Tuesday, January 7, 2020

Deepika Padukone visits JNU to lend her support to the students

గాయపడిన జె.ఎన్.యు. విద్యార్థులకు దీపికా పదుకొనె మద్దతు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మంగళవారం జె.ఎన్.యు. క్యాంపస్ ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం గుర్తు తెలియని దుండగులు జరిపిన కర్కశ దాడిలో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అనుకూల వర్గాలు వ్యతిరేకత తెల్పుతున్నా పట్టించుకోకుండా దీపికా జె.ఎన్.యు.కు చేరుకుని గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీఘోష్ సహా మిగిలిన క్షతగాత్రుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు అండగా తామంతా నిలబడతామని ఈ సందర్భంగా వారికి దీపికా తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని వారి వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా దీపికా వెంట జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జె.ఎన్.యు.లో విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.