Tuesday, December 27, 2022

Covid BF-7 Sub Variant Scare: Mock Drill In Hospitals Across Country

దేశ వ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బి.ఎఫ్-7 ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మంగళవారం మాక్ డ్రిల్ చేపట్టారు. కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మార్గదర్శకత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు సమాయత్తమయింది. గత కొన్ని రోజులుగా చైనా, జపాన్ , హాంకాంగ్, దక్షిణకొరియా తదితర దేశాల్లో బి.ఎఫ్-7 కల్లోలం సృష్టిస్తోంది. దాంతో దేశంలో మోదీ సర్కారు అప్రమత్తమయింది. వ్యాక్సిన్లు, మందులతో పాటు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రుల్లో బెడ్లు తదితరాల్ని సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు దేశం మొత్తం కరోనా సన్నద్ధతపై మాక్ డ్రిల్ చేపట్టింది. కొత్త వేరియంట్ ప్రభావం మనదేశంపై అంతగా ఉండకపోవచ్చునంటూనే జాగ్రత్తలు తప్పక పాటించాలని కేంద్రం కోరుతోంది. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కుల్ని తప్పనిసరి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Wednesday, December 21, 2022

CM YSJagan send Tab gifts with Byjus content to 8th class students of A.P

8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

ఏపీలోని ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను బహుమతిగా అందించే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి జడ్పీ హైస్కూల్ లో బుధవారం ఉదయం ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు. డిజిటల్ విప్లవంలో విద్యార్థుల్ని సైతం భాగస్వాముల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బాలబాలికలు నాణ్యమైన విద్యను అందిపుచ్చుకోవాలనే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను కానుకగా అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రతిఏటా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేస్తామన్నారు. ఈ ఏడాదికి సంబంధించి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ట్యాబ్ ల పంపిణీ జరుగనుంది. రాష్ట్రంలోని 9703 పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 4,59,564 మంది పిల్లలకు, 59,176 మంది ఉపాధ్యాయులకు వీటిని అందించనున్నారు.  ఇందుకుగాను రూ.686 కోట్లను వెచ్చించి మొత్తం 5,18,740 ట్యాబ్ లను పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు బైజూస్ కంటెంట్ ను అందించనున్నారు. ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్ ల్లో ఆ పాఠాలను చూసి పిల్లలు నేర్చుకునేందుకు ఏర్పాటు చేశారు. ఈరోజు సీఎం జగన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా బాలలు ముక్తకంఠంతో శుభాకాంక్షలు తెలిపారు.

Tuesday, November 15, 2022

Tollywood Legendary Veteran Hero SuperStar Krishna

ఆయనే కీర్తి.. ఆయనో స్ఫూర్తి

తెలుగు చలనచిత్రసీమ పరిశ్రమగా ఎదిగి మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అత్యధిక చిత్రాల్లో నటించిన కథనాయకుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. 1964 తేనె మనసులు మొదలు, 2016 శ్రీశ్రీ వరకు ఆయన 350కి పైగా సినిమాల్లో నటించి వేలమందికి పని కల్పించిన మహనీయుడు. ఆయన ప్రేక్షకులు, అభిమానుల్ని అలరించడంతో పాటు నిర్మాతల హీరోగా పేరొందిన కీర్తి పతాక. అన్నింటికి మించి మంచి మనసున్న నటశేఖర్ కృష్ణ యావత్ టాలీవుడ్ కి స్ఫూర్తి ప్రదాత. తెలుగు సినీ సీమలో ఆయనదో సువర్ణాధ్యాయం.

Wednesday, November 9, 2022

visakha steel plant employees bike rally against privatization

స్టీల్ ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (ఆర్.ఐ.ఎన్.ఎల్) కార్మికులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం కూర్మానపాలెంలో గల ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నగరంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ఆ శాఖ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఇదిలావుండగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా కార్మికులు చేపట్టిన ఆందోళన 635వ రోజుకు చేరుకుంది. ప్రధాని మోదీ ఈనెల 12 నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్లాంట్ ఎంప్లాయీస్ నిరసన తీవ్రతను పెంచారు. ఆ రోజు నేరుగా ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించాలని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి నిర్ణయించింది.  

