సభ్యుల మంత్రివర్గంలో వీరితో పాటు ఇద్దరు తమిళులు, ఒక మహిళ ఉన్నారు. ప్రముఖ మార్క్సిస్ట్ రాజకీయ నాయకుడు దినేష్ గుణవర్ధన (70) విదేశాంగ మంత్రిగా ఎంపికయ్యారు. ప్రస్తుత పార్లమెంటును అధ్యక్షుడు రద్దు చేసి తాజా పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే వరకు ఈ కేబినెట్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు జరగాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రస్తుత ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయకపోతే ఆయనను తొలగించలేరు. అలాగే దేశాధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సే కేబినెట్ అధిపతి అయినప్పటికీ మంత్రిత్వ శాఖలను నిర్వహించలేరు. సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా గడువుకు ముందే తాజా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మధ్యంతర కేబినెట్ నియామకాన్ని చేపట్టారు. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 52 ఏళ్ల సజిత్ ప్రేమదాసను 13 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. గతంలో గోటబయ సైనిక బలగాల అధినేతగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దేశం  పార్లమెంట్ ఎన్నికల ముంగిట నిలిచిందని స్పీకర్ కరు జయసూర్య ఇటీవల పేర్కొనడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా పదవి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నారు. `ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీగా, పార్లమెంటరీ ఎన్నికల గురించి పార్లమెంట్ సభ్యులు, స్పీకర్, పార్టీ నాయకులతో చర్చిస్తాం` అని విక్రమసింఘే కార్యాలయం సోమవారమే ఒక ప్రకటన జారీ చేసింది.

Tuesday, November 19, 2019

Rajya Sabha Chairman ordered review of new Military Style Uniform of Marshals


మార్షల్స్ సైనిక యూనిఫాంపై సమీక్ష: ఉపరాష్ట్రపతి
రాజ్యసభలో కొత్తగా అమలులోకి వచ్చిన మార్షల్స్ యూనిఫాంపై పున:సమీక్షకు చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదేశించారు. సైనిక దుస్తుల తరహాలో మార్షల్స్ యూనిఫాం ఉండడంపై కొందరు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న సభాపతి ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ కు మంగళవారం ఆదేశాలు ఇచ్చారు. రాజ్యసభ సచివాలయం వివిధ సలహాలు పరిశీలించాక మార్షల్స్ కు కొత్త యూనిఫాం అమలు చేసింది. అయితే సైనికయేతర సిబ్బంది సైనిక యూనిఫాంను కాపీ చేయడం, ధరించడం చట్టవిరుద్ధం, భద్రతాపరమైన ప్రమాదమంటూ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మార్షల్స్ సైనిక దుస్తులు, టోపీ, తలపాగాలను ధరించడంపై  మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం కోరుతూ ట్వీట్ చేశారు. ఆయనకు పలువురు రిటైర్డ్ డిఫెన్స్ అధికారులు మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంకయ్య ఈ విషయమై రాజ్యసభ సచివాలయం పున:సమీక్షిస్తుందని సభకు తెలిపారు.

Friday, November 15, 2019

Delhi court directs city police to give 10 days pre-arrest notice to Shehla Rashid in sedition case


షెహ్లా అరెస్ట్ కు 10 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి
దేశద్రోహం కేసును ఎదుర్కొంటున్న కశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలు షెహ్లా రషీద్ కు ఢిల్లీ కోర్టు బాసటగా నిలిచింది. ముందస్తు బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐ.ఒ) కోర్టుకు తెలియజేయడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం ఆమెకు 10 రోజుల ముందే విషయాన్ని తెలపాలని పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆగస్ట్ 17న ఆమె ఉద్దేశపూర్వకంగానే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల్లో విద్వేషభావాల్ని రెచ్చగొట్టేలా షెహ్లా పోస్టులు చేశారని పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. ముఖ్యంగా భారత సైన్యం అక్కడ విచారణల పేరిట యువతను అర్ధరాత్రిళ్లు తరలించుకు వెళ్లి ఇబ్బందుల పాల్జేస్తున్నారంటూ ఆమె ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో షెహ్లా వరుస పోస్టులు పెడుతూ అల్లర్లు ప్రేరేపించేందుకు యత్నించినట్లు కేసు పెట్టారు. ఇదిలావుండగా అరెస్ట్ ను తప్పించుకోవడానికి ఆమె యాంటిసిపేటరీ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు విచారణకు తమ క్లయింట్ హాజరవుతారని షెహ్లా న్యాయవాదులు తెలిపినా అడిషినల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు.

