Monday, September 14, 2020

 

China spy Indian PM, President and CJI and around 10 thousand other Prominent persons

చైనా వెన్నులో భారత్ వణుకు

పొరుగుదేశంలో డ్రాగన్ గూఢ`చౌర్యం`

భారత్ అంటే చైనా జడుస్తోందా..? అందుకే దాదాపు 10 వేల మంది కీలక వ్యక్తులపై గూఢచర్యానికి పాల్పడుతోందా..? 1962 నాటి పరిస్థితులు కాదని.. భారత్ ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన దేశమని చైనాకు బాగా బోధపడినట్లుంది. దాంతో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, కేంద్రమంత్రులు సహా వేల మంది ప్రముఖులపై  స్పైయింగ్ కు పాల్పడుతోన్నట్లు సమాచారం. వీరిలో భారత రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి డిజిటల్ జీవితాలపై చైనా కంపెనీలు కన్నేసి ఉంచాయి. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు, మద్దతుదారుల కార్యకలాపాల పైనా ఆ కంపెనీలు నిఘా పెట్టాయని నేషనల్ న్యూస్ ఏజెన్సీ తాజా కథనంలో పేర్కొంది. వీరి రియల్ టైం డేటాను చైనా కంపెనీలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. షెంజేన్ అనే సంస్థ ఈ కుట్రకు నేతృత్వం వహిస్తోంది.  షెంజాన్, చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ డేటా స్థావరాన్ని నిర్మించి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆ కథనంలో వివరించింది. భారత్‌ సరిహద్దుల్లో చొరబాట్లకు దిగడంతో పాటు చైనా చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మరో భారీ కుట్రకు తెరలేపింది. గూఢచర్యం నెరిపేందుకు తమ దేశంలోని కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది.  గల్వాన్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ దేశ వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించి చైనాకు గట్టిగా బదులిచ్చింది. దాంతో ఉడికిపోతున్న చైనా ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.