Thursday, January 30, 2020

SC Stays Proceedings Initiated By Woman Claiming To Be Daughter Of Singer Anuradha Paudwal

అనురాధ పౌద్వాల్ కు సుప్రీంలో ఊరట
ప్రముఖ గాయని అనురాధ పౌద్వాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ 45ఏళ్ల మహిళ ఆమె కుమార్తె నని చెప్పుకుంటూ రూ .50 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మహిళ ఫిర్యాదు మేరకు తిరువనంతపురం(కేరళ) ఫ్యామిలీ కోర్టులో అనురాధ పౌద్వాల్ పై కేసు విచారణ ప్రారంభమయింది. అయితే పౌద్వాల్ అభ్యర్థన పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసుపై గురువారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవై, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సదరు మహిళకు నోటీసు జారీ చేసింది. ఈ కేసును తిరువనంతపురం కోర్టు నుంచి ముంబై కోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ పౌద్వాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు ధర్మాసనం ఆ మహిళకు తాజాగా నోటీసు ఇచ్చింది. పౌద్వాల్ పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ ఉత్తమగాయనిగా పలు అవార్డులు అందుకున్నారు. ఆమె సంగీత స్వరకర్త అరుణ్ పౌద్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పౌద్వాలే తన తల్లి అంటూ సదరు మహిళ కేరళ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 27న పౌద్వాల్ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో పౌద్వాల్ ముంబై కోర్టుకు కేసు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

Muzaffarnagar Coldest In Uttar Pradesh At 6 Degrees Celsius

ఉత్తరాదిన ఇంకా వణికిస్తున్న చలిపులి
ఉత్తరభారతదేశంలో ఇంకా శీతలవాతావరణం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ (యూపీ)లోని ముజఫర్ నగర్ లో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. లఖ్నవూ, బరేలీ, ఝాన్సీ, ఆగ్రాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. యూపీలోని మిగిలిన ప్రాంతాల వాతావరణంలో పెద్ద మార్పేమీ లేనట్లు వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో చాలా చోట్ల శుక్రవారం ఉదయం పొడి వాతావరణం, ఓ మాదిరిగా పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.