Wednesday, July 31, 2019

PM Khan orders roll back of roti, naan prices across Pakistan


పాకిస్థాన్ లో నాన్, రోటీల ధరలు తగ్గించాలని ఇమ్రాన్ ఆదేశం
పాకిస్థాన్ లో గ్యాస్, గోధుమ పిండిలపై సుంకాలు తగ్గించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గం సమన్వయ సమావేశంలో పాల్గొన్న ప్రధాని బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నాన్, రోటీ ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశాలిచ్చారు. మునుపటి మాదిరిగా పేదలతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా నాన్, రోటీ ధరలు తగ్గించాలన్నారు. గతంలో పాకిస్థాన్ లో నాన్ ధర రూ.8-10 ఉండగా రోటీ రూ.7-8 కు లభించేది. అయితే గ్యాస్, గోధుమ పిండిలపై పన్నులు పెంచడం వల్ల నాన్, రోటీ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం నాన్ ధర రూ.12-15, రోటీ ధర రూ. 10-12కు పెరిగిపోయింది. తక్షణం ఇదివరకటి ధరలకు నాన్, రోటీల ధరలు తగ్గాలని ఇమ్రాన్ హుకుం జారీ చేశారు.

Tuesday, July 30, 2019

Triple talaq bill passed by Parliament


ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర
దేశంలో వివాహిత ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ బిల్లు ఆమోదాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ లోనూ గట్టెక్కింది. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ప్రవేశపెట్టారు. ఎస్.పి, బీఎస్పీలు సభకు హాజరుకాలేదు. ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. సభ నుంచి వాకౌట్ చేసింది. కూటమి మిత్ర పక్షం జేడీయూ కూడా వాకౌట్ చేయడం గమనార్హం. వై.ఎస్.ఆర్.సి.పి, టి.ఆర్.ఎస్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనలేదు. బిల్లుకు అనుకూలంగా 99 మంది ఎంపీలు ఓటేయగా 84 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. దాంతో రాజ్యసభ లోనూ బిల్లు ఆమోదం పొందగల్గింది. ఎగువ సభలో మోదీ ప్రభుత్వానికి వాస్తవంగా 107 మంది ఎంపీల బలముంది. బిల్లు ఆమోదానికి 121 ఓట్లు అవసరం. ఎస్.పి, బీఎస్పీ సభ్యులు సభకు హాజరుకాకపోవడం, టి.ఆర్.ఎస్, వై.ఎస్.ఆర్.సి.పి. సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకపోవడంతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు కు రాజ్యసభ లో కూడా ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం పొందాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి అమలులో ఉన్న ట్రిపుల్ తలాఖ్ ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు చట్టరూపాన్ని దాల్చి అమలులోకి రానుంది.

Monday, July 29, 2019

Financier 'kidnapped and freed' after paying Rs 1 crore in hyderabad


రూ.కోటి తీసుకొని ఫైనాన్షియర్ని విడిచిపెట్టిన కిడ్నాపర్లు

హైదరాబాద్ లో కిడ్నాపర్ల ముఠా రూ.కోటి వసూలు చేసి ఓ ఫైనాన్షియర్ ను సోమవారం విడుదల చేసింది. ఆదివారం రాత్రి దోమలగూడ లో గజేంద్ర ప్రసాద్ అనే ఫైనాన్షియర్ ను ఓ ముఠా కిడ్నాప్ చేసింది. అతని కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే గజేంద్రను విడిచిపెడతామని హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు రూ.కోటి చెల్లించడంతో ముఠా అతణ్ని అబిడ్స్ లో వదిలి పరారయింది. ఈ మేరకు గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గజేంద్ర తనకు ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో లావాదేవీల్లో వివాదమున్నట్లు తెలిపారు. గత రాత్రి తనను అపహరించిన కిడ్నాపర్లు తర్వాత నిర్భందించి దాడి చేశారన్నారు. గజేంద్ర ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. మొహం కూడా కమిలిపోయింది. కిడ్నాపర్లు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుండగా రూ.5 లేదా 10 లక్షలు ఇస్తానని చెప్పగా తనను వాళ్లు తీవ్రంగా కొట్టారన్నారు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని వదిలివేయాలని కోరినా కనికరించలేదని చెప్పారు. తప్పక రూ.కోటి ఇస్తానని చెప్పడంతో అంగీకరించి తనను విడుదల చేశారని గజేంద్ర పోలీసులకు వివరించారు. తన స్నేహితుడు ఆ మొత్తాన్ని కారులో తీసుకొని వచ్చి సమీపంలోని ఓ స్కూల్ వద్ద పార్క్ చేశారన్నారు. అనంతరం ఆ డబ్బును ముఠాలోని ఇద్దరు సభ్యులు వెళ్లి తీసుకుని వచ్చారన్నారు. ఆ తర్వాతే నిర్బంధ ప్రాంతం నుంచి తనను కిడ్నాపర్లు అబిడ్స్ కు తరలించి పరారయినట్లు తెలిపారు.

Sunday, July 28, 2019

Bachchan 'filled with pride' after successful rescue of Mahalaxmi Express passengers


మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన బృందాలకు అమితాబ్ అభినందనలు
మహారాష్ట్రలో ఇటీవల జలదిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణికుల్ని రక్షించిన సహాయక రక్షణ బృందాల్ని ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. శనివారం థానే జిల్లా సమీపంలోని వంగణీ ప్రాంతంలో ఈ రైలు వరద నీటిలో చిక్కుబడి 1050 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. వారందరూ సుమారు 17 గంట పాటు రైల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. సమాచారం అందుకున్న సహాయక రక్షణ బృందాలు, భారత సైన్యం రంగంలోకి దిగి గంటల తరబడి శ్రమించి ప్రయాణికులందర్ని సురక్షితంగా వరద నీటి నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. స్పందించిన బిగ్ బి , "ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అభినందనలు .. వారు మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 700 మంది ప్రయాణికులను విజయవంతంగా రక్షించారు! ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైల్వే, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కు ధన్యవాదాలు, మీరు చాలా గొప్ప కార్యం నిర్వర్తించారు .. ఇది సాహసోపేతమైన , విజయవంతమైన కార్యక్రమం. నేను ఎంతో గర్వ పడుతున్నాను. జై హింద్! అని ట్వీట్ చేశారు. ప్రాణాల కోసం పోరాడుతున్న ప్రయాణికుల్ని ప్రాణాలొడ్డి రక్షించడానికి చేపట్టిన విజయవంతమైన సహాయక చర్య ఆయనను ఎంతగానో కదిలించింది. దాంతో ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వారందర్ని అమితాబ్ ప్రశంసలతో ముంచెత్తారు.

Saturday, July 27, 2019

All 1,050 passengers of stranded Mahalaxmi Express rescued:Railways


ఈ నీళ్ల పైన రైలుంది
·       ముంబయిలో పోటెత్తిన వరదలు
·       మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి 1050 మంది ప్రయాణికుల తరలింపు
కుంభవృష్టి తాజాగా మహారాష్ట్రలోని ముంబయి, థానేల్ని అతలాకుతలం చేసింది. ఉల్హాస్ నది పోటెత్తడంతో సెంట్రల్ రైల్వే జోన్ లోని రైల్వే ట్రాక్ లు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం రాత్రి ముంబయి నుంచి కోల్హాపూర్ బయలుదేరిన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వరదల తాకిడికి ముంపునకు గురై నిలిచిపోయింది. బద్లా పూర్, వంగణి రైల్వే స్టేషన్ల మధ్యమార్గంలో రైలు వరద పోటెత్తి ప్రవహించడంతో జలదిగ్బంధనానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న 1050 మంది రైల్లోనే చిక్కుబడిపోయారు. వారందర్ని శనివారం మధ్యాహ్నం సహాయ రక్షణ బృందాలు సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి. మొత్తం ప్రయాణికులందర్ని వారు చేరుకోవాల్సిన గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో మరో రైలులో తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి కుండపోత వర్షానికి వరద పోటెత్తడంతో మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తున్న రైల్వే ట్రాక్ ముంపునకు గురైంది. గంటల కొద్దీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణికులు కాలం గడిపారు. శనివారం ఉదయానికే సహాయ రక్షణ బృందాలు రైలు జలదిగ్బంధానికి గురైన ప్రాంతానికి చేరుకున్నాయి. భారత నేవీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తూ వీరికి సహకరించారు. సహాయ రక్షణ చర్యలు చేపట్టిన సెంట్రల్ రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్), జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)  ప్రయాణికులందరి ప్రాణాలు కాపాడాయి. లైఫ్ జాకెట్లు, బోట్ల తో భారత నేవీ బృందం కూడా వరదల్లో దిగ్బంధనానికి గురైన మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ వద్దకు చేరుకుని ప్రయాణికుల్ని సురక్షితంగా తీరానికి చేర్చడానికి సహకరించింది. వెలుపలికి తీసుకువచ్చిన ప్రయాణికుల్ని తొలుత బద్లాపూర్ లోని కన్వెన్షన్ హాల్ కు తరలించారు. వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుల్లో కొందర్ని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ రైల్వే సిబ్బంది ప్రయాణికులంతా తేరుకున్నాక వారి గమ్య స్థానం కోల్హాపూర్ కు వేరే మార్గంలో ప్రత్యేక రైలులో తరలించే ఏర్పాట్లు పూర్తి చేసింది.


Friday, July 26, 2019

Rahul priyanka pay tribute to kargil war heroes


కార్గిల్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్ ప్రియాంక
20వ విజయ్ దివస్ సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. కార్గిల్ లో పాకిస్థాన్ చొరబాటుదారులపై భారత్ సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై26న విజయ దివస్ ను ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలోఅసువులు బాసిన వీర జవాన్లకు రాహుల్, ప్రియాంక శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు ఆ వీర జవాన్లని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు పణంగా పెట్టిన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అదే విధంగా దేశ రక్షణలో నిరంతరం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మహిళా, పురుష జవాన్లకు వందనాలంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
చొరబాటుదారుల పీచమణచిన భారత సైన్యం
సైన్యం నాటి విజయ క్షణాల్ని స్మరించుకుంటూ నూతనోత్తేజంతో సవాళ్లను ఎదుర్కొనేందుకు `విజయ్ దివస్` ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. 1999 జులై 26 న కార్గిల్ లో చిట్టచివరి చోరబాటుదారుణ్ని మట్టుబెట్టాక భారత సైన్యం విజయగర్వంతో జాతీయ పతాకను కార్గిల్ లో ఎగురవేసింది. మే 3న పాక్ ముష్కరుల చొరబాటును గుర్తించిన దగ్గర నుంచి జులై 26 వరకు `ఆపరేషన్ విజయ్` చేపట్టిన భారత్ సైన్యం (వైమానిక దళం ప్రధాన భూమిక పోషించింది) ఎడతెగని పోరాటం చేసి కార్గిల్ భూభాగాన్ని కాపాడింది. `టోలింగ్` శిఖరాన్ని రాజ్ పుతానా రైఫిల్స్-2 స్వాధీనం చేసుకోగా, జమ్ముకశ్మీర్ రైఫిల్స్-13 `పాయింట్ 4875(బాత్రా టాప్)`ను భారత్ వశం చేసింది. `ఖలుబార్` శిఖరాన్ని 1/9  గూర్ఖా రైఫిల్స్ స్వాధీనం చేసుకుని జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అదేవిధంగా టైగర్ హిల్, జుబర్, కుకర్ థాంగ్ శిఖరాలపై ఐఏఎఫ్ యుద్ధ విమానాలు మిగ్-21 మిగ్-27 మిరాజ్- 2000లు లేజర్ గైడెడ్ బాంబుల్ని ప్రయోగించి పాక్ చొరబాటుదారుల బంకర్లను భస్మీపటలం చేశాయి.

Thursday, July 25, 2019

Nalini released from vellore prison on parole


వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలైన నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురిలో ఒకరైన నళిని గురువారం వెల్లూర్ జైలు నుంచి పెరోల్ పై విడుదలయింది. కూతురు పెళ్లి ఏర్పాట్లు నిర్వహించుకునేందుకు ఆమెకు నెలరోజుల పెరోల్ లభించింది. ఈ మేరకు నళిని జులై5న అభ్యర్థించింది. మన్నించిన మద్రాస్ హైకోర్టు 30 రోజుల సాధారణ సెలవు మంజూరు చేసింది. నళినిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు నుంచి ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. వెల్లూర్ సాతువాచారి గ్రామం నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో రంగాపురం తరలించారు. నళిని కూతురు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కలవరాదు..మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదనే షరతుపై నళినికి పెరోల్ మంజూరయింది. అయితే ఆమె తన కూతురు పెళ్లి ఏర్పాట్లకుగాను ఆరు నెలలపాటు పెరోల్ కోరింది. ప్రభుత్వం కేవలం నెల రోజులు మాత్రమే సాధారణ సెలవులు ఇవ్వగలమని తేల్చి చెప్పింది. 30 రోజుల సమయం పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ఏమాత్రం సరిపోదని నళిని వాదించినా ఫలితం లేకపోయింది. నళిని, మురగన్ (జీవిత ఖైదీ) లు జీవితఖైదు అనుభవిస్తుండగా వెల్లూర్ జైలులోనే కూతురు జన్మించింది. 28 ఏళ్లగా తామిద్దరం జైలులోనే గడుపుతున్నామని తల్లిదండ్రులుగా తమ కూతురు ఆలానాపాలనకు కూడా నోచుకోలేకపోయామని నళిని ఆవేదన వ్యక్తం చేసింది.

Wednesday, July 24, 2019

BJP MLA demands resignation of Karnataka legislative assembly speaker following fall of coalition government


కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కర్ణాటక విధానసభ స్పీకర్ కె.రమేశ్ కుమార్ (కాంగ్రెస్) రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రేణుకాచార్య బుధవారం డిమాండ్ చేశారు. కుమారస్వామి ప్రభుత్వ పతనంతో రాష్ట్ర ప్రజల అభీష్టం నెరవేరిందని వారి ఆకాంక్షల ప్రకారం బీజేపీ పాలన కొనసాగుతుందని రేణుకాచార్య పేర్కొన్నారు.  కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం విశ్వాస తీర్మానం వీగి పోవడంతో 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. 
కుమారస్వామికి రెండో సారి ముఖ్యమంత్రి పదవి అర్ధాంతరంగా పోయింది. తొలుత 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబర్ 9 వరకు సీఎంగా ఆయన బీజేపీ తో కూడిన జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ కు సారథ్యం వహించారు. బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. మళ్లీ దశాబ్దం తర్వాత రెండోసారి 2018లో ఊహించని వరంలా కాంగ్రెస్ తో జట్టుకట్టి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు. 23 మే 2018 నుంచి ఆయన 23 జులై 2019 వరకు సీఎంగా పదవిలో ఉన్నారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జనతాదళ్(ఎస్) ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శాసనసభ్యత్వాలకు రాజీనామా సమర్పించడంతో రగడ మొదలైంది. తాజాగా శాసనసభలో బలం నిరూపించుకోలేక ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కుమారస్వామి తండ్రి మాజీ ప్రధాని దేెవెగౌడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వల్పకాలమే పనిచేశారు. కేంద్రంలో నాడు సంకీర్ణ కూటమికి ప్రధానిగా ఆయన నేతృత్వం వహించాల్సి రావడంతో కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేశారు. 1994 డిసెంబర్ నుంచి 1996 మే వరకు ఆయన రాష్ట్ర సారథ్య బాధ్యతలు వహించారు.

Tuesday, July 23, 2019

UP revenue official suspended for 'calling names' to PM


ప్రధాని మోదీని తిట్టి సస్పెండయిన యూపీ రెవెన్యూ అధికారి
ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన ఉత్తరప్రదేశ్ రెవెన్యూ అధికారి ఒకరిపై సస్పెన్షన్ వేటుపడింది. కిసాన్ సమ్మాన్ నిధి పింఛను ఇప్పించాలని కోరిన ఓ రైతుపై సదరు అధికారి బూతులతో రెచ్చిపోయాడు. అక్కడితో ఆగకుండా దేశ ప్రధాని మోదీ పైన తిట్ల దండకం అందుకున్నాడు. ఇదంతా పక్కన ఎవరో మొబైల్ లో వీడియో రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారమంతా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. కోర్టు మెట్లు ఎక్కింది. విచారణ నిర్వహించిన బద్వాన్ జిల్లా మేజిస్ట్రేట్ దినేశ్ కుమార్ సాక్ష్యాధారాల్ని పరిశీలించిన మీదట మంగళవారం సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. 
లేఖ్ పాల్ సింగ్ అనే రైతు పింఛన్ అందడం లేదని రెవెన్యూ అధికారి శివ సింగ్ వద్దకు వచ్చాడు. తనకిచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి పింఛన్ ధ్రువపత్రంలో తప్పులున్న విషయం ఆయన దృష్టికి తెచ్చాడు. అందువల్లే తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి సరిచేయాలని కోరాడు. అందుకు ఆ అధికారి సహకరించకపోగా తాత్సారం చేస్తున్నాడు. విసిగిపోయిన రైతు లేఖ్ పాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇస్తానని రెవెన్యూ అధికారిని హెచ్చరించాడు. దాంతో శివాలెత్తిన అధికారి శివ సింగ్ ఆ రైతుపై బూతుపంచాగం విప్పాడు. ఆ కోపోద్రేకంలో ప్రధాని మోదీని దుర్భాషలాడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నాడు.


Monday, July 22, 2019

`Train 18` trial run from delhi to katra conducted successfully


ఢిల్లీ-కత్రా మధ్య `వందే భారత్` రైలు ట్రయల్ రన్
భారత్ బుల్లెట్ ట్రైన్ (ట్రైన్-18) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య సోమవారం ట్రయల్ రన్ ప్రారంభించింది. ఈ రైలు జమ్ము తావీ స్టేషన్ కు ఈ మధ్యాహ్నం 12.45కు చేరింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ వందే భారత్ రైలు వయా జమ్ము తావీ రైల్వేస్టేషన్ మీదుగా కత్రా చేరుకుంటుంది. ఢిల్లీ-కత్రాల మధ్య దూరం 640 కిలోమీటర్లు. రాజధాని, శతాబ్ది, ఘటిమాన్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లతో సహా ఈ దూరాన్ని చేరుకోవడానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఈ సూపర్ ఫాస్ట్ లన్నీ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వాటికన్నా మించిన వేగంతో వందే భారత్  చైర్ కార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తూ ఢిల్లీ నుంచి కత్రాకు ఏడు గంటల్లోనే చేరుతుంది. ఢిల్లీ-వారణాసిల మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి14న ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ-కత్రా కు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జమ్ముతో పాటు మరో మూడు ప్రధాన నగరాలకు ఈ వందే భారత్ ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీ-జమ్ము-కత్రా, ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్ కతాలకు వందే భారత్ ను త్వరలో ప్రారంభించేందుకు యోచిస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఇంజిన్ లేని తొలి భారతీయ రైలైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపకల్పన చేసింది. ఢిల్లీ-వారణాసి మధ్య ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. ఈ రైలులో 1128 మంది ప్రయాణించొచ్చు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తయారీకయిన వ్యయం రూ.60 కోట్లు. యూరప్ నుంచి ఈ తరహా రైలు దిగుమతి చేసుకోవాలంటే రూ.100 కోట్లు వ్యయం అవుతుంది.

Sunday, July 21, 2019

UP CM Adityanath meets affected families in Sonbhadra


సోన్ భద్ర లో వరాల జల్లు కురిపించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ (యూపీ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోన్ భద్ర జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఇటీవల ఈ జిల్లాలోని ఉంభా గ్రామంలో రెండు వర్గాల భూతగాదాల్లో కాల్పులు చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను సీఎం యోగి పరామర్శించారు. ఒక్కో మృతుని కుటుంబానికి ఆయన రూ.18 లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2.5 లక్షల సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కాల్పులకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని సీఎం చెప్పారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ బాధిత కుటుంబాల్లోని వృద్ధులకు పింఛను అందిస్తామని చెప్పారు. ఉంభా గ్రామంలో అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. వసతి గృహంతో కూడిన పాఠశాలను నిర్మిస్తామని, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్లను కూడా నెలకొల్పనున్నామని సీఎం యోగి ప్రకటించారు. దశాబ్దాలకు తరబడి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, వారి భూముల జోలికి ఇకపై ఎవరూ రాకుండా చూసుకుంటామని సీఎం ఉంభా గ్రామస్థులకి అభయం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఉంభా చేరుకున్న ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర డీజీపీ, సీఎస్ ఉన్నారు. 
ప్రియాంక ప్రభావంతోనే..సీఎం ఆఘమేఘాల పర్యటన
ఈనెల 17న ఈ ఘోర కలి జరగ్గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ రెండ్రోజుల వ్యవధిలోనే యూపీ చేరుకున్నారు. సోన్ భద్రకు ఆమె పయనం కాగానే అడ్డుకుని యోగి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం ప్రియాంకను చునూర్ ప్రభుత్వ అతిథి గృహానికి తరలించి విద్యుత్, నీళ్లు లేకుండా వేధించింది. అయినా ఆమె బాధితుల్ని పరామర్శించేవరకు ఢిల్లీ వెనుదిరిగేది లేదని అక్కడే భీష్మించారు. దాంతో తప్పనిసరై కేవలం ఇద్దరు బాధితుల్ని మాత్రమే ప్రియాంక ఉన్న అతిథి గృహానికి అనుమతించింది. అక్కడే ఆమె బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ మళ్లీ ఇంకోసారి తప్పక సోన్ భద్రకు వస్తానని హామీ ఇచ్చి ఢిల్లీ తిరుగుప్రయాణమయ్యారు.. ప్రియాంక పర్యటన ప్రభావం వల్లే సీఎం యోగి రాజకీయ కోణంలో  ఆఘమేఘాల మీద బాధితుల పరామర్శకు బయలుదేరారని పరిశీలకులు భావిస్తున్నారు.


Saturday, July 20, 2019

Sindhu reaches first final of year beating chen yufei in semis


ఇండోనేసియా ఓపెన్ ఫైనల్స్ చేరిన స్టార్ షట్లర్ సింధు
భారత స్టార్ షట్లర్ సింధు ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో ఆదివారం ఆమె చిరకాల ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఫోర్త్ సీడ్ అకానె యమగూచితో తలపడనుంది.  సింధు ఈ ఏడాది ఫైనల్స్ కు చేరడం ఇదే ప్రథమం. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ లో ఆమె సెకండ్ సీడ్ చైనా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చెన్ యు ఫై 21-19 21-10 గేమ్ ల తేడాతో ఓడించింది. సింధు తనదైన శైలిలో శక్తివంతమైన స్మాష్ లు, నెట్ దగ్గర అమోఘమైన డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సింధు చురుకైన ఆటతీరుకు చెన్ యు వద్ద సమాధానమే లేకపోయింది. అయితే తొలిగేమ్ మొదట్లో చెన్ దూకుడు కనబరచగా సింధు నెమ్మదిగా ఆట కొనసాగించింది. చెన్ 18-14 తో ముందంజలో ఉండగా సింధు పుంజుకుని వరుసగా నాల్గు పాయింట్లు సాధించి 18-18 తో సమఉజ్జీగా నిలిచింది. ఈ గేమ్ ను ప్రత్యర్థి చెన్ గెలుచుకోకుండా చాలా సేపు సింధు నిలువరించగల్గింది. గేమ్ పాయింట్ వద్ద నుంచి సింధు ఆటపై పట్టుకోల్పోకుండా కొనసాగించింది. ఆ తర్వాత సింధు ఆటలో వేగం పెంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. స్మాష్ లు, డ్రాప్ షాట్లతో పాయింట్లను గెలుచుకుంది. తొలి గేమ్ ను 21-19తో సొంతం చేసుకుంది. నివ్వెరపాటు నుంచి తేరుకున్న చెన్ తొలిగేమ్ లో మాదిరిగానే రెండో గేమ్ లోనూ తనదైన రీతిలో చెలరేగి వరుసగా 4 పాయింట్లను సాధించి 4-0 తో సింధుపై ఆధిపత్యాన్ని కనబర్చింది. ఆటపై ఏకాగ్రత కోల్పోకుండా పట్టుదలగా ఆడిన సింధు డిఫెన్సివ్ ప్లేతో చెన్ ఆట లయను దెబ్బతీసింది. సింధు ఎత్తుగడ ఫలించి చెన్ చాలా అనవసరమైన తప్పిదాలు చేసింది. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా ఆటపై పట్టు కనబరస్తూ సింధు 21-10 తేడాతో గేమ్ ను మ్యాచ్ ని గెలుచుకుని ఫైనల్ లో అడుగుపెట్టింది.  


Friday, July 19, 2019

Tiger Found Resting On A Bed In A Shop In Assam


పాపం ఆ పులి అలసిపోయి.. ఓ ఇంట్లో మంచమెక్కి నిద్రపోయింది
పులి జనారణ్యంలోకి వచ్చేసింది. ఎంతగా అలసిపోయిందో ఏమో ఓ ఇంట్లోకి దూరి మంచమెక్కి మరీ అదమరచి హాయిగా నిద్రలోకి జారిపోయింది. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 సమయంలో అసోం లోని నాగోన్ జిల్లా బగొరీలో జరిగింది. అసోం తో పాటు ఈశాన్య భారతంలో ఇటీవల ఎడతెగని వర్షాలకు వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక్కడకు సమీపంలో 2 కిలో మీటర్ల దూరంలోనే కజిరంగ జాతీయ అభయారణ్యం ఉంది. వర్షాలతో పోటెత్తిన వరదలకు వన్య ప్రాణులన్నీ చెల్లాచెదురైపోయాయి. వీటిలో చాలా జంతువులు చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. అలా వరదల్లో చిక్కుకుని ప్రాణాలు దక్కించుకున్న రాయల్ బెంగాల్ టైగ్రస్(ఆడ పులి) అనుకోని అతిథిలా ఇలా ఓ ఇంట్లోకి వచ్చి సేద తీరింది. రాయల్ బెంగాల్ పులులు ఈతలో నేర్పరులన్న సంగతి తెలిసిందే. ఇవి కిలోమీటర్ల కొద్దీ అలసిపోకుండా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంటాయి. ప్రపంచంలో అతి పెద్దవైన సుందర్బన్ (మాంగ్రూవ్స్) మడ అడవుల్లో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అటు పశ్చిమబెంగాల్, ఇటు బంగ్లాదేశ్ లో విస్తరించిన సుందర్ బన్ మడ అడవుల్లో  ఎక్కువగా గల రాయల్ బెంగాల్ పులులు రాత్రి వేళల్లో ఆహారం కోసం నదుల గుండా ఈదుతూ వేట కొనసాగిస్తుంటాయి. కానీ అసోం లోని బగోరిలో గల మోతీలాల్ ఇంటికి ఆహ్వానం లేని అతిథిలా జొరబడి అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. మోతీలాల్ ఇల్లు, షాప్ పక్కపక్కనే ఉంటాయి. ఆ ప్రాంగణంలోకి ఉదయాన్నే పులి దర్జాగా నడుచుకు వస్తుంటే చుట్టుపక్కల జనం కేకలు వేశారు. అప్పటికి పులి..మోతీలాల్ కు కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. బిక్కచచ్చిపోయిన మోతీలాల్ ను ఆ పులి ఏమీ చేయకుండా నేరుగా ఇంట్లోకి దూరి ఓ గదిలో గల మంచంపైకెక్కి నిద్రపోయింది. దాదాపు 10 గంటలు మోతీలాల్ ఇంట్లోనే పులి తనవితీరా సేద తీరింది. మోతీలాల్ కుటుంబ సభ్యుల్ని భద్రంగా ఆ ఇంటి నుంచి వేరో ఇంటికి తరలించారు. అప్పటి వరకు ఆ పులికి నిద్రా భంగం కల్గించకుండా వన్యప్రాణి సంరక్షణ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ను సైతం క్రమబద్ధీకరించారు. అదే విధంగా జనానికి ఎటువంటి హాని జరగకుండా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 సమయంలో నిద్ర లేచిన పులి హైవే గుండా సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయేలా చర్యలు తీసుకున్నామని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యు.టి.ఐ) అధికారి రతిన్ బ్రహ్మన్ తెలిపారు.

Thursday, July 18, 2019

Imran Khan plans rally like modi`s style infront of president trumph in US tour


మోదీ ర్యాలీ తరహాలో ట్రంప్ ను ఆకట్టుకోవాలనుకుంటున్న ఇమ్రాన్ ఖాన్

అగ్ర రాజ్యం అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పాక్ తో అమెరికా సంబంధాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ట్రంప్ హయాంలోనూ ఇరు దేశాల మధ్య  సంబంధాలు మెరుగుపడలేదు. ఉగ్రవాద మూలాల పాకిస్థాన్ లో అంతకంతకూ వేళ్లూనుకున్న నేపథ్యంలో ఆ దేశాన్ని అమెరికా దూరం పెట్టింది. దాంతో ముంబయి   బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయిీద్ (జె.యు.డి. చీఫ్)ను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ తమ సరిహద్దుల గగన తలంలో భారత్ విమానాల రాకపోకలకు ఆంక్షల్ని తొలగిస్తూ భారత్ తో పాటు అమెరికాను ఏకకాలంలో ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసింది. అమెరికా, పాక్ మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఇమ్రాన్ నడుం బిగించారు. అందులో భాగంగానే నెల 22న ఆయన  అమెరికాలో పర్యటించనున్నారు. వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో భేటీ కానున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా ట్రంప్ దృష్టిలో పడాలని ఇమ్రాన్ ఉబలాటపడుతున్నారు. మోదీ ర్యాలీ తరహాలో ఈ ర్యాలీ ఉండాలని కోరుకుంటున్నారు. భారత్ నాయకుల ర్యాలీలు అమెరికాలో గతంలో అనేకసార్లు నిర్వహించారు. కానీ పాక్ నాయకుడి ర్యాలీ ఏర్పాటు కాబోవడం ఇదే ప్రథమం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ రాజధాని వాషింగ్టన్ డీసీలోని చైనాటౌన్ లో నిర్వహించతలపెట్టిన ఈ ర్యాలీ సందర్భంగా ఆయన అనుకూల వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు జోరందుకోనున్నాయి.  అమెరికాలో పాకిస్థాన్ కు చెందిన పౌరులు దాదాపు అయిదు లక్షల మంది ఉంటారని అంచనా.  తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి వ్యతిరేకంగా ముజాహిర్లు, బలోచిస్థానీయులు, భుట్టో-జర్దారీ లకు చెందిన పీపీపీ అనుకూలురు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిమానులు ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జులై 23న యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్ (యూఎస్ఐపీ) ఆహ్వానంపై ఆ సంస్థ నిర్వహిస్తున్నమేధోమథనం కార్యక్రమంలో ఇమ్రాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 



Wednesday, July 17, 2019

ICJ asks Pakistan to hold death sentence of kulbhushan jadhav, calls for fair trial


