Monday, May 27, 2019

Pak SC makes history by hearing case via e-Court



పాక్ సుప్రీంకోర్టు లో తొలిసారి ఈ-కోర్టు కేసు విచారణ
పాకిస్థాన్ న్యాయ వ్యవస్థ చరిత్రలో సోమవారం (మే27) కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ఆ దేశ సుప్రీంకోర్టు తొలిసారిగా ఈ-కోర్టు పద్ధతిలో కేసు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలో జస్టిస్ తారిఖ్ మసూద్, జస్టిస్ మజర్ అలాం ఖాన్ మయిన్ఖేల్ లతో కూడిన ఇస్లామాబాద్ లోగల సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సుప్రీంకోర్టు కరాచీ రిజిస్ట్రీ నుంచి న్యాయవాది ఆన్ లైన్ లో కేసును సుప్రీం ధర్మాసనం ముందుంచారు. సుప్రీంకోర్టు హాల్ లో కంప్యూటర్ కు అనుసంధానం చేసిన వీడియో లింక్ ద్వారా విచారణ కొనసాగించారు. ఈ సౌకర్యంతో పలువురు న్యాయవాదులు, కక్షిదారులూ లబ్ధి పొందగలరని భావిస్తున్నారు. విలువైన సమయం, ధనం కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా పదవిలోకి వచ్చిన ఖోసా జనవరిలోనే కొండల్లా పేరుకున్న కేసులు, విచారణ జాప్యాలను త్వరలో నివారించాల్సి ఉందని పేర్కొన్నారు. సంస్థాగతంగా ఓ క్రమపద్ధతిలో కేసుల విచారణ పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అనవసర ఆలస్యాల నివారణ, వ్యాజ్యాల కుదింపు, పనిభారం తగ్గింపు దిశగా ముందడుగు వేయాలని చీఫ్ జస్టిస్ ఖోసా పేర్కొన్నారు. పాత, కొత్త కేసుల విచారణను ఎటువంటి జాప్యం లేకుండా ఇకపై ఈ-కోర్టు ద్వారా చకచకా నిర్వహించే వీలుకల్గుతుందని పాక్ న్యాయవ్యవస్థ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.