Thursday, April 18, 2019

mumbai indians landslide victory against delhi capitals 2019 vivo ipl season12


ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ పై ముంబయి ఘన విజయం
సొంత మైదానంలోనే ఢిల్లీ కేపిటల్స్ ను ఓడించి ముంబయి ఇండియన్స్ కాలర్ ఎగరేసింది. 40 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ నం.34లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. రోహిత్, డీకాక్ ల జోడీ దూకుడుగా ఆడ్డంతో 6.1 ఓవర్లలోనే ముంబయి 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందుకుంది. రోహిత్(30) తో పాటు డీకాక్(37), కునాల్ పాండ్యా (37), హార్ధిక్ పాండ్యా(32) రాణించారు. చివరి మూడు ఓవర్లలో పాండ్యా సోదరులు చెలరేగిపోయి ఆడి 50 పరుగులు రాబట్టారు. దాంతో ముంబయి జట్టు మంచి లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగలిగింది. టీ20ల్లో రోహిత్ 8 వేల పరుగుల మైలురాయిని దాటాడు. అనంతరం ఏదశ లోనూ ఢిల్లీ కేపిటల్స్ ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కోలేకపోయింది. 9వికెట్లను కోల్పోయి 128 పరుగుల్ని మాత్రమే చేయగల్గింది. రాహుల్ చాహర్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు, బుమ్రా 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఢిల్లీని ఘోరంగా దెబ్బ తీశారు. పృద్వీ షా(20), ధావన్(35), అక్షర పటేల్(26) మాత్రమే రాణించారు. హార్ధిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్ లోనే తమను ఓడించిన ఢిల్లీ కేపిటల్స్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ముంబయికి ఇది వరుసగా రెండో విజయం కాగా పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత స్థానానికి చేరుకుంది. సీఎస్కే 14 పాయింట్లతో ఉండగా ఎం.ఐ 12 పాయింట్లు సాధించింది.

3 year old boy in coma after torture by mother said Kochi police

ఈమె తల్లేనా అసలు..
·    మూడేళ్ల కొడుకుని కొట్టి కోమాలోకి నెట్టింది
ఈమె తల్లేనా అసలు అనే అనుమానం ఈ ఘటన విన్నా,చూసిన ఎవరికైనా రాక మానదు. అంతటి అమానుషమైన అమానవీయ దుస్సంఘటన కొచిలో జరిగింది. బుధవారం జరిగిన ఘటన వివరాలు గురువారం (ఏప్రిల్18) వెలుగులోకి వచ్చాయి. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మూడేళ్ల కొడుకుని ఓ తల్లి దుంగతో తలపై దారుణంగా కొట్టి గాయపరిచింది. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కోమాలోకి వెళ్లిపోయాడు. అంతేగాక ఆ బాలుడ్ని తీవ్రంగా హింసించినట్లు కూడా శరీరంపై కాలిన గాయాలున్నాయి. స్పృహ లేని స్థితిలో ఉన్న బాలుడ్ని తండ్రి భుజానెత్తుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. టేబుల్ పైనుంచి పడి బాలుడు గాయపడినట్లు డాక్టర్లను నమ్మించాలని కట్టుకథలు చెప్పాడు. విశ్వసించని వైద్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ దారుణం వెల్లడయింది. బాలుడి మెదడుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

ivanka trump Says father offered her world bank job but she passed


వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి వద్దన్న ఇవాంక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తండ్రి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.  ప్రెసిడెంట్ సీనియర్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్న ఆమెను ప్రపంచ బ్యాంక్ చీఫ్ బాధ్యతల్నీ తీసుకోవాల్సిందిగా ట్రంప్ కోరారు. అయితే ఇవాంక తనకు ఇష్టమైన పనే చేస్తానని.. శ్రామిక, మహిళా సాధికారత రంగాలలో సేవల పట్ల మక్కువని పేర్కొన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం (ఏప్రిల్17) ఇథోయోఫియా, ఐవరీకోస్ట్ ల్లో ఇవాంక పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ తో ఆమె మాట్లాడుతూ పై విషయాన్ని తెలిపారు. త్వరలో ట్రంప్ కూడా ఇక్కడ పర్యటనకు వస్తారన్నారు. ఆఫ్రికా దేశాలతో సహా ప్రపంచమంతా ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలన్నదే అమెరికా లక్ష్యమని ఇవాంక పేర్కొన్నారు. సొంత ఆసక్తితోనే ఇవాంక  ప్రస్తుత ఆఫ్రికా పర్యటనకు రావడం గమనార్హం.


madeira crash at least 29 killed on tourist bus near canico portugal island


మదీరా ద్వీపంలో టూరిస్ట్ బస్ బోల్తా 29 మంది దుర్మరణం
పోర్చుగల్ మదీరా ద్వీపంలో బుధవారం (ఏప్రిల్17) సాయంత్రం 6.30 ప్రాంతంలో ఘోర బస్ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మృతులంతా 44 నుంచి 50 ఏళ్ల లోపు వారే. డ్రైవర్, టూర్ గైడ్ సహా 55 మంది బస్ లో ప్రయాణిస్తున్నారు. కేనికొ పట్టణానికి సమీపంలో రోడ్డు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పిన బస్ పక్కనున్న ఇళ్ల మీదుగా దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా జర్మనీ దేశస్థులు. దుర్ఘటనలో మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఆ రోడ్డుపై నడుస్తున్న కొందరు పాదచారులు కూడా బస్ దూసుకెళ్లిన క్రమంలో గాయపడినట్లు సమాచారం. ‘ప్రమాదంపై వ్యాఖ్యానించడానికి మాటలు రావడం లేదు.. మృతుల బంధువులు, క్షతగాత్రుల బాధల్ని తట్టుకోలేకపోతున్నా’ అని కేనికొ మేయర్ ఫిలిపె సౌసా ఓ టీవీ చానల్ లో పేర్కొన్నారు. చనిపోయిన యాత్రికుల్లో 11 మంది పురుషులు, 18 మంది మహిళలని తెలిపారు. 28 మంది దుర్ఘటనా స్థలంలోనే చనిపోగా మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందన్నారు.