Monday, August 31, 2020

Pranab Mukherjee, ex-president and Congress veteran, dies in Delhi hospital


ప్రణబ్‌దా అస్తమయం

భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు ప్రారంభంలో ప్రణబ్ కి డాక్టర్లు కీలకమైన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కరోనా కూడా నిర్ధారణ కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. అవయవాలేవీ పనిచేయకపోవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీకి చికిత్స అందిస్తున్నా ఫలితం లేకుండాపోయింది. ఆయన మరణంతో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. రాష్ట్రప​తి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో తుది వీడ్కోలు పలకనున్నారు. దాదాలేని ఢిల్లీని ఊహించలేమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Sunday, August 30, 2020

Death toll in restaurant collapse in China rises to 29

చైనాలో హోటల్ కుప్పకూలి 29 మంది దుర్మరణం

చైనాలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలో 29 మంది దుర్మరణం పాలయ్యారు. జియాంగ్ఫెన్ కౌంటీలోని చెంజ్వాంగ్ గ్రామంలో జుజియన్ అనే హోటల్ శనివారం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. 80 ఏళ్ల వృద్ధుడి జన్మదిన వేడుకను  నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. వేడుక జరుగుతున్న సమయానికి ఆ రెండంతస్తుల రెస్టారాంట్ లో 57 మంది ఉన్నారు. వీరిలో 29 మంది మృత్యుపాలవ్వగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 21 మంది స్వల్ప గాయాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు జిన్హూ వార్త సంస్థ పేర్కొంది. ఈ దుర్ఘటన ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్స్లో సంభవించినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. 

Friday, August 28, 2020

Karnataka Govt Issues Revised Guidelines For Inter-State Travellers Relaxes Conditions Of Quarantine

కర్ణాటక ప్రయాణికులకు శుభవార్త!

బెంగళూరు, కర్ణాటక వెళ్లాలనుకునే వారికి కచ్చితంగా ఇది శుభవార్తే. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ముఖ్యంగా బెంగళూరు రావాలనుకునే ప్రయాణికులకు కోవిడ్ ఆంక్షలను సర్కారు సులభతరం చేసింది. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఇప్పటివరకూ విధించిన నిబంధనలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం యడ్యూరప్ప ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల అంతర్రాష్ట సరిహద్దుల్లో రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, బెంగళూరు వచ్చేవారిలో కరోనా లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లో ఉండి `ఆప్తమిత్ర` హెల్త్‌ లైన్‌ నంబర్ 14410కి ఫోన్ చేసి చికిత్స పొందొచ్చు. అదేమాదిరిగా ఇప్పటివరకూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు `సేవా సింధు` పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాల్సి వచ్చేది. ఇక ఆ నిబంధన ఉండదు. అంతేకాదు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో వచ్చేవారికి కరోనా టెస్టులు చేయరు. క్వారంటైన్ నిబంధన కూడా ఉపసంహరించారు. కరోనా లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించడంతో పాటు వైద్యం పొందాల్సి ఉంటుంది. మాస్క్, భౌతిక దూరం వంటి నిబంధనల్ని అందరూ పాటించాలని ప్రభుత్వం సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయి. 

Tuesday, August 25, 2020

Japan: Tokyo installs transparent public toilets in parks that turn opaque when in use

 జపాన్ పార్కుల్లో ఊసరవెల్లి టాయిలెట్లు

నూతన ఆవిష్కరణల్లో అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోమని మరోసారి జపాన్ నిరూపించుకుంది. పార్కుల్లోని మరుగుదొడ్ల నిర్మాణంలో కొంగొత్త పోకడను ఆ దేశం ప్రదర్శించింది. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్ అనగానే అపరిశుభ్రత గుర్తొస్తుంది. లోపల శుభ్రంగా ఉందో లేదో అని శంక అందరిలోనూ కల్గకమానదు. అందుకు చెక్ చెబుతూ అద్దాలతో ఈ మరుగుదొడ్లను తీర్చిదిద్దారు. హా! ఇదేమి చోద్యం.. మరుగు లేకుండా ఎలా..ఇలా నిర్మించారనే గా మీమాంస. ఆ భయం మనకు అవసరం లేదండి. ఎవరైనా ఈ టాయిలెట్ లోపలకి వెళ్లి లాక్ చేయగానే ఈ అద్దాల గది రంగు మారిపోతుంది. దాంతో లోపల ఉన్న వాళ్లు బయటకు కనిపించే చాన్సే లేదు. మా దేశంలో టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయని ప్రజలకు చూపించేందుకే ఇలా గ్లాస్ టాయిలెట్లను జపాన్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ అద్దాల మరుగుదొడ్లను ఎబిసు పార్క్, యోయోగి ఫుకామాచి మినీ పార్క్, హారు-నో-ఒగావా కమ్యూనిటీ పార్క్, ఎబిసు ఈస్ట్ పార్క్ ల్లో సహా ఎబిసు స్టేషన్లలోనూ చూడవచ్చు. జపాన్ ఆర్కిటెక్ట్ షింగెరు బాన్ ఈ సరికొత్త గ్లాస్ టాయిలెట్లను రూపొందించారు.

Saturday, August 22, 2020

Pawan Kalyan Emotional Message to His Brother Chiranjeevi On His Birthday


చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవర్ స్టార్

మెగా కాంపౌండ్ లో అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించిన హీరో పవన్ కల్యాణ్ తన మనసులో మాటను మరోసారి కుండబద్దలు కొట్టారు. అన్నయ్య చిరంజీవే తనకు స్ఫూర్తి ప్రదాత అని పునరుద్ఘాటించారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా అపురూపమైన రీతిలో పవర్ స్టార్ స్పందించడం మెగా అభిమానులందర్ని ఓలలాడించిందనే చెప్పాలి. నటుడిగానే కాక జనసేన అధినేతగానూ నిత్యం వార్తలో ఉండే పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై తనకుగల ఆరాధ్య భావనను మరోసారి అఖిలాంధ్ర అభిమానులతో లేఖారూపంగా పంచుకున్నారు. శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమని పవన్‌ పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా అవతరించారని ప్రశంసించారు. అన్నయ్యే నా తొలి గురువు అని పవన్ ఈ భావోద్వేగ సందేశంలో ప్రకటించారు. `అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో అన్నయ్య చిరంజీవిని అంతే పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చెయ్యి పట్టుకునే పెరిగాను. అన్నయ్య నన్ను అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నడిపించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగు వారు సగర్వంగా `చిరంజీవి మావాడు` అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం` అని పవర్ స్టార్ స్పష్టం చేశారు. `ఆయనకు చిరాయువుతో కూడిన శుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు` అని పవన్ పేర్కొన్నారు.

Wednesday, August 12, 2020

Low pressure over Bay to trigger rain in Andhra Pradesh in next four days

 ఏపీకి భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల చురుగ్గా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి. రాగల నాలుగు రోజులు ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు కురవొచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం 8 గంటల వరకు పార్వతీపురం (విజయనగరం) లో 8 సెం.మీ., వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా)లో అత్యధిక వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. గురువారం (ఆగస్టు 13) న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దాంతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీకి ముందస్తు సూచనలు జారీ అయ్యాయి. మూడు కోస్తా జిల్లాలతో పాటు కర్నూలును భారీ వానలు ముంచెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.

Saturday, August 8, 2020

Air India Express Plane Touched Down 1km from Beginning of Runway Before Crashing

వందల ప్రాణాలు కాపాడిన బోయింగ్-737 పైలట్లు

కోజికోడ్ బోయింగ్-737 విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగకుండా పైలట్లు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువస్తున్న వందేభారత్ విమానం శుక్రవారం ఘోర ప్రమాదానికి గురికాగా సుమారు 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ విమాన పైలట్లు సమయస్ఫూర్తి వల్లే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం నివారించగలిగారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు విమానంలో మిగిలి ఉన్న ఇంధనం పూర్తిగా వినియోగం అయ్యే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దాంతో విమానం భస్మీపటలం కాకుండా కాపాడగలిగారు. అయితే క్రాష్ ల్యాడింగ్ లో పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలపై వాతావరణం అనుకూలించని పరిస్థితిలో ల్యాడింగ్ రిస్క్ మరింత అధికం. కేరళలోని కోజికోడ్ టేబుల్ టాప్ రన్ వే పై అదే చోటు చేసుకుంది. గత నాల్గు రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వందేభారత్ (ఎయిర్ ఇండియా) విమాన పైలట్లకు రన్ వే స్పష్టంగా కనిపించలేదు. పైగా ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలు ఇతర రన్ వేల కన్నా చాలా చిన్నవి. మనదేశంలో పదేళ్ల క్రితం కర్ణాటక (మంగుళూరు)లో ఇదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఎయిరిండియా బోయింగ్- 737 విమానం కూలిపోయింది. 160 మంది నాటి దుర్ఘటనకు బలయ్యారు. ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన టేబుల్ టాప్ రన్ వే దేశంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి మంగుళూరు, రెండు కోజికోడ్ కాగా మూడోది లేంగ్ వ్యూ(మిజోరం) లో ఉంది. తాజాగా ప్రమాదానికి గురైన 9-1344 విమాన పైలట్లు రన్ వే నం.9 కనిపించక పలుమార్లు ఏటీసీతో సంప్రదించారు. అనంతరం వారి కోరిక మేరకు రన్ వే 10 పై విమానాన్ని దించడానికి ఏటీసీ అనుమతి తీసుకుని ప్రయత్నించారు. 2,700 మీటర్ల మొత్తం రన్ వేలో పైలట్లు సుమారు 1000 మీటర్ల రన్ వే వద్ద ల్యాడింగ్ కు సిద్ధపడ్డారు. ఈ దశలోనే విమానం భారీ కుదుపులకు లోనై రన్ వే నుంచి దూసుకుపోయి 50 అడుగుల లోతుగల లోయలో పడిపోయి రెండుగా విడిపోయింది. దాంతో ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై డీజీసీఏ అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టింది.

Monday, August 3, 2020

Nimmagadda Ramesh Kumar To Take Charge as AP SEC again

ఏపీ ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ బాధ్యతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో పోరాటం చేసిన అనంతరం ఆయన ఇటీవల ఎస్ఈసీగా పునర్నియామకం పొందిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయ దుమారం రేపిన నిమ్మగడ్డ  ఎపిసోడ్‌ ఎట్టకేలకు ముగిసినట్లయింది. సోమవారం ఉదయం 11.15 గంటలకు తిరిగి ఎస్ఈసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిమ్మగడ్డ పూర్వపు హోదాలో సోమవారం ఆఫీసుకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. `రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ కు అనుగుణంగా నేను బాధ్యతలు చేపట్టా` అని ఆయన ఎన్నికల కమిషన్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు తెలిపారు. `ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ.. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది.. గతంలో మాదిరిగానే  ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా` అని అధికారులకు పంపిన సర్క్యులర్ లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికల్ని ఆయన వాయిదా వేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వై.ఎస్.ఆర్.సి.పి.ని కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా ఆయన ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారని సర్కారు మండిపడింది. పాత్రికేయుల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ ఆయనపై ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట ప్రభుత్వం తరఫున పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలోనే ఆయన పదవీకాలన్ని తగ్గించి కొత్త ఎస్ఈసీగా తమిళనాడు హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించారు. దాంతో నిమ్మగడ్డ ఏపీ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలడంతో నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించక తప్పలేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జూలై 30 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు. గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. దానికి అనుగుణంగా సోమవారం మళ్లీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ బాధ్యతలు చేపట్టారు.