Friday, June 7, 2019

Rahul mania grips Wayanad despite heavy rain



వాయ్ నాడ్ పర్యటనకు విచ్చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ లోని తన నియోజకవర్గం వాయ్ నాడ్ విచ్చేశారు. ఇటీవల ఇక్కడ లోక్ సభ నియోజకవర్గం నుంచి రాహుల్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. శుక్రవారం (జూన్7) మధ్యాహ్నం 2 గంటలకు ఆయనకు కోజికోడ్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన మూడ్రోజుల పాటు వాయ్ నాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సుమారు 4.31 లక్షల ఓట్ల మెజార్టీని సాధించిన రాహుల్ ఈ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు ఆయన కలికవు జిల్లాలో ఓపెన్ టాప్ వాహనంలో పర్యటన ప్రారంభించారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్న వేలమంది జనం రాహుల్ కోసం వేచి చూస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు, పిల్లలు కూడా రోడ్ కు ఇరువైపుల నిలబడి తమ ప్రియతమ నేతకు స్వాగతం పలకడం కనిపించింది. రాహుల్ చేతులూపుతూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వర్షం వల్ల కొన్ని చోట్ల రోడ్లు నీటితో నిండిపోగా జనం బాల్కనీల పైన, మిద్దెల పైన నిలిచి రాహుల్ కు జయజయధ్వానాలు పలికారు. వాయ్ నాడ్ రాహుదారులన్నీ కాంగ్రెస్ జెండాలతో రెపరెపలాడాయి. రాహుల్ వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేశ్ చెన్నితాల, పీకే కున్హలీకుట్టీ , యూడీఎఫ్ నాయకులు ఉన్నారు. మూడ్రోజుల పర్యటనలో రాహుల్ నిలంబుర్, ఎర్నాడ్ ల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. తొలిసారి ఇక్కడ ఎంపీ గా ఎన్నికైన రాహుల్ కల్పెట్టా, కంబాల్కడు, పనమరం, మానత్వాడి, పుల్పల్లీ, సుల్తాన్ బథేరి ల్లోనూ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఢిల్లీకి ఈ నెల 9న తిరిగి వెళ్లనున్న రాహుల్ కోజికోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. వాయ్ నాడ్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఆయనను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన మొత్తం 15 రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు.

dubai:8 indians among 17 killed in bus crash



దుబాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం:8 మంది భారతీయుల సహా 17 మంది  

దుర్మరణం
దుబాయ్ లో శుక్రవారం(జూన్7) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒమన్ నుంచి వస్తున్న బస్ దుబాయ్ అల్ రషీదియా ఎగ్జిట్ రోడ్డుపై అతి వేగంగా ప్రయాణిస్తూ పక్కనే ఉన్న అడ్వర్టయిజ్ మెంట్ బోర్డును బలంగా ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 17 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో  అత్యధికులు ఒమన్ జాతీయులే. భారత్ కు చెందిన 8మంది ప్రాణాలు కోల్పోయారు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ కు సమీపంలో ఈ ఉదయం 5.40 నిమిషాలకు ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. బోర్డును వేగంగా ఢీకొట్టిన క్రమంలో బస్ ఎడమ వైపు భాగం నుజ్జునుజ్జుయింది. ఆ వైపు కూర్చున్న ప్రయాణికులంతా మృతువాత పడినట్లు సమాచారం. రంజాన్ వేడుకలు ముగించుకుని ఒమన్ నుంచి తిరిగివస్తూ వీరంతా దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగే సమయానికి బస్ లో 31 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రుల్ని రషీద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దుబాయ్ పోలీస్ చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలిఫా అల్ మెరి, దుబాయ్ అటార్ని జనరల్ ఎయిసమ్ ఎస్సా అల్ ముమైదన్ తదితర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం బస్ డ్రైవర్ తప్పు మార్గంలో వాహనాన్ని నడిపాడు. అల్ రషీదియా మెట్రో స్టేషన్ వైపునకు అసలు బస్ ల ప్రవేశానికి అనుమతి లేదని తెలుస్తోంది. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం మస్కట్-దుబాయ్ ల మధ్య రోజుకు మూడు సార్లు నడిచే ఈ-05 బస్ సర్వీసుల్ని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. రషీద్ ఆసుపత్రికి చెందిన అనధికారిక వర్గాల  సమాచారం మేరకు మొత్తం 10 మంది భారతీయులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఆరుగురు కేరళీయులని సమాచారం.