కులభూషణ్ జాదవ్ ఉరి నిలిపివేయాలని పాకిస్థాన్ కు ఐసీజే ఆదేశం
పాకిస్థాన్ చెరలో మగ్గుతున్న భారత మాజీ నేవీ కమాండర్ కులభూషణ్ జాదవ్ కు ఆ దేశ న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు విధించిన ఉరిశిక్షను నిలిపివేసి నిష్పక్షపాత న్యాయవిచారణ చేపట్టాలని పాకిస్థాన్ కు సూచించింది. ఐసీజేలో 15:1 నిష్పత్తిలో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) విభాగమైన ఐసీజే 1945లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ఏర్పాటయింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ లోని హేగ్ లో అంతర్జాతీయ న్యాయ విచారణలు నిర్వహిస్తోంది. 
 తమ దేశంలో గూఢచర్యం నిర్వహించి కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలతో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆయనను నిర్బంధించింది. వాస్తవానికి ఆయనను ఇరాన్ లో నిర్బంధించిన పాకిస్థాన్ నిఘా అధికారులు తమ దేశానికి తరలించారని భారత్ వాదిస్తోంది. 2003 నుంచి 2016 వరకు నేవీ కమాండర్ గా విధులు నిర్వర్తించిన కులభూషణ్ పదవీ విరమణ చేశారు. ఆయన వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 10 ఏప్రిల్ 2017న ఇరాన్ వెళ్లిన సందర్భంగా అక్కడ పట్టుకుని పాకిస్థాన్ కు అపహరించుకు వెళ్లారు. కులభూషణ్ భారత రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ తరఫున తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పాక్ ఆయనకు ఉరిశిక్ష విధించింది. భారత్ ఐసీజే దృష్టికి తీసుకెళ్లడంతో పాక్ న్యాయస్థానం తీర్పునకు అడ్డుకట్టపడింది. సుదీర్ఘ విచారణల అనంతరం  ఐసీజే నిష్పాక్షపాత, సమగ్ర విచారణ చేపట్టాలని పాక్ ఉన్నత న్యాయస్థానానికి సూచిస్తూ విధించిన ఉరిశిక్ష తీర్పును సస్పెండ్ చేసింది. 1970 లో మహారాష్ట్రలోని సాంగ్లిలో సుధీర్ జాదవ్, అవంతి జాదవ్ లకు కులభూషణ్ జన్మించారు. కులభూషణ్ కు ఉరిశిక్ష విధిస్తూ పాక్ న్యాయస్థానం విధించిన తీర్పుపై ఐసీజే వేటు వేస్తూ ఇచ్చిన తీర్పు భారత్ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ కేసు విషయంలో పాక్ కు అమెరికా, చైనాలు మద్దతు ఇవ్వడం గమనార్హం.

Tuesday, July 16, 2019

Mischievous Penguins Raid Sushi Bar in newzealand Even After Being Removed by the Police


వెల్లింగ్టన్ వాసుల్ని భయపెట్టిన నీలిరంగు పెంగ్విన్ల జోడి
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో చిట్టి పెంగ్విన్ పక్షుల జోడి కలకలం రేపింది. మంగళవారం ఈ ఘటన స్థానిక సుషి బార్ లో చోటు చేసుకుంది. వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గల ఈ బార్ లో సోమవారం కూడా ఈ పక్షుల జోడిని అక్కడ సిబ్బంది గమనించారు. మళ్లీ మంగళవారం కూడా ఈ పక్షులు బార్ ప్రాంగణంలోని ఓ రూమ్ ఏసీ బాక్స్ వద్ద తచ్చాడాయి. వీటి జాడను గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీటిని పట్టుకుని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో గల హార్బర్ ప్రాంతంలో విడిచిపెట్టారు. అదే ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ నీలి రంగు పెంగ్విన్ పక్షులు తిరుగాడుతుంటాయి. అయితే ఇలా రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో వీటిని చూడ్డం అరుదేనట. ఇంతకీ జనం అంతగా భయాందోళనకు గురి కావడానికి కారణమేంటంటే ఇవి అన్ని పక్షుల్లా మనుషులకు భయపడవు. పైగా ఇవే మనుషులపై దాడి చేస్తాయి. తమ ఉనికికి ఇబ్బందిగా అనిపించినా వీటి ఏకాంత వాసానికి భంగం కల్గినా ఆహారం లభించకపోయినా మనుషులే లక్ష్యంగా సూదంటి ముక్కు, గోళ్లతో మనుషుల్ని గాయపరుస్తుంటాయని అధికారులు తెలిపారు. దాంతో వీటిని క్రూర జంతువుల మాదిరిగా ప్రమాదకర పక్షుల జాబితాలో జనం చేర్చారు. అదీ గాక ఇవి ఒకచోట గూడు ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంత దూరం తీసుకెళ్లి విడిచినా తిరిగి అదే చోటుకి వచ్చి చేరతాయట. దాంతో బార్ సిబ్బంది సత్వరం స్పందించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి వీటి బెడదను వదిలించుకున్నారు. సుషి బార్ సిబ్బంది రేడియో న్యూజిలాండ్ (ఆర్.ఎన్.జి) తో ఈ నీలి పెంగ్విన్ల సమాచారాన్ని పంచుకున్నారు. వీటిని వెల్లింగ్టన్ హార్బర్ ప్ర్రాంతంలో విడిచివచ్చిన పోలీస్ కానిస్టేబుల్ జాన్ జు సోషల్ మీడియా (ఫేస్ బుక్)లో ఈ సమాచారాన్ని పోస్టు చేశాడు. జంతు సంరక్షణ శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్జర్వేషన్-డీఓసీ) కార్యనిర్వహణాధికారి జాక్ మేస్ మాత్రం ఈ పక్షులు మళ్లీ తిరిగి రావచ్చని భావిస్తున్నారు. తొలుత ఈ పెంగ్విన్ల రాకను బార్ సిబ్బంది వీనీ మోరిస్ పసిగట్టింది. అయితే ఈ పక్షులంటే జనానికి భయం కావచ్చు గానీ అవి మాత్రం ప్రేమించదగినవేనని ఆమె పేర్కొంది.

World hunger not going down, at the same time obesity also growing up


ఆకలి..ఊబకాయం రెండూ పైపైకే
ప్రగతి బాటలో పరుగులు పెడుతోన్న ప్రపంచంలో ఆకలి కేకలు ఓ వైపు, ఊబకాయం మరో వైపు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి 9 మందిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వరల్డ్ ఆర్గనైజేషన్స్ నివేదికలు ఉద్ఘోషిస్తున్నాయి. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ తాజా నివేదిక ప్రకారం 82 కోట్ల మంది (820 మిలియన్లు) పోషకాహార లేమితో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 81 కోట్ల 10 లక్షలుంది. 2030 నాటికి పోషకాహార లేమితో బాధపడే మనుషులే లేకుండా చూడాలన్న లక్ష్య సాధన ప్రస్తుతం క్లిష్టంగా మారింది. అంతేకాకుండా 2050 నాటికి అదనంగా మరో 200 కోట్ల మంది (2 బిలియన్లు) పోషకాహార లేమి ని ఎదుర్కోనున్నారనే నివేదికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ), అంతర్జాతీయ ద్రవ్యనిధి, వ్యవసాయాభివృద్ధి సంఘం (ఐ.ఎఫ్.ఎ.డి), ఐక్యరాజ్యసమితి బాలల సంఘం (యూనీసెఫ్), ప్రపంచ ఆహార కార్యక్రమాల అమలు సంఘం (డబ్ల్యు.ఎఫ్.పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ)ల అధినేతలు సంయుక్తంగా ఈ విపత్కర పరిస్థితి అడ్డుకట్టకు ముందడుగు వేయాల్సిన ఆవ్యశ్యకతను ఈ నివేదక స్పష్టం చేస్తోంది. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పోషకాహార లేమితో బాధపడుతున్న వారి జనాభా ఎక్కువగా ఉంది. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లోనే దాదాపు 50 కోట్ల మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఆఫ్రికా దేశాల మొత్తం జనాభాలో వీరి శాతం ఏకంగా 30.8 గా నమోదయింది. ముఖ్యంగా అయిదేళ్ల లోపు శిశు మరణాల్లో అత్యధిక శాతం పోషకాహార లేమి కారణంగానే అని స్పష్టం చేస్తోన్న నివేదిక భవిష్యత్ లో ఆరోగ్యకర సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఏటా 30 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమితో మృత్యుదరి చేరుతున్నారు. ప్రపంచం మొత్తం 66 లక్షల మంది పిల్లలు రోజూ సరైన ఆహారం తినకుండా బడులకు వెళ్తుండగా అందులో 23 లక్షల మంది పిల్లలు ఆఫ్రికా దేశాలకు చెందినవారు కావడం గమనార్హం.  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (sustainable development goal SDG-2) సాధనకు అంతర్జాతీయ సంస్థలు కూడి రావాల్సిన సమయం ఆసన్నమైంది. 
ఊబకాయం సమస్య అన్ని ఖండాలు, అన్ని ప్రాంతాల్లో నమోదయింది. ముఖ్యంగా యువత, పాఠశాలల బాలల్లో అత్యధికులు ఈ ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు.  సరైన ఆహార నియమాలు పాటించక అనారోగ్యకర ఆహారాన్ని(జంక్ ఫుడ్స్) తీసుకుంటున్న ఆయా దేశాల్లోని పిల్లలు ఈ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి 10 మందిలో 9 మంది ఈ సమస్యకు లోనవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డబ్ల్యు.హెచ్.ఒ. నివేదిక ప్రకారం 2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 65 కోట్లు. ఇందులో 39% 18 ఏళ్ల లోపు వాళ్లే. 1975 నుంచి 2016 నాటికి ఊబకాయల సంఖ్య మూడింతలు పెరగడం గమనార్హం.


