Monday, July 22, 2019

`Train 18` trial run from delhi to katra conducted successfully


ఢిల్లీ-కత్రా మధ్య `వందే భారత్` రైలు ట్రయల్ రన్
భారత్ బుల్లెట్ ట్రైన్ (ట్రైన్-18) వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య సోమవారం ట్రయల్ రన్ ప్రారంభించింది. ఈ రైలు జమ్ము తావీ స్టేషన్ కు ఈ మధ్యాహ్నం 12.45కు చేరింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ వందే భారత్ రైలు వయా జమ్ము తావీ రైల్వేస్టేషన్ మీదుగా కత్రా చేరుకుంటుంది. ఢిల్లీ-కత్రాల మధ్య దూరం 640 కిలోమీటర్లు. రాజధాని, శతాబ్ది, ఘటిమాన్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లతో సహా ఈ దూరాన్ని చేరుకోవడానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఈ సూపర్ ఫాస్ట్ లన్నీ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వాటికన్నా మించిన వేగంతో వందే భారత్  చైర్ కార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తూ ఢిల్లీ నుంచి కత్రాకు ఏడు గంటల్లోనే చేరుతుంది. ఢిల్లీ-వారణాసిల మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈ ఫిబ్రవరి14న ప్రారంభించారు. తాజాగా ఢిల్లీ-కత్రా కు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జమ్ముతో పాటు మరో మూడు ప్రధాన నగరాలకు ఈ వందే భారత్ ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీ-జమ్ము-కత్రా, ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్ కతాలకు వందే భారత్ ను త్వరలో ప్రారంభించేందుకు యోచిస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఇంజిన్ లేని తొలి భారతీయ రైలైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రూపకల్పన చేసింది. ఢిల్లీ-వారణాసి మధ్య ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. ఈ రైలులో 1128 మంది ప్రయాణించొచ్చు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తయారీకయిన వ్యయం రూ.60 కోట్లు. యూరప్ నుంచి ఈ తరహా రైలు దిగుమతి చేసుకోవాలంటే రూ.100 కోట్లు వ్యయం అవుతుంది.