Saturday, August 31, 2019

Final NRC out in Assam, nearly 2 million stare at uncertain future


అసోం లో ఎన్.ఆర్.సి. తుది జాబితా తకరారు
 ·    అనర్హులుగా 19 లక్షల మంది


అసోంలో జాతీయ పౌర పట్టి (ఎన్.ఆర్.సి) తుది జాబితాను శనివారం విడుదల చేశారు. జాతీయ పౌరసత్వ నమోదుకు మొత్తం 3,30,27,661 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,11,21,004 మంది ధ్రువీకరణ పొందారు. మరో 19,06,657 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో వారంతా విదేశీయులుగా పరిగణనలోకి రానున్నారు. అయితే ప్రభుత్వం వారిపై ఇప్పటికిప్పుడు చర్యలేవీ ఉండవని హామీ ఇస్తోంది. వారికి నాలుగు నెలలు గడువు ఇవ్వనున్నారు. న్యాయస్థానాల్లో తమ భారత పౌరసత్వం గురించి వారు కేసులు దాఖలు చేసుకోవచ్చు. అందుకయ్యే న్యాయసేవా ఖర్చును ప్రభుత్వం భరించనున్నట్లు పేర్కొంది. ఆల్ అసోం స్టూడింట్స్ యూనియన్ (ఆసు) తుది జాబితాపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్.ఆర్.సి. లోని అవకతవకలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆసు ప్రధానకార్యదర్శి లురింజ్యోతి గొగొయ్ చెప్పారు. 1971లో బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చి భారత్ లో నివసిస్తున్న శరణార్థుల ధ్రువపత్రాల్ని ఎన్.ఆర్.సి. అధికారులు తిరస్కరించడం వివాదం రేపుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చి ఉంటున్న వారి పౌరసత్వాన్ని అధికారులు ధ్రువీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న భారతీయుల్ని అనర్హులుగా పరిగణించడంపై పెద్దఎత్తున ఆరోపణల సెగరేగుతోంది. ఈ తుది జాబితాపై తాము ఏమాత్రం సంతోషంగా లేమని బీజేపీ మాజీ ఎంపీ  మంగల్దోయ్ వ్యాఖ్యానించారు. ఎన్.ఆర్.సి. విడుదల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని 10 జన్ పథ్ నివాసానికి వెళ్లి పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కలుసుకున్నారు. ఈ విషయంలో కేంద్రం విఫలమైందని సమావేశంలో ఏకే అంటోనీ, గౌరవ్ గొగొయ్, గులాంనబీ అజాద్, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజిన్ చౌధురి వ్యాఖ్యానించినట్లు సమాచారం. అనంతరం అధిర్ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యలపై వ్యంగ్యోక్తులు విసిరారు. దేశంలో తమ పార్టీ అధికారంలో ఉండబట్టే ఎన్.ఆర్.సి. నిర్వహించగల్గుతున్నామన్న తివారీ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ పార్లమెంట్ లోనూ ఎన్.ఆర్.సి. నిర్వహిస్తారా అని అధీర్ ఎద్దేవా చేశారు.  తనూ బయట నుంచే వచ్చానంటూ తన తండ్రి బంగ్లాదేశ్ లో ఉండేవారని గుర్తు చేశారు. నిజమైన పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించరాదని వారందరికీ రక్షణ కల్పించాలని అధీర్ హితవు చెప్పారు. మరో వంక అసోంలో అల్లర్లు చెలరేగకుండా 144వ సెక్షన్ విధించారు.



Friday, August 30, 2019

India pays in advance for S-400 missiles to Russia


2023లో భారత సైన్యం చేతికి రష్యా ఎస్-400 క్షిపణులు
రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎస్-400 గగనతల రక్షణ క్షిపణులు 2023లో భారత సైన్యం చేతికి అందనున్నాయి. ఈ మేరకు రష్యాకు భారత్ ముందస్తు మొత్తాన్ని (బయానా) చెల్లించింది. భూఉపరితలం నుంచి గగనతలంలో శత్రుదుర్భేద్య మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థ (ఎస్-400) నిర్ణీత గడువులో భారత సైన్యం అమ్ములపొదిలో చేరనుంది. ఇందుకు సంబంధించి భారత్ తో అన్ని అంశాలు పరిష్కృతమై ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు రష్యా ఫెడరల్ సర్వీసెస్ మిలటరీ అండ్ టెక్నికల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్తను భారత్ లోని రష్యా రాయబార వ్యవహారాల మంత్రి రోమన్ బబుష్కిన్ ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రానున్న నాల్గేళ్లలో ఈ  ఎస్-400  క్షిపణి రక్షణ వ్యవస్థ (మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్/ యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్) భారత్ కు అందనున్నట్లు తెలిపారు. భారత్, రష్యాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేర్చడంలో భాగంగా ఒప్పందం ప్రకారం ఈ క్షిపణుల్ని సకాలంలో అందజేయనున్నామన్నారు. రష్యా తయారీ ఎస్-400 క్షిపణికి 600 కి.మీ దూరంలోని లక్ష్యాలను తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. రెండంచెల రక్షణ వ్యవస్థ కల్గిన ఈ క్షిపణులు 1990లో రూపుదిద్దుకుని అనేక పరీక్షల అనంతరం 2007లో రష్యా సైన్యం చెంతకు చేరాయి. ప్రపంచంలో ఈ ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థే ప్రస్తుతానికి అత్యంత ఆధునికమైంది. నాటో (ఉత్తర అమెరికా, యూరప్) దేశాల్లో ఈ క్షిపణుల్ని ఎస్.ఎ-21 గ్రోవ్లర్ గా పిలుస్తారు.

Thursday, August 29, 2019

One of the stalwarts of people's telugu movement Gidugu Rama Murthy


అచ్చతెలుగు దివ్య వెలుగు గిడుగు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. తెలుగు మాతృభాషగా మాట్లాడే వారు సుమారు 11 కోట్ల మంది. దేశంలో ప్రాంతీయ భాషలలో మాట్లాడే వారి సంఖ్యలో తెలుగు వారు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగుది 15వ స్థానం. దేశంలో హిందీ తర్వాత స్థానంలో తెలుగు నిలుస్తోంది. `ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్` గా కీర్తి పొందింది. `దేశ భాషలందు తెలుగు లెస్స` అని శ్రీకృష్ణదేవరాయలతో ప్రశంసలు అందుకుంది. అటువంటి తెలుగును సామాన్య జనం వాడుక భాష లో అందరి దరికి చేర్చిన మహానుభావుల్లో గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ఆద్యులు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడాయన. గిడుగు వాడుక భాషా ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు తర్వాత  అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29 ని `తెలుగు భాషా దినోత్సవం` గా జరుపుకుంటున్నాం.
గిడుగు రామ్మూర్తి పంతులు 1863 లో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వీర్రాజు విష జ్వరంతో మరణించారు. ప్రాథమిక విద్య అనంతరం గిడుగు రామ్మూర్తి పంతులు విజయనగరంలోని మేనమామ గారి ఇంటికి చేరి హైస్కూలు చదువు పూర్తి చేశారు. ఆయనకు 10వ తరగతిలో గురజాడ అప్పారావు గారు సహాధ్యాయి. అనంతరం పర్లాకిమిడి రాజా వారి పాఠశాల్లో 8వ తరగతి చరిత్ర ఉపాధ్యాయుడిగా గిడుగు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ప్రయివేటుగా బి.ఎ. చేశారు. డిగ్రీలో చరిత్రను ముఖ్య పాఠ్యాంశంగా ఎంచుకున్న ఆయన రాష్ట్రంలోనే రెండో ర్యాంక్ సాధించారు.
చదువంటే ఎనలేని మమకారం గల గిడుగు బహుభాషా కోవిధుడు. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృతంతో పాటు సవర భాషను పట్టుబట్టి నేర్చుకున్నారు. సవరలు వారి భాషలోనే చదువుకొనేలా ప్రోత్సహించారు. సొంతంగా పాఠశాల ప్రారంభించి ఉపాధ్యాయుల్ని నియమించి వారికి జీతాలు ఇస్తూ సవరలకు చదువు నేర్పారు. వారిని తన ఇంట్లోనే పెట్టుకుని భోజనం పెడుతూ చదువు చెప్పించారు. స్వయంగా ఆయన సవర భాషలో పుస్తకాలు రాశారు. సవర-ఇంగ్లీషు డిక్షనరీ రూపొందించారు. మద్రాస్ ప్రభుత్వం గిడుగు కృషిని గుర్తించి `రావుబహుదూర్` బిరుదుతో పాటు, కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. ఆనాడే సవరలు, హరిజనులు అంటరాని వారు కాదని వారితో మమేకం అయిన ధీశాలి.
1907లో  ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా ఇంగ్లీషు దొర యేట్సు వచ్చారు. ప్రజలు మాట్లాడే భాష, పాఠ్య పుస్తకాల భాష మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయని యేట్సుకు సందేహం వచ్చింది. ఆ విధంగా వాడుక భాష ఉద్యమం గురజాడ, గిడుగు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుల ద్వారా ప్రారంభమైంది. జనం మాట్లాడే తెలుగు భాషను గ్రంథ రచనకు అనువుగా చేయడానికి ఎనలేని కృషి చేసిన గిడుగుకు వీరేశలింగం పంతులు ఊతం కూడా లభించింది. 1919లో వాడుక భాషా ఉద్యమ ప్రచారం కోసం 'తెలుగు' అనే మాసపత్రిక నడిపారు. వ్యాసాలు, ఉపన్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. స్కూలు, కాలేజీ పుస్తకాల్లోని  గ్రాంథికభాషను క్రమంగా వాడుకభాషలోకి తేవడానికి గిడుగు సాగించిన కృషి ఫలించింది. ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వాడుక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది. తాపీ ధర్మారావు సంపాదకుడిగా ప్రారంభమైన `జనవాణి` అనే పత్రిక వాడుక భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది. వాడుక భాష లో విద్య బోధిస్తేనే ప్రయోజనం ఉంటుందని గిడుగు నిరూపించారు. జనం మాట్లాడే భాష అంతటా వినబడుతూ ఉంటుంది. అదే నిత్య జీవంతో కళకళలాడుతుందని లోకానికి చాటి చెప్పిన మహనీయులు గిడుగు రామ్మూర్తి.  ఆయన 1940 జనవరి 22న రాజమండ్రిలో మరణించారు.

Wednesday, August 28, 2019

J&K administration says more schools to open today; parents worried


కశ్మీర్ లో విద్యార్థుల్లేక బోసిపోతున్న పాఠశాలలు
కశ్మీర్ లోయలో రెండు వారాల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నా విద్యార్థులు రాకపోవడంతో తరగతి గదులు బోసిపోతున్నాయి. ఈ నెల 5న కేంద్రప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో అక్కడ అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. పాఠశాలలతో పాటు అన్ని విద్యాలయాలు, వివిధ కార్యాలయాలు రోజుల తరబడి మూసివేశారు. క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జనజీవనం యథావిధిగా కొనసాగుతోంది. దాంతో ప్రాథమిక పాఠశాలల్ని సోమవారం పున: ప్రారంభించారు. బుధవారం నుంచి ఉన్నత పాఠశాలల్ని తెరిచారు. అయితే కశ్మీర్ లోయ ఇంకా భద్రత దళాల జల్లెడలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దాంతో బాలల్ని పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. పేరుకే పాఠశాలలు తెరుచుకున్నాయి గానీ విద్యార్థులు లేక తరగతులు ఖాళీగా కనిపిస్తున్నాయి. బుధవారం నాటికి కూడా విద్యార్థుల హాజరుశాతం పెరగలేదని జె.కె. ప్రభుత్వ ప్రతినిధి రోహిత్ కన్సాల్ తెలిపారు. విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సి ఉందన్నారు. శ్రీనగర్ లో దాదాపు 200 ప్రాథమిక పాఠశాలల్ని పున: ప్రారంభించారు. అత్యధిక స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా నమోదయింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన దక్షిణ కశ్మీర్ సోపియాన్ లో పదుల సంఖ్యలో పాఠశాలలు తెరిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదని కశ్మీర్ పాఠశాల విద్యా సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్) యూనిస్ మాలిక్ తెలిపారు. స్కూళ్లకు పంపి తమ పిల్లల ప్రాణాలతో తల్లిదండ్రులు చెలగాటమాడరు కదా అని బాట్మాలూ జిల్లా కు చెందిన గుల్జార్ అహ్మద్ వ్యాఖ్యానించారు. తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్తుండగా అల్లర్లు చెలరేగాయన్నారు. దాంతో పరిస్థితి సద్దుమణిగే వరకు వాళ్లను ఇంటి వద్దనే ఉంచినట్లు గుల్జార్ తెలిపారు. కనీసం సెల్ ఫోన్ నెట్ వర్క్స్ పునరుద్ధరించినట్లయితే తమ పిల్లల్ని స్కూళ్లకు పంపగలమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

Tuesday, August 27, 2019

PM meets PV Sindhu, congratulates her for winning gold at BWF World Championships


ప్రధాని మోదీ, మంత్రి రిజిజుల్ని కలిసిన పీవీ సింధు
స్విట్జర్లాండ్ (బాసెల్)లో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన తొలి భారతీయ షట్లర్ గా చరిత్ర సృష్టించిన పీవీ సింధు ప్రధాని మోదీ, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుల్ని కలుసుకుంది. కోచ్ లు పి.గోపీచంద్, కిమ్ జి హ్యూన్, తండ్రి పి.వి.రమణలతో కలిసి ఆమె మంగళవారం ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సింధూ సాధించిన ఘనత యావత్ భారతదేశానికి గర్వకారణమన్నారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ప్రపంచ చాంపియన్ షిప్ లో తొలి స్వర్ణాన్ని సాధించడం ద్వారా సింధు దేశానికి కీర్తిని తీసుకువచ్చిందని..ఆమెను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాల్ని సాధించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి రిజిజు ఆమెకు ఈ సందర్భంగా రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని (చెక్) అందించారు.

Monday, August 26, 2019

Alongside Trump, PM Modi rejects any scope for third party mediation on Kashmir


మోదీపై జోక్ పేల్చిన ట్రంప్
భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరదాగా ఆటపట్టించారు. ఫ్రాన్స్ పట్టణం బియర్రిట్జ్ లో జరుగుతున్న జి-7 సమావేశాలకు హాజరైన సందర్భంగా మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ జోక్ పేల్చారు. మోదీ ఇంగ్లిష్ చక్కగా మాట్లాడతారు.. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో మాట్లాడరంటూ ట్రంప్ చమత్కరించారు. అందుకు మోదీ పెద్దగా నవ్వేస్తూ తన చేతుల్లోకి ట్రంప్ చేయిని తీసుకుని చరిచారు. దాంతో అక్కడున్న వారందరిలో నవ్వులు విరబూశాయి.
కశ్మీర్ సమస్యపై మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టం
దీర్ఘకాల అపరిష్కృత సమస్యగా ఉన్న కశ్మీర్ వ్యవహారాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని ట్రంప్ తో భేటీ సందర్భంగా మోదీ తేల్చిచెప్పారు. ఈ సమస్య పరిష్కారంలో మూడో దేశాన్ని ఇబ్బంది పెట్టబోమన్నారు.  ట్రంప్ తో కలిసి మోదీ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ను కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ పాతపాటే పాడారు. అందుకు బదులుగా ట్రంప్ కశ్మీర్ పై మధ్యవర్తిత్వం వహించడానికి తను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. స్పందించిన అమెరికా కాంగ్రెస్ భారత్, పాక్ ల ద్వైపాక్షిక చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాలని వివాదం రేగకుండా సముచిత ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తో మోదీ కశ్మీర్ సమస్యపై మూడో దేశం జోక్యం అవసరం లేదని నర్మగర్భంగా చెప్పారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం పాక్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి యత్నించి భంగపడింది. ఆ క్రమంలో అమెరికా అధ్యక్షుడికి ఫోన్ చేసి మరీ పాక్ ప్రధాని నానాయాగి చేశారు. దాంతో మోదీ సైతం ఇటీవల ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడి కశ్మీర్ భారత అంతర్భాగమని అందులో తాము దేశీయంగా చేపట్టిన చర్యల్ని వివరించారు. సానుకూలంగా స్పందించిన ట్రంప్ వెంటనే ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసి భారత్ ను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. తాజా భేటీలో ట్రంప్ తో మోదీ మాట్లాడుతూ పాక్ ప్రధానితో కొంతకాలం క్రితం టెలిఫోన్ లో తను సంభాషించినట్లు తెలిపారు. పాక్ లో సమస్యల్ని ఇమ్రాన్ తనతో ఏకరువు పెట్టారన్నారు. ఆ దేశంలోని ప్రజల బాగోగులకు సంబంధించి కూడా భారత్ చేయూత అందిస్తుందని ఇమ్రాన్ కు చెప్పినట్లు మోదీ తెలిపారు.

Sunday, August 25, 2019

Muslims cremate Hindu friend in Assam village


సోదర హిందువుకి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లింలు
అసోంలో మత సామరస్యం మరోసారి వెల్లివిరిసింది. కామరూప్ జిల్లా హిందూముస్లింల సఖ్యతకు అద్దం పట్టింది. ఆదివారం కండికర్ గ్రామంలో ఓ వృద్ధ హిందువుకి దహనసంస్కారాల్ని ముస్లిం సోదరులు నిర్వహించిన ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల రాజ్ కుమార్ గౌర్ శనివారం మరణించారు. దాంతో ఏళ్ల తరబడి అక్కడ జీవనం సాగిస్తున్న ఆయనకు స్థానిక ముస్లింలే అంతిమసంస్కారాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ నుంచి అసోం వలస వచ్చిన రాజ్ కుమార్ కుటుంబం తొలుత రైల్వే కార్టర్స్ లో నివాసం ఉండేవారు. 1990లో తండ్రి మరణించడంతో రాజ్ కుమార్ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో సద్దాం హుస్సేన్ అనే ముస్లిం తన ఇంట్లో ఆయనకు ఆశ్రయం కల్పించారు. రాజ్ కుమార్ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. వారిద్దరూ ముస్లిం యువకుల్నే పెళ్లి చేసుకున్నారు. రాజ్ కుమార్ కూడా దశాబ్దాలుగా ముస్లింలతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. ముస్లింల పండుగలు, పెళ్లి వేడుకల్లో రాజ్ కుమార్ పాల్గొంటూ వాళ్ల బంధువుగా మెలిగారు. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడంతో కండికర్ గ్రామ ముస్లింలే దహన సంస్కారాలకు పూనుకున్నారు. అందుకు అవసరమయ్యే సామగ్రి తదితరాల గురించి తమను అడిగి తెలుసుకున్నట్లు పొరుగున గల ఉపెన్ దాస్ గ్రామవాసులు తెలిపారు. ఒక బ్రాహ్మణుడ్ని ఏర్పాటు చేసుకుని వారు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. ఇటీవల ఎన్.ఆర్.సి. పున: నమోదు (రీ వెరిఫికేషన్)కు అసోం పశ్చిమ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన ముస్లింలకు శివసాగర్, చారయిడియో జిల్లాల హిందూ యువకులు ఆశ్రయం కల్పించి ఆదరించిన సంగతి తెలిసిందే.

Saturday, August 24, 2019

Several Leaders Says Deeply Saddened to Hear the Death of Arun Jaitley


అరుణ్ జైట్లీ అస్తమయం: పలువురు నాయకుల నివాళి
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.30 కు తుదిశ్వాస విడిచారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోది, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియగానే ఆయన స్వగృహానికి చేరుకున్న రాష్ట్రపతి దివంగత నేతకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమిళనాడు పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. హోంమంత్రి అమిత్ షా సమాచారం అందిన వెంటనే అరుణ్ జైట్లీ నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అరుణ్ జైట్లీ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆగస్ట్ 9న ఆయన అస్వస్థకు గురై ఎయిమ్స్ లో చేరారు. అరుదైన కేన్సర్ తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ రెండు వారాల చికిత్స అనంతరం కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి లోనూ ఆయన అమెరికా వెళ్లి కొంతకాలం చికిత్స పొందారు. వాజ్ పేయి ప్రభుత్వంలో న్యాయశాఖ, సమాచార ప్రసారశాఖల్ని నిర్వహించారు. స్వతహాగా న్యాయవాది అయిన ఆయన సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల్లో కేసులు వాదించారు. అరుణ్ జైట్లీ పాత్రికేయులతో సత్సంబంధాలు నెరపిన నేత. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన అడిషినల్ సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు వహించారు. ప్రధాని మోదితో ఆయనకు మూడు దశాబ్దాల అనుబంధముంది. మోది తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఆయన కేబినెట్ లో రక్షణ, ఆర్థిక శాఖల్ని చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో అరుణ్ జైట్లీ తరఫున పీయూష్ గోయల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్ మరణించిన నెలలోనే మరో సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటు. ఆయన అంత్యక్రియల్ని ఆదివారం ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో నిర్వహించనున్నారు.

Friday, August 23, 2019

6-year-old girl raped by 3 schoolmates in Chhattisgarh


ఆరేళ్ల బాలికపై అత్యాచారం ముగ్గురు బాలురపై కేసు నమోదు
ఛత్తీస్ గఢ్  రాజధాని రాయ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆగస్ట్ 20 మంగళవారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. కమట్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బాలిక ఒకటో తరగతి చదువుతోంది.  బాలికను పాఠశాల బాత్రూమ్ లోకి తీసుకెళ్లిన ముగ్గురు బాలురు లైంగికంగా వేధించారు. వీరిలో ఒక బాలుడు ఆ బాలికపై అత్యాచారానికి  ఒడిగట్టాడు. బాలురు అందరూ 10 ఏళ్ల వారే కావడం గమనార్హం. ఈ ఘటనను గమనించిన ఉపాధ్యాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకువచ్చారు. బాధిత బాలిక సహా ముగ్గురు  బాలుర్ని ఆయన వద్దకు తరలించారు. తర్వాత తల్లిదండ్రుల్నిపిలిపించి బాలికను అప్పగించారు. గురువారం రాత్రి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణానికి పాల్పడిన ముగ్గురు బాలురపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో-ఐపీసీ సెక్షన్ 4) కింద కేసులు నమోదు చేశారు. బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలల సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఘటన వివరాల్ని నమోదు చేశారు. బాలికను లైంగికంగా వేధించినందుకు గాను ఇద్దరిపై సెక్షన్-354/ఎ కింద, అత్యాచారం చేసిన బాలుడిపై సెక్షన్-376 ప్రకారం కేసులు నమోదు చేశారు. అయితే ఇంకా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోలేదని సమాచారం.

Thursday, August 22, 2019

Kia Seltos SUV launched by Tiger Shroff in Mumbai


కియా సెల్టాస్ కారును ప్రారంభించిన టైగర్ ష్రాఫ్
మేడ్ ఇన్ ఇండియా కియా సెల్టాస్ కారును కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ముంబయిలో గురువారం ప్రారంభించారు. దక్షిణకొరియా దిగ్గజ అటో మోటార్ కార్ప్ కియా కార్ల ఉత్పత్తి కర్మాగారాన్ని భారత్ లో ఆరంభించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కియా ఉత్పత్తి కేంద్రంలో తయారైన కియా సెల్టాస్ కారు (రూ.9.7లక్షలు) డిజిల్, పెట్రోల్, టర్బో పెట్రో మోడళ్లలో మార్కెట్ లో లభ్యమౌతోంది. కంపెనీ ప్లాంట్ (పెనుగొండ) లో కియా సెల్టాస్ మోడల్ కు సంబంధించి 5,000 కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ మోడల్ ఎస్.యు.వి.లకు ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 32,000 బుకింగ్స్ జరిగినట్లు కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కుక్యాన్ షిమ్ తెలిపారు. కియా సెల్టాస్ ఎస్.యు.వి.కి ఆసియా దేశాలతో పాటు, యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లోనూ డిమాండ్ రావచ్చన్నారు. టర్కీలో తయారవుతున్న హుండై గ్రాండ్ ఐ-10 నియోస్ కు కియా సెల్టాస్ గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. యూరప్ మార్కెట్  ప్రధానంగా హుండై గ్రాండ్ ఎన్ సీరిస్ కార్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. భారత్ లో గత కొద్ది నెలలుగా విక్రయాల పరంగా ఆటోమొబైల్ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో కియా చాలెంజ్ గా తమ కన్జ్యూమర్ ఫ్రెండ్లీ కార్లను విడుదల చేస్తోంది. ప్రతి మూణ్నెలకో కొత్త మోడల్ కారుతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నామని కియా ప్రకటించడం విశేషం.

Wednesday, August 21, 2019

Madame Tussauds welcomes its new entrant..A Burger


టుస్సాడ్స్ మ్యూజియంలో బర్గర్ బొమ్మ
జీవకళ ఉట్టిపడేలా మైనపు బొమ్మల్ని రూపొందించి ప్రదర్శించే టుస్సాడ్స్ మ్యూజియంలో కొత్త స్టార్ కొలువుదీరాడు.  స్టార్ అంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడో లేదంటే ఏ స్పోర్ట్స్ స్టార్ కాదండోయ్.. స్టార్లతో పాటు వారూవీరు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆరగించే బర్గర్.. ఈసారి టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన కొత్త స్టార్. కె.ఎఫ్.సి. బర్గర్ ను మైనంతో రూపొందించి ఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. తినే బర్గర్ కంటే ఈ టుస్సాడ్స్ (మైనపు) బర్గర్ సైజులో 1.5 రెట్లు పెద్దది. అల్లపు రుచితో ప్రపంచవ్యాప్తంగా నోరూరిస్తున్న తమ జింజర్ బర్గర్ ప్రపంచ ప్రసిద్ధ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరడం పట్ల కె.ఎఫ్.సి. ఇండియా మార్కెటింగ్ ఆఫీసర్ మోక్ష్ చోప్రా సంతోషం వ్యక్తం చేశారు. కె.ఎఫ్.సి. జింజర్ బర్గర్ కు టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం దక్కి ఓ సెలబ్రెటీ స్టేటస్ పొందడం తమను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందన్నారు.  అంతరిక్షంలోకి కూడా వెళ్లిన ఏకైక బర్గర్ తమదేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ట్యాటూ (పచ్చబొట్టు) గా తమ బర్గర్ ను పలువురు ముద్రించుకోవడం తెలిసిందేనన్నారు. కె.ఎఫ్.సి. సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారాన్ని ఎల్లలు దాటించడంలో భాగంగా జింజర్ బర్గర్ ను 2017లో అంతరిక్షంలోకి పంపించింది.

Tuesday, August 20, 2019

Rajiv Gandhi birth anniversary: Top Congress leaders pay tributes to former PM


ఘనంగా రాజీవ్ గాంధీ 75వ జయంతి
భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలువురు నాయకులు ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్, ప్రియాంక, కూతురు మిరయా, కొడుకు రేహన్, భర్త రాబర్ట్ వాద్రా పుష్పాంజలి ఘటించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, గులాంనబీ అజాద్ తదితర నాయకులు వీర్ భూమికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ తన తండ్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు వారం రోజుల పాటు స్మారక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రియతమ నేత రాజీవ్ గాంధీ సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికారంటూ సంబంధిత వీడియోను రాహుల్ గాంధీ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

Monday, August 19, 2019

Dr.Manmohan Sing elected to Rajya Sabha from Rajasthan


మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టనున్న మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈసారి ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడుతున్నారు. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల మన్మోహన్ అసోం నుంచి అయిదుసార్లు వరుసగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 2019 వరకు ఆయన అసోం తరఫున సభలో ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం తగినంత మంది శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపుతోంది. రాజస్థాన్ లో గత ఏడాదే అశోక్ గహ్లోత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గతంలో రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ జూన్ లో అకస్మికంగా మరణించారు. దాంతో రాజస్థాన్ నుంచి ఖాళీ పడిన ఆ స్థానం నుంచి మన్మోహన్ ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసింది. ఈసారి బీజేపీ ఆ స్థానం నుంచి తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా 233 మంది సభ్యులు ఎన్నికవుతారు, మరో 12 మందిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ఈ ఎగువ సభలో అధికార బీజేపీకి 78 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండగా కాంగ్రెస్ కు 47 మంది సభ్యులున్నారు.

Sunday, August 18, 2019

Two Nigerians held for duping Chandigarh woman of Rs 44 lakh


మహిళకు రూ.44 లక్షల టోకరా: ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
ఫేస్ బుక్ చాటింగ్ తో మహిళ నుంచి రూ.44 లక్షలు కాజేసిన ఇద్దరు నైజీరియా ఘరానాలను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. చండీగఢ్ సమీపంలో రాజ్‌నంద్ గావ్‌కు చెందిన మహిళను బురిడీ కొట్టించిన నిందితులు కిబీ స్టాన్లీ ఓక్వో (28), న్వాకోర్ (29)లను రాజధాని ఢిల్లీలోని చాణక్య ప్లేస్ లో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సుమారు 8 నెలల పాటు దర్యాప్తు నిర్వహించిన రాజ్‌నందగావ్ పోలీసులు ఢిల్లీలో నిందితుల ఆచూకీ కనుగొని శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు.  ప్రత్యేక బృందం ఇద్దరు నిందితుల్నీఅరెస్టు చేసినట్లు రాజ్‌నందగావ్ పోలీసు సూపరింటెండెంట్ కమ్లోచన్ కశ్యప్ తెలిపారు. ఢిల్లీ నుంచి వీరిని ట్రాన్సిట్ రిమాండ్లో ఆదివారం రాజానందగావ్ కు తీసుకువచ్చారు. ఈ కేసు ఫిర్యాదు గత ఏడాది డిసెంబర్‌లో నమోదైంది. స్టేషన్ పారాకు చెందిన బాధితురాలు తన భర్త పేరిట ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్‌లో డేవిడ్ సూర్యన్ అనే యూజర్ నుంచి గత ఏడాది జులైలో ఆమె తనకు వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించింది. అతను లండన్ లో ఓ షిప్ కెప్టెన్ గా పని చేస్తున్నట్లు పేర్కొని చాటింగ్ కొనసాగించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ల్యాప్‌టాప్, మొబైల్, డైమండ్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల్ని ప్రత్యేక బహుమతులుగా పంపుతున్నట్లు అబద్ధాలు వల్లించాడు.  ఆ తర్వాత ఢిల్లీలోని కస్టమ్స్ ఆఫీసర్ నంటూ మరో నిందితుడు నమ్మబలుకుతూ ఆమెకు ఫోన్ కాల్ చేశాడు. బహుమతుల్ని స్వీకరించడానికి కస్టమ్స్ డ్యూటీగా సుమారు రూ.62,500 చెల్లించాలని కోరాడు. బాధితురాలు ఆ డబ్బు ఆన్ లైన్ అకౌంట్ ద్వారా చెల్లించింది. బహుమతుల క్లియరెన్స్ కోసం సర్వీస్,డాక్యుమెంట్,ప్రాసెసింగ్ ఛార్జ్, ఆదాయపు పన్ను తదితరాలకు డబ్బు చెల్లించాలంటూ ఆమెకు వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి కాల్స్, మెయిల్స్ వచ్చాయి. దాంతో బాధితురాలు గత ఏడాది జులై-నవంబర్ మధ్య రూ.44 లక్షలు చెల్లించింది. అయితే ఆ తర్వాత ఆమెకు ఏ బహుమతులు అందకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి డిసెంబర్ 1 న కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం పోలీసుల వేట మొదలైంది. నిందితులు ఉపయోగించిన డబ్బు, మొబైల్ నంబర్లు, ఇ-మెయిల్ ఐడీ, బాధితురాలు బదిలీ చేసిన సొమ్ము జమ అయిన బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు ఒక్కొక్కటిగా గుర్తిస్తూ కేసు చిక్కుముడిని విప్పారు. చివరకు దర్యాప్తులో నిందితుల స్థావరం ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. ప్రత్యేక బృందం మెరుపుదాడి చేసి నిందితులిద్దర్నీ పట్టుకుని వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 34 (ఉమ్మడి ఉద్దేశం) 66 డి (కంప్యూటర్ ద్వారా మారు వేషంలో మోసం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Saturday, August 17, 2019

PM Modi in Bhutan: RuPay card launched, 9 MOUs exchanged

భూటాన్ లో రూపే కార్డు సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోది

భారత ప్రధాని నరేంద్ర మోది భూటాన్ లో శనివారం రూపే కార్డు సేవల్ని ప్రారంభించారు. మోది ఆ దేశ ప్రధాని డాక్టర్ లోటే షెరింగ్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య   విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మాంగేదాచులో జలవిద్యుత్ కేంద్రాన్నీ ప్రధాని ప్రారంభించారు. అనంతరం థింపులో ఇస్రో ఎర్త్ స్టేషన్ నూ మోది ఆరంభించారు. హిమాలయ సానువుల రాజ్యంలో రూపే సేవలు ప్రారంభమవ్వడం పట్ల మోది సంతోషం వ్యక్తం చేశారు. `రూపే కార్డు సేవలు ఆరంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది` అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత మే లో ఆయన సింగపూర్ లోనూ ఈ కార్డును ప్రారంభించారు. దాంతో ఉభయదేశాల ప్రజలు డిజిటల్ వాలెట్ (పరస్పర నగదు మార్పిడి ఆమోదం) సేవల్ని వినియోగించే అవకాశం కల్గింది. తాజాగా భారత్ రూపే కార్డు డిజిటల్ సేవలు అమలవుతున్న రెండో దేశంగా భూటాన్ నిలుస్తోంది. మార్చి నుంచే భూటాన్ లో ఈ కార్డు సేవల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తద్వారా భారత్ భూటాన్ ల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాల్లో ఇతోధిక పురోగతిని ఆశిస్తున్నారు. సింగపూర్ లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ద్వారా డిజిటల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా భారత్ లో ఈ రూపే కార్డు ద్వారా రిటైల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ ఫర్ సేవల గొడుగులా ఎన్.పి.సి.ఐ. పనిచేస్తోంది. రూపే కార్డులు మరికొన్ని దేశాల్లోనూ అమలులో ఉన్నాయి.

Friday, August 16, 2019

UNSC to discuss Kashmir issue on China`s request


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ పై చర్చ !
నాలుగు దశాబ్దాల అనంతరం కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చైనా ఈ మేరకు భద్రతా మండలికి లేఖ రాయడంతో సుదీర్ఘకాలం అనంతరం కశ్మీర్ అంశం అంతర్జాతీయ వేదికపై చర్చకు రానుంది. ఈ చర్చలో పాకిస్థాన్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ చర్చను రహస్యంగా సాగించనున్నట్లు యూఎన్ఎస్సీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా మండలి అధ్యక్షుడు జోన్నా రొనెకా(పోలెండ్) ఈ రహస్య కీలక చర్చ చేపట్టే వేదిక, తేదీని నిర్ణయించనున్నారు. భారత అంతర్గత భూభాగమైన జమ్ముకశ్మీర్ లో 370-ఎ (స్వయంప్రతిపత్తి) అధికరణం రద్దు, రాష్ట్ర విభజన చేపట్టిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ యూఎన్ఎస్సీ వేదిక పైకి వచ్చింది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా ఇందుకు సంబంధించి పావులు కదిపింది. కశ్మీర్ అంశంలో భారత్ వైఖరిని చైనా మినహా యూఎన్ఎస్సీలో మిగిలిన నాలుగు శాశ్వత సభ్యదేశాలు రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సమర్ధించాయి. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆ వివాదాన్ని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరాయి. బుధవారం (ఆగస్ట్14) నాడు భద్రతా మండలిలో సిరియా, మధ్య ఆఫ్రికాల అంశం చర్చకు వచ్చింది. అయితే అదే సమయంలో కశ్మీర్ అంశంపై చర్చ జరపాలంటూ చైనా లేఖ ఇచ్చింది. చైనా ఈ మేరకు పట్టుబట్టగా ఫ్రాన్స్ ఈ అంశంపై కింది స్థాయిలో (ద్వైపాక్షిక) చర్చలు జరిగితే చాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కశ్మీర్ అంశంపై భద్రతా మండలిలో చివరిసారిగా 48 ఏళ్ల క్రితం చర్చ జరిగింది. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) వాసులు పాకిస్థాన్ అరాచక పాలనకు తాళలేక వేలసంఖ్యలో శరణార్థులుగా సరిహద్దులు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చారు. మరో వైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగి భారత్ భూభాగంపై మోర్టార్ దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో తూర్పు పాకిస్థాన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భారత్ అండగా నిలవాల్సి వచ్చింది. శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకుంటుండగా పాకిస్థాన్ యుద్ధానికి తొడగొట్టి పరాజయం పాలైంది. అమేయ భారత సైన్యం శక్తియుక్తులకు పాకిస్థాన్ తోకముడిచింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్లే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. బీజేపీ దివంగత అగ్రనేత వాజ్ పేయి సైతం నాడు ఇందిరను అపర కాళికామాతగా ప్రశంసించారు. ఆనాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం, కశ్మీర్ అంశం చర్చకు వచ్చాయి.

Thursday, August 15, 2019

Phone tapping: Cong demands probe as ruling BJP steps up



కర్ణాటకలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్ రగడ
కర్ణాటక మరో వివాదానికి వేదికయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాజా వివాదానికి తెరతీశారు. ప్రస్తుత సీఎం బి.ఎస్.యడ్యూరప్ప కాంగ్రెస్ నేతల ఆరోపణలకు స్పందిస్తూ విచారణకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ పోలీసు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.ఎస్.సదానంద గౌడ విలేకర్లతో మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం క్రిమినల్ నేరంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణతో ట్యాపింగ్ దోషుల్ని పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు. సదానంద గౌడ స్వల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూర్ ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగర అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సీఎం యడ్యూరప్ప నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నప్పుడు నగరానికి కొత్త కమిషనర్ గా భాస్కర్ రావు నియమితులు కానున్నారంటూ ముందుగానే మీడియాకు విడుదలయిన ఆడియో టేప్ తాజా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి కేంద్రబిందువయింది. కమిషనర్ తో పాటు ఇద్దరు ఐ.పి.ఎస్ ఆఫీసర్ల టెలిఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ఉదంతంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 18,23) ముగిశాక మే,జూన్ ల్లో మొత్తం మూడుసార్లు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు బట్టబయలయింది. కొత్త సీఎం యడ్యూరప్ప బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ గా అలోక్ కుమార్ సింగ్ (1994 బ్యాచ్) స్థానంలో భాస్కర్ రావు(1990 బ్యాచ్)ను ఆగస్ట్ 2న నియమించిన సంగతి తెలిసిందే. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు భాస్కర్ రావు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) హోదాలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కె.ఎస్.ఆర్.పి) విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు నిర్ధారణ అయింది. అలోక్ సింగ్ కమిషనర్ గా కనీసం మూడు నెలలు పనిచేయకుండానే కె.ఎస్.ఆర్.పి.కి బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సీఎల్పీ  నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం తనకు తెలియదన్నారు.
1988లో ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా పార్టీ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 88 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించి చివరకు ఫోన్ల ట్యాపింగ్ వివాదం వల్ల పదవి నుంచి తప్పుకున్నారు.

Wednesday, August 14, 2019

Chandrayaan-2 Successfully Enters Lunar Transfer Trajectory


చంద్రుని పరిభ్రమణ కక్ష్యలోకి చంద్రయాన్-2 వ్యోమనౌక

చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని పరిభ్రమణ మార్గంలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి 02.21కి విజయవంతంగా వ్యోమనౌక చంద్రుని కక్ష్య దిశగా ముందుకు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రయాన్-2ను జులై 23 న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. జీఎస్ఎల్వీ ఎం.కె-3 ఎం-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక వివిధ దశలను దిగ్విజయంగా దాటుతూ పురోగమిస్తోంది. బెంగళూరులోని అబ్జర్వేటరీ కేంద్రం నుంచి వ్యోమనౌక స్థితిగతుల్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. తాజాగా వ్యోమనౌక ఇంజిన్ లోని ద్రవ ఇంధనాన్ని 1,203 సెకన్ల పాటు మండించారు. ఆగస్ట్ 20న ప్రస్తుత చంద్రుని కక్ష్యలోకి వ్యోమనౌక చేరుకుంటుంది. మరోసారి ఆ రోజు వ్యోమనౌక ఇంజిన్ లో ద్రవ ఇంధనాన్ని మండించనున్నారు. అక్కడ నుంచి అయిదు దశల ప్రయాణం అనంతరం తుది లక్ష్యంలోకి అడుగుపెడుతుంది. తుది అయిదో దశలో చంద్రగ్రహ ఉపరితలానికి 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి వ్యోమనౌక చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

Tuesday, August 13, 2019

Jahnavi kapoor prays lord sri venkateswara in tirumala today


శ్రీదేవి జయంతి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి
బాలీవుడ్ నటి జాహ్నవి మంగళవారం తిరుమలలో స్వామి వారిని  దర్శించుకున్నారు. తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా ఆమె కాలినడక మార్గంలో శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో తల నేలకు తాకించి మోకాలి  ఆరాధన చేశారు. హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ అంటూ జాహ్నవి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తరచు జాహ్నవి స్వామి ఆలయానికి విచ్చేస్తుంటారు. ఈసారి తెలుగు సంప్రదాయ దుస్తుల్లో స్నేహితులతో కలిసి స్వామి సన్నిధికి విచ్చేశారు. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ విధిగా ఆమె స్వామి వారి సన్నిధికి వస్తుంటారు. ఇంతకుముందూ జాహ్నవి తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ లతో కలిసి తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకుపచ్చ వోణి బంగారు రంగు పరికిణి ధరించిన ఆమె స్వామి సేవలో పాల్గొన్న ఫొటోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ ఫొటోలకు వేల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సాధించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్ రూమ్ టబ్ లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Monday, August 12, 2019

Vikram lander will land on moon as tribute to Vikram Sarabhai from crores of Indians:PM Modi


చందమామపై విక్రమ్ ల్యాండర్.. అదే భారత అంతరిక్ష పితామహునికి ఘన నివాళి:ప్రధాని మోది
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక పార్శ్వమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుండడమే భారత అంతరిక్ష ప్రయోగ పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ కి నిజమైన నివాళి అని ప్రధాని మోది పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోది వీడియో సందేశమిస్తూ ఆయన సేవల్ని స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపకుడిగా విక్రమ్ సారాభాయ్ సేవలు చిరస్మరణీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా భారతీయ సంస్కృతి, సంస్కృత భాషా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. పిల్లల్లో ఆధునిక శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో పాటు, భారతీయ సంస్కృతి విలువల్ని పెంపొందించడం, సంస్కృత భాషా అభిలాషను ప్రోత్సహించేందుకు పాటు పడ్డారని ప్రధాని చెప్పారు. డాక్టర్ హోమీ బాబా మరణంతో యావత్ ప్రపంచం శాస్త్రసాంకేత విజ్ఞాన రంగంలో ఎదుర్కొంటున్న లోటును విక్రమ్ సారాభాయ్ తీర్చారన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ వ్యాప్తంగా నీరాజనాలందుకుంటున్న ఇస్రోను నెలకొల్పిన విక్రమ్ సారాభాయ్ `భారతమాతకు నిజమైన పుత్రుడు` అని చైర్మన్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ఆయన ఓ అద్భుతమైన సంస్థకు అంకురార్పణ చేశారని కొనియాడారు. భౌతికశాస్త్రం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అణుశక్తి రంగాల్లో విక్రమ్ సారాభాయ్ సేవలు నిరుపమానమన్నారు.
విక్రమ్ సారాభాయ్ ఆగస్ట్ 12, 1919లో అహ్మదాబాద్ (ఉమ్మడి మహారాష్ట్ర) లో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1942లో ఆయన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు. ఇస్రోతో పాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఎ) సంస్థలను నెలకొల్పారు. భారత అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా) కి 1966-1971 వరకు చైర్మన్ గా వ్యవహరించారు. 1966లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. 1971లో తన 52వ ఏట తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ పరమపదించారు. మరణానంతరం 1972లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.   

Sunday, August 11, 2019

Abrogation of 370 is the need of the hour: Vice President venkaiah Naidu


జమ్ముకశ్మీర్ లో 370 అధికరణం రద్దు అనివార్యం: ఉపరాష్ట్రపతి
దేశ భద్రత, సమగ్రతల కోణంలో ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అత్యవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం చెన్నైలో ఆయన తన రెండేళ్ల పదవీకాలంపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. 370 అధికరణం రద్దుకు పార్లమెంట్ ఆమోదం లభించినందున ఇప్పుడు ఆ విషయంపై తను స్వేచ్ఛగా మాట్లాడుతున్నానన్నారు. ఈ ఆర్టికల్ రద్దు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రొఫెసర్ తనను జమ్ముకశ్మీర్ ను చూశారా? అని ప్రశ్నించినట్లు ఉపరాష్ట్రపతి చెప్పారు. మన ముఖంలో ఉండే రెండు కళ్లు కూడా ఒకదాన్ని మరొకటి చూడలేవు..కానీ ఒక కంటికి బాధ కల్గితే రెండో కంట్లోనూ నీరు ఉబికి వస్తుందని వెంకయ్య అన్నారు. అదే విధంగా భారత జాతి ప్రయోజనాల రీత్యా దేశమంతా ఏకరీతిగా ముందడుగు వేయాలని చెప్పారు. రాష్ట్రాలు, ప్రాంతాలన్న తేడా లేకుండా సంక్షేమ ఫలాలు దేశమంతా అందాలన్నారు. జమ్ముకశ్మీర్ లో జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలై ప్రగతి నెలకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు వల్ల ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. తమ పార్టీకి రాజ్యసభలో కనీస మెజార్టీ లేదని.. 370 ఆర్టికల్ రద్దు బిల్లును తొలుత ఆ సభలోనే ప్రవేశపెడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు నాటి పరిస్థితులు నెలకొంటాయేమోనన్న చిన్న సందేహం కల్గిందన్నారు. అయితే పెద్దల సభలో బిల్లు సజావుగా ఆమోదం పొందిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అపొలో హాస్పిటల్స్ చైర్మన్ పి.సి.రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్, రాజస్థాన్ విశ్వవిద్యాలయం ఉపకులపతి కె.కస్తూరి రంగన్, వి.ఐ.టి. వ్యవస్థాపకులు, చాన్స్ లర్ జి.విశ్వనాథన్ తదితరులు ఉపరాష్ట్రపతిని ఈ సందర్భంగా అభినందించారు.

Saturday, August 10, 2019

Tens of thousands join Moscow opposition rally after crackdown


నిష్పాక్షిక ఎన్నికల కోసం రష్యాలో కదం తొక్కిన జనం
నిష్పాక్షికంగా స్వేచ్ఛాయుత రీతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ (ఓపెన్ రష్యా మూవ్ మెంట్) రష్యా రాజధాని మాస్కో లో పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు దిగారు. మాస్కో స్క్వేర్ లో శనివారం సుమారు 40 వేల మంది నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ `పుతిన్ ఇప్పటికీ చెప్పిన అబద్ధాలు చాలించండి..మాకు ఓటు వేసే స్వేచ్ఛ కల్పించండి` అంటూ నినాదాలు చేశారు. దాదాపు 20 ఏళ్లగా అధ్యక్ష, ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న 66 ఏళ్ల పుతిన్ నేరుగా ప్రజల నిరసనల్ని ఎదుర్కోవడం ఇదే ప్రథమం. తాజా ర్యాలీలో 20 వేల మంది వరకు హాజరుకావచ్చని పోలీసులు వేసిన అంచనా తప్పింది. 2012లో దేశాధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టడం ఇదే ప్రథమం. జులై 21న కూడా మాస్కో స్క్వేర్ లో పెద్ద ఎత్తున జనం ఆందోళనకు దిగారు.16 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈ సందర్భంగా ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ రాజకీయ వివాదాన్ని రాజేస్తున్నారని ఆరోపించారు. మాస్కోలో గల 1 కోటీ 50 లక్షల మందిని  ఆ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ప్రజా పక్షం వహిస్తున్న ప్రతిపక్ష అభ్యర్థుల్ని స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికారులు అంగీకరించకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. దాంతో వందల సంఖ్యలో నిరసనకారుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దేశమే ఒక ఖైదుగా పౌరులు బందీలుగా మారినట్లు ప్రస్తుత పరిణామాలు పరిణమించాయని ఓపెన్ రష్యా ఉద్యమ కర్త డిమిత్రి ఖోబోటోవ్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు చర్యల్ని ఖండిస్తూ తాజాగా ఈరోజు మళ్లీ ప్రజలు ఆందోళనకు దిగారు. సెప్టెంబర్ లో సిటీ ఆఫ్ పార్లమెంట్స్ (స్థానిక సంస్థలు) కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పుతిన్ వ్యతిరేకులైన పలువురు ప్రతిపక్ష నాయకుల్ని పోటీ చేయడానికి వీలులేకుండా జైళ్లకు తరలించారు. ఆందోళనకు దిగి చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రతిపక్ష నాయకుడు డిమిత్రి గుడ్ కోవ్ కు 30 రోజుల కారాగారం విధించారు. ఆయన భార్య వలెరియా గుడ్ కోవ్ శనివారం నిర్వహించిన మాస్కో ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి పౌరులకు అధికారంలో భాగస్వామ్యం వహించే హక్కు ఉందని కానీ అందుకు పాలకులు భీతిల్లుతున్నారని వ్యాఖ్యానించారు.

Friday, August 9, 2019

Hong Kong protesters kick off three-day airport rally


హాంకాంగ్ లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య ఉద్యమం
చైనా ఏలుబడిలోకి వచ్చిన హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం మహోజ్వల రూపం దాల్చింది. శుక్రవారం చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి వేల సంఖ్యలో ప్రజాస్వామ్య ఉద్యమకారులు చొచ్చుకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్లే రహదారులన్నీ ఉద్యమకారులతో నిండిపోయాయి. దేశంలో (చైనా ఆధీనంలో ఉన్న తమ ప్రాంతం-టెరిటరీ) ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని కోరుతూ గత ఏప్రిల్ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మూడ్రోజులు విమానాశ్రయాల ముట్టడికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమకాంక్షను వెలిబుచ్చడం ద్వారా అంతర్జాతీయంగా మద్దతు సాధించేందుకు విమానాశ్రయాల ముట్టడికి శ్రీకారం చుట్టారు. నిరసనకారులు ముఖ్యంగా యువత ఉద్యమాన్ని ముందుకు నడుపుతోంది. నల్లని దుస్తులు ధరించిన ఆందోళనకారులు ప్లకార్డులు, బేనర్లు చేతపట్టుకుని రహదారుల మీదుగా నినాదాలు చేసుకుంటూ చెక్ లాప్ కాక్ విమానాశ్రయంలోకి చొచ్చుకువచ్చారు. ఏప్రిల్ లో తొలిసారి ఈ విమానాశ్రయాన్ని ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఇదేవిధంగా ముట్టడించారు. సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకుంటూ ఉద్యమకారులు వందలు, వేల సంఖ్యలో విమానాశ్రయం ముట్టడి దిశగా ముందుకు కదిలారు. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుంచి చైనా ఏలుబడిలో వచ్చిన సంగతి తెలిసిందే. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉద్యమాన్ని శాంతింపజేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. నిరసనకారులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వం దిగరావడం ఉండదని తేల్చి చెప్పారు. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్య పరిష్కారమౌతుందన్నారు. వాస్తవానికి ఏప్రిల్ లో ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రజాస్వామ్య ఉద్యమం సెగ రేగింది. అనంతరం విద్యార్థులు, యువత చెంతకు చేరిన ఉద్యమం ప్రస్తుతం ఊపందుకుంది. 428 చదరపు మైళ్ల విస్తీర్ణం కల్గిన హాంకాంగ్ జనాభా సుమారు 74 లక్షలు. ద్రవ్య వినిమయంలో హాంకాంగ్ డాలర్ ప్రపంచంలోనే 13 స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ ప్రజల భాష కంటోనీస్ కాగా ప్రస్తుతం అధికార భాషలుగా మాండరీన్ (చైనీస్), ఇంగ్లిష్ చలామణి అవుతున్నాయి. బ్రిటన్ హయాంలో హాంకాంగ్ వలస ప్రాంతానికి `సిటీ ఆఫ్ విక్టోరియా` నగరం రాజధానిగా ఉండేది. ప్రసుత్తం హాంకాంగ్ టెరిటరీ రాజధాని బీజింగ్. తమర్ లో గల చట్ట సభ (లెజిస్లేటివ్ కౌన్సిల్) లో ప్రతినిధులు సమావేశమవుతుంటారు. బిల్లుల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు రూపొందిస్తారు. ప్రాంతీయంగా చట్టాలు చేసే అధికారం చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే ఉంటుంది. హాంకాంగ్ లో 2016లో జరిగిన ఎన్నికల్లో 22 పార్టీలకు చెందిన సభ్యులు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. బీజింగ్ అనుకూల పార్టీల కూటమి, ప్రజాస్వామ్య ఉద్యమ పార్టీల కూటమి, స్థానిక ప్రయోజనాల పరిరక్షణ పార్టీల కూటమిగా ఈ 22 పార్టీల నుంచి మూడు గ్రూపులు ఏర్పడ్డాయి.

Thursday, August 8, 2019

Narendra Modi speech: Article 370 was a hurdle for development of Jammu & Kashmir, says PM


జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు ప్రపంచానికి తమ సత్తా చాటాలి:ప్రధాని

జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రజలు తమ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్ లో అధికరణం 370 రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆ రాష్ట్రాన్ని విడగొట్టిన అనంతరం తొలిసారి ప్రధాని మోదీ దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని టీవీలు గురువారం ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అయితే జె&కె ను నిరంతరం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచబోమన్నారు. పరిస్థితులు చక్కబడిన అనంతరం తిరిగి రాష్ట్ర హోదాను కట్టబెడతామని చెప్పారు. భద్రతా బలగాలు జె&కె లో శాంతిభద్రతల పరిరక్షణకు ఇతోధిక సేవలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దేశ రక్షణలో అమరులైన వారి త్యాగాలను తమ సర్కారు సదా స్మరించుకుంటోందన్నారు. జమ్ముకశ్మీర్ లడఖ్ ప్రాంతాల ప్రత్యేకతల్ని, ప్రజల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 త్వరలో అసెంబ్లీ ఎన్నికలు

జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగిన సంగతిని ఆయన ప్రస్తావించారు. ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో రానున్న రోజుల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవాలని కోరారు. తద్వారా సమర్థులైన  ముఖ్యమంత్రి అధికారాన్ని చేపడతారని చెప్పారు. క్రితంసారి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. దాంతో పీడీపీకి బీజేపీ మద్దతిచ్చింది. మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో బీజేపీ తమ మద్దతును ఉపసంహరించుకుంది. రాష్ట్రం మళ్లీ గవర్నర్ పాలన లోకి వెళ్లింది. ఆర్నెల్ల తర్వాతా అక్కడ పరిస్థితి చక్కబడకపోవడంతో గవర్నర్ పాలన కొనసాగుతోంది. 

Wednesday, August 7, 2019

Prez, PM, Sonia among hundreds who pay homage to Swaraj at her residence


సుష్మా స్వరాజ్ కు నేతల కన్నీటి వీడ్కోలు
భారత మాజీ విదేశాంగశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుష్మాస్వరాజ్ (67)కు దేశ విదేశాలకు చెందిన నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా (కార్డియక్ అరెస్ట్-గుండె ఆగిపోవడం) మరణించారు. అంతకు కొద్ది సేపు క్రితం కూడా జమ్ముకశ్మీర్ దేశంలో పరిపూర్ణంగా విలీనమైనందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా దేశ ప్రధాని, హోంమంత్రులు మోదీషాల్ని అభినందిస్తూ చిరకాల స్వప్నాన్ని ఈరోజు నిజం చేశారంటూ ప్రశంసించారు. సమాచారం అందగానే పార్టీలకతీతంగా నేతలు బుధవారం ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ నివాసానికి చేరుకుని ఆమె పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. సుష్మా మరణవార్త విని ఆమె గురువు బీజేపీ అగ్రనేత అద్వానీ తల్లడిల్లిపోయారు. కంటతడి పెడుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. సుష్మా తన ప్రతిపుట్టిన రోజుకు వచ్చి ఇష్టమైన చాక్లెట్ కేక్ ఇచ్చి వెళ్లేవారంటూ అద్వానీ గుర్తు చేస్తుకున్నారు. తమ పార్టీలోకి యువకెరటంలా వచ్చిన సుష్మా అనంతర కాలంలో అత్యున్నతమైన నేతగా ఎదిగారన్నారు. ఉగాండా అధ్యక్షులు మరియా ఫెర్నాండ ఎస్పినోస నివాళులర్పించారు. సుష్మా జీవిత కాలం ప్రజాసేవకు అంకితమైన ఓ గొప్ప నేతగా సంతాప సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి, హోంమంత్రి అమిత్ షా, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నాయకులు బృందా కారత్, బీఎస్పీ అధినేత్రి మాయవతి, ఎస్పీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ తదితరులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానుల కడసారి నివాళుల కోసం సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి తరలించి కొద్దిసేపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అనంతరం లోదీ రోడ్ లోని శ్మశానవాటికలో సుష్మాస్వరాజ్ అంత్యక్రియల్ని నేతలు, అభిమానులు అశ్రునయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.

Tuesday, August 6, 2019

Parliament passes Consumer Protection Bill


వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు-2019కు పార్లమెంట్ ఆమోదముద్ర
వినియోగదారుల హక్కుల రక్షణకు సంబంధించిన బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఎగువ సభ మంగళవారం వినియోగదారుల రక్షణ బిల్లు-2019ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇంతకుముందే లోక్ సభలో ఈ బిల్లు పాసయింది. ఈ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ స్థాయీ సంఘం పేర్కొన్న అయిదు సూచనల్ని చేరుస్తూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 1986 మార్చి 15 నాటి వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం స్థానంలో ప్రస్తుత పార్లమెంట్ ఆమోదం పొందిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం-2019 అమలులోకి రానుంది. సీపీఐ సభ్యులు డెరెక్ ఒబెరాయ్, కెకె రాగేష్ సూచనల ప్రకారం బిల్లులో సవరణలకు గాను పార్లమెంట్ స్థాయి సంఘానికి పంపామని మంత్రి పాశ్వాన్ తెలిపారు. అత్యధిక సభ్యుల అభ్యంతరాల మేరకు ఆరోగ్య సంరక్షణాంశాల్ని బిల్లు నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు చెప్పారు. అవివాదాస్పదంగా రూపుదిద్దుకున్న తాజా వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు ప్రకారం వినియోగదారులు వస్తు నాణ్యత, సేవలకు సంబంధించిన ఫిర్యాదుల్ని వినియోగదారుల వివాద పరిష్కారాల కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో కమిషన్, ఫోరంల్లో ఫిర్యాదు చేసి న్యాయం పొందే అవకాశం లభిస్తుంది. వినియోగదారులకు లోపభూయిష్ఠ సేవలు, నాణ్యత లేని వస్తువులు విక్రయించినట్లయితే కొత్త వస్తువులు లేదా సొమ్ము అందజేతకు సంబంధించి  న్యాయం జరిగేలా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అవసరమైన పక్షంలో పర్యవేక్షణ చేస్తుంది.

Monday, August 5, 2019

Assisted dying:Australian cancer patient first to use new law


ఆస్ట్రేలియాలో స్వచ్ఛంద మరణం పొందిన తొలి కేన్సర్ రోగి

కేన్సర్ తుది దశకు చేరుకుని వ్యధ అనుభవిస్తున్న ఆస్ట్రేలియా మహిళ కెర్రీ రాబర్ట్ సన్(61) కారుణ్య మరణం పొందారు. యూథనేష్యా (వ్యాధి నయం అవుతుందనే ఆశ లేనప్పుడు మందులతో ప్రాణం పోగొట్టడం) ద్వారా ప్రాణాలు విడిచిన తొలి కేన్సర్ రోగి ఆమె. విక్టోరియా రాష్ట్రంలో ఆమె తనకు స్వచ్ఛంద మరణం ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిపుణులైన వైద్యుల సమక్షంలో మరణాన్ని ఆశ్రయించారు. ఈ వివాదాస్పద `కారుణ్య మరణ చట్టం` ఆ రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చింది. ఆరు నెలలకు మించి రోగి బతకరనే వైద్యుల నివేదిక ఆధారంగా సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణలో మరణాన్ని ప్రసాదిస్తారు. భరించలేని బాధను అనుభవిస్తున్న రోగి స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటూ దరఖాస్తు చేసిన 29 రోజులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. జూన్ లో ఈ మేరకు అభ్యర్థించిన కెర్రీకి జులైలో ప్రభుత్వం అనుమతించింది. కుటుంబ సభ్యులు కూడా `ఆమె కోరుకున్న అధికారం మరణం`(The empowered death that she wanted) అని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కెర్రీకి జాక్వి, నికోల్ అనే ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె అంతిమ ఘడియల్లో బంధువులందరూ దగ్గరే ఉన్నామని.. తన తల్లి కెర్రి చివరి మాటగా జీవితాన్ని నిరాడంబరంగా, హుందాగా గడపమని సూచించినట్లు నికోల్ రాబర్ట్ సన్ తెలిపింది. ఆమె జీవించిన క్షణాలన్నీ సంతోషంగా ఉండేటట్లు చూసుకున్నామని అలాగే ఆమె మరణం లోనూ ప్రశాంతంగా సాగిపోయేందుకు సహకరించామంది. రాబర్ట్ సన్ ప్రకటనను `చారిటీ గో జెంటిల్ ఆస్ట్రేలియా` విడుదల చేసింది. 2010 నుంచి బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న కెర్రీ 2019 జులై వరకు కిమో థెరపీ, రేడియేషన్ చికిత్స తీసుకున్నారు. ఆమె ఈ చికిత్సలు తీసుకుంటున్న క్రమంలో అనేక సైడ్ ఎఫెక్ట్ లకు గురయ్యారు. కేన్సర్ ఆమె శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించింది. ఎముకలు, ఊపిరితిత్తులు, మెదడు, కాలేయ భాగాలకు వ్యాధి సోకింది. భరించలేని బాధను అనుభవిస్తున్న ఆమె విక్టోరియా రాష్ట్రంలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మరణాన్ని పొందింది. ఇదే తరహా కారుణ్య మరణాలు కెనడా, నెథర్లాండ్స్, బెల్జియంల్లో అమలులో ఉన్నాయి.