Saturday, February 27, 2021

TDP chief Chandra Babu completed his tour in kuppam

కుప్పంలో జూ.ఎన్టీఆర్ రావాలని నినాదాలు

చంద్రబాబు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీ ప్రచారబాధ్యతలు చేపట్టాలనే నినాదాలు మిన్నంటాయి. పంచాయతీ ఎన్నికల అనంతరం సొంత నియోజకవర్గం కుప్పంకు విచ్చేసిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో గడిచిన మూడు రోజులుగా ఆయన విస్తృతంగా పర్యటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడు నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తానన్నారు. తనకు వీలులేకుంటే లోకేశ్ వచ్చి పర్యటిస్తారని చెప్పారు. టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని సూచించారు. పర్యటన అనంతరం శనివారం ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ పయనమయ్యారు.

Wednesday, February 24, 2021

Ghatkesar B-pharmacy student commit suicide

ఘట్ కేసర్ బీఫార్మసీ విద్యార్థిని

బలవన్మరణం

తనను కిడ్నాప్ చేసి ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారం చేశారనే డ్రామాతో హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఘట్‌కేసర్ విద్యార్థిని బుధవారం తుదిశ్వాస విడిచింది. ఆమె బలవన్మరణానికి పాల్పడ్డం యావత్ నగరవాసుల్ని కలచివేసింది. ఆ కేసులో తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తొలుత మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్యం అందించి వైద్యులు ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన యువతి తిరిగి నిన్న రాత్రి మరోసారి షుగర్ ట్యాబ్లెట్లు మింగింది. ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు యువతి కిడ్నాప్ డ్రామా ఆడి 10 రోజులవుతోంది. పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వైద్యుల సూచనమేరకు ఆమెను మానసిక చికిత్సాలయానికి తరలించారు. కౌన్సిలింగ్ చేసి చికిత్స అందిస్తున్నారు. అంతలోనే మళ్లీ ఆత్మహత్యకు పాల్పడ్డంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Saturday, February 20, 2021

YSSharmila shouts `Jai Telangana` slogan for the first time

తెలంగాణకు జై కొట్టిన షర్మిల

రాజన్న తనయ వై.ఎస్.షర్మిల తొలిసారి తెలంగాణకు జై కొట్టారు. రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్న ఆమె వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం షర్మిల స్వగృహం లోటస్ పాండ్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వై.ఎస్ తన పాలనలో పేదలు లక్షాధికారులు కావాలని ఆశించారన్నారు. వారి పిల్లలు ఉచితంగా ఉన్నత, వృత్తి విద్యలు చదువుకొని గొప్పవారు అవ్వాలని కలలు కన్నారని గుర్తు చేశారు. రైతే రాజులా తలఎత్తుకుని జీవించేలా పాలించారని షర్మిల చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలోని తమతమ ప్రాంతాల్లో జీవనస్థితిగతుల గురించి నిర్భయంగా నిజాయతీగా అభిప్రాయాలు వెల్లడించాలని అభిమానుల్ని కోరారు.  ఆ ఫీడ్ బ్యాక్ తో రానున్న కాలంలో తాము ఏవిధంగా ముందడుగు వేయాలనేది ఆలోచన చేస్తామన్నారు. అందుకనుగుణంగా 11 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని వారి ముందుంచారు. ఈ సమావేశం సదర్భంగా షర్మిల భావోద్వేగంతో మాట్లాడుతూ రాజన్న తెలంగాణకు ఎంతో చేశారని అందువల్లే ఆయన చనిపోయినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గుండెలాగిపోయి మరణించారన్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే తెలంగాణకు తమ వంతు సేవలందిస్తామని చెప్పారు. దాంతో సమావేశానికి హాజరైన వారు ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రతిగా షర్మిల కూడా పలుమార్లు జై తెలంగాణ అంటూ వారితో గొంతు కలిపారు.

Friday, February 19, 2021

Kerala Doctors Remove Whistle Stuck In Woman's Respiratory System For 25 Years

25 ఏళ్లుగా మహిళ గొంతులో ఇరుక్కున్న విజిల్

  ·శస్త్రచికిత్స ద్వారా వెలికితీసిన కేరళ వైద్యులు

కేరళలోని కన్నూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్యులు ఒక మహిళకు వీడని పీడ నుంచి విముక్తి  కలిగించారు. సదరు మహిళ శ్వాసకోశ వ్యవస్థ నుంచి విజిల్‌ను విజయవంతంగా వెలికితీశారు. దాంతో 25 ఏళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమెకు ఉపశమనం లభించింది. కేరళకు చెందిన ఆ మహిళ తన 15వఏట అనుకోకుండా ఈల మింగింది. అప్పుడు కంగారు పడిన బాలిక అధికంగా నీరు తాగింది. అంతటితో ఆ విజిల్  సమస్య తీరిపోయినట్లు భావించి మిన్నకుండిపోయింది. అయితే ఆ ఈల బాలిక గొంతు నుంచి ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే నాళంలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమెకు దగ్గు వీడని పీడగా మారింది. అలా రెండు దశాబ్దాలపాటు తీవ్రమైన దగ్గుతో బాధపడుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె 40వ పడిలోకి చేరింది. దగ్గు అంతకంతకు పెరిగిపోతుండడంతో తొలుత ఆస్తమా సోకిందని వైద్యులు అనుకున్నారు. కన్నూర్ జిల్లా మత్తన్నూరులో నివసిస్తున్న ఆమెకు వైద్యం అందిస్తోన్న ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు ఏదో వస్తువు గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. కేసును ప్రభుత్వ వైద్య కళాశాలకు రిఫర్ చేశారు. మెడికల్ కాలేజీ వైద్యులు రాజీవ్ రామ్, పద్మనాభన్ బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి గాలిగొట్టంలో ఇరుక్కున్న విజిల్‌ను బయటకు తీసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సుదీప్ తెలిపారు.

Wednesday, February 17, 2021

Kalyanamasthu scheme revived after 10 years in Tirumala

మే 28 నుంచి మళ్లీ కల్యాణమస్తు!

తిరుమలలో మళ్లీ కల్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారయింది. దాదాపు దశాబ్దం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభించదలిచింది. దేశవ్యాప్తంగా కల్యాణమస్తు పేరిట సామూహిక వివాహాల్ని టీటీడీ నిర్వహించనుంది.  ఈ ఏడాది మే 28  మధ్యాహ్నం 12.34  నుంచి 12:40 వరకు, అక్టోబర్ 30 ఉదయం 11:04 నుంచి 11:08  వరకు,  నవంబర్ 17 ఉదయం 9:56 నుంచి 10.02 వరకు కల్యాణమస్తు ముహూర్తాలు ఖరారు చేశారు. పాలకమండలిలో చర్చించి పెళ్లిళ్ల వేదికలను నిర్ణయిస్తామని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.  కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా వివాహం చేసుకున్న వారికి  మంగళసూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు.

Tuesday, February 9, 2021

YSSharmila`s new party YSRTP!

షర్మిల కొ్త్త పార్టీ వైఎస్ఆర్టీపీ!

తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ రాష్ట్రంలో రాజన్నరాజ్యం మళ్లీ రావాల్సి ఉందని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం స్వగృహం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత షర్మిల నల్గొండకు చెందిన వైఎస్ అనుచరులైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఈరోజు ఫిబ్రవరి 9 వైఎస్ఆర్, విజయమ్మల పెళ్లిరోజని శుభసూచకంగా ఈ ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తను మాట్లాడ్డానికి రాలేదని వారు చెప్పేది వినడానికి వచ్చానన్నారు. స్థానికంగా గల సాధకబాధకాలు వినాలనుకుంటునట్లు చెప్పారు. ఈ రాష్ట్రానికి ఆనాటి వైఎస్ పాలన కావాలని తాము తీసుకువస్తామని షర్మిల తెలిపారు. ఆమె ప్రారంభించనున్న కొత్త పార్టీకి వైఎస్ఆర్టీపీగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈసరికే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. తెల్లనిరంగుపై మండే సూర్యుడి చిహ్నంతో జెండా కూడా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా ఆమె మళ్లీ పాదయాత్ర చేపట్లనున్నట్లు తెలుస్తోంది. 

Monday, February 8, 2021

What Is Glacial Lake Outburst? What caused flooding in Uttarakhand?

హిమాలయాలతో చెలగాటం..

అందుకే ఉత్తరాఖండ్ విలయం

ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా మంచు చరియలు విరిగిపడి ఉండొచ్చని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీఐఎంవోడీ) నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం ఉదయం మంచు చరియలు విరిగిపడి ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో సుమారు 150 మంది మృత్యుఒడికి చేరిన సంగతి తెలిసిందే. విపరీతంగా మంచు కరగడంతో ఇక్కడ మరోసారి జల ప్రళయం సంభవించింది. జోషీ మఠ్‌లో ధౌలిగంగ నదికి అకస్మాత్తుగా వరదలు రావడంతో తపోవన్‌లోని రుషి గంగ పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఈ ప్రాజెక్టులోకి వరద పోటెత్తడంతో అక్కడ పనిచేస్తున్న వందల మంది కార్మికులు గల్లంతయ్యారు. ఎందుకీ వైపరీత్యం అనే అంశంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీ నదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాల నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని భావిస్తున్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందంటున్నారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల మేర పెరిగినట్లు ఐసీఐఎంవోడీ అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉందని తద్వారా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. మంచు కరగడం, వాతావరణ తీరుతెన్నులూ గందరగోళానికి కారణమని స్పష్టమౌతోంది. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల హిమాలయాలకు అపారనష్టం వాటిల్లుతోంది. అప్ఘనిస్థాన్‌ నుంచి మయన్మార్‌ వరకూ 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్‌ పర్వతశ్రేణులు.. ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరాలకు హిమాలయాలు నిలయంగా ఉన్నాయి.  ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు ఉన్న ప్రాంతం హిమలయాలు. గంగా, మెకాంగ్‌, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు మూలధారం. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా మంచు నిక్షిప్తమై ఉంది. ప్రకృతి సమతౌల్యతను దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మరోసారి ఉత్తరాఖండ్ మంచు చరియల దుర్ఘటన నిరూపించింది. విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమాలయాలకు తీవ్ర ముప్పు వాటిళ్లుతోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా మంచు కొండలు కరిగిపోతున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయ పర్వతాలపై ఉన్న హిమానీ నదాలు తరిగిపోయి, జలవిలయానికి కారణమవుతున్నాయి.

Saturday, February 6, 2021

TDP leader Ganta Srinivasa Rao from Visakha resigns MLA post

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామా

విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ వల్లే విశాఖకు ఉక్కు నగరంగా పేరొచ్చిందన్నారు. ఇక్కడ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయడమంటే మనిషి తలను మొండెం నుంచి వేరుచేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు తమ పదవులకు రాజీనామాలిచ్చి ఉద్యమంలో పాల్గొనగలరనే ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగ, కార్మిక సంఘాలు నిరసనల్ని ఉద్ధృతం చేశాయి.  స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు కూడా వారికి మద్దతుగా నిలవడం విశేషం. శనివారం నగరంలో చేపట్టిన ఆందోళనలో అందరూ పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాడు ఉద్యమకారులు చేసిన త్యాగాలను వృథా కానివ్వబోమని ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు.

Wednesday, February 3, 2021

Andhra Pradesh Government files petition to ban e-watch app released by state election commissioner Nimmagadda Ramesh Kumar

ఏపీలో ఈ-వాచ్ యాప్

ఆంధ్రప్రదేశ్ లో ఈనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై సమగ్ర నిఘా ఉంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్ ను ఈ రోజు (బుధవారం) ప్రారంభించింది. ఎన్నికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించేందుకే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామన్నారు. రేపటి నుంచి గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ అందుబాటులో ఉంటుందని నిమ్మగడ్డ తెలిపారు. యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు టెక్నాలజీ సాయంతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. అయితే ఈ యాప్ పూర్తిగా ప్రయివేటని అధికారిక కార్యకలాపాలకు వినియోగించరాదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. యాప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం దాన్ని నిలిపేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

Monday, February 1, 2021

Women SI carried unidentified dead body on her shoulder for 2 kilometers and performing his last rites in Srikakulam district of Andhra Pradesh

యాచకుడి శవానికి మహిళా ఎస్.ఐ అంతిమసంస్కారం 

పోలీసుల్లోనూ మానవతా మూర్తులుంటారని ఓ మహిళా ఎస్.ఐ. నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల అడవికొత్తూరు గ్రామ పొలాల్లో ఓ గుర్తుతెలియని వృద్ధుడి శవం పడిఉందనే సమాచారంతో ఎస్.ఐ. శిరీష అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తి ఎవరైఉంటారనే విషయమై ఆరా తీశారు. అతను బిచ్చగాడని తెలిసింది. అయితే అక్కడి నుంచి శవాన్ని తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. దాంతో ఆమె స్వయంగా తన భుజాలపై మృతదేహాన్ని మోసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. దాంతో కొందరు ఎస్సై ఔదార్యానికి చలించి సహాయంగా భుజం కలిపారు. దాంతో అందరూ కలిసి రెండు కిలోమీటర్ల మేర పొలం గట్లపై ఆ శవాన్ని మోసుకొచ్చి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. వీరికి లలితా చారిటబుల్ ట్రస్ట్ చేయూతనందించింది. ఎస్సై శిరీష చూపిన చొరవకు పోలీసులతో పాటు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా శిరీషని ప్రత్యేకంగా అభినందించారు.