Monday, September 30, 2019

Close associate of gangster Kapil Sangwan held in Delhi


గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ కీలక అనుచరుడి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ ముఠా లోని కీలక సభ్యుణ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఉదయం ద్వారాక ప్రాంతంలో ఓ కారును అతను బైక్ పై వెంబడిస్తూ అటకాయించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో కాల్పులకు తెగబడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ఎడమకాలులో నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో బైక్ పై నుంచి కింద పడ్డాడు. వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతణ్ని కపిల్ సంగ్వాన్ ప్రధాన అనుచరుడు కుల్దీప్ రాథిగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు, అపహరణలు, హత్య, హత్యా యత్నాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భూకబ్జాలు తదితర పలు కేసుల్లో రాథి నిందితుడన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న కపిల్ సంగ్వాన్ పెరోల్ పై ఈ జూన్ లో విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున పార్టీ చేసుకునేందుకు ముఠా సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కరుడగట్టిన అతడి అనుచరులు 15 మందిని స్పెషల్ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నజఫ్ గఢ్ లోని గొయల డైరీ ప్రాంతంలో వీరంతా సమావేశమైనట్లు ఏఎస్ఐ దినేశ్ కుమార్ కు సమాచారం అందడంతో స్పెషల్ సెల్ ను అప్రమత్తం చేశారు. ఏసీపీ మనోజ్ పంత్ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్ పోలీసులు రెండు జట్లుగా విడిపోయి ఈ ముఠాపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.  పట్టుబడ్డ వారిలో ఇద్దరు కొత్తవారు కాగా మిగిలిన 13 మంది పలు దారుణాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కినవారే. ఈ గ్యాంగ్ కు చెందిన మరో ఎనిమిది మందిని సైతం 2018 జులైలో వసంత్ కుంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Sunday, September 29, 2019

Government bans onions export


ఉల్లి ఎగుమతులపై భారత సర్కారు నిషేధాస్త్రం
దేశంలో ఉల్లి కొరత నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వచ్చాయి. ఆదివారం ఈ మేరకు ఉల్లి ఎగుమతుల విధానాన్ని సవరిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉల్లి ఎగుమతులపై ఎటువంటి పరిమితులు లేవు. ఆ నిబంధనను రద్దు చేస్తూ కేంద్రం సవరించిన ఉల్లి ఎగుమతుల నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఏడాదిలో భారత్ నుంచి రూ.3,497 కోట్ల ఉల్లి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్ లో చుక్కలనంటుతున్న ఉల్లి ధరల్ని దారిలోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ 15 రోజుల క్రితం కనీస ఎగుమతి ధరను టన్నుకు రూ. 59,932గా నిర్ణయించింది. అయినా దేశీయ అవసరాలకు ఉల్లి అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మేరకు సాంతం ఉల్లి ఎగుమతులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దేశంలో గరిష్ఠంగా ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వరదలతో అల్లాడుతుండడంతో దిగుబడి తగ్గిపోయి గిరాకీ గణనీయంగా పెరిగింది. దాంతో ఎంతకూ ధరలు దిగిరావడం లేదు. భారత్ నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ఎగుమతయ్యేది.

Saturday, September 28, 2019

Chattisgarh: Wild elephant crushes woman, son to death


అడవి ఏనుగు దాడిలో మహిళ నాల్గేళ్ల కొడుకు మృతి
ఛత్తీస్ గఢ్ లోని అడవిలో ఏనుగు దాడిలో ఓ మహిళ సహా ఆమె నాల్గేళ్ల కొడుకు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చోటుచేసుకుంది. బలరామ్ పూర్ జిల్లాలోని సెవరి గ్రామ పరిధిలో ఈ భారీ ఏనుగు దాడి చేసింది. సరోజ్ తికిరి(35), వివేక్ తికిరి(4) ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్ పూర్ అటవీ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్.డి.ఒ) కె.ఎస్.కుతియా శనివారం వివరాలు తెలిపారు. ఏనుగు దాడిలో ఇంకా శాంతిసంజె తికిరి(59), అమర్ మణి తికిరి(58) కూడా తీవ్రగాయాల పాలయ్యారన్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఏనుగు తల్లీకొడుకుపై దాడి చేస్తుండగా కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరూ కూడా గాయపడ్డారని కుతియా తెలిపారు.

Friday, September 27, 2019

BJP's Yuvraj Singh wins Hamirpur bypoll


యూపీ ఉప ఎన్నికలో బీజేపీ నాయకుడు యువరాజ్ సింగ్ గెలుపు
ఉత్తరప్రదేశ్(యూపీ) లోని హమిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడ గతంలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్ చందల్ హత్య కేసులో నేరం రుజువుకావడంతో అతని శాసనసభ్యత్వం రద్దయింది. 22 ఏళ్ల నాటి హత్య కేసులో ఆయనకు శిక్ష పడింది. దాంతో సెప్టెంబర్ 23 (సోమవారం)  హమిర్పూర్ లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టగా తాజా బీజేపీ అభ్యర్థి యువరాజ్ సింగ్ 17,846 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 74,373 ఓట్లు పడగా సమీప ప్రత్యర్థి సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) అభ్యర్థికి 56,528 ఓట్లు వచ్చాయి. మూడు నాలుగు స్థానాల్లో నౌషిద్ అలీ(బీఎస్పీ), హర్దీపక్ నిషద్ (కాంగ్రెస్) నిలిచారు. ఈ ఉపఎన్నికలో మొత్తం 9మంది అభ్యర్థులు పోటీపడగా 51 శాతం ఓటింగ్ నమోదయింది. హమిర్పూర్ లో పార్టీ సీటును నిలబెట్టుకోవడంలో కృషి చేసిన కార్యకర్తలు, ప్రజలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాభినందనలు తెలిపారు.

Thursday, September 26, 2019

Chain snatching cases high in Delhi: Alarming situation in the national capital


దేశ రాజధానిలో నేరగాళ్ల స్వైర విహారం
పెరుగుతోన్న నేరాలతో దేశ రాజధాని ఢిల్లీ వణుకుతోంది. పట్టపగలే బైక్ లపై స్వైరవిహారం చేస్తూ నేరగాళ్లు హస్తినాపురవాసుల్ని భయపెడుతున్నారు. మహిళల మెడలో గొలుసులు, మొబైల్ ఫోన్లు, బ్యాగుల చోరీలే లక్ష్యంగా బరి తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టు మొబైల్ దోపిడీకి పాల్పడ్డారు. గడిచిన ఆదివారం చిత్రంజన్ పార్క్ ప్రాంతంలో షాపింగ్ చేసి ఆటోలో ఇంటికి తిరుగుప్రయాణమైన మహిళా జర్నలిస్ట్ జోయ్మాల బగాచిని బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అటకాయించారు. ఆమె మొబైల్ ను గుంజుకున్నారు. ఈ పెనుగులాటలో కదులుతున్న ఆటో నుంచి ఆమె రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. సాయంత్రం 6 సమయంలో జరిగిన ఈ ఘటనలో బగాచి దవడ ఎముక విరిగిపోయింది. చబుకం భాగం చీలిపోవడంతో కుట్లు పడ్డాయి. స్థానికులు స్పందించి రక్తమోడుతున్న ఆమెను ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆ మహిళా జర్నలిస్ట్ ను  రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఇంతవరకు నిందితుల్ని పట్టుకోవడంలో విఫలమైన పోలీసులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చోరీ చేసిన బైక్ లపై ప్రయాణిస్తున్న దుండగులు మహిళలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు.
నేరాల్లో మైనర్లే ఎక్కువ..
మెడలో గొలుసులు తెంచుకోపోయే చోరుల్లో అధికశాతం మైనర్లే ఉంటున్నట్లు పోలీస్ రికార్డులను బట్టి స్పష్టమౌతోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకొనే వాళ్లు, స్నేహితులతో జల్సాలకు అలవాటు పడిన బాలురే ఎక్కువగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరంతా ముఠాలుగా ఏర్పడుతుండడం పోలీసుల్ని సైతం కలవరానికి గురిచేస్తోంది. ఈ ముఠాలు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాదారులుగాను చలామణిలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికి 4000 గొలుసు చోరీ కేసులు నమోదు కాగా సుమారు 3 వేల మంది చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.  2018లో 6,932 గొలుసు దొంగతనం కేసులు నమోదు కాగా 5,571 మందిని పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. నేరాల తీవ్రత అత్యంత ఆందోళనకరమైన స్థితికి చేరుకోవడంతో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించారు. క్రైం స్పెషల్ సెల్, యాంటీ టెర్రర్ వింగ్ విభాగాలు నేరాల అదుపుపై దృష్టి సారించాయి. ఈ నేరగాళ్ల ఆటకట్టించేందుకు మహారాష్ట్ర వ్యవస్థాగత నేరనియంత్రణ చట్టం (ఎం.సి.ఒ.సి.ఎ) తరహాలో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రేమికుల జంటది అదే బాట..
ఆగస్ట్ 20న ప్రేమికుల జంటను నగర పోలీసులు ఓ చోరీ కేసులో పట్టుకున్నారు. ఈ జోడీ కొట్టేసిన వస్తువుల్ని విక్రయించి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడయింది.  ఈ చోరీ జంటలోని యువతి పురుషుడి మాదిరిగా దుస్తులు ధరించి తనెవరయింది బయటపడకుండా నేరాలకు పాల్పడినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ డిస్ట్రిక్ట్) మోనికా భరద్వాజ్ తెలిపారు. పట్టుబడిన ఈ ప్రేమికుల జంటపై ఐపీసీ సెక్షన్ 411 కింద కేసు నమోదు చేశారు. మెడలో గొలుసు తెంచుకుపోవడంతోనే ఈ నేరాలు పరిమితం కావడం లేదు. దోపిడీ, దౌర్జన్యం, హత్యాయత్నం తదితర తీవ్ర హింసాత్మక నేరాలకు ఈ చోరులు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ జులై 14న డిఫెన్స్ కాలనీలోని ఓ హోటల్ లో కుక్ గా పనిచేస్తున్న 22ఏళ్ల యువకుణ్ని బైక్ పై వచ్చిన దుండగులు హత్య చేశారు. తన వద్ద ఉన్న వస్తువును లాక్కుపోవడానికి ప్రయత్నించగా అతను ప్రతిఘటించడంతో ఆగంతకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దుండగుల్ని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకడు మైనర్. జులై2న స్థానిక లక్ష్మీ నగర్ లో ఓ ప్రభుత్వోద్యోగి చేతిలో నుంచి బ్యాగ్ ను బైకర్ చోరులు ఎత్తుకుపోయారు. ఆ క్రమంలో వాళ్లు బలంగా నెట్టేయడంతో ఆ ఉద్యోగి రోడ్డుపై పడిపోయి గాయాలపాలయ్యారు. బైకర్ చోరుల ఆగడాలు అక్కడితోనే ఆగడం లేదని చట్టవిరుద్ధంగా ఆయుధాల రవాణాను కూడా చేస్తున్నట్లు పోలీసుల పరిశోధనలో వెల్లడయింది.
క్రీడాకారుడూ చోరుడే..
ఆగస్ట్ 23న 26 ఏళ్ల తైక్వాండో జాతీయ స్వర్ణ పతక విజేతను స్నాచింగ్, రొబరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ పిస్టల్, చోరీ చేసిన 2 ఖరీదైన మొబైల్ ఫోన్లు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 5న అతను వికాస్ పురిలోని ఓ మహిళ చేతిలోని మొబైల్ ఫోన్ ను కొట్టేసి పారిపోయాడు. అనంతరం పోలీసులకు పట్టుబడ్డా ప్రస్తుతం తీహార్ జైలు నుంచి బెయిల్ పై మళ్లీ బయటకు వచ్చాడు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై ఐపీసీ సెక్షన్ 356 (చోరీ, దోపీడీ) కేసు మాత్రమే నమోదు చేయడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని ఢిల్లీ పోలీసు మాజీ అధికారి నౌపుర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడ్డ వారికి బెయిల్ లభిస్తోంది, నేరం రుజువయ్యాక కేవలం రెండేళ్ల జైలు పడుతోంది. కచ్చితంగా ఇటువంటి నేరాల అదుపునకు కఠినమైన కేసుల నమోదు తప్పనిసరి అని ఆమె అన్నారు. ఇటీవల హర్యానాలో స్నాచింగ్ కేసును ఉదహరిస్తూ అందులో నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారన్నారు. నేరం రుజువయ్యాక నిందితుడికి 10 సంవత్సరాలు కారాగారవాసం పడిందని చెప్పారు.
మాన్యులకూ తప్పని స్నాచింగ్..
రాజధాని ఢిల్లీలో సామాన్యులకే కాక పెద్ద పదవుల్లో ఉన్న కుటుంబాల వారికి చైన్ స్నాచింగ్ ల బెడద తప్పడం లేదు. భారత సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా భార్య అపర్ణా మెహతా మొబైల్ ఫోన్ ను బైకర్ చోరులు అత్యంత లాఘవంగా లాక్కుపోయారు. ఆగస్ట్ 18న సాయంత్రం ఆమె సెంట్రల్ ఢిల్లీ సమీపంలోని ఎఫ్.ఐ.సి.సి.ఐ ఆడిటోరియం నుంచి వస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు ఆమె మొబైల్ ఫోన్ ను గుంజుకున్నాక మెడలో చైన్ ను తెంచడానికి యత్నించారు. అయితే అపర్ణా ప్రతిఘటించడంతో మొబైల్ ఫోన్ ను మాత్రం ఎత్తుకుని పరారయ్యారు.
నేరాల అదుపునకు 190 పోలీసు టీంలు..
ఢిల్లీలో చైన్ స్నాచింగ్ తదితర నేరాల అదుపునకు 190 ప్రత్యేక పోలీస్ జట్లను రంగంలోకి దించినట్లు నగర పోలీస్ కమిషనర్ అముల్యా పట్నాయక్ ఇటీవల సీనియర్ అధికారులతో సమావేశం సందర్భంగా తెలిపారు. కరుడుగట్టిన నేరగాళ్లు అజయ్(35), మోను(40)లను ఎం.సి.ఒ.సి.ఎ. చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించామన్నారు. అయితే వాళ్లిద్దరూ ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చారని వారిపైన నిఘా ఉంచినట్లు తెలిపారు.
నివేదిక కోరిన ఢిల్లీ హైకోర్టు..
ఢిల్లీలో నేరాలకు సంబంధించి ఆప్ సర్కార్, లెప్టినెంట్ గవర్నర్ లు సవివర నివేదికల్ని అందజేయాలని హైకోర్టు ఇటీవల ఆదేశాలచ్చింది. కార్యాచరణ ప్రణాళికను అంశాల వారీగా పేర్కొనాలని సూచించింది. నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల వివరాలు, గస్తీ, నేరాలు, నేరస్తుల పోకడలు, పోలీసులు ఛేదించిన కేసుల ప్రగతి తెలపాలని ఆదేశించింది.


Wednesday, September 25, 2019

PM Modi gets 'Global Goal keeper' award for Swachh Bharat Abhiyan


ప్రధాని మోదీకి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు ప్రదానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ ప్రదానం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ న్యూయార్క్ లో బుధవారం (భారత కాలమానం ప్రకారం) జరిగిన కార్యక్రమంలో ఈ అత్యుత్తమ అవార్డును బిల్ గేట్స్ చేతుల మీదుగా అందుకున్నారు. దేశంలో `స్వచ్ఛ భారత్ అభియాన్` కార్యక్రమాన్ని 2014లో మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. బాపూజీ 150వ జయంత్యుత్సవాలు జరుగుతున్న సంవత్సరంలో ఈ అవార్డు లభించడం తనకు వ్యక్తిగతంగా ఎంతో విలువయిందంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 130 కోట్ల మంది భారతీయులు స్వచ్ఛభారత్ లో పాల్గొంటూ ఎటువంటి అవరోధాన్నైనా ఎదుర్కోడానికి సిద్ధమని ప్రతిజ్ఞ  చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. గడిచిన అయిదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను గ్రామగ్రామాన నిర్మించినట్లు తెలిపారు. ప్రజాఉద్యమంగా కొనసాగుతున్న శుభ్రత కార్యక్రమాల వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాల్ని రక్షించుకోగలిగామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు.హెచ్.ఒ) ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పారు. బిల్ అండ్ మెలిండ గేట్స్ ఫౌండేషన్ కూడా భారత్ లో గ్రామీణ పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడినట్లు పేర్కొందన్నారు. గాంధీజీ కలలు గన్న పరిశుభ్రత సాకరమయినందుకు ఆనందంగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం కేవలం భారతీయుల జీవన ప్రమాణాల్ని మాత్రమే కాక ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన యావత్ మానవాళి జీవనప్రమాణాల పెంపునకు దోహదం చేసేదన్నారు. వసుదైక కుటుంబ (The whole world is one single family) తత్వం విశ్వవ్యాప్తం కావాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.

Tuesday, September 24, 2019

Gandhians, social activists to take out year-long march from Delhi to Geneva


అక్టోబర్ 2న న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీ-జెనీవా `జై జగత్` యాత్ర (victory of the world) ప్రారంభం కానుంది. అహింస, శాంతి సందేశాలపై విశ్వవ్యాప్త ప్రచారం సాగించడంలో భాగంగా 15000 కి.మీ. మేర ఈ యాత్ర కొనసాగనుంది. సుమారు 200 మంది గిరిజన, దళిత ఉద్యమకర్తలు, రచయితలు, ప్రఖ్యాత గాంధేయ సిద్ధాంతకర్తలు, అభిమానులు న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ మార్చ్ లో పాల్గొంటున్నారు.  ఈ యాత్ర 10 దేశాల గుండా సాగనుంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, సెనెగల్, స్వీడెన్, బెల్జియం తదితర దేశాల నుంచి తరలిన జైజగత్ యాత్రికులందర్నీ కలుపుకుంటూ 2020 సెప్టెంబర్ 26 నాటికి జెనీవా చేరనున్నట్లు ఏక్తా పరిషద్ జాతీయ సంయోజకుడు అనీశ్ థిలెన్కెరి తెలిపారు. గతంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం జైజగత్ యాత్ర న్యూఢిల్లీ నుంచి అట్టరి-వాఘా సరిహద్దుల మీదుగా సాగాల్సి ఉంది. పాక్ లో రెణ్నెల్లు యాత్ర కొనసాగించాలనుకున్నారు. అనంతరం లాహోర్ మీదుగా ఇరాన్ చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తాజా యాత్రను రాజ్ ఘాట్ (ఢిల్లీ) నుంచి ప్రారంభించి మహారాష్ట్రలో గాంధీజీ నెలకొల్పిన సేవాగ్రామ్ కు చేరుకుంటారు. ఆ తర్వాత నాగ్ పూర్ నుంచి యాత్ర ఇరాన్ తరలుతుంది. అక్కడ నుంచి అర్మేనియా తదితర దేశాల గుండా ముందుకు సాగుతుందని అనీశ్ వివరించారు. గాంధీజీ ప్రవచించి, ఆచరించిన అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితుడైన నికోల్ పష్నియాన్ (ప్రస్తుత ఆర్మేనియా ప్రధానమంత్రి) తమతో పాటు అహింసా సిద్ధాంత శిక్షణ, ప్రచార కార్యక్రమాల్లో కొన్నేళ్లుగా పాలుపంచుకుంటున్నారన్నారు. ఏడాది పాటు వివిధ దేశాల గుండా సాగే జైజగత్ యాత్రికులు ఆయా ప్రాంతాల్లో స్థానిక నిర్వాహకులు సహకారంతో అహింసా ఉద్యమ ప్రచారం, శాంతి స్థాపనలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారని అనీశ్ తెలిపారు. సంఘసేవకులు పి.వి.రాజగోపాల్, గాంధేయ సిద్ధాంతవేత్త, కెనడా నాయకులు జిల్ కార్ హారిస్, దళిత, గిరిజన హక్కుల ఉద్యమకారుడు రమేశ్ శర్మ జైజగత్ యాత్రకు నేతృత్వం వహించనున్నారన్నారు. జెనీవా చేరిన అనంతరం వారం రోజుల పాటు ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి పేదరికం, పర్యావరణ సమస్యలు, అహింసావాదం, సాంఘిక బహిష్కరణ తదితర అంశాలపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Monday, September 23, 2019

Pak has reactivated terror camp at Balakot, India ready for challenge: Rawat


బాలాకోట్ లో మళ్లీ తిష్ట వేసిన పాక్ ఉగ్రమూకలు:ఆర్మీ చీఫ్ రావత్
భారత వాయుసేన మెరుపుదాడులతో భస్మీపటలం చేసి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని బాలాకోట్ లో మళ్లీ ఉగ్రతండాలు వెలిశాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. చెన్నైలోని సైనికాధికారుల శిక్షణ కేంద్రం (ఓటీఏ)లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావత్ విలేకర్లకు ఈ విషయం తెలిపారు. సుమారు 500 మంది చొరబాటుదారులు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ప్రజల మాటు నుంచి ఈ కుయత్నాలకు పాల్పడుతోందన్నారు. భారత సైన్యం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పుల్వామాలో (ఫిబ్రవరి 14న) పాక్ ప్రేరేపిత ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న అనంతరం భారత్ దీటుగా బదులిచ్చినా ఆ దేశం కళ్లు తెరవలేదన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిచ్చిన పాక్ సైన్యం  నియంత్రణ రేఖ (ఎల్.ఒ.సి) వెంబడి కాల్పులు జరుపుతూ భారత్ ను రెచ్చగొడుతోంది. పుల్వామా బాంబు పేలుడు తర్వాత (ఫిబ్రవరి 26న) భారత వాయుసేన పీఓకేలోని బాలాకోట్ లో దాగిన ఉగ్రమూకలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం రెండ్రోజుల క్రితం యుద్ధమంటూ వస్తే పాకిస్థాన్ ప్రపంచ పటంలో కనపడదని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి (ఆర్టికల్ 370) రద్దు అనంతరం హోంమంత్రి అమిత్ షా ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనమే మిగిలిఉందని పార్లమెంట్ లో ప్రకటించిన విషయం విదితమే. అయినా బలహీన పాకిస్థాన్ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా కయ్యానికి కాలు దువ్వాలని ఉవ్విళ్లూరడమే విచిత్రంగా కనిపిస్తోంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై భంగపడుతూనే సమరనాదం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరూ గెలవరనే మాట అంటూనే కుయుక్తులు పన్నుతున్నారు. పీఓకే లోని వివిధ ప్రాంతాలలో జైష్-ఇ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ నిర్వహిస్తున్న 13 శిక్షణ శిబిరాలను తమ దేశం మూసివేసినట్లు ఇటీవల ప్రకటించారు. అందుకు భిన్నంగా తాజాగా అక్కడ ఉగ్ర కార్యకలాపాలు మళ్లీ ఊపందుకోవడం ఎవరు తీసిన గోతిలో వారే పడతారనడానికి తార్కాణంగా కనబడుతోంది.

Sunday, September 22, 2019

Rohingas are Bangladeshi, says Suu Kyi


రోహింగ్యాలు బర్మా వారు కాదన్న సూకీ: బిట్రన్ మాజీ ప్రధాని
రోహింగ్యా ముస్లింలు బర్మా జాతీయులు కాదు.. వాళ్లు బంగ్లాదేశ్ పౌరులు.. ఈ వ్యాఖ్య చేసిన వారెవరో ఆషామాషి వ్యక్తులు కాదు. ప్రజాస్వామ్య ఉద్యమ కెరటంగా ప్రపంచవ్యాప్త కీర్తి పొందిన మయన్మార్ (బర్మా) పోరాటయోధురాలు ఆంగ్ సాన్ సూకీ మాట. తాజాగా ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ బయటపెట్టారు. ఆయన రచించిన `ఫర్ ది రికార్డ్` అనే పుస్తకం ద్వారా ఈ విషయం వెల్లడయింది. గురువారం లండన్ లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. కెమెరూన్ తన పదవీ కాలం (2010-2016)లో చోటు చేసుకున్న అనేక పరిణామాల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మయన్మార్ పాలకులు మొదటి నుంచి రోహింగ్యాలపై ఇదే వైఖరి కనబరుస్తుండగా సూకీ సైతం అదే పంథా కల్గి ఉండడమే యావత్ ప్రపంచానికి విస్మయం కల్గించింది. సైనిక పాలన నుంచి మయన్మార్ కు విముక్తి కల్పించాలని నిజమైన ప్రజాస్వామ్యం దేశంలో పరిఢవిల్లాలని పరితపించి స్ఫూర్తిమంతమైన ఉద్యమాన్ని నడిపిన ధీర సూకీ. 1989 నుంచి 2010 వరకు సూకీ సైనిక పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకు వేదికగా `నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ)` అనే ప్రజాస్వామ్య అనుకూల రాజకీయ పార్టీకి నాయకత్వం వహించారు. దాంతో సైనిక పాలకులు మొత్తం 15 ఏళ్ల పాటు సూకీని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమె కారాగారవాసంలో ఉండగానే 1991లో నోబెల్ శాంతి బహుమతిని పొందారు. ప్రస్తుతం మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ హోదాలో ఉన్న సూకీ కాబోయే అధ్యక్షురాలు. సూకీ అంటే తనకెంతో గౌరవాభిమానాలున్నాయంటూ కెమెరూన్ తన పుస్తకంలో రాశారు. 2013 అక్టోబర్ లో ఆమె లండన్ పర్యటనకు రావడంతో ప్రపంచం మొత్తం కళ్లు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయన్నారు. అప్పటికే మయన్మార్ లో రోహింగ్యాలపై హింస చెలరేగింది. వారిపై అత్యాచారాలు, హత్యలు, జాతి నిర్మూలన దాష్టీకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాఖైన్స్ (ప్రావిన్స్) లో బౌద్ధుల దాడులతో రోహింగ్యాలు లక్షల సంఖ్యలో పొరుగునున్న బంగ్లాదేశ్ కు పారిపోయారు. దాంతో ప్రపంచం నలుమూలల నుంచి రోహింగ్యాలకు సానుభూతి వెల్లువెత్తుతోందని సూకీ దృష్టికి తెచ్చినట్లు కెమెరూన్ పేర్కొన్నారు. అందుకు సూకీ చెప్పిన సమాధానంతో ఆయన అవాక్కయ్యారు. 'వారు నిజంగా బర్మా వారు కాదు, వాళ్లు బంగ్లాదేశ్ జాతీయులు` అంటూ సూకీ బదులిచ్చారని ఆ పుస్తకంలో కెమెరూన్ రాశారు. పైగా రోహింగ్యాలే కాదు.. బౌద్ధులు హింసకు గురౌతున్నట్లు సూకీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేవలం భయాందోళనల వల్లే అక్కడేదో జరిగిపోతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆ క్రమంలోనే సూకీ మయన్మార్ లో జాతి ప్రక్షాళన జరుగుతోందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సూకీ పాలనాపగ్గాలు చేపట్టాక రోహింగ్యాలపై దాడులు ఆగకపోగా మరింత పెచ్చుమీరినట్లు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిషన్ నివేదిక  స్పష్టం చేసిన అంశాన్ని కెమెరూన్ తన పుస్తకంలో ప్రస్తావించారు. దేశంలో మారణహోమాన్ని నిలువరించడం, దోషులపై దర్యాప్తు జరపడం, నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రూపొందించడంలో సూకీ ప్రభుత్వం విఫలమైంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆగస్ట్ 2017లో సుమారు 7,00,000 మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్ పారిపోయి తలదాచుకున్నారు. తాజాగా విడుదలైన కెమెరూన్ పుస్తకం ద్వారా మరోసారి రోహింగ్యాల కడగండ్లు తెరపైకి వచ్చినట్లయింది.


Saturday, September 21, 2019

UP farmers stopped at Delhi border


ఢిల్లీలో యూపీ రైతుల ర్యాలీ అడ్డగింత
తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతుల్ని పోలీసులు ఢిల్లీ లోని వివిధ ప్రాంతాల్లో నిలిపివేశారు. యూపీలోని నోయిడా నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కిసాన్ సంఘటన్ కు చెందిన రైతులు శనివారం ర్యాలీ ప్రారంభించారు. చెరకు బకాయిల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, వ్యవసాయ రుణ వితరణల కోసం రైతులు తమ గోడును కేంద్ర మంత్రితో వెళ్లబోసుకునేందుకు బయలుదేరారు. ఘాజీపూర్ సరిహద్దుల నుంచి జాతీయ రహదారులు నం.9, నం.24 గుండా వేల సంఖ్యలో రైతులు ర్యాలీ తీయడంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఏదో విధంగా వివిధ మార్గాల్లో రైతునేత దివంగత మాజీ ప్రధాని చరణ్ సింగ్ సమాధి ప్రాంతం కిసాన్ ఘాట్ చేరుకున్న రైతుల్ని పోలీసులు నిలిపివేశారు. ఇందిరాపురం, ఆనంద్ విహార్ తదితర ప్రాంతాల్లో రైతు ర్యాలీల్ని పోలీసులు భగ్నం చేసి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతకుముందు నోయిడాలో ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు విఫలం కావడంతో రైతులు ఛలో ఢిల్లీ ర్యాలీ తీయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే మంత్రితో భేటీకి రైతు సంఘం ప్రతినిధులకు అధికారులు అనుమతి ఇచ్చారు. రైతుల ర్యాలీ సందర్భంగా పోలీసులు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Friday, September 20, 2019

Motor cyclist dies after being hit by train


రైలు ఢీకొని బైకర్ దుర్మరణం
కోల్ కతాలో మోటారు బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రైలు ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు ఆగ్నేయ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ చక్రాల కింద బైక్ నలిగిపోగా బైకర్ అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. కోల్ కతా నుంచి రైలు బయలుదేరి 9 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సత్రాగచి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ ను ఆనుకుని నియంత్రణదారు లేని చోట కాలిబాట మార్గంలో బైకర్ రైలు వస్తున్నా దాటేయొచ్చనే తలంపుతో బైక్ ను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.45 సమయంలో రైలు దూసుకువస్తుండగా బైకర్ వాహనంతో సహా దాని చక్రాల కింద చిక్కుకుపోయి దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Thursday, September 19, 2019

NDRF set to induct women personnel


వచ్చే ఏడాది నాటికి ఎన్డీఆర్ఎఫ్ లోకి మహిళలు
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) లోకి మహిళల ప్రవేశం షురూ కానుంది. వచ్చే ఏడాది నాటికి కొత్తగా ఏర్పాటుకానున్న నాలుగు బెటాలియన్లలో మహిళల్ని చేర్చుకోనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఐపీఎస్ ఎస్.ఎన్.ప్రధాన్ ప్రకటించారు. 2018 నుంచి మహిళా సభ్యుల్ని చేర్చుకోవాలనే యోచన ఊపందుకుందన్నారు. పశ్చిమబెంగాల్ లోని హరింఘాటలో గల ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్ లో రెండో బెటాలియన్ ను ప్రధాన్ ఇటీవల ప్రారంభించారు. ప్రధానంగా సౌకర్యాల లేమీ వల్లే గతంలో మహిళా సిబ్బందిని చేర్చుకోలేకపోయామన్నారు. కొన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అన్ని మౌలికసదుపాయాల్ని కల్పించగల స్థితిలోకి వచ్చిందని అందుకే ఇప్పుడున్న 12 బెటాలియన్లకు అదనంగా మరో నాలుగు కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఈ కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కొత్త బెటాలియన్లకు మహిళా సిబ్బందిని పంపాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఇతర సాయుధ దళాల్ని ఎన్డీఆర్ఎఫ్ కోరుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఒక్కో బెటాలియన్ లో 1,150 మంది సిబ్బంది ఉంటారు. కొత్త సిబ్బందిని చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వం అసోం రైఫిల్స్, ది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటుకు 2005లో బీజం పడింది. ఇందుకుగాను ప్రకృతి విపత్తుల నిరోధక కార్యనిర్వహణ చట్టం చేశారు. 2006లో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటయింది. బాధితుల సంరక్షణ, వెన్నుదన్నుగా నిలవడం అనే ప్రధాన ధ్యేయంతో ఎన్డీఆర్ఎఫ్ పని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు, భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి ఇతోధిక సేవలందిస్తోంది.

Wednesday, September 18, 2019

Ghulam Nabi Azad, Ahmed Patel meet Chidambaram in Tihar jail


చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి కలిసిన గులాంనబీ, అహ్మద్ పటేల్
తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం తనయుడు కార్తీలు కలిశారు. ఐ.ఎన్.ఎక్స్. మీడియా ముడుపుల కేసులో చిదంబరం అరెస్టయి సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. సోమవారమే చిదంబరం 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. చిదంబరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని జైలు ప్రధాన ఆవరణలో ఆయనను కలిసినట్లు గులాంనబీ తెలిపారు. అర్ధగంట సేపు చిదంబరంతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ లు తాజా రాజకీయ పరిణామాల్ని ఆయనతో చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆయా రాష్ట్రాల ఎన్నికలు, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిమాణాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల త్రయం చర్చించినట్లు తెలుస్తోంది.


Tuesday, September 17, 2019

Air-To- Air Missile Astra succesfully test fires in the odisha coast


అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాల్ని ఛేదించే అస్త్రా క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బంగాళాఖాతంపై సుఖోయ్-30 ఎం.కె.ఐ. యుద్ధ విమానం నుంచి మంగళవారం ఈ పరీక్షను భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. నిరంతరం నిర్వహించే పరీక్షల్లో భాగంగా ఈరోజు అస్త్రా క్షిపణి ప్రయోగాన్ని చేపట్టారు. వివిధ రాడార్లు, ఎలక్ట్రో ట్రాకింగ్ వ్యవస్థ, సెన్సార్ల నుంచి అందిన సమాచారం ప్రకారం అస్త్రా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్లు భారత సైనికాధికారులు ధ్రువీకరించారు. అవసరాలకు అనుగుణంగా అస్త్రాను ప్రయోగించొచ్చన్నారు. మధ్యంతర, సుదీర్ఘ శ్రేణిలోని లక్ష్యాల్ని ఈ క్షిపణి ఛేదించగలదని పేర్కొన్నారు.

Monday, September 16, 2019

AP CM YSJagan arial survey at kachuluru


లాంచీ మునిగిన కచ్చులూరు ప్రాంతంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి లాంచీ మునక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించారు. దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన లాంచీ దుర్ఘటన లో 12 మంది మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం 8, సోమవారం మరో నాలుగు మృతదేహాల్ని వెలికితీసి రాజమండ్రి  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంపచోడవరం, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మునిగిపోయిన లాంచీ, అందులో చిక్కుకుపోయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు దుర్ఘటన ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రెండు హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో 34 మంది గల్లంతైనట్లు భావిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుర్ఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం జగన్‌  వెంట ఏపీ హోంమంత్రి సుచరిత, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులు ఉన్నారు. అనంతరం జగన్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితులను పరామర్శించారు. బోటు ప్రమాదానికి గల కారణాలను అధికారుల్నిఅడిగి తెలుసుకున్నారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి యోగ క్షేమాలు కనుక్కున్నారు. బాధితులకు అందుతున్న చికిత్స గురించి సీఎం జగన్ వైద్యుల్ని ఆరా తీశారు. ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ సర్కారు ఆదివారమే రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తెలంగాణ సీఎం కె.సి.ఆర్. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Sunday, September 15, 2019

Microsoft CEO Satya Nadella Arrives In Hyderabad To Perform Father's Funeral


తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్ల శనివారం మధ్యరాత్రి  హైదరాబాద్ వచ్చారు. ఆయన తండ్రి ప్రఖ్యాత మాజీ ఐఏఎస్ అధికారి యుగంధర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక విమానంలో లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పీవీ నరసింహారావు హయాంలో పీఎంఓలో యుగంధర్ సెక్రటరీగా పనిచేశారు. 1962 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన 2004_2009 వరకు ప్రణాళికా సంఘం సభ్యునిగా విధులు నిర్వర్తించారు. ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రి ఎన్.ఎ.ఎ. అకాడెమీ డైరెక్టర్ గా (1988_93) బాధ్యతలు వహించారు. ఐఏఎస్ అధికారిగా పలు కీలక బాధ్యతలు చేపట్టిన యుగంధర్(82) ఈనెల13న పరమపదించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

Saturday, September 14, 2019

IAF to felicitate locals who helped in locating missing AN-32 in Arunachal on sept 17


ఎ.ఎన్-32 జాడ చెప్పిన వారిని సన్మానించనున్న ఐఏఎఫ్ 
కూలిన తమ విమానం జాడ కనుగొనేందుకు సహకరించిన వారిని భారత వాయుసేన (ఐఏఎఫ్) సన్మానించనుంది. ఈ నెల17న వెస్ట్ సియాంగ్ జిల్లాలోని అలోలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సెర్చ్ ఆపరేషన్స్ లో పాల్గొన్న అధికారులు, పర్వాతారోహకులు, స్థానికులకు ఐఏఎఫ్ రూ.5లక్షల నగదు నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమాన జాడ కనుగొనేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరికీ నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనుంది. ఈ మేరకు ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రధానకార్యదర్శి నరేశ్ కుమార్, సియాంగ్ డిప్యూటీ కమిషనర్ రాజీవ్ తకూక్ కు వేర్వేరుగా రాసిన లేఖల్లో తెలిపారు. 
ఈ ఏడాది జూన్3న అసోంలోని జోర్హాట్ లో వరద బాధితులకు సహాయ సామగ్రి అందించి అరుణాచల్ ప్రదేశ్ మెచుకా ఎయిర్ ఫీల్డ్ కు తిరుగు ప్రయాణంలో వాయుసేన విమానం ఎ.ఎన్-32 కూలిపోయింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విమానం అదృశ్యమయిందని తొలుత భావించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూం(ఏటీసీ)తో సంబంధాలు తెగిపోవడంతో విమానం జాడ కోసం వాయుