Sunday, April 14, 2019

jet airways crisis deepens no flight from monday


జెట్ విమానాలు నేటి నుంచి బంద్
·   ఎయిర్ వేస్ సంక్షోభం తీవ్రతరం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ పైలట్ల విధులు బహిష్కరణ ప్రకటనతో మరో సమస్యలోకి జారుకుంది. దాంతో సోమవారం (ఏప్రిల్15) నుంచి జెట్ విమానాలు ఎగరబోవడం లేదని తెలిసింది.  నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్(ఎన్.ఎ.జి) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్ఏజీలో 1100 మంది పైలట్లు సభ్యులుగా ఉన్నారు. ఒక్క జెట్ ఎయిర్ వేస్ లోనే 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. పైలట్లతో పాటు జెట్ ఇంజినీర్లు, సీనియర్ మేనేజర్లు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి నుంచి వీరందరికీ జీతాలు అందడం లేదని సమాచారం. అయితే జెట్ యాజమాన్యం సంస్థ మనుగడను కాపాడ్డానికి ప్రాథమిక పెట్టుబడిగా ఎస్.బి.ఐ నుంచి రూ.1500 కోట్ల రుణ మంజూరు కోరింది. జెట్ సిబ్బంది అందరికీ ఆ మొత్తం రాగానే బకాయిలన్నీ చెల్లిస్తామని నచ్చజెబుతూ వచ్చింది. అయితే ఆ ప్రణాళికా బెడిసికొట్టిన మీదట జెట్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. సంక్షోభానికి ముందు జెట్ సంస్థ రోజూ 120 విమానాల్ని నడిపేది. ఆ తర్వాత ఆ సంఖ్యను రోజుకు 15 కు కుదించింది. ఇప్పుడు పూర్తిగా సర్వీసుల బంద్ దశకు చేరుకుంది.



elephant kills oldaged pilgrim injures two others in poondi reserve forest


ఏనుగు దాడిలో వృద్ధ భక్తుడి మృతి ఇద్దరికి గాయాలు
దైవ దర్శనానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధ భక్తుడు ఏనుగు దాడిలో దుర్మరణం చెందాడు. ఈ దుర్ఘటన ఆదివారం పూండి రిజర్వ్ ఫారెస్ట్ కు 30కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఏనుగు దాడిలో మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడకు సమీపంలోని వెలియాన్ గిరిలో కొండపై పురాతన దేవాలయాన్ని సందర్శించుకోవడానికి పలువురు భక్తులు బయలుదేరారు. వీరంతా మార్గమధ్యంలో సెలయారులో నీళ్లు తాగేందుకు ఆగారు. అకస్మాతుగా అడవిలో నుంచి దూసుకువచ్చిన ఏనుగు ఆరుసామి(60) అనే వృద్ధుడ్ని కాళ్లతో తొక్కేసింది. దాంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరిపైన ఏనుగు విరుచుకుపడగా తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు భక్తులు మాత్రం ఏనుగు దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడినట్లు సమాచారం.


Lover kills woman travels with body in suitcase


ప్రేయసిని చంపి సూట్ కేస్ లో కుక్కిన కిరాతకుడు
నమ్మిన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన కిరాతకుడి ఉదంతమిది. 25 ఏళ్ల యువతి వారం రోజులుగా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. మేడ్చల్ లోని ఓ డ్రెయినేజీ నుంచి యువతి మృతదేహాన్ని శనివారం (ఏప్రిల్13) కనుగొన్నారు. ఇంజినీరింగ్ చేసిన యువతి తన సహ విద్యార్థిని ప్రేమించింది. వీరిద్దరూ 2017 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈనెల 4న ఇద్దరూ ఉద్యోగం కోసం మస్కట్ లో ఇంటర్వ్యూకు వెళ్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ అతను యువతిని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని లాడ్జిలో దించాడు. ఆ తర్వాత రోజు ఆమెను చంపేసి సూట్ కూస్ లో శవాన్ని కుక్కాడు. ఆ సూట్ కేస్ తో కొంత దూరం బస్ లో ప్రయాణించి ఆ తర్వాత క్యాబ్ లో కి మారి మేడ్చల్ ప్రాంతానికి  చేరుకున్నాడు. అక్కడ డ్రెయినేజీలో సూట్ కేస్ ను పారేసినట్లు పోలీసులు వివరించారు. యువతి ఫోన్ కాల్స్ ఆధారంగా హంతకుడి గుట్టురట్టయింది.  

worlds largest plane rock flies first time in mojave california from stratolaunch private company


‘రాక్’ ప్రయోగం విజయవంతం
·        ప్రపంచంలోనే అతి పెద్ద అంతరిక్షవాహక విమానం

ప్రముఖ అంతరిక్ష వాహక విమానాల తయారీ సంస్థ స్ట్రాటో లాంచ్ ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. అమెరికా కాలమానం ప్రకారం (13 ఏప్రిల్) శనివారం ఉదయం 6.58 కి కాలిఫోర్నియాలోని మొజావ్ ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్ నుంచి  ఈ అతిపెద్ద ఉపగ్రహాల రవాణా విమానం ‘రాక్’ను ప్రయోగించింది. రన్ వే పై పరీక్ష పూర్తయిన అనంతరం రాక్ గాల్లోకి దూసుకెళ్లి ఆకాశంలో 2గంటల 30 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. ఫుట్ బాల్ మైదానం విస్తీర్ణం (360 అడుగులు) కన్నా ఈ రాక్షస విమానం ‘రాక్’ రెక్కల వైశాల్యం పెద్దది. మొత్తం 385 అడుగుల వెడల్పుతో అత్యంత పెద్ద రెక్కలుగల ‘రాక్’ 17 వేల అడుగుల ఎత్తుకు దూసుకెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 304 కిలోమీటర్లు. ఉపగ్రహ వాహక రాకెట్లను రవాణా చేసే ఈ భారీ విమానం గగనంలో 35 వేల అడుగుల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది. రెండు విమానాల్ని అతికించినట్లు కనిపించే ఈ భారీ విమానం ఆరు జెట్ ఇంజన్లను కల్గి ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వైశాల్యానికి ఈ విమానం మొత్తం వైశాల్యం సరిగ్గా సమానం. రాక్ విజయవంతంతో నాసా ప్రయోగాలకు మరింత ఉపయుక్తం కాగలదని భావిస్తున్నారు. ఇదొక చారిత్రక విజయంగా నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బెచెన్ పేర్కొన్నారు. ప్రాజెక్టు విజయవంతానికి కృషి చేసిన జట్టు సభ్యులకు, భాగస్వామ్య సంస్థ నార్తరప్ గ్రుమన్స్ కు స్ట్రాటోలాంచ్ కంపెనీ సీఈవో జీన్ ప్లాయిడ్ అభినందనలు తెలిపారు. రాక్ ప్రయోగం విజయవంతం కావడం.. భూమి పై నుంచి చేపట్టే అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగాలకు ప్రత్యామ్నాయం కాగలదని పేర్కొన్నారు.


ram gopal varma shocking twist chief minister chandrababu naidu joins ysrcp


ఆర్ జీవీ తేనెతుట్ట నుంచి మరోరాయి

రామ్ గోపాల్ వర్మ.. ఆర్ జీవీ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. సంచలనాల దర్శక,నిర్మాత.. అంతకు మించి వివాదాలకు రారాజు.. ఆయన ట్వీట్లు రేపే కల్లోలం అంతా ఇంతా కాదు.. ఇదిగో ఏపీలో ఇలా..ఎన్నికలు ముగిశాయో లేదో.. ట్విటర్ లో మార్ఫింగ్ ఫొటోతో వివాదానికి తెరతీశారు. కుర్చీ మాదంటే మాదని ఎవరి ధీమాలో వారుండగా.. వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్న సీఎం చంద్రబాబు ఆ పార్టీలో జగన్ సమక్షంలో చేరినట్లు నకిలీ ఫొటోను పోస్టు చేశారు.
 షాకింగ్ ట్విస్ట్: ఇప్పుడే వైసీపీలో చేరిన సీబీఎన్! అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ రాశారు.


ipl2019 rcb at last registered a win in season12 against kings punjab

ఆర్ సీ బీ గెలిచింది..!
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మూడు వారాలుగా ఎదురుచూస్తున్న విజయం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ)కి దక్కింది. మొహాలీలో ఐపీఎల్ మ్యాచ్ నం.28 కింగ్స్ లెవన్ పంజాబ్ పై ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆర్ సీబీ గెలుపునందుకుంది. కెప్టెన్ కోహ్లీ(67), వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఏబీడివిలియర్స్(59) లు అర్ధసెంచరీలు నమోదు చేయగా నాల్గో నంబర్ బ్యాట్స్ మన్ స్టాయినిస్ (28) పరుగుల అండతో సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో తొలిసారిగా రెండు పాయింట్లను తన ఖాతాలో నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్ సీబీ ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 173/4 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్ సీబీ కేవలం ఓపెనర్ల వికెట్లనే కోల్పోయి 174/2 పరుగులు చేసి గెలుపొందింది. టోర్నీలో వరుసగా ఆరు మ్యాచ్ లను చేజార్చుకున్న ఆర్ సీబీ ఎట్టకేలకు విజయాన్ని సాధించి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగల్గింది.
గేల్ సెంచరీ మిస్
ఐపీఎల్ చరిత్రలోనే 175 పరుగుల్ని(2013లో పుణెపై) చేసిన ఏకైక బ్యాట్స్ మన్ యూనివర్స్ బాస్ కింగ్స్ పంజాబ్ కు చెందిన క్రిస్ గేల్ ఈ 12వ సీజన్లో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. ఈ మ్యాచ్ లో కేవలం 64 బంతుల్లోనే 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.