Monday, March 29, 2021

Bus accident near Visakhapatnam five passengers dead 30 injured

 విశాఖ హైవే రక్తసిక్తం

విశాఖపట్నం-విజయనగరం హైవే రక్తమోడింది. విజయనగరం జిల్లా సుంకరపేట వద్ద సోమవారం ఉదయం జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. గ్యాస్ లారీ, రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. అదే సమయంలో విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు  ప్రమాదానికి గురైన బస్సును ఢీకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్ యార్డ్ ఉండడం.. తెల్లవారుజామున అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టడంతో విపరీతంగా వెలువడిన పొగ కారణంగా డ్రైవర్లకు రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దాంతో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హటాహుటిని దుర్ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.