Saturday, April 20, 2019

anna hazare says sweeping electoral reforms needed to end malpractices

సమూలంగా ఎన్నికల సంస్కరణలు అవసరం: హజారే
దేశంలో ఎన్నికల అక్రమాలు అరికట్టడానికి సమూలంగా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ప్రముఖ సామాజిక సేవ, ఉద్యమకర్త అన్నా హజారే అభ్రిపాయపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్లు మూల స్తంభాలన్నారు. ప్రస్తుత రాజకీయాల వల్ల అటు పార్లమెంట్, అసెంబ్లీల పవిత్రత అడుగంటిపోతోందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీలు, గుర్తులతో పోటీ ఎందుకన్నారు. భారత సంవిధానంలో ఎక్కడా పార్టీలు, గుర్తుల ప్రస్తావన లేదని కేవలం వ్యక్తి(నాయకుడు) అని మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు రాశారని హజారే గుర్తు చేశారు. 25 ఏళ్లు నిండిన భారతీయ పౌరులెవరైనా పోటీ చేయొచ్చన్నారు. ప్రజల్ని ఏదోవిధంగా మభ్యపెట్టి డబ్బు ఎరవేసి లోబర్చుకుని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలు, గుర్తుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) పలుమార్లు మనవి చేసినా స్పందన లేదని చెప్పారు. ప్రధాని మోదీకి అనేక అంశాలపై 32 లేఖలు రాసినా పట్టించుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. లోక్ పాల్ దృష్టికి కూడా ఎన్నికల అవకతవకల విషయాన్ని తీసుకెళ్లానన్నారు. కచ్చితంగా ఈ అక్రమ దందాకు ఏదో ఒక రోజు చరమగీతం పాడగలమని హజారే ఆశాభావం వ్యక్తం చేశారు. మూడో దశ పోలింగ్ లో భాగంగా ఈనెల 23న అహ్మద్ నగర్(మహారాష్ట్ర) లో ఓటు హక్కు వినియోగించుకుంటానని 81 ఏళ్ల హజారే తెలిపారు. సరైన అభ్యర్థికే ఓటు వేస్తానని లేదంటే నోటా (none of the above)  బటన్ నొక్కుతానని చెప్పారు.

judiciary is under threat says chief justice after reports of harassment allegations against him


న్యాయ వ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐ గొగొయ్
దేశంలో న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని తనపై చేసిన లైంగిక వేధింపు ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ మహిళ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది.  సీజేఐ గొగొయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏ విధమైన ఆర్డర్ ఇవ్వకుండా విడిచిపుచ్చింది. ‘ఇది నమ్మలేకపోతున్నా..ఇంత చౌకబారు ఆరోపణలు ఎదుర్కొంటానని నేనెన్నడూ ఊహించలేదు’ అని గొగొయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘20 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా అవిశ్రాంతంగా పని చేశాను.. నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.80 లక్షలు మాత్రమే.. ఏరోజూ అవినీతికి పాల్పడ లేదు..ఇదేనా భారత ప్రధానన్యాయమూర్తిగా నాకు ఇచ్చే రివార్డు’ అని ప్రశ్నించారు. ఈ నీచమైన ఆరోపణలు చేసిన మహిళపై పోలీస్ స్టేషన్లో రెండు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ప్రస్తుత పోకడలు న్యాయ వ్యవస్థను  బలి పశువును చేసేలా తయారయ్యాయని కానీ అలా ఎన్నటికీ జరగదని గొగొయ్ పేర్కొన్నారు. సీజేఐపై మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఏదో ఆశించి చేస్తున్న బెదిరింపు (బ్లాక్ మెయిల్)గా కనిపిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు.