Friday, January 31, 2020

India won again in the nail biting T-20 fight

కివీస్ కు మళ్లీ భంగపాటు: సూపర్ ఓవర్లో భారత్ కు మరో గెలుపు
సూపర్ ఓవర్ ఫోబియా కివీస్ ను వదల్లేదు. స్వదేశంలో భారత్ తో జరుగుతున్న టీ20 సీరిస్ నాల్గోమ్యాచ్ లోనూ ఓటమి పాలయింది. వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం కొనసాగించింది. హమిల్టన్ లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపు దశ నుంచి ఓటమి అంచులకు జారిపోయి సీరిస్ ను 3-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించినట్లు ఆ జట్టుకు సూపర్ ఓవర్ అచ్చి రాలేదు. బుధవారం ఓటమి పాలయిన జట్టు శుక్రవారం వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ కు తలవంచింది. క్రితం మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన రోహిత్, జడేజా, షమి  లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాల్గో టీ20 ఫలితం తేల్చే సూపర్ ఓవర్ లో బూమ్రా బంతితో కట్టడి చేస్తే రాహుల్ బ్యాట్ తో విజయాన్ని నిర్దేశించారు. మ్యాచ్ ఆద్యంతం భారత్ చెత్త ఫీల్డింగ్ చేసినా కివీస్ విజయతీరానికి చేరలేకపోయింది. సూపర్ ఓవర్లో సీఫెర్ట్, మన్రోలు బ్యాటింగ్ కు దిగారు. బూమ్రా విసిరిన తొలి రెండు బంతుల్లో సీఫెర్ట్ ఇచ్చిన క్యాచ్ ల్ని అయ్యర్, రాహుల్  అందుకోలేకపోయారు. బూమ్రా ఈ ఓవర్లో ఓ వికెట్ తీసి 13 పరుగులిచ్చాడు. ఇందులో రెండు బౌండరీలుండగా మెన్ఇన్ బ్లూ రెండు క్యాచ్ లు జారవిడిచారు. అనంతరం ఓపెనర్ రాహుల్ తో కెప్టెన్ కోహ్లీ 14 పరుగుల లక్ష్య ఛేదనకు క్రీజ్ లోకి వచ్చారు. రాహుల్ తొలిబంతికే సిక్స్, తర్వాత బంతికి బౌండరీ బాదాడు. అదే ఊపులో భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. కెప్టెన్ కోహ్లీకి సంజూశ్యాంసన్ జతకలిశాడు. కోహ్లీ సూపర్ ఓవర్ 4,5 బంతుల్లో వరుసగా డబుల్, ఫోర్ (2, 4) కొట్టి ఇంకో బంతి మిగిలివుండగానే భారత్ ను గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీష్ పాండే 50(36), రాహుల్ 39(26) రాణించారు. 166 పరుగుల ఛేదనకు దిగిన కివీస్ పటిష్టమైన స్థితి నుంచి తడబడి చివర్లో 165/7 పరుగుల వద్ద చేతులెత్తేయడంతో మ్యాచ్ టై అయింది. మన్రో 67(47), సీఫెర్ట్ 57(39) అర్ధ సెంచరీలు సాధించారు. శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్అవార్డు దక్కింది.

Thursday, January 30, 2020

SC Stays Proceedings Initiated By Woman Claiming To Be Daughter Of Singer Anuradha Paudwal

అనురాధ పౌద్వాల్ కు సుప్రీంలో ఊరట
ప్రముఖ గాయని అనురాధ పౌద్వాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ 45ఏళ్ల మహిళ ఆమె కుమార్తె నని చెప్పుకుంటూ రూ .50 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మహిళ ఫిర్యాదు మేరకు తిరువనంతపురం(కేరళ) ఫ్యామిలీ కోర్టులో అనురాధ పౌద్వాల్ పై కేసు విచారణ ప్రారంభమయింది. అయితే పౌద్వాల్ అభ్యర్థన పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసుపై గురువారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవై, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సదరు మహిళకు నోటీసు జారీ చేసింది. ఈ కేసును తిరువనంతపురం కోర్టు నుంచి ముంబై కోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ పౌద్వాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు ధర్మాసనం ఆ మహిళకు తాజాగా నోటీసు ఇచ్చింది. పౌద్వాల్ పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ ఉత్తమగాయనిగా పలు అవార్డులు అందుకున్నారు. ఆమె సంగీత స్వరకర్త అరుణ్ పౌద్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పౌద్వాలే తన తల్లి అంటూ సదరు మహిళ కేరళ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 27న పౌద్వాల్ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో పౌద్వాల్ ముంబై కోర్టుకు కేసు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Muzaffarnagar Coldest In Uttar Pradesh At 6 Degrees Celsius

