Thursday, October 1, 2020

Amitabh Bachchan Couldn't Afford 2 Rupees To Join His School Cricket Team, Shares Childhood Story


 రూ.2 లేక క్రికెట్ కోరిక తీరలేదు:అమితాబ్ 

చిన్నతనం మధురస్మృతులు.. చిట్టిపొట్టి బాధలు మనిషన్నాకా ఎన్నోకొన్ని ఉంటూనే ఉంటాయి. బిగ్ బి బాలీవుడ్ బాద్ షా అమితాబూ అలాంటివి చిన్నతనంలో అనుభవించారట. తన ప్రఖ్యాత `కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్-12 షోలో స్వయంగా బిగ్ బీనే ఆ  జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ తన బాల్యంలో బేల్ పూరి తినాలని ఉన్నా డబ్బు లేక నాడు ఆ కోరిక తీర్చుకోలేకపోయాననే బాధను అమితాబ్ ఎదుట వ్యక్తీకరించారు. అందుకు అమితాబ్ తనూ చిన్నతనంలో అటువంటి వెలితిని ఎదుర్కొన్నట్లు ప్రపంచానికి చాటారు. అదేమిటంటే కేవలం రూ.2 లేక స్కూల్ క్రికెట్ టీంలో ఆడలేకపోయిన సంగతిని చెప్పారు. క్రికెట్ ఆడతానని తన తల్లి తేజి బచ్చన్ ను అమితాబ్ అడగ్గా అందుకు ఆమె నిరాకరించారట. అప్పటికే అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ప్రఖ్యాత కవిగా పేరొందారు. చిన్నతనంలో అందరిలాగానే అమితాబ్ బాధలు, ఆనందాలు చవిచూశారు. యుక్త వయసుకు వచ్చాక సినిమాల్లో నటించాలనే కోరిక కల్గింది. కుటుంబ పరిచయంతో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లి సిఫార్సు లేఖ రాయించుకుని అమితాబ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. పడుతూ లేస్తూనే.. ఆ పరిశ్రమలో నిలదొక్కుకుని అదే బాలీవుడ్ లో షెహన్ షాగా ఎదిగారు. ఫ్రెంచ్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ ట్రఫౌట్ అమితాబ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ `అతనే ఓ పరిశ్రమ`(ఇండస్ట్రీ) గా ప్రశంసించాడు. జీవితంలో తన విజయం వెనుక ఒక్కరు కాదు ఇద్దరు మహిళలున్నారంటారు అమితాబ్. ఒకరు తనతల్లి కాగా రెండు తన భార్య జయబాదురిగా బిగ్ బీ పేర్కొన్నారు. ఇటీవల తల్లి జయంతి సందర్భంగా తన నివాసభవన సముదాయం ప్రతీక్షాలో గుల్మొహర్ మొక్కను ఆమె జ్ఞాపకార్థం నాటారు. ఇంతకు ముందు అదే చెట్టు అక్కడ ఉండేదని అది కూలినచోటనే మరో మొక్కను తిరిగి నాటినట్లు అమితాబ్ తెలిపారు. తల్లి అంటే జ్ఞాపకం కాదని ఆరాధ్య దైవంగా ఆయన అభివర్ణించారు.