Friday, January 29, 2021

Andhra Pradesh Grama volunteer died in attack in Guntur

అసభ్యంగా ప్రవర్తించాడని వాలంటీర్ హత్య

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లిదండ్రులు దాడి చేసి చంపిన ఘటన ఇది. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల నంబల నాగరాజు గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలున్నాయి. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకెళ్తుండగా ప్రాణాలు విడిచాడు. వినుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నాగరాజు మాట్లాడుతూ తను నిద్రలో ఉండగా తలుపులు తీసుకొని వచ్చిన దుండగులు తనపై దాడికి పాల్పడ్డారన్నాడు. ఓ యువతితో వచ్చిన వివాదంతోనే ఆమె బంధువులు తనపై దాడి చేశారని చెప్పాడు. యువతి పట్ల వాలంటీరు అనుసరించిన తీరే ఈ దాడికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.