Friday, December 27, 2019

MiG 27 to pass into history, its last squadron to be decommissioned in Jodhpur on Friday

చరిత్ర పుటల్లో ఐఏఎఫ్ అస్త్రం మిగ్-27
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భాసిల్లిన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయి. 1999లో పాకిస్థాన్ మూకలతో జరిగిన కార్గిల్ యుద్ధం నుంచి భారత తురఫుముక్కగా మిగ్-27 ఇతోధిక సేవలందించింది. భారత సైన్యంతో `బహుదూర్` గా కీర్తి పొందిన ఈ రష్యా తయారీ మిగ్-27 కాలమాన క్రమంలో `ప్రాణాంతక` లోహ విహాంగంగా భయపెట్టింది. శుక్రవారం జోద్ పూర్ ఎయిర్ బేస్ నుంచి చివరి మిగ్-27 నిష్క్రమణ (డీ కమిషన్) పూర్తయింది. ఈ ఎయిర్ బేస్ నుంచి ఏడు మిగ్-27లతో స్క్వాడ్రన్ లీడర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టి డీకమిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఏడాది బాలాకోట్ పై భారత్ వైమానిక దళం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసిన అనంతరం పాక్ శత్రు విమానాలు భారత్ గగనతలంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ వర్ధమాన్ ఈ మిగ్-27 విమానంతోనే పాక్ అత్యాధునిక ఎఫ్-27 (అమెరికా తయారీ) యుద్ధ విమానాల్ని నిలువరించడమే కాకుండా ఓ ఫైటర్ క్రాఫ్ట్ ను నేల కూల్చిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో మిగ్-27 డీకమిషన్ కార్యక్రమం సందర్భంగా రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ సొంబిత్ ఘోష్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ ఎయిర్ బేస్ నుంచి ఇక మిగ్-27లు కార్యకలాపాలు నిర్వహించబోవన్నారు. ఐఏఎఫ్ సేవల నుంచి తప్పించిన ఈ విమానాల భవిష్యత్ గురించి ఇప్పటికింకా కచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదన్నారు. వీటిని దేశీయ అవసరాలకు వినియోగించడమా, ఇతర దేశాలకు తరలించడమా అనేది అనంతర కాలంలో తేలనుందని చెప్పారు.