Friday, November 4, 2022

Fridge blast at home kills 3, injures 2 in Tamil Nadu

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలి ముగ్గురి దుర్మరణం

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలిన దుర్ఘటనలో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం ఈ ప్రమాదం చెంగల్‌పేట జిల్లా గుడువాంచేరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఆర్‌ఆర్‌ బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడు శబ్దం విని అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఇల్లంతా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. దుర్ఘటనలో గిరిజ (63), ఆమె సోదరి రాధ (55), ఆమె సోదరుడు రాజ్‌కుమార్ (47) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏడాది క్రితం మృతి చెందిన వెంకట్‌రామన్‌ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న అతని భార్య గిరిజ సహా అతని కుటుంబం వెంకట్రామన్‌కు వార్షిక కర్మలు (శ్రాద్ధం) చెల్లించడానికి గురువారం రాత్రి ఇక్కడ ఇంటికి వచ్చారు. ప్రమాద సమయంలో వీరితో పాటు రాజ్‌కుమార్ భార్య భార్గవి (35), అతని కుమార్తె ఆరాధన (6) ఉన్నారు. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని క్రోంపేట ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tuesday, November 1, 2022

Andhra Pradesh formation day celebrations held at CM camp office Tadepalli

ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలుత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 20 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 మందికి అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో గొప్ప సంస్కృతి ఉందనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వై.ఎస్.విజయమ్మ కూడా పాల్గొన్నారు.

Saturday, October 29, 2022

World's 'tallest' Shiva statue unveiled in Rajasthan's Rajsamand

మహాశివయ్య@369

·        రాజస్థాన్ లో విశ్వాస్ స్వరూపం విగ్రహావిష్కరణ

ప్రపంచంలోనే అతి ఎత్తైన మహాశివుని విగ్రహం రాజస్థాన్ లో కొలువుదీరింది. శనివారం ఈ 369 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లొత్ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారీ బాపు, సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ ఛైర్మన్ మదన్ పలీవాల్ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఉదయ్ పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో గల నాథ్ ద్వారలో ధ్యానముద్రలో కూర్చున్న శివయ్య `విశ్వాస్ స్వరూపం`గా భక్తుల్ని అలరిస్తున్నాడు. 2012లో ముఖ్యమంత్రి గెహ్లొత్ ఆధ్వర్యంలోనే ఈ మహా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భారీ శివయ్య విగ్రహం తయారవ్వడానికి 10 ఏళ్లు పట్టింది. తాట్ పదమ్ సంస్థాన్ ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో కొండపైన నెలకొల్పిన ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచీ కనిపిస్తుంది. ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం వల్ల రాత్రిపూట కూడా విగ్రహాన్ని స్పష్టంగా చూడొచ్చు. విగ్రహ నిర్మాణం కోసం మూడు వేల టన్నుల స్టీలు, ఐరన్. 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను వినియోగించారు. 250 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచినా చెక్కుచెదరనంత పటిష్టంగా 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం చేపట్టారు. విగ్రహం నెలకొల్పిన ప్రదేశం చుట్టూ బంగీ జంప్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి సాహసక్రీడలు, పర్యాటకులు ఆస్వాదించే ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ లను ఏర్పాటు చేశారు.

Friday, October 14, 2022

Rajahmundry road cum railway bridge closed till 21 Oct 2022

కొత్త బ్రిడ్జి మూసివేత

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిని వారం రోజులపాటు మూసివేశారు. ఈరోజు శుక్రవారం నుంచి మళ్లీ ఈనెల 21 వరకు ఈ బ్రిడ్జిపై రోడ్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయనున్నారు. అత్యవవసర మరమ్మత్తులు చేపట్టడంతో రాజమండ్రి- కొవ్వూరు మధ్య గల ఈ వారధిపై అన్ని ప్రయాణ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. 4.1 కిలోమీటర్లు (2.5 మైళ్లు) పొడవైన ఈ బ్రిడ్జిపై  ప్రతి అయిదేళ్లకోసారి రోడ్డు భవనాల శాఖ విధిగా మరమ్మత్తులు చేపడుతోంది. దాంతో ఈసారి కూడా అన్ని ప్రయాణ వాహనాలు; చిన్న, మధ్యతరహా రవాణా వాహనాల ట్రాఫిక్ ను ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక భారీ రవాణా వాహనాలైన లారీలు, ట్రక్కులు మొదలైన వాటిని దివాన్ చెరువు జంక్షన్ రహదారిని కలుపుతూ నిర్మించిన నాల్గో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు. 1974 నుంచి గోదావరి నదిపై అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ కం రైల్వే వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరమైన రాజమండ్రి, వాణిజ్య పట్టణం కొవ్వూరుల మధ్య రాకపోకలకు అనువుగా మారింది.

Monday, July 25, 2022

Droupadi Murmu to take oath as President followed by 21-gun salute

 రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సోమవారం ఉదయం 10.15కి ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ముర్ముతో పాటు, సీజేఐ జస్టిస్ రమణ, రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా ఆశీనులయ్యారు. వేదిక కింద ముందు వరుసలో ప్రధాని నరేంద్రమోదీ, సోనియాగాంధీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రతిభాపాటిల్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరానీ తదితరులు కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఈ ఉదయం 8.30కి ముర్ము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధిని సందర్శించి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం ఆమె తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కు విచ్చేశారు. ఆమెను సెంట్రల్ హాల్ లోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, ఓం బిర్లా తోడ్కొని వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత ముర్ము మాట్లాడుతూ ఆజాదికీ అమృత మహోత్సవాలు జరుగుతున్న వేళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడంతో అమితానందం కల్గుతోందన్నారు. ఇందుకు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా నీటిపారుదల శాఖలో ఓ సాధారణ క్లర్కుగా జీవితం ప్రారంభించిన ఆమె దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి చేరుకున్నారు.  రాజకీయాల్లో తను కౌన్సిలర్ స్థానం నుంచి రాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం ముదావహమని ముర్ము అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి ఇదే నిదర్శనమని సగర్వంగా ప్రకటించారు. ప్రపంచంలోనే భారత్ ఓ అమేయశక్తిగా అవతిరించిందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లల్లో దేశం మరింతగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు అందరూ సహకరించాలన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.

Friday, July 15, 2022

andhra pradesh cm ys jagan conducts aerial survey of flood hit areas

గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి నేరుగా జగన్ హెలికాఫ్టర్లో గోదావరి ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే వరద పరిస్థితి కొలిక్కివచ్చే వరకు వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.  

Friday, July 8, 2022

Vijayamma resigns from YSRCP, announces support for daughter Sharmila

Vijayamma resigns from YSRCP, announces support for daughter Sharmila

వైఎస్ ఆర్ సీపీకి విజయమ్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తన కుమార్తె వై.ఎస్. షర్మిలకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ని నెలకొల్పిన తనయ షర్మిల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్న ఆమె ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవ అధ్యక్షరాలి పదవి నుంచి తప్పుకుంటున్నానన్నారు. తనను అందరూ క్షమించాలని కోరారు.  గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదుట ప్రస్తుతం జరుగుతున్న వై.ఎస్.ఆర్.సి.పి. ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరయిన ఆమె ఆ హోదాలో తుది ప్రసంగం చేశారు. వై.ఎస్ ఆకస్మిక మరణం దరిమిలా కుమారుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి కష్టాలు ఎదురైనప్పుడు తనతో పాటు షర్మిల, యావత్ కుటుంబం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన సంగతిని విజయమ్మ గుర్తు చేశారు. ఇప్పుడు టీఎస్ లో కుమార్తె షర్మిల వై.ఎస్ ఆశయసాధనకు పాటుపడుతోందని అందుకే ప్రస్తుతం ఆమెకు చేయూత అవసరమన్నారు. అందువల్ల రెండు పార్టీల్లో కొనసాగడం మంచిది కాదని తన అంతరాత్మ ప్రబోధిస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ వివరించారు.

Thursday, June 30, 2022

Sri Sathya Sai auto accident CM YSJagan announces Rs.10 lakhs ex gratia

 కూలీల్ని పొట్టనబెట్టుకున్న కరెంట్ తీగ

శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఘోర దుర్ఘటన సంభవించింది. తాడిమర్రి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో అయిదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. చిల్లకొండయ్యపల్లిలో ఈ ఉదయం వ్యవసాయ పనుల కోసం మహిళా కూలీలు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటోపై  హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి. దాంతో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న మహిళా కూలీలు అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. వీరిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

Tuesday, May 31, 2022

TTD Total Plastic Ban In Tirumala on 1 June

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

కలియుగ ఇల వైకుంఠం తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల గిరులపై ఈ నిషేధాజ్ఞల్ని కఠినంగా అమలు చేయనున్నారు. బుధవారం (జూన్ 1) నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇకపై ప్లాస్టిక్ తో తయారైన అన్నిరకాల వస్తువుల వాడకం తిరుమలలో నిషేధం. ప్లాస్టిక్ కవర్లు, సీసాలు సహా షాంపూ ప్యాకెట్లను సైతం భక్తులు వెంట తీసుకురాకూడదని టీటీడీ స్పష్టం చేసింది.

Monday, April 4, 2022

CM Jagan LIVE : AP New Districts Launch

పాలనా నవశకానికి నాంది

* కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం శుభాకాంక్షలు

* ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్ష

పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న తమ ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు వెన్నుదన్నుగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కోరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో సోమవారం కొత్త జిల్లాల్ని వర్చువల్ గా జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మొత్తం 727 జిల్లాలుండగా దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో ఇప్పుడు జిల్లాల సంఖ్య 26కు చేరిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19 లక్షల పైచిలుకుగా ఉండనున్నట్లు సీఎం తెలిపారు. గతంలో ఈ సంఖ్య 38 లక్షలు కావడం వల్ల దేశంలో అత్యంత ఎక్కువ జనసాంద్రత కలిగిన జిల్లాలున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.  పొరుగునున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో సగటు జిల్లా జనాభా 10 లక్షలు కాగా కర్ణాటకలో ఆ సగటు 21 లక్షలు, మహారాష్ట్రలో 31 లక్షలని ఆయన వివరించారు. నవరత్నాల పథకాలు సహా పేదల జీవనస్థితిగతుల మెరుగు కోసం అనేక పథకాల అమలుకు శ్రీకారం చుట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నామన్నారు. ఇందుకు ప్రధాన భూమిక జిల్లా కలెక్టర్లదేనని సీఎం చెప్పారు. గతంలో జిల్లా కలెక్టర్లకు అధికారం మాత్రమే ఉండేదంటూ ఆయన ఇప్పుడు వారి భుజాలపై బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. పేదల సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించాల్సిన గురుతర కర్తవ్యంతో జిల్లా ప్రథమ పౌరులుగా కలెక్టర్లు పరిపాలన సాగించాలని సూచించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థ చక్కగా కొనసాగుతోందన్నారు. సుమారు 2.60 లక్షల వాలంటీర్లతో మొత్తం 15505 సచివాలయాలు ప్రజలకు సౌకర్యాలు అందజేస్తున్నాయని సీఎం వివరించారు. రాష్ట్రంలో సుమారు 4.90 కోట్ల జనాభా ఉండగా  ప్రతి అయిదు వందల జనాభాకు ఓ సచివాలయం, ప్రతి 50 మందికి ఓ వాలంటీర్ చొప్పున ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు.

కొత్త జిల్లాలు 26 - రెవెన్యూ డివిజన్లు 72 :

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల: ఆత్మకూరు (కొత్త) డోన్(కొత్త), నంద్యాల

21. అంతపురం: అనంతపురం, కల్యాణదుర్గం, గుంతకల్ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్ఆర్ కడప: బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి

Friday, April 1, 2022

Personal loans up to Rs 50,000 at 7% interest for prisoners in Maharashtra jails

ఖైదీలకు రూ.50 వేల చొప్పున రుణాలు

మహారాష్ట్ర జైళ్లలోని ఖైదీలకు వ్యక్తిగత రుణాలు అందించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ  వినూత్న కార్యక్రమానికి ఎర్వాడ జైలు శ్రీకారం చుట్టనుంది. తొలుత ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ప్రాజెక్ట్ అమలును బట్టి రాష్ట్రంలోని మిగిలిన జైళ్లలోని ఖైదీలకూ రుణాలు అందనున్నాయి. మహారాష్ట్ర సహకార బ్యాంక్ తో సంప్రదింపులు జరిపిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఒక్కో ఖైదీకి రూ.50 వేల రుణం అందేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎర్వాడ జైలులో 1055 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. రుణం అవసరమైన ప్రతి ఖైదీ ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. ఆయా ఖైదీల శిక్షా కాలం, జైలులో వారు పొందే వేతనం, సంపాదన ఆధారంగా మంజూరయ్యే రుణ మొత్తాన్ని బ్యాంకర్లు నిర్ణయిస్తారు. ఇందుకు 7% వడ్డీ వసూలు చేస్తారు. ఖైదీ విడుదలయ్యే నాటికి బ్యాంకు వద్ద తీసుకున్న రుణం తీరిపోయేలా నిర్ణీత గడువు నిర్ధారిస్తారు.   

Tuesday, March 29, 2022

Tamil Nadu Young man buys dream bike of Rs 2.6 lakh with Rs.1 coins

రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు

తమిళనాడు సేలం జిల్లా అమ్మపేటకు చెందిన ఓ యువకుడు చిల్లర నాణేలతో బైక్ కొని వార్తల్లోకెక్కాడు. భూపతి అనే చిరుద్యోగి రూ.2.60 లక్షలతో బజాజ్ డొమినర్-400 బైక్ కొన్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ 29 ఏళ్ల యువకుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి బైక్ కొనాలనే ఆశ. మూడేళ్లు క్రితం అతను బజాజ్ షోరూంకు వెళ్లి బైక్ రేటు గురించి కనుక్కున్నాడు. అప్పటి నుంచి రూపాయి నాణేలను కూడబెట్టాడు. ఆ నాణేలన్నింటిని బస్తాల్లో కట్టి బజాజ్ షోరూంకు ట్రాలీలో తీసుకొచ్చాడు. తొలుత అంగీకరించని షోరూం సిబ్బంది భూపతి బ్రతిమలాడ్డంతో తర్వాత ఒప్పుకున్నారు. నాణేలు లెక్కించడానికి అతని స్నేహితులతో పాటు సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు. లెక్క సరిపోయాక బిల్లు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది అతనికి బైక్ ఇచ్చి పంపించారు. దాంతో హైఎండ్ బజాజ్ బైక్ పై భూపతి కేరింతలు కొడుతూ ఇంటికి చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన అతను స్నేహితులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Monday, March 28, 2022

Telangana CM KCR attended inauguration ceremony of reconstructed Yadadri temple

నవ వైకుంఠం యాదాద్రి

తెలంగాణ తిరుమలగా భక్త జనకోటిని అలరించనున్న యాదాద్రి ఆలయం పున:ప్రారంభమయింది. లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం అందరికీ ఈ సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. నవ వైకుంఠంగా భాసిల్లుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు దర్శన భాగ్య క్రతువులు సోమవారం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలు షురూ అయ్యాయి. ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు మొదలయ్యాయి. ఈ ఉదయం సీఎం దంపతులు, అసెంబ్లీ, మండలి సభాపతులైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్టామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టిన శోభాయాత్రలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి మాడ వీధుల్లో వైభవోపేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు, ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశిన ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం అయింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించారు. తర్వాత గర్భాలయంలోని మూలవరుల దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని తొలి పూజలు చేశారు. మరోవైపు నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్‌తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాలన్నింటిని భక్తుల కోసం సిద్ధం చేశారు.

Wednesday, March 23, 2022

Kodali Nani fires again on Chandra Babu in the AP Assembly

చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయిన మంత్రి కొడాలి

బూతుల మంత్రిగా, ఆవేశపరుడిగా ప్రతిపక్షాలు పేర్కొంటున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మాజీ బాస్ చంద్రబాబుపై మళ్లీ నోరుపారేసుకున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ, నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ తెలుగుదేశం శాసనసభ్యులు తాజాగా ఈరోజు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. చిడతలు కొడుతూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్య పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు ఎమ్మెల్యేలేనా? అసెంబ్లీ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు.. ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో మీ చేష్టలన్నింటిని చూస్తున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ దశలో మంత్రి కొడాలి జోక్యం చేసుకుంటూ చంద్రబాబుపై యథావిధిగా మాటల దాడి చేశారు. సన్నాసి, వెదవ అంటూ తిట్ల వర్షం కురిపించారు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారుణవాహిని అని పేరు పెట్టి అందరికీ సారాను అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు `చీప్` మినిస్టరని.. చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కొడాలి ఎద్దేవా చేశారు.

Saturday, March 19, 2022

10 died 25 injured in bus accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

·        10 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్ణాటకలోని ఓ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 26 మందితో ప్రయాణిస్తున్న ఎస్.వి.టి. బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు. వై.ఎన్.హోసకోట నుంచి పావగడకి బస్సు బయలుదేరింది. పలవలహళ్లి సమీపంలో ప్రమాదం బారినపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Monday, March 14, 2022

Chandrababu fires on Y.S.Jagan gov. visits West Godawari district today

కల్తీ సారా బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్తీ మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఏరులై పారుతోందని ఇందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీదే బాధ్యతన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అగ్నిమాపకకేంద్రం నుంచి అసెంబ్లీ హాల్ ప్రధాన ద్వారం వరకు ప్లకార్డులు, మద్యం సీసాలు చేతపట్టుకుని ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే కారణంతో అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేల్ని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, బుచ్చయ్యచౌదరి, పయ్యవుల కేశవ్ లు సస్పెండయిన వారిలో ఉన్నారు.

కల్తీ సారా ఘటనపై సీఎం భేటీ

ఏపీ అసెంబ్లీ లో సీఎం వై.ఎస్.జగన్‌తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చ జరిగింది. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ వారితో పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియపర్చాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ముఖ్యమంత్రి సూచించారు. ఘటనపై సభలో స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Friday, March 11, 2022

Telangana CM KCR Diagnosed With 'Mild Chest Infection'

సీఎం కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎడమవైపు ఛాతీలో కొద్దిగా నొప్పి వచ్చింది. దాంతో కేసీఆర్ ని హుటాహుటిన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోగ్య పరీక్షలు ఏటా యథావిధిగా నిర్వహించేవేనని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా కేసీఆర్ కొంచెం నలతగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు డా.ఎమ్వీరావు చెప్పారు. ఆయన ఎడమచెయ్యి లాగుతుందని తెలిపారన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని కొద్దిపాటి ఇన్ఫెక్షన్ మాత్రమేనని డాక్టర్ రావు చెప్పారు. పరీక్షల సందర్భంగా ఆసుపత్రిలో ఆయన వెంట సతీమణి శోభ, కుమార్తె కవిత, మనుమడు హిమాన్షు, ఇతర కుటుంబసభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈరోజు ఏర్పాటైన కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. 

Wednesday, March 9, 2022

CM KCR announces mega recruitment process for 91,142 jobs

కేసీఆర్.. సూపర్ హిట్

* అసెంబ్లీలో జాబ్స్ బాంబ్

* ప్రభుత్వ మెగా జాబ్ మేళా ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదరగొట్టారు. సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సూపర్ హిట్ కొట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక యావత్ దేశం దృష్టిని ఆయన అలవోకగా సాధించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, అటు కేంద్రంలో మోదీ సర్కారుకి నోటమాట రానట్లుగా జాబ్ బాంబ్ పేల్చారు. బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ ఏకబిగిన గంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మొత్తం 91142 ఉద్యోగాల్ని ఈరోజే నోటిఫై చేస్తున్నామన్నారు. తక్షణం 80039 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సభ్యుల చప్పట్ల మధ్య ఘనంగా ప్రకటించారు. అదేవిధంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీ కేలండర్ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్క హోంశాఖలోనే 18334 ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అలాగే విద్యాశాఖలో 20వేల పైచిలుకు పోస్టుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. వైద్యశాఖలో 12,755, బీసీ సంక్షేమశాఖ 4311, రెవెన్యూశాఖ 3560, ట్రైబల్ వెల్ఫేర్ 2399 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో 95శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉంటుందని మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తామని సీఎం సగర్వంగా ప్రకటించారు.  తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత గ్రూపుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1: 503 పోస్టులు, గ్రూప్-2:582 గ్రూప్-3: కింద1373 గ్రూప్-4: 9168 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ఠ వయో పరిమితిని ప్రకటించడం విశేషం.