Tuesday, November 12, 2019

President rule in Maharastra today onwards


`మహా`లో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తక్షణం రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఎన్నికలు ఫలితాలు విడుదలై 19రోజులు గడిచినా బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాలేకపోవడంతో గవర్నర్ నివేదన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తాము తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరింత గడువు ఇవ్వకుండా రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కోష్యారి సిఫార్సు చేయడంపై శివసేన నిప్పులు చెరిగింది. ఇందుకు సంబంధించి శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన 56 స్థానాలు దక్కించుకోగా ఎన్సీపీ 54, పొత్తు పార్టీ కాంగ్రెస్ 44 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు 29 స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. బీజేపీ-శివసేనలు చెరి రెండేళ్లు సీఎంగా అధికారం చలాయించడంపై నెలకొన్న ప్రతిష్టంభనతో తాజాగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తెరపైకి వచ్చింది. ఎన్నికల పొత్తు సమయంలోనే తాము ఈ మేరకు ప్రతిపాదిస్తే బీజేపీ అంగీకరించిందని శివసేన పేర్కొంటోంది. అందుకు ప్రస్తుతం బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఏ పార్టీకి తగిన సంఖ్యాబలం లేక ప్రభుత్వాన్ని స్థాపించలేక పోయాయి. ఇదిలావుండగా గవర్నర్ వైఖరిపై కాంగ్రెస్ మండిపడింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని విమర్శించింది. మంగళవారం ఏఐసీసీ సమాచార శాఖ ఇన్ చార్జీ రణ్ దీప్ సింగ్ సుర్జీవాలా విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ వైఖరిని ఘాటుగా విమర్శించారు. సీపీఎం పోలిట్ బ్యూరో కూడా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని తీవ్రంగా ఖండించింది.

Thursday, November 7, 2019

Telangana registers No.1 spot in STD`s due to the causes of Unsafe sex, diabetes


సుఖ వ్యాధుల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమం

తెలంగాణలో ప్రజారోగ్యం అథమ స్థానంలో ఉందనే చేదు నిజం మరోసారి స్పష్టమయింది. సుఖ వ్యాధుల్లో ఆ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆందోళన కల్గిస్తోంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 నివేదిక ప్రకారం తెలంగాణ తర్వాత స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ లు నిలిచాయి. అసురక్షిత లైంగిక కార్యకలాపాలు, మధుమేహం ఇందుకు కారణాలని తేలింది. 2018 లెక్కల ప్రకారం తెలంగాణలో 14,940 సుఖ వ్యాధిగ్రస్తులు నమోదయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పురుషుల సంఖ్య 4,824 కాగా మహిళలు 10,116 మంది ఉన్నట్లు వెల్లడయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 12,484 (3,197(పు), 9,287(మ)); మధ్యప్రదేశ్ లో 8,140 (2,042(పు), 6,098(మ); కర్ణాటకలో 3,685 (1,226(పు),2,459(మ); రాజస్థాన్ లో 2,869 (1,161(పు), 1,708(మ)) మంది సుఖ వ్యాధి గ్రస్తులున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తొలి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో రెండు తెలుగురాష్ట్రాలతోపాటు మొత్తం మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలడం నివ్వెరపరస్తోంది. అందులోనూ ఈ సుఖవ్యాధుల బారిన పడిన వారిలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉండడం కలవరం కల్గిస్తోంది. ఈ సాంక్రమిక సుఖవ్యాధి(ఎస్.టి.ఐ) బారిన పడిన వారికే ఎక్కువగా హెచ్.ఐ.వి (ఎయిడ్స్) సోకే ప్రమాదం ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలంగాణ మొత్తం జనాభాలో 15 నుంచి 20% మంది మధుమేహవ్యాధి పీడితులుండడం వల్ల ఈ ఎస్.టి.ఐ. రోగుల సంఖ్య తెలంగాణలో ఎక్కువగా నమోదవ్వడానికి ప్రధాన కారణమని భారతీయ వైద్య సంఘం (ఐ.ఎం.ఎ) కార్యదర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.


Friday, November 1, 2019

Rajnath Singh pays tribute to former PM Shastri


నిరుపమాన యోధుడు లాల్ బహుదూర్ శాస్త్రి: రాజ్ నాథ్
పాకిస్థాన్ తో యుద్ధ సమయంలో భారత్ ను సమైక్యంగా పటిష్టంగా నిలిపిన యోధుడు దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్లాఘించారు. ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ లో పర్యటిస్తున్న రక్షణమంత్రి ఈ సందర్భంగా శుక్రవారం శాస్త్రి స్ట్రీట్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాక్ ల యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని శాస్త్రీజీ జైజవాన్ జైకిసాన్ పిలుపు ఓ ప్రభంజనంలా యావత్ దేశాన్ని కదిలించిందని రాజ్ నాథ్ పేర్కొన్నారు. యుద్ధానంతరం 1966 లో యూఎస్ఎస్ఆర్ మధ్యవర్తిత్వంలో భారత్-పాక్ ల మధ్య తాష్కెంట్ లో ఒప్పందం కుదిరింది. సరిగ్గా ఒక రోజు తర్వాత జనవరి 11న శాస్త్రీజీ ఆకస్మికంగా కన్నుమూశారు. శాస్త్రీజీ జీవనశైలి, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమని రాజ్ నాథ్ కొనియాడారు. శాస్త్రీజీ స్మృత్యర్థం నిర్మించిన పాఠశాలను ఆయన సందర్శించి అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు భారత్ పైన, హిందీ భాష పట్ల కనబర్చిన ప్రేమకు రక్షణ మంత్రి ముగ్ధులయ్యారు. ఈనెల 2,3 తేదీల్లో జరగనున్న ప్రభుత్వాధినేతల (సీహెచ్జీ) సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొంటారు. అదేవిధంగా భారత్, ఉజ్బెకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల పైన చర్చలు జరుపుతారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్.సి.ఒ) కీలక సమావేశంలో రాజ్ నాథ్ పాల్గొననున్నారు.