Friday, July 31, 2020

Pawan Kalyan Bakrid Wishes to All Muslim Brothers

పవన్ కల్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ అని గుర్తు చేశారు. బక్రీద్‌కు మరో పేరే ఈద్-ఉల్-అజహా అని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రంజాన్ తరవాత ముస్లింలు అంత పవిత్రంగా జరుపుకునే పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాంను సంపూర్ణంగా విశ్వసించే ముస్లింలు అందరికీ తన తరఫున, జనసేన పార్టీ నుంచి బక్రీద్ శుభాకాంక్షలు అని పవర్ స్టార్ ప్రకటించారు. బక్రీద్ అందించిన సందేశం ముస్లింలకు మాత్రమే కాక యావత్ మానవాళికి ఆచరణీయం అని ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ పండుగను సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా భౌతికదూరం పాటిస్తూ ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని కోరారు.

Wednesday, July 29, 2020

Unlock 3.0: No night curfew, reopening of gyms, yoga institutes

అన్ లాక్-3: సినిమా హాళ్లు..స్కూళ్లకు నో 
తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్రప్రభుత్వం సినిమా హాళ్ల రీఓపెన్ కు నో చెప్పింది. అదే విధంగా విద్యాసంస్థల్ని ఆగస్ట్ 31 వరకు తెరవరాదని పేర్కొంది. అన్ లాక్‌ 1,2 అమలు తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నా అన్ లాక్ 3ను ధైర్యంగా కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఆగస్టు 5 నుంచి జిమ్స్‌, యోగా సెంటర్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న దేశ ఆర్థిక గమనాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలనే సర్కారు భావిస్తోంది. అయితే అత్యధిక జనసమర్ధంతో నిండి ఉండే ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం (జులై 29) రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెట్రో సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం కొనసాగనుంది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగనుంది. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా అదనపు ఆంక్షలు విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం మాత్రం రాష్ట్రాలకు ఉండదు. శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు యథావిధిగా కొనసాగించనున్నట్లు కేంద్రం తెలిపింది. భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చంది. అన్‌లాక్ 2.0 జులై 31తో ముగియనున్న నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్స్‌ పున:ప్రారంభంపై పరిస్థితులకు అనుగుణంగా తేదీలను ఖరారు చేస్తామని సంకేతం ఇచ్చింది.

Tuesday, July 28, 2020

Andhra govt plans to reopen schools from Sep 5

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో బడి గంట
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని  ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి రెండో వారం నుంచి ఏపీలో స్కూళ్లు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అన్న సందిగ్ధతకు జగన్ సర్కార్ తాజాగా తెరదించింది. స్కూళ్ల పున: ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లను తెరుస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సీఎం జగన్ సైతం ఈరోజు అధికారికంగా తేదీని ధ్రువీకరించారు. అయితే గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,948 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,297కి చేరింది. ఇప్పటి వరకు 1,148 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 52,622 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా టెస్టుల్లో మాత్రం ఏపీ తన రికార్డు నిలబెట్టుకుంటోంది. తాజాగా 24 గంటల్లో  62,979 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 32,100 ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా పరీక్షలున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలావుండగా తెలంగాణలో మాత్రం స్కూల్స్ రీఓపెన్ పై అనిశ్చితి కొనసాగుతోంది. కరోనా తీవ్రతపై ఆ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి.

Saturday, July 25, 2020

Paritala Sunitha father Dharmavarapu Kondaiah passed away

పరిటాల సునీతకు పితృవియోగం
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  అనంతపురం జిల్లా వెంకటాపురంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దాంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరిటాల రవి దారుణహత్య దరిమిలా కొండన్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆయన రాజకీయాలకు కొత్త అయిన కుమార్తె పరిటాల సునీత వెంట ఉండి నడిపించారు. జిల్లాలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా కొండన్న సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సునీతమ్మ కుటుంబాన్నిపలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. గడిచిన ఎన్నికల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన మనవడు పరిటాల శ్రీరామ్ ను ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. కొండన్నమృతి తీరని లోటని పేర్కొంటూ సునీతమ్మ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సునీతమ్మ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న మరణం బాధాకరమంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా వెంకటాపురంలో ఈ సాయంత్రం కొండన్న భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Thursday, July 23, 2020

AP CM YSJagan allocates portfolios to new ministers

ఏపీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యావంతుడు డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మత్స్య,  పశు సంవర్ధకశాఖ దక్కగా వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ లభించింది. ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన పోర్టుపోలియో తాజాగా కృష్ణదాస్‌కు కేటాయించారు. అలాగే మోపిదేవి స్థానంలో అప్పలరాజుకు ఆ శాఖలను అప్పగించారు. కృష్ణదాస్ ఇంతకుముందు నిర్వహించిన రోడ్లు భవనాల శాఖను శంకర్ నారాయణ స్వీకరించారు. ఆయన గతంలో నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు.
తాజా మార్పులతో ఏపీ మంత్రివర్గం..
*1. కృష్ణదాస్- డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్
2.  బొత్స సత్యనారాయణ- మున్సిపల్ శాఖ
3.  పుష్ప శ్రీవాణి- డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ
4.  అవంతి శ్రీనివాస్- పర్యాటక శాఖ
*5. వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమ శాఖ
6.  కురసాల కన్నబాబు- వ్యవసాయం
7.  పినిపె విశ్వరూప్- సాంఘిక సంక్షేమశాఖ
8.  తానేటి వనిత- మహిళా సంక్షేమం
9.  చెరుకువాడ రఘునాథరాజు- గృహనిర్మాణశాఖ
10. ఆళ్ల నాని- డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ
11.  వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయశాఖ
12.  కొడాలి నాని- పౌరసరఫరాలు
13.  పేర్ని నాని- రవాణా, సమాచారశాఖ
14.  మేకతోటి- సుచరిత హోంశాఖ
*15. సీదిరి అప్పలరాజు- మత్స్య,  పశుసంవర్ధకశాఖ
16.  బాలినేని శ్రీనివాసరెడ్డి-విద్యుత్, అటవీ శాఖ
17.  ఆదిమూలపు సురేష్- విద్యాశాఖ
18.  మేకపాటి గౌతమ్ రెడ్డి- పరిశ్రమలు వాణిజ్యం, ఐటీశాఖ
19.  అనిల్ కుమార్ యాదవ్- సాగునీటి పారుదలశాఖ
20.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
21.  నారాయణస్వామి- డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
*22. శంకర్ నారాయణ- రోడ్లు, భవనాలు
23.  బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు
24.  గుమ్మన జయరాం- కార్మిక, ఉపాధి కల్పన
25.  అంజద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ

Friday, July 17, 2020

Journalist Madhusudhan Reddy dies with Covid-19 in Tirupati

ఏపీలో కరోనాకు మరో జర్నలిస్ట్ బలి
కరోనా వైరస్ కు ఆంధ్రప్రదేశ్ లో మరో జర్నలిస్ట్ బలయ్యారు. ఓటీవీ చానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మధుసూధన్ రెడ్డి కరోనా కారణంగా కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలోనే ఈనెల 12న కరోనా తో పార్థసారథి అనే కెమెరామన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన శ్వాస తీసుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. ఇప్పటికే తెలంగాణలో ఓ జర్నలిస్ట్ కరోనాకు బలయ్యారు. జూన్ లో మనోజ్ కుమార్ అనే టీవీ జర్నలిస్ట్ ని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. 


Monday, July 13, 2020

Real Ayodhya in Nepal, Ram Not Indian: Nepal PM Oli

రాముడు నేపాలీ: ప్రధాని ఓలి
భారత్ పై మరోసారి నేపాల్ ప్రధాని కె.పి.ఓలి విషం కక్కారు. ఈసారి ఏకంగా రాముడ్ని అడ్డం పెట్టుకుని ఆయన మనదేశాన్ని ఆడిపోసుకున్నారు. భారత్ లోని రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్య నకిలీదన్నారు. మన దేశం సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు రువ్వారు. సోమవారం ఆయన నేపాల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ తెంపరితనాన్ని ప్రదర్శించారు. అసలైన రామజన్మభూమి నేపాల్ లోనే ఉందని చెప్పారు. బీర్గంజ్ జిల్లాలోని థోరి శ్రీరాముని జన్మస్థలమని ఓలి పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత్ కు మిత్రదేశంగా కొనసాగుతున్న నేపాల్..ఓలీ ప్రధానిగా పదవిలోకి వచ్చాక చైనా కన్నుసన్నల్లో నడుస్తూ మనదేశంతో శత్రుత్వం పెట్టుకుంటోంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాల్ని ఇటీవల తమ మేప్ లో చేర్చుకుని తమవే ఆ భూభాగాలంటూ నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.

Wednesday, July 8, 2020

AP CM YS Jagan unveils 'Nalo Natho' book a biography on YSR Written by YSVijayamma

మహానేత రాజన్నకు సీఎం జగన్ ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి జననేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వై.ఎస్.ఆర్ 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రమే అమరావతి నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. కరోనా నెగెటివ్ పత్రాలు ఉన్న వారినే పోలీసులు సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో అనుమతించారు. ఈ సందర్భంగా మహానేత సతీమణి విజయమ్మ ఆయనపై రాసిన `నాలో..నాతో..వైఎస్ఆర్` పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. నాన్న వై.ఎస్. లో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన జీవనగమనంలో చూసిన విధానాన్ని అమ్మ విజయమ్మ ఈ పుస్తక రూపంలో జనం ముందుకు తీసుకువచ్చారని జగన్ అన్నారు. నాన్న జయంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 37 ఏళ్ల సహచర్యంలో తన భర్త వై.ఎస్.లో చూసిన గొప్ప గుణాలు, మూర్తిభవించిన మానవత్వాన్ని ప్రజలతో పంచుకునేందుకే ఈ పుస్తకాన్ని రాసినట్లు విజయమ్మ తెలిపారు.

Sunday, July 5, 2020

Punjab: 10 people fall sick after eating ‘parsad’ allegedly ‘laced with some poisonous substance’

పంజాబ్ గురుద్వారాలో విషాహారం: 10 మందికి తీవ్ర అస్వస్థత
పంజాబ్ లో విషాహారం తిని 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవల మరణించడంతో ఇంట్లో దినకర్మ నిర్వహించారు. ప్రార్థనలు (సుఖ్మాణి సాహిబ్) నిర్వహించిన తర్వాత బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. అనంతరం రఘువీర్ ఆహారపదార్థాలను (ప్రసాద వితరణ) తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. అక్కడున్న భక్తులు ఈ భోజనాలు తిన్న వెంటనే అనారోగ్యానికి  గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో పాటు కొందరు స్పృహ కోల్పోయారు. వెంటనే వీరందర్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గుర్ని హుటాహుటిన అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అయితే ఇంట్లో ఈ ప్రసాదాలను తిన్న వారెవరూ అస్వస్థతకు గురికాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి గురుద్వారాకు తీసుకెళ్లిన ఆహారంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Friday, July 3, 2020

Corona cases gone up to 18,750 in Telangana

ప్రగతి భవన్ లోనూ కరోనా కలకలం!
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది. ఈరోజు వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 275కి చేరుకుంది. ఇదిలావుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ ను సైతం మహమ్మారి వణికిస్తోందని సమాచారం. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా సోకి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గం గజ్వేల్ ఫామ్ హౌస్ కు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగురోజులుగా ఆయన అక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడ్డంతోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం అక్కడ నుంచి దూరంగా వచ్చి విధుల్లో పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మరోవైపు రాజధాని హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ పరిధి)లో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో మరోసారి లాక్ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మందు కాదని భావించే ప్రభుత్వం పునరాలోచించినట్లు తెలుస్తోంది.