Saturday, June 19, 2021

Milkha Singh to get state funeral

మిల్కాసింగ్ కు కన్నీటి వీడ్కోలు

ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్‌ కు శనివారం చండీగఢ్ లో పూర్తిస్థాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 91 ఏళ్ల ఈ పరుగుల వీరుడికి కుటుంబ సభ్యులు కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజుతో సహా పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. క్రీడా ప్రపంచం ఆయనను ది ఫ్లయింగ్ సిక్కుఅని ప్రేమగా పిలుచుకునేది. ఆసియా క్రీడల్లో ఆయన నాలుగుసార్లు స్వర్ణ పతకాలు గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో నాల్గో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయారు. ఆయన మృతి పట్ల యావత్ భారత క్రీడాలోకం తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐదు రోజుల క్రితం మిల్కా భార్య, మాజీ భారత వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ కౌర్ కరోనాతో మొహాలి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.  మిల్కాకు  గోల్ఫ్ దిగ్గజం కుమారుడు జీవ్ మిల్కా సింగ్, కుమార్తెలు మోనా సింగ్, సోనియా సింగ్, అలీజా గ్రోవర్ ఉన్నారు. ఆయనకు మే 20 న కరోనా పాజిటివ్ అని తేలడంతో మే 24 న మొహాలిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మే 30 న మిల్కా డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో జూన్ 3 న ఆసుపత్రిలో చేర్చారు. ఈ భారత మాజీ అథ్లెట్ కు గురువారం కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అయితే మరుసటి రోజే ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.