ఉత్తరాదిన ఇంకా వణికిస్తున్న చలిపులి
ఉత్తరభారతదేశంలో ఇంకా శీతలవాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని ముజఫర్ నగర్ లో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. లఖ్నవూ, బరేలీ, ఝాన్సీ, ఆగ్రాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. యూపీలోని మిగిలిన ప్రాంతాల వాతావరణంలో పెద్ద మార్పేమీ లేనట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శుక్రవారం ఉదయం పొడి వాతావరణం, ఓ మాదిరిగా పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.

Tuesday, January 28, 2020

AP Council Abolition is A Nonsense:KK

శాసనమండలి రద్దు అర్థరహితం:కేకే
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలన్న నిర్ణయం ఓ అర్థరహిత చర్యగా రాజ్యసభ సభ్యుడు, తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు అభిప్రాయపడ్డారు. పెద్దల సభగా విధాన పరిషత్ కొనసాగాలనే తను కోరుకుంటున్నానన్నారు. మండలికి పెట్టే ఖర్చు దండగా అనే వాదనను ఆయన కొట్టిపారేస్తూ..నాన్సెన్స్ అని పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం శాసనవ్యవస్థలో ఉభయ సభలు ఉండాలి.. ఒక సభలో తొందరపాటు నిర్ణయాలేవైనా తీసుకుంటే పెద్దల సభలో వాటిని సరిచేసే అవకాశముంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ద్వితీయ అభిప్రాయం తప్పనిసరి అని కేకే అన్నారు. 80 ఏళ్ల కేకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్ లో డిప్యూటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కొద్దికాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన `ఇండియన్ ఎక్స్ ప్రెస్` పత్రిక జర్నలిస్టుగా గుర్తింపుపొందారు. గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ గా రెండు పర్యాయాలు శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే కేకే `ది డైలీ న్యూస్` పత్రిక ఎడిటర్ గా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం పెనవేసుకున్న అనుబంధం ఆయనది. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నాడు తీవ్రంగా వ్యతిరేకించారు. 1984లో ఎన్టీయార్ హయంలోనూ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం చేసిన సందర్భంలో కేకే బాహటంగా తన వ్యతిరేకత ప్రకటించారు. తాజాగా ఇప్పుడు మండలి రద్దు అంశంపై ఆయన నిర్మోహమాటంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మ మండలి రద్దు తీర్మానాన్ని ఖండించారు. అమరావతిని మార్చడం సరికాదు.. మూడు రాజధానుల ప్రకటనకు అనుకూలంగా మాట్లాడి తప్పు చేశానని పేర్కొన్నారు.

Sunday, January 26, 2020

ITBP Celebrate 71st Republic Day by Hoisting National Flag at 17,000 Feet in Ladakh

హిమగిరులపై మువ్వన్నెల జెండా రెపరెపలు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ.టి.బి.పి.) సిబ్బంది 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐటీబీపీ సిబ్బంది 17,000 అడుగుల ఎత్తుకు జాతీయ జెండాను మోసుకు వెళ్లి ఎగురవేశారు. సైనికులు 'భారత్ మాతా కి జై', 'వందే మాతరం' అంటూ నినాదాలు చేశారు. జెండాను ఎగురవేసే సమయంలో లడఖ్‌లో ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉంది. అతిశీతల వాతావరణంలో దేశానికి అచంచల సేవలందిస్తున్న ఈ ఐటీబీపీ సైనికులను 'హిమ్వీర్స్' (హిమాలయాల ధైర్య సైనికులు) అని కూడా పిలుస్తారు. 1962 చైనా-భారత్ యుద్ధం నేపథ్యంలో ఐటీబీపీ ఏర్పడింది. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) చట్టం ప్రకారం 1962 అక్టోబర్ 24 న నెలకొల్పిన ఐదు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో ఐటీబీపీ ఒకటి. నాటి నుంచి హిమగిరులపై ఈ దళం భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, విధులను నిర్దేశిస్తూ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చరిత్రాత్మక క్షణానికి గుర్తుగా ఏటా జనవరి 26 న రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది. 1929 లో ఇదే రోజున భారత సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించింది. 1949 నవంబర్ 26 న రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ ఆమోదించింది.

Friday, January 24, 2020

Oxford Dictionary Gets 26 India English Words Like Aadhaar, chawl, dabba, hartal, shaadi

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 26 భారతీయ పదాలకు చోటు
దేశ ప్రజల గుర్తింపు కార్డు ఆధార్ కు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో చోటు దక్కింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తాజా 10వ ఎడిషన్ శుక్రవారం విడుదలయింది. ఇందులో ఆధార్, చావల్ (బియ్యం), డబ్బా(బడ్డీ), హర్తాళ్ (ఆందోళన), షాదీ (పెళ్లి) వంటి 26 భారతీయ భాషా పదాలకు చోటు కల్పించారు. వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ ఇండియన్ ఇంగ్లిష్ డిక్షనరీలో చాట్‌బాట్, ఫేక్ న్యూస్, మైక్రోప్లాస్టిక్, బస్ స్టాండ్, డీమ్డ్ యూనివర్శిటీ, ఎఫ్ఐఆర్, నాన్-వెజ్, రిడ్రెసల్, టెంపో, ట్యూబ్ లైట్, వెజ్, వీడియోగ్రాఫ్ తదితర 1,000 పదాలకు స్థానం లభించినట్లు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎడ్యుకేషన్ డివిజన్) ఫాతిమా దాదా తెలిపారు. అలాగే డిక్షనరీ ఆన్‌లైన్ వెర్షన్‌లో విద్యుత్ కోసం (current- for electricity), దోపిడీదారుడు (looter), దోపిడీ (looting), ఉపజిల్లా (one of the areas that a district is divided) వంటి నాలుగు కొత్త భారతీయ ఆంగ్ల పదాలకు చోటు దక్కిందన్నారు. 77 సంవత్సరాల చరిత్ర కల్గిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తొలి నిఘంటువు తొలుత జపాన్‌లో 1942 లో ప్రచురితమయింది. ఓయూపీ ఏర్పడ్డాక ఆల్బర్ట్ సిడ్నీ హార్నబి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ నుంచి 1948లో డిక్షనరీ మొదటి ఎడిషన్ విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యాన్ని పొందిన ఆయా భాషా పదాల్ని అందిపుచ్చుకుంటూ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఎనిమిది దశబ్దాలుగా సరికొత్త ఎడిషన్లను ఆవిష్కరిస్తూ వస్తోంది. కేంబ్రిడ్జ్ తర్వాత అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీయే. ఈ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభమైన ఓయూపీ ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయ ముద్రణా సంస్థ. 190 దేశాలలో 70 భాషల్లో ఓయూపీ ప్రచురణలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా, వృత్తిపరమైన పుస్తకాల్ని ఓయూపీ విడుదల చేస్తోంది.

Tuesday, January 21, 2020

MS Dhoni offers prayers at Deori Temple

డియోరి గుళ్లో ధోని పూజలు
ఝూర్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్ ఎం.ఎస్.ధోని మంగళవారం ఇక్కడ డియోరీలోని దేవాలయంలో పూజలు చేశాడు. గతేడాది వరల్డ్ కప్ లో ఆడిన నాటి నుంచి ధోని మళ్లీ గ్రౌండ్ లోకి దిగలేదు. దాంతో మార్చిలో జరగనున్న ఐపీఎల్ టీ20 మ్యాచ్ ల్లో రాణిస్తేనే మెన్ ఇన్ బ్లూ టీంలో అతనికి చోటు దక్కనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ధోని పాల్గొని చాలా కాలమైనందున అతని శరీరం రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఏమేరకు సహకరిస్తోందో చూడాలని కూడా వ్యాఖ్యానించాడు. బీసీసీఐ సైతం ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ జాబితాలో ధోని పేరు చేర్చలేదు. అయితే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లనే బీసీసీఐ పరిగణనలోకి తీసుకుని లిస్టు రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ధోని స్వరాష్ట్రంలోని డియోరీ దేవాలయంలో పూజలు చేసిన న్యూస్ నెట్టింట్లో వైరల్ అయింది. 2011లో వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు కూడా ఇదే దేవాలయంలో అప్పటి టీం కెప్టెన్‌గా ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌ని అందించిన ఘనత ధోని సొంతమయింది. 2007లో సైతం ధోని టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించిన సంగతి తెలిసిందే. భారత్ మొత్తం మూడు వరల్డ్ కప్ లను అందుకోగా అందులో మొదటిది 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో సాధ్యమయింది. మిగిలిన రెండు వరల్డ్ కప్ లను ధోని నాయకత్వంలోనే భారత్ జట్టు గెలుచుకోవడం విశేషం. ఆ విధంగా భారత్ కు రెండు సార్లు వరల్డ్ కప్ లను అందించిన ఘనాపాఠి ధోనియే. 2019 వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలయింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండోరోజూ కొనసాగడం కివీస్ కు కలిసివచ్చింది. 240 స్వల్ప పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు టాప్ ఆర్డర్ వికెట్లు టపటపా పడిపోయాయి. ఆ దశలో టీం ఇండియాకు ధోని వెన్నెముకగా నిలిచాడు. ఆ మ్యాచ్ లో చలాకీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(79) చెలరేగి బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరి జోడి భారత్ ను దాదాపు గెలుపువాకిటకు తీసుకెళ్లింది. ధోని అర్ధ సెంచరీ (50) చేసి రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారింది. ఆ తర్వాత నుంచి ధోని క్రికెట్ మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం రానున్న ఐపీఎల్ లో రాణించడంతో పాటు మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఝూర్కండ్ లోనే ధోని ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాడు.

Monday, January 20, 2020

BalaKrishna new look in the AP Assembly

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ కొత్త లుక్ 
హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్ డీఏ బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్ష బెంచీల్లో ఆశీనులైన బాలయ్య బారు మీసాలు, గుండు, నెరిసిన గడ్డంతో కనిపించారు. సహచర శాసనసభ్యులే గుర్తు పట్టలేని విధంగా తెల్ల చొక్కా, ప్యాంట్ ధరించిన ఆయన పూర్తి సరికొత్త గెటప్ లో సమావేశాలకు హాజరయ్యారు. బాలయ్య ఈ గెటప్ లో కనిపించడం ఇదే ప్రథమం. దాంతో ఆయన ప్రస్తుత గెటప్ లోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇటీవల ఎస్.ఎ.రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `రూరల్` సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య ఫ్రెంచ్ కట్ గడ్డంతో యువకుడిలా కనిపించి అలరించారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిలా వైట్ అండ్ వైట్ డ్రస్, గుండుతో ఆయన దర్శనమివ్వడం చర్చనీయాంశం అయింది. ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీఎల్పీ సమావేశానికి ఆయన ఇదే గెటప్ లో హాజరవ్వడంతో తెలుగుదేశం నాయకులూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ఆయన తన ఆస్థాన దర్శకుడు బోయపాటి శ్రీను చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ కోసం వీరి ప్రస్తుత చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Saturday, January 18, 2020

Saibaba temple to remain open on Sunday, bandh at Shirdi

షిర్డీలో బంద్: యథాతథంగా సాయిబాబాకు పూజలు
మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే సర్కారు నిర్ణయానికి నిరసనగా ఆదివారం షిర్డీలో బంద్ పాటించనున్నారు. అయితే సాయిబాబా మందిరం మాత్రం తెరిచే ఉంటుంది. అసంఖ్యాక భక్తులకు అసౌకర్యం కల్గరాదని సాయిబాబా ఆలయ సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. శనివారం బాబా పూజలు యథావిధిగా నిర్వహించి భక్తులకు దర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగించారు. చారిత్రక ఆధారాలను బట్టి తమ ప్రభుత్వం పాథ్రిని సాయిబాబా జన్మస్థలంగా గుర్తించినట్లు ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇటీవల అక్కడ ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.100 కోట్ల మొత్తాన్ని మహా అగాడి సర్కార్ ప్రకటించింది. సాయి ఆజన్మాంతం తిరిగి నిర్యాణం చెందిన షిర్డీని పక్కన బెట్టి కొత్త ప్రాంతాన్ని ఉద్ధవ్ ప్రభుత్వం తెరపైకి తేవడాన్ని బీజేపీ కూడా వ్యతిరేకిస్తోంది. షిర్డీ ఆలయ సంస్థాన్ ఈ నిర్ణయంపై బహిరంగంగా ఏ ప్రకటన చేయలేదు. ఆదివారం నాటి షిర్డీ బంద్ కు ట్రస్టుకు సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సర్కార్ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న వర్గాలు పట్టణంలో బంద్ కొనసాగించనున్నాయి. వ్యాపార సముదాయాలు మాత్రమే మూసివేయనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు దర్శనం ఎప్పటిలాగే లభించనుంది. అదేవిధంగా బాబా లడ్డూ ప్రసాదాలను వారికి అందజేయనున్నట్లు సంస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి.

Monday, January 13, 2020

Pawan Kalyan meets BJP working president JPNadda

బీజేపీ అగ్రనేత జేపీనడ్డాతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి తరలించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీనడ్డాతో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఆయన ఢిల్లీ చేరుకుని మకాం వేసిన సంగతి తెలిసిందే. సోమవారం పవన్ కల్యాణ్ పార్టీ సహచరులు నాదెండ్ల మనోహర్ తో కలిసి నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (బెంగళూరు), ఆ పార్టీ ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్ వెంట రాగా జనసేన అధినాయకులు నడ్డాతో భేటీ అయ్యారు. అమరావతి ప్రస్తుత సంక్షోభాన్ని వీరిద్దరూ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన నడ్డా దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా పరిణామాలన్నింటిని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు పవన్, మనోహర్ లకు ఆయన చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించి రైతులకు పలు పర్యాయాలు పవన్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. వారు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తేనే తీసుకోవాలి తప్పిస్తే బలవంతంగా లాక్కోవద్దని పవర్ స్టార్ గళమెత్తారు. రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని కూడా నాడు జనసేనాని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే అమరావతి పరిసర 29 గ్రామాలకు చెందిన రైతులు 33 వేల ఎకరాల భూమి రాజధాని కోసం సమర్పించారు. ప్రభుత్వ భూములు కలుపుకొని మొత్తం సుమారు 54 వేల ఎకరాల భూములు సమకూరాయి. ఇక కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి దశల వారీగా నిధులు అందాల్సిన తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడం జరిగింది. ప్రత్యేక హోదా, నవ్యాంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల బకాయిలు కోసం పోరాడాల్సిన తరుణంలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. అవసర ప్రాధాన్యాలు పక్కకపోయి ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇప్పటికే అయిదేళ్లు కాలం గడిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ కు ఎప్పుడూ గుడారాల రాజధానే అనే అపకీర్తి మిగులుతోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై ఆ తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ నాడు కర్నూలు రాజధాని అయింది. ఆపై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో హైదరాబాద్ కు మళ్లాల్సి వచ్చింది. ఇటీవల విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ గా నిలదొక్కుకునేందుకు అమరావతి రాజధానిగా రూపుదాల్చింది. అంతలోనే మళ్లీ దక్షిణాఫ్రికా తరహాలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. ఇలా వరుసగా  రాజధాని అంశం చుట్టే రాష్ట్రం పరిభ్రమిస్తే అభివృద్ధి మాట అటుంచి మౌలికసౌకర్యాల కల్పనా.. అభూతకల్పనగా మారే దుస్థితి. సాటి తెలుగురాష్ట్రం తెలంగాణ శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే చిరకాల ఆంధ్రప్రదేశ్ కు ఇంకా రాజధానే ఖరారు కాకపోవడమంటే నగుబాటే. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగే అవకాశం (గడువు) మరో నాల్గేళ్లలో 2024లో పూర్తికానుంది.  రాజధాని అమరావతి అనుకున్నాక నిర్మాణ పనులకు అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ కు దీటుగా.. ఆ మాటకొస్తే ప్రపంచ ప్రసిద్ధ నగరాల జాబితాలో చోటు దక్కించుకునే రాజధానిని నిర్మించాలన్నదే తమ తపనని నాటి ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అద్భుత రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అయితే నిధుల లేమితో ఆ దిశగా అడుగులు వడివడిగా పడలేదన్నది వాస్తవం. ఆ అంశాలన్నింటిపై పాలక ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిన దశలో ఇప్పుడు అమరావతిలో రాజధానిని నిలుపుకోవడంపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తనవంతు పోరాడుతూనే.. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుం కట్టారు. అందులో భాగంగా ఈరోజు జేపీనడ్డాతో మాట్లాడారు. ఇకపై మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయాలనే ఆకాంక్షను కూడా పవన్ కల్యాణ్ ఆయన వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన దరిమిలా తెలుగుదేశం పార్టీ కి దగ్గరయ్యే దిశగాను జనసేనాని అడుగులు వేశారు. చాలా అంశాల్లో పచ్చపార్టీ ఆలోచనా విధానంతో పవన్ ఏకీభవిస్తూ మాట్లాడారు కూడా. జనసేనతో ఎన్నికల పొత్తులో కలిసి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు అమరావతి రాజధాని అంశంలో సైతం గొంతు కలిపాయి. అయితే రాజధాని తరలింపును అడ్డుకోగలిగిన ఏకైక శక్తి కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక్క బీజేపీకే సాధ్యమనే విషయం పవన్ కల్యాణ్ కు బాగా తెలుసు. అందుకనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ భవిత కోసం ఆయన అవసరమైతే మళ్లీ బీజేపీతో సయోధ్యగా ముందుకు పోవడానికి కూడా సంసిద్ధమయ్యారు. మరో వైపు బీజేపీ పెద్దలకు కూడా పవన్ స్టామినా ఏంటో తెలుసు. గతేడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 7శాతం ఓట్లు (సుమారు 21.50 లక్షల ఓట్లు) తెచ్చుకున్న జనసేన రాష్ట్రంలో తృతీయ రాజకీయ శక్తి. ఆ పార్టీది వై.ఎస్.ఆర్.సి.పి, టీడీపీల తర్వాత స్థానం. ఆ దృష్టానే బెట్టు వీడిన బీజేపీ నేతలు పవన్ ఘోష వినడానికి ముందుకు వచ్చారు. జేపీ నడ్డా ఈరోజు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

Saturday, January 11, 2020

Kerala Government collapses Huge multi storied building

కేరళలో 3 సెకన్లలోనే భారీ ఆకాశహార్మ్యం నేలమట్టం
అక్రమకట్టడాలపై కేరళ ప్రభుత్వం శనివారం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్ని నేల మట్టం చేసింది. ఈ ఉదయం కొచ్చిలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్సుల కూల్చివేత ప్రక్రియను అధికారులు సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేశారు. బ్యాక్ వాటర్ ను పట్టించుకోకుండా కొచ్చిలో ఈ విధంగా నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లు నిర్మించినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో 350 కి పైగా ఫ్లాట్లుండగా 240 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆ గృహ సముదాయాల నుంచి ఖాళీ చేయించారు. అనంతరం రెండ్రోజుల ఈ కూల్చివేతల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ వారాంతంలో కేరళ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశంలోనే నివాస సముదాయాలతో కూడిన అతిపెద్ద కూల్చివేత డ్రైవ్‌లలో ఒకటిగా నిలిచింది. కొచ్చిలోని మారడు సరస్సు ఒడ్డున హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ పేరిట ఈ అక్రమ అపార్ట్ మెంట్లు వెలిశాయి. నిబంధనలు ఉల్లంఘించి ఈ ఆకాశ హార్య్మాలు నిర్మించడంతో అయిదు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లోనే ఆదేశించింది. గత ఏడాది కూడా పెను వరదల తాకిడికి కేరళ అల్లాడిన సంగతి తెలిసిందే. ఈ రోజు రెండు బహుళ అంతస్తుల భవనాలు కూల్చివేతకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సుమారు 800 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి కేవలం మూడు సెకన్ల వ్యవధిలోనే భారీ ఆకాశ హార్మ్యాన్ని నేలమట్టం చేయడం విశేషం.

Tuesday, January 7, 2020

Deepika Padukone visits JNU to lend her support to the students

గాయపడిన జె.ఎన్.యు. విద్యార్థులకు దీపికా పదుకొనె మద్దతు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మంగళవారం జె.ఎన్.యు. క్యాంపస్ ను సందర్శించి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఆదివారం గుర్తు తెలియని దుండగులు జరిపిన కర్కశ దాడిలో సుమారు 40 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో దేశవ్యాప్తంగా అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అనుకూల వర్గాలు వ్యతిరేకత తెల్పుతున్నా పట్టించుకోకుండా దీపికా జె.ఎన్.యు.కు చేరుకుని గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీఘోష్ సహా మిగిలిన క్షతగాత్రుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు అండగా తామంతా నిలబడతామని ఈ సందర్భంగా వారికి దీపికా తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు విద్యార్థులు, అధ్యాపకులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని వారి వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా దీపికా వెంట జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో జె.ఎన్.యు.లో విస్తృత పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Friday, January 3, 2020

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals to the state

ఏపీలో సకల జనుల సమ్మె ఉద్రిక్తం
ఆంధ్రప్రదేశ్ కు `మూడు రాజధానులు వద్దు ప్రస్తుత రాజధాని అమరావతే ముద్దు` అంటూ రైతులు ఆందోళన ఉధృతం చేశారు. గత 16 రోజులుగా రోడెక్కిన రైతులు శుక్రవారం సకల జనుల సమ్మెకు పిలుపు ఇచ్చారు. దాంతో రాజధాని సమీపంలోని బాధిత 29 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మందడం కు ర్యాలీగా తరలడానికి సిద్ధమైన `జనసేన` అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను పోలీసులు దారిలోనే నిలిపివేశారు. దాంతో ఆయన రోడ్డుపై ధర్నాకు దిగారు. సకల జనుల సమ్మె పిలుపు నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. రైతులకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఎక్కడికక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఈ క్రమంలో మహిళల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ ప్రతిపక్ష నాయకులు విరుచుకు పడ్డారు. మహిళల్ని బస్సుల్లో అక్కడ నుంచి పోలీసులు తరలించారు. పోలీసుల తీరును తప్పుబడుతూ రైతులు ఆ వాహనాలకు అడ్డంగా పడుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వం అణచివేత చర్యలకు పూనుకుంటోందని..ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు తమ ఆవేదన వెలిబుచ్చేందుకు రోడ్డు పైకి వస్తే వారిపై పోలీసులు దౌర్జన్యం చేశారని ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇది మా సమస్య కాదని మౌనంగా ఉంటే రేపొద్దున మరో బాధ వారిని వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్పుడు వారికి సహకరించే వారుండరని అందుకే సమష్ఠిగా పోరాడాలని సూచించారు.

Wednesday, January 1, 2020

AP Governor and CM, Opposition Leaders 2020 New Year Wishes to the People

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నాయకుల శుభాకాంక్షలు
2020 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రజలకు శుభాభినందనలు చెప్పారు. జనవరి 1 బుధవారం అమరావతిలోని రాజ్ భవన్ వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ కు పిల్లలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు డాలర్ శేషాద్రి తదితరులు గవర్నర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీటీడీ పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలందరూ ఈ ఏడాది ఆనందంగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు విషెస్ తెల్పుతూ ఈ సంవత్సరం యావత్ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని వేడుకున్నట్లు చెప్పారు. గడిచిన ఏడాది రాష్ట్ర ప్రజలు చిరునవ్వులతో తమ ప్రభుత్వాన్ని ఆహ్వానించి ఆనందంగా గడిపారని ఈ ఏడాది అందరి ఇళ్లల్లో సంతోషం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలని దుర్గమ్మని వేడుకున్నట్లు తెలిపారు. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దంపతులు ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను నాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారన్నారు. కానీ నేడు 2020 సత్ఫలితాల్ని తెలంగాణ అనుభవిస్తోందని చెప్పారు. నూతన సంవత్సరం తొలిరోజున దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. `రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలి..అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి`..అని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ఆయనకు దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే రామానాయుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు.