Thursday, April 29, 2021

West Bengal assembly election crude bombs-hurled in central Kolkata amid last phase of polls

పశ్చిమబెంగాల్ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు

పశ్చిమబెంగాల్ తుది దశ పోలింగ్ లో నాటు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. గురువారం ఉదయం సెంట్రల్ కోల్‌కతాలోని మహాజతి సదన్ ప్రాంతంలో ఆగంతకులు నాటుబాంబులు విసరడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నగరం నడిబొడ్డున గల సెంట్రల్ అవెన్యూలో జరిగిన ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆధారాలు సేకరించి దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు. జోరాసంకో  నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మీనా దేవి పురోహిత్ పోలింగ్ బూత్‌లలో పర్యటిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటుబాంబులు విసిరారు. తన వాహనానికి అత్యంత సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించినట్లు పురోహిత్ తెలిపారు. "నా కారుపై బాంబులు విసిరినప్పటికీ నేను భయపడను. నేను ఖచ్చితంగా బూత్‌లను సందర్శిస్తాను" అని ఆమె చెప్పారు. "వారు నన్ను చంపడానికి ప్రయత్నించారు .. ఓటర్లను భయపెట్టడానికి ఇది ఒక కుట్ర" అని పురోహిత్ ఆరోపించారు. ఘటనా స్థలంలో భారీ పోలీసు బృందాన్ని మోహరించినట్లు కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో జోరసంకోతో సహా కోల్‌కతాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్  సాయంత్రం 6.30 వరకు కొనసాగనుంది.

Wednesday, April 28, 2021

Cowin Aarogya Setu crash as citizens rush to register for Corona Vaccines

కోవిన్ పోర్టల్‌ క్రాష్! 

దేశంలోని యువతకు కోవిడ్ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. 18 ఏళ్ల పైబడిన వారందరూ అర్హులే అని కేంద్రం ప్రకటించడంతో ఎక్కువ మంది ఒకేసారి రిజిస్ట్రేషన్‌కి ప్రయత్నించారు. దాంతో సర్వర్లు క్రాష్ అయ్యాయి. సెకండ్ వేవ్ సృష్టిస్తోన్న భయోత్పాతంతో ఒక్కసారిగా అందరిలోనూ వేక్సినేషన్ విషయమై చురుకు పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 60 కోట్ల  పైచిలుకు మందికి కరోనా వ్యాక్సినేషన్ జరగ్గా అందులో 25 శాతం సుమారు 15 కోట్ల మందికి  మనదేశంలో కరోనా టీకా వేశారు. భారత ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్ పోర్టల్‌ కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇప్పటి వరకూ కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయాలతో 18 ఏళ్ల పైబడిన యువత పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు కోవిన్ పోర్టల్‌‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్దఎత్తుల లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. దాంతో లోడ్ తట్టుకోలేక సర్వర్లు క్రాష్ అయినట్లు సమాచారం.

Friday, April 23, 2021

Hyderabad chicken and mutton shops will be closed on April 25th sunday due to Mahavir birth anniversary

ఈ సండే ముక్కా చుక్క బంద్

హైదరాబాద్ మహానగర వాసులు ఈ ఆదివారం ముక్క, చుక్కకు దూరం కానున్నారు. మహవీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 25న  మాంసం, మందు దుకాణాలన్నీ బంద్ కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ) పరిధిలోని కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలన్నింటినీ ఈ ఆదివారం మూసేయాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించేలా వెటర్నరీ విభాగం అధికారులు బాధ్యత తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. గత ఏడాది కరోనా టైమ్ లో చికెన్ పై దుష్ప్రచారం జరిగింది. మాంసాహారం వల్లే కరోనా వస్తుందంటూ వదంతులు వ్యాపించడంతో ఓ దశలో కిలో చికెన్ ధర రూ.50 కి పడిపోయింది. కోడి, గుడ్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. దాంతో నెలల పాటు ఫౌల్ట్రీ రంగం కుదేలయిపోయింది. రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖలు చికెన్, గుడ్లు తినడం ద్వారానే పోషకాలు లభించి కరోనాను తేలిగ్గా జయించొచ్చని ప్రచారాన్ని చేపట్టాయి. మళ్లీ జనం కోడి, గుడ్లను తీసుకోవడం ప్రారంభించారు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.280 వరకు చేరుకోగా, మాంసం కిలో రూ.500 పైచిలుకు పలుకుతోంది. మద్యం విషయానికి వస్తే ఏరోజుకారోజు పైపైకే అన్నచందంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Monday, April 19, 2021

Mahesh Babu tweets TS CM KCR get well soon recovery

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మహేష్ బాబు ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్ కు సోమవారం నిర్వహించిన ఆర్టీ పీసీఆర్, యాంటిజెన్ పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల కోవిడ్ బారిన పడ్డ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పలు సందర్భాల్లో కేసీఆర్ భేటీ అయ్యారు. దాంతో ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన గజ్వేల్ లోని సొంత వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 10 రోజుల పాటు ఆయన అక్కడే అవసరమైన చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటారని వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీరావు తెలిపారు. కేసీఆర్ గొప్ప పోరాటయోధుడని ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఎవరూ ఆందోళన చెందవద్దంటూ తనయుడు కేటీరామారావు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో యావత్ తెలుగుపరిశ్రమ కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కేటీఆర్ తో వ్యక్తిగత స్నేహమున్న మహేశ్ బాబు వెంటనే స్పందించి సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేసినట్లు సమాచారం.

Thursday, April 15, 2021

4 persons from same family died after burnt alive in Visakhapatnam Madhurawada

కుటుంబాన్ని కడతేర్చి.. యువకుడి ఆత్మహత్య

బెహ్రెయిన్ లో స్థిరపడిన ఓ కుటుంబం విశాఖపట్నంలో కడతేరిన ఉదంతమిది. ఇంట్లోని పెద్ద కొడుకే తల్లి,తండ్రి, తమ్ముణ్ని చంపేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన సుంకర బంగారినాయుడు (52).. భార్య నిర్మల (44), దీపక్ (22) , కశ్యప్ (19) ఇద్దరు కొడుకులతో నగరంలో నివాసముంటున్నారు. మధురవాడ లోని మిథిలాపురి కాలనీలో ఆదిత్య ఫార్చ్యూన్స్ (ఫ్లాట్ నెం.505)లో  అద్దెకు దిగారు. ఎనిమిది నెలల నుంచి ఈ కుటుంబం ఇక్కడి గెటెడ్ కమ్యూనిటీకి చెందిన అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. ఎన్.ఐ.టి.లో ఇంజనీరింగ్ చేసిన దీపక్ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం సివిల్స్ కు సిద్ధమవుతున్నాడు. ఆ మానసిక ఒత్తిడితోనే ఇంట్లో తరచు గొడవపడేవాడని ఇరుగుపొరుగు వారి కథనం. గురువారం తెల్లవారుజామున కూడా ఇంట్లో గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండ్రి, తల్లి, తమ్ముణ్ని దీపక్ కొట్టి చంపడంతో వారి తలలపైన ఒంటిపైన తీవ్ర గాయాలున్నాయి. ఇంటి లోపల నేల, గోడలపై రక్తపు మరకల్ని గుర్తించినట్లు సీపీ మనీష్ కుమార్ సిన్హా వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం కుటుంబ సభ్యుల్ని హత్య చేసి వారిపై పెట్రోల్ పోసి అంటించిన అనంతరం దీపక్ కూడా ఒంటికి నిప్పుపెట్టుకున్నట్లు తెలిపారు. దాంతో మొత్తం నాలుగు మృతదేహాలు కాలిన స్థితిలో పోలీసులు గుర్తించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగి కుటుంబం సజీవదహనం అయినట్లు భావించారు. గెటెడ్ కమ్యూనిటీ కావడంతో బయట వ్యక్తులు లోపలకు వచ్చే వీలులేనందున ఆత్మహత్యలై ఉండొచ్చని ఆ తర్వాత అనుమానించారు. చివరకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టడంతో దీపక్ ఈ హత్యలకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. 

Thursday, April 1, 2021

AP CM YSJagan launches covid vaccination for above 45 years people

కరోనా వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శం: సీఎం

కోవిడ్ టీకా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యావద్దేశానికే ఆదర్శంగా నిలవనుందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్‌ భారతితో కలిసి వెళ్లిన సీఎం జగన్ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జగన్ తో పాటు భారతికి కూడా ఈ రోజు తొలిడోసు టీకా వేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ మాట్లాడుతూ కరోనాను నిలువరించలేమని దానితో సహజీవనం తప్పదని చెప్పారు. అయితే నివారణకు మనదగ్గర ఉన్న ఏకైక అద్భుత అస్త్రం టీకాయేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మనకున్న వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ జాతీయస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీని ముందువరుసలో నిలబెట్టగలవని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు రెండునెలల్లో రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా వేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.