Thursday, April 25, 2019

parag archer take rr to winning side ipl season 12


రాజస్థాన్ చేతిలో కోల్ కతా చిత్తు
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన ఐపీఎల్ సీజన్12 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్(ఆర్.ఆర్) పట్టుదలగా ఆడి విజయాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన ఆర్ ఆర్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోలకతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ దినేశ్ కార్తిక్ (50 బంతుల్లో 9x6, 7x4) మాత్రమే రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జట్టులో తర్వాత నితీశ్ రాణా (21) చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్ ఆర్ జట్టు ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలుపునందుకుంది. టోర్నీలో ప్లేఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఆర్.ఆర్. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టుకు ఇది నాల్గో విజయం. అజింక రహానే ఈ మ్యాచ్ లోనూ దూకుడుగా ఆడాడు. ఒక సిక్స్, అయిదు బౌండరీలతో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. సంజు శ్యామ్ సన్ (22) అండగా నిలవడంతో 5.2 ఓవర్లలోనే ఓపెనర్లు 53 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశారు. రహానే అవుటయ్యాక 63 పరుగుల వద్ద శ్యామ్ సన్ వికెట్ ను జట్టు వెంటనే కోల్పోయింది. గెలుపు దోబూచులాడిన సమయంలో అయిదో బ్యాట్స్ మన్ గా వచ్చిన రియాన్ పరాగ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. విలువైన 47 పరుగులు చేసిన పరాగ్ 19 ఓవర్లో రస్సెల్ బౌలింగ్ లో హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అప్పటికే ఆ ఓవర్లో సిక్సర్ సాధించడంతో ఆర్.ఆర్. జట్టు సురక్షితమైన స్థానంలోకి వచ్చింది. చివర్లో ఆర్చర్ (27) మురిపించాడు. ప్రదీప్ కృష్ణ బౌలింగ్ లో వరుసగా బౌండరీ, సిక్సర్ సాధించి కావాల్సిన 9 పరుగుల్ని రెండు బంతుల్లోనే సాధించి జట్టును విజయం ముంగిట నిలిపాడు. కేకేఆర్ జట్టుకు ఇది ఏడో ఓటమి.

pm narendra modi arrives at dashashwamedh ghat for ganga aarti


వారణాసిలో మోదీ రోడ్ షో ధూంధాం
ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్26) ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ఒకరోజు ముందు అట్టహాసంగా గురువారం ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ రోడ్ షోకు పెద్దసంఖ్యలో జనం హాజరయ్యారు. మోదీ.. మోదీ.. అంటూ పలుచోట్ల నినాదాలు మిన్నంటాయి. ఆయన వెంట ఎన్డీయే నాయకులు, బీజేపీ నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  బీజేపీ  అధ్యక్షుడు అమిత్ షా, పియూష్ గోయల్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర పార్టీ అగ్ర నాయకులతో పాటు, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, బిహార్ సీఎం నితిశ్ కుమార్, లోక్ జన్ శక్తి అగ్రనేత రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు రోడ్ షో లో మోదీ వెంట ఉన్నారు. అనంతరం మోదీ దశాశ్వమేథ్ ఘాట్ వద్ద గంగా హారతికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ రాయ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి బరిలో నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ గురువారం తమ అభ్యర్థిగా అజయ్ రాయ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. 2014లోనూ రాయ్ వారణాసి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడో స్థానంలో 75,614 ఓట్లు సాధించారు. మోదీ రికార్డు స్థాయిలో 5,81,022 ఓట్లు పొందగా ఆయనకు పోటీగా నిలిచిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్  2,09,238 ఓట్లతో రెండో స్థానాన్ని పొందారు.


william receives traditional maori greeting from new zealand pm jacinda ardern


న్యూజిలాండ్ ప్రధానికి బ్రిటన్ రాకుమారుడు శుభాకాంక్షలు

బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్ గురువారం (ఏప్రిల్25) న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లారు. ఆక్లాండ్లో ప్రధాని జకిండా అర్డెర్న్ తదితరులు విలియమ్స్ కు ఘన స్వాగతం పలికారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ తరఫున సంప్రదాయ మావోరి (ముక్కు- ముక్కు రాసుకునే పండుగ) శుభాకాంక్షల్ని ప్రధాని అర్డెర్న్ కు విలియమ్స్ తెలియజేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా విలియమ్స్ అంజక్ డే(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ యుద్ధ వీరులు, శాంతికాముకుల స్మారక దినోత్సవం) వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో విలియమ్స్ స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. కార్యక్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యు.కె. జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ప్రధాని అర్డెర్న్ తో కలిసి విలియమ్స్ పౌర సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెల్లింగ్టన్ లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాణి నిలువెత్తు చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా గత నెలలో క్రైస్ట్ చర్చి మసీదుల్లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడిన వారిని ఆయన ఆసుపత్రులకు వెళ్లి పరామర్శంచనున్నారు. క్రైస్ట్ చర్చి దాడుల్లో 50 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడంలో బ్రిటన్, న్యూజిలాండ్ చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని ప్రధాని అర్డెర్న్ పేర్కొన్నారు.

rupee tumbles 22 paise against dollar on crude concerns


రూపాయి 22 పైసల పతనం 70.08 డాలర్ తో మారకం
భారత్ రూపాయి తాజాగా గురువారం(ఏప్రిల్25) 22 పైసలు పతనమైంది. ఫారెక్స్ (ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్) మార్కెట్ ప్రకారం డాలర్ తో మారకంలో 70.08 పలుకుతోంది. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ కు డిమాండ్ రావడం ఇందుకు కారణం.  బుధవారం కూడా రూపాయి 24 పైసలు పతనమై డాలర్ తో మారకంలో 69.86 వద్ద నిలిచింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ద్రవ్యోల్బణమూ రూపాయి పతనానికి కారణంగా భావిస్తున్నారు. ఇలాగే ముడి చమురు ధరలు పెరుగుదల కొనసాగితే ఆ ప్రభావం ఆయా దేశాల కరెన్సీ విలువలు మరింత దిగజారే ప్రమాదముంది.