Monday, July 15, 2019

Three-hr partial lunar eclipse on July 16-17 night


జులై 16,17ల్లో పాక్షిక చంద్రగహణం
ఆకాశంలో అద్భుతాల్ని తిలకించే ఆసక్తిపరులకు మరో రోజు వ్యవధిలో సంభవించనున్న పాక్షిక చంద్రగ్రహణం వీక్షించే అవకాశం వచ్చింది. జులై 16, 17 తేదీల్లో బుధవారం మధ్యరాత్రి 1.31 నుంచి 4.29 గంటల వరకు ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నట్లు బిర్లా ప్లానిటోరియం రిసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దౌరి తెలిపారు. 3 గంటల సమయానికి చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రులకు మధ్యలోకి భూమి రావడంతో ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారు ఈ చంద్రగ్రహణాన్ని తిలకించొచ్చు. మళ్లీ 2021 వరకు చంద్రగ్రహణాలు సంభవించే అవకాశం లేదు. 2021 మే 26న మళ్లీ చంద్రగ్రహణం సంభవించనుంది. ప్రస్తుత పాక్షిక చంద్రగ్రహణాన్ని ఎటువంటి కళ్లద్దాలు లేకుండా నేరుగా తిలకించొచ్చని దౌరి తెలిపారు. దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణ దృశ్యాలు కనిపించనున్నాయన్నారు.

Sunday, July 14, 2019

Icc world cup 2019 final match tied.. super over boundary winner England


ఐసీసీ ప్రపంచ కప్-12 విజేత ఇంగ్లాండ్
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. క్రికెట్ పుట్టినింట తొలిసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన పండుగ.. వాడవాడలా సంబరాలతో ఇంగ్లాండ్ మునిగితేలుతోంది. క్రికెట్ ప్రపంచ కప్-12 ను సగర్వంగా ఆతిథ్య జట్టు భుజాలకెత్తుకుని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ కొత్త చాంపియన్ గా అవతరించింది. న్యూజిలాండ్ పై ఆదివారం క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో అనేక మెరుపులు..మలుపులు.. ఎవరు ఓడారో ఎవరు గెలిచారో తేలని సందిగ్ధతల నడుమ ఆఖరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్కోర్లు(241) సమానం..సూపర్ ఓవర్ రన్స్(15) సమానం..  విజేత న్యూజిలాండా, ఇంగ్లాండా అనే మీమాంస మధ్య చివరికి ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో ఒక బౌండరీ అధికంగా కొట్టిన ఇంగ్లాండ్ విజేతయింది. సూపర్ ఓవర్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. బోల్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని స్టోక్స్, బట్లర్ లు రెండు బౌండరీల సాయంతో 15పరుగులు స్కోరు చేశారు. అనంతరం న్యూజిలాండ్ ఛేదనకు దిగింది. గుఫ్తిల్, నీషమ్ లు ఆర్చర్ బౌలింగ్ ను  ఎదుర్కొని ఓ సిక్సర్ తో 15పరుగులు సాధించి  స్కోరును సమం చేశారు. దాంతో  బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్  విజేతగా నిలిచింది.
సూపర్ ఓవర్ నిబంధన లేకున్నట్లయితే వాస్తవానికి న్యూజిలాండే విజేత. స్కోర్లు సమానమైనప్పుడు తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు సహజంగానే గెలిచినట్లు లెక్క. కానీ వరల్డ్ కప్ లో స్కోర్లు సమానమైతే సూపర్ ఓవర్ ఆడించే నిబంధన ఉంది. అందులోనూ స్కోర్లు సమానమవ్వడం మరో అబ్బురం.
తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కు అది ఏమంత ఛేదన లక్ష్యం.. సునాయాసంగా ఓ 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేస్తారనే అందరూ అనుకున్నారు. కివీస్ మరోసారి భారత్ ను కంగు తినిపించినట్లే పటిష్ఠ ఇంగ్లాండ్ ను 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంతవరకు ఏ ప్రపంచ కప్ లో లేని విధంగా సూపర్ ఓవర్ అనివార్యమయింది. ఆ సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు రెండూ 15 పరుగులు స్కోరు చేశాయి. మళ్లీ రెండోసారి మ్యాచ్ టై అవ్వడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో అధికంగా చేసిన బౌండరీ ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఆతిథ్య జట్టుకు తొలి ప్రపంచ కప్ అందింది. వరుసగా రెండోసారి ఫైనల్లో కప్ ను కోల్పోయి న్యూజిలాండ్ ఢీలా పడింది. 2015 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన కివీస్ ఈసారి 2019లో అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో సూపర్ ఓవర్ పరాజయాన్ని చవిచూసింది.

Sidhu`s resignation today is anti india stance, says delhi MLA Sirsa


సిద్ధూ రాజీనామా భారత్ వ్యతిరేక చర్య: ఢిల్లీ ఎమ్మెల్యే సిర్సా
పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ట్విటర్ లో ఈ మేరకు పేర్కొంటూ సిద్ధూ తన రాజీనామా లేఖను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు  పంపనున్నట్లు ప్రకటించారు. 55 ఏళ్ల సిద్ధూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన దగ్గర నుంచి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే అతని వల్ల పార్టీ దెబ్బతింటోందని గతంలోనే పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. సిద్ధూ రాజీనామా విషయాన్ని ట్విటర్ పేర్కొనగానే ఢిల్లీ ఎమ్మెల్యే, సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ(డీఎస్జీఎంసీ) నాయకుడు మణిందర్ సింగ్ సిర్సా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఈరోజు ఆదివారం సిద్ధూ సెలవు రోజున రాజీనామా చేయడమేంటన్నారు. భారత్, పాక్ నాయకుల మధ్య కర్తార్ పూర్ కారిడార్ కు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయాన్ని రాజీనామాకు సిద్ధూ ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా భారత వ్యతిరేక చర్యగా సిర్సా పేర్కొన్నారు. గతంలో సిద్ధూ పాకిస్థాన్ (ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం) వెళ్లినప్పుడు కూడా తన చర్యతో వివాదాస్పదమయ్యాడు. పాక్ సైనిక జనరల్ బజ్వాను సిద్ధూ కౌగలించుకోవడంపై నాడు విమర్శలు చెలరేగాయి. తాజాగా సిద్ధూ రాజీనామా నిర్ణయం దేశ, సిక్కు వ్యతిరేక చర్యగా కనిపిస్తోందని సిర్సా ఆ వీడియో ట్వీట్ లో పేర్కొన్నారు.


Saturday, July 13, 2019

Strategic Sikkim and major parts of Darjeeling hills cut off for 3rd following landslidesand torrets


సిక్కిం, డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్
ఎడతెగని వర్షాల కారణంగా సిక్కిం, డార్జిలింగ్ హిల్స్ ప్రాంతాల వాసులకు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విపరీతంగా కొండ చెరియలు విరిగి పడుతుండడంతో రోడ్లన్నీ బారులుతీరిన వాహన శ్రేణులతో నిండిపోయాయి. మూడ్రోజులుగా వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో రోడ్లపై ఆగకుండా కొండచెరియలు విరిగిపడుతున్నాయి. దాంతో ఎక్కడ ట్రాఫిక్ ను అక్కడ నిలిపివేశారు. ఎన్.హెచ్-10 గ్యాంగ్ టాక్ కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ ను అనుమతించినా మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది. శ్వేతిజ్హొర, కలిజ్హొర ల్లోని రోడ్లు పూర్తిగా కొండచరియలతో నిండిపోయాయి. ఎన్.హెచ్-10 ఎన్.హెచ్-31 జాతీయ రహదారులపై ఇంకా కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం పశ్చిమబెంగాల్ లోని తెరాయ్, దూర్స్ ప్రాంతాల్లో వరద పోటెత్తి నివాస ప్రాంతాలు, సాగు భూములు ముంపునకు గురయ్యాయి. డార్జిలింగ్ హిల్స్ పరిధిలో తీస్తా నది పొంగి ప్రవహిస్తుండడంతో మూడ్రోజులుగా సెవొక్ రోడ్డుపై కార్లలో తరలి వచ్చిన పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఈ నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో జైపూర్ (రాజస్థాన్) పర్యాటకుడు అమన్ గార్గ్ చనిపోగా మృతదేహం 20 కిలోమీటర్ల దూరంలో తీస్తా ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ కారుతో పాటు అందులో ప్రయాణిస్తున్న గౌరవ్ శర్మ, డ్రైవర్ రాకేశ్ రాయ్(34) జాడ కోసం సహాయ రక్షకబృందం వెతుకులాట కొనసాగిస్తోంది.  హిమాలయాల ఈశాన్య ప్రాంతంలోని డార్జిలింగ్, కుర్సెంగ్, కలింపాంగ్, సిలిగురి రోడ్లలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయింది. తీస్తా నదిలో 3,58,690 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకా నది పొంగి ప్రవహించొచ్చని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.


Friday, July 12, 2019

Pak extends till Jul 26 its airspace ban along eastern border with India


జులై 26 వరకు సరిహద్దుల్లో విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాక్
పాకిస్థాన్ తూర్పు ప్రాంతంలో గల భారత్ సరిహద్దుల్లోని తమ గగనతలంపై విమాన రాకపోకలపై నిషేధాజ్ఞల్ని ఆ దేశం పొడిగించింది. శుక్రవారం ఈ మేరకు పాక్ పౌర విమానయాన అధికార వర్గాలు (సీఏఏ)  ప్రకటించాయి. పాకిస్థాన్ ఈ విధంగా నిషేధాన్ని విధించడం ఇది అయిదోసారి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో 46 మంది సీఆర్ పీఎఫ్ సిబ్బందిని ఉగ్రవాదులు బాంబు దాడిలో కబళించిన నేపథ్యంలో పెద్దఎత్తున భారత్ వైమానిక దళం (ఐఏఎఫ్) పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) కు దిగింది. ఫిబ్రవరి 26న పాక్ లోని బాలాకోట్ లోగల ఉగ్రతండాల్ని(జేఈఎం) ఐఏఎఫ్ భస్మీపటలం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ తూర్పున భారత్ తో గల సరిహద్దు గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞల్ని జారీ చేసింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని సీఏఏ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతవరకు ఆ దిశగా పురోగతి ఏదీ లేదని తెలిపాయి. అయితే కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతున్న భారత ప్రధాని మోదీకి వీవీఐపీ కేటగిరీ కింద వెసులుబాటు కల్పించింది. తమ గగనతలంపై నుంచి ఆయన ప్రయాణించే విమానానికి పాక్ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కానీ ప్రధాని మోదీ విమానం పాక్ గగన తలం నుంచి కాకుండా వేరే మార్గంలో కిర్గిస్థాన్ చేరింది. అంతకుముందు మే21న బిష్కెక్ లో విదేశాంగ మంత్రుల భేటీకి బయలుదేరిన అప్పటి మంత్రి సుష్మాస్వరాజ్ విమానానికి పాక్ గగనతల ప్రవేశానికి ఇదే విధంగా ఆ దేశం ప్రత్యేక అనుమతినిచ్చింది. భారత ప్రభుత్వం తమ గగనతలంలో విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పాక్ పౌర విమానయాన శాఖ మంత్రి షారూక్ నుస్రరత్ తెలిపారు. అయితే తొలుత భారత్ సరిహద్దుల్లోని తమ వైమానికదళ యుద్ధ విమానాల మోహరింపును ఉపసంహరించుకుంటేనే పాక్ గగనతలంలో నిషేధాజ్ఞల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.  

Thursday, July 11, 2019

England one sided win over defending champions Australia by 8 wkts


ఫైనల్ కు ఇంగ్లాండ్ రె`ఢీ:`ఏకపక్ష మ్యాచ్ లో ఆస్ట్రేలియా చిత్తు
వరల్డ్ కప్-12 రెండో సెమీస్ మ్యాచ్ చూస్తే అచ్చం భారత్ మాదిరిగా ఆస్ట్రేలియా కనిపించింది. వరల్డ్ కప్ నాకౌట్ కు ముందు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ తొలి సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయింది. టాస్, వర్షం, ధోని రనౌట్ మ్యాచ్ ను కివిస్ వశం చేశాయి. అయితే గురువారం రెండో సెమీస్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బర్మింగ్ హమ్ ఎడ్జ్ బస్టన్ మైదానంలో బ్యాటింగ్ ఎంచుకుని బోల్తా పడింది. తొలి సెమీస్ కు యాక్షన్ రిప్లేలా రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా ఆడింది. తొలి 6 ఓవర్లలో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్(87) అడ్డం పడకపోతే ఆస్ట్రేలియా వికెట్ల పతనం ఆగేది కాదు. 223 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ కు చేరే అవకాశమే ఉండదు. కేరీ, స్మిత్ జోడి నాల్గో వికెట్ కు 103 పరుగులు జత చేశారు. కెప్టెన్ ఆరన్ ఫించ్(0), డేవిడ్ వార్నర్(9), పీటర్ హ్యాండ్ కోంబ్(4) టాప్ ఆర్డర్ లో తక్కువ స్కోర్ కే బ్యాట్లు ఎత్తేశారు. ఆసిస్ ఇన్నింగ్స్ లో ఇద్దరు డకౌట్లు కాగా మరో అయిదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ చేరారు. ఆ జట్టు 49 ఓవర్లకే ఆలౌటయింది. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్ వోక్స్, ఆడిల్ రషీద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు.
తనను టైటిల్ ఫెవరెట్ గా క్రికెట్ విశ్లేషకులు ఎందుకు పేర్కొంటున్నారో ఆసీస్ తో సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆడి చూపించింది. బౌలింగ్ లో చండప్రచండమైన బంతులతో ప్రత్యర్థిని వణికించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో పిడుగుల్లాంటి షాట్లతో హోరెత్తించింది. ఛేదన లక్ష్యం న్యూజిలాండ్ 239 పరుగుల స్కోరు భారత్ ముందుంచిన మాదిరిగానే ఆస్ట్రేలియా 223 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఎదుట పెట్టింది. తేడా ఒక్కటే అక్కడ భారత్ తలొగ్గితే ఇక్కడ ఇంగ్లాండ్ దుమ్మురేపింది.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి పరుగులు సాధించారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే ఆసిస్ పేసర్లు కూనల్లా మారిపోయారు. ముఖ్యంగా ఓపెనర్ జాసన్ రాయ్(85) 65 బంతుల్లో 5 సిక్సర్లు, 9 బౌండరీలతో ఆసిస్ బౌలింగ్ ను తునాతునకలు చేశాడు. మిచెల్ స్టార్క్ ప్రధాన బాధితుడు. ఓవర్ కు 7.78 పరుగుల చొప్పున 9 ఓవర్లలో జానీ బెయిర్ స్టో(34) ఒకే ఒక వికెట్ తీసుకుని 70 పరుగులు సమర్పించుకున్నాడు. జాసన్ రాయ్ వికెట్  పాట్ కమిన్స్ కు దక్కింది. జోయ్ రూట్(49*), మోర్గాన్(41*) చివరి వరకు క్రీజ్ లో నిలిచి ఇంగ్లాండ్ ను ఫైనల్ కు చేర్చారు. ఆ జట్టు ఇంకా దాదాపు 18 ఓవర్లు మిగిలి ఉండగానే 32.1 ఓవర్లలో 226 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. జాసన్ బెరండ్రాఫ్ బౌలింగ్ లో కెప్టెన్ మోర్గాన్ విన్నింగ్ షాట్ బౌండరీ కొట్టాడు.3 వికెట్లు తీసి అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 
తొలిసారి వరల్డ్ కప్ విజేత ఎవరో?
లండన్ లార్డ్స్ లో ఆదివారం తుది పోరుకు న్యూజిలాండ్ తో ఇంగ్లాండ్ జట్టు సిద్ధమౌతోంది. ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి 1987,1992,2019ల్లో ఆ జట్టు ఫైనల్ కు చేరగా మరో జట్టు న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ఫైనల్ (2015, 2019) కు చేరింది. ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపడ్డం ఇదో తొలిసారి. రెండింటిలో ఏ జట్టు గెలిచిన తొలిసారి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డుల్లో చోటు దక్కించుకోనుంది.

Wednesday, July 10, 2019

3 die of asphyxiation in Telangana


బావిలో మోటారు రిపేరుకు దిగి ముగ్గురు మృత్యువాత
తెలంగాణ లోని ఓ పురాతన బావిలో మోటారు మరమ్మతు చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ముత్యంపేట మండలానికి చెందిన కౌటలా గ్రామంలో చోటు చేసుకుంది. 35 అడుగుల లోతు గల ఈ బావిలోకి బుధవారం ఉదయం మోటార్ రిపేరు చేయడానికి వీరంతా దిగినట్లు తెలుస్తోంది. తొలుత ఓ వ్యక్తి ఈ బావిలోకి దిగి విషవాయువులు వెలువడిన కారణంగా ఊపిరాడక చనిపోయాడు. అతణ్ని రక్షించడానికి తోటి పనివాళ్లు ఇద్దరు ఒక్కొక్కరుగా అందులోకి దిగి అపస్మారక స్థితిలోకి చేరి ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ముగ్గురు 19 నుంచి 25ఏళ్ల లోపు యువకులు. మృతుల్ని రాజు(26), శ్రీనివాస్(25), మహేశ్(18) గా గుర్తించారు. మృతదేహాల్ని బావిలో నుంచి వెలికి తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈనెల 8న నల్గొండ జిల్లాలోని షాలిగౌరారం మండలానికి చెందిన పెరికకొండారం గ్రామంలో ఓ 18 ఏళ్ల విద్యార్థిని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. కావ్య అనే ఆ విద్యార్థిని బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. పశువులకు మేత వేయడానికి వెళ్లిన ఆమె నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయింది.

Tuesday, July 9, 2019

Puppy beaten to death in Thane housing complex, 1 booked


కుక్క పిల్లే కదా అని చంపేసి.. ఆనక ఇరుక్కున్న ఘనుడు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కుక్క పిల్లే కదా అని కొట్టి చంపి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన జులై3 బుధవారం జరిగింది. థానె సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో భయాందర్ గృహ సముదాయాల టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి ఓ కుక్క పిల్ల జొరబడింది. దాన్ని చూసి ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. కుక్క పిల్ల కళేబరాన్ని చూసిన ఇరుగుపొరుగులు ఎలా చనిపోయిందో తెలియక తర్వాత అక్కడ నుంచి తొలగించారు. అయితే రెండ్రోజులు గడిచిన తర్వాత వాట్సాప్ లో ఆ వీడియో ప్రత్యక్షమయింది. కుక్కపిల్లను కొట్టి చంపుతున్న వీడియోను సదరు వ్యక్తే రికార్డు చేసి పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన కుక్కలన్నింటికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానాన్ని జత చేశాడు. అతడికి ఈ మొత్తం వ్యవహారంలో స్నేహితుడొకరు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను చూసి చలించిపోయిన అపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. థానె రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కుక్క పిల్లను చంపిన సదరు వ్యక్తిపై నమోదు చేశారు. నోరు లేని మూగ జీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం నేరం కిందకే వస్తుంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం, ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్428, 429 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయదగ్గ నేరంగా పరగణించి పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

YSRCP party men do not exceed limits Chandrababu warns Cm Jagan


చంద్రబాబు ఓదార్పు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని కలుసుకుని పరామర్శించారు. తాడిపత్రి లోని వీరాపురం గ్రామంలో భాస్కరరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భాస్కరరెడ్డి మృతికి పరహారంగా చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. అనంతరం ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.సి పార్టీపై నిప్పులు చెరిగారు. ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తల్ని వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇదేనా జగన్ అందిస్తున్న ఉత్తమ పాలన అని చంద్రబాబు నిలదీశారు. వై.ఎస్.ఆర్.సి.పి. దుందుడుకు పోకడలకు పోతోందని అది మంచిది కాదని చెప్పారు. ఆ పార్టీ వారి ఆగడాలు శ్రుతి మించుతున్నాయని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. సీఎం జగన్ సత్పరిపాలన అందించడానికి ఆరునెలల గడువు అడిగారు..వేచి చూస్తున్నాం.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం.. అని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక 40 రోజుల్లో ఉత్తమ పాలన మాట అటుంచి ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తక్షణం వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణుల్ని అదుపులో పెట్టుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు తేల్చిచెప్పారు.

Monday, July 8, 2019

BCCI appoints Dravid as Head of Cricket at NCA


ఎన్.సి.ఎ. అధినాయకుడిగా మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్

నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్.సి.ఎ) హెడ్ గా భారత జట్టు మాజీ కెప్టెన్ క్రికెట్ వాల్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. సోమవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ మేరకు ప్రకటించింది. జులై 1నే వాస్తవానికి ద్రవిడ్ ఎంపిక జరిగింది. అయితే అతను ఇండియా సిమెంట్స్ లో వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చాయి. `ఒక వ్యక్తికి ఒకే పదవి` అనే నియమం ప్రకారం ఎన్.సి.ఎ. అధ్యక్షుడు ఆదాయాన్ని చేకూర్చే ఏ ఇతర పదవుల్లో ఉండకూడదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) సభ్యత్వాన్ని అందులో భాగంగానే వదులుకున్నారు. అడ్వయిజరీ కమిటీ (సి.ఒ.ఎ) ఇండియా సిమెంట్స్ పదవిని త్యజించడం లేదా దీర్ఘకాలిక సెలవు పెట్టుకుని ఎన్.సి.ఎ. హెడ్ బాధ్యతలు స్వీకరించాలని ద్రవిడ్ కు సూచించింది. ఇండియా సిమెంట్స్ సెలవు మంజూరు చేయడంతో ద్రవిడ్ ఎన్.సి.ఎ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వీలుకల్గింది. ద్రవిడ్ పదవీ కాలాన్ని బీసీసీఐ ప్రకటించలేదు. ఎన్.సి.ఎ పదవిలో ద్రవిడ్ భారత క్రికెట్ కు సంబంధించి పలు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్ పురుషుల, మహిళల జట్ల హెడ్ కోచ్ లు సహా కోచ్ లందరికి ద్రవిడ్ నేతృత్వం వహిస్తారు. క్రీడాకారులకు కీలక శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇండియా-ఎ, ఇండియా అండర్-19, అండర్-23 జట్లు కూడా ఎన్.సి.ఎ హెడ్ పరిధిలోనే ముందంజ వేయనున్నాయి. ఇంతకు ముందు ఎన్.సి.ఎ. చైర్మన్ గా అనిల్ కుంబ్లే వ్యవహరించిన సంగతి తెలిసిందే.