Thursday, September 5, 2019

SC allows Mehbooba Mufti's daughter to meet her in Kashmir


మెహబూబాను కలుసుకునేందుకు కూతురికి సుప్రీం అనుమతి
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతురు ఇల్తిజాకు గురువారం సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. రాష్ట్రంలో స్వయంపత్రిపత్తిని రద్దు (370 అధికరణ) చేస్తూ కేంద్రప్రభుత్వ నిర్ణయం వెలువడిన దరిమిలా ముఫ్తీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ గృహ నిర్బంధంలో ఉంచారు. ఆగస్ట్ 5న ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ముఫ్తీ మాట్లాడుతూ కశ్మీర్ ను కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమిస్తే ప్రస్తుత భూభాగాన్ని భారత్ ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అరెస్టయి గృహనిర్బంధంలో ఉన్న ఆమెను కలుసుకోవడానికి అనుమతినివ్వాలని ఇల్తిజా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. నెలరోజులుగా తన తల్లిని చూడలేదని ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నామని ఇల్తిజా పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానన్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమె పిటిషన్ ను విచారించి ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. శ్రీనగర్ లో గల తన నివాసంలో ముఫ్తీని కలుసుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించలేదని తెలిపింది. అయితే కలుసుకున్నాక బయట స్వేచ్ఛగా తిరగరాదనేది ప్రభుత్వ వాదనగా పేర్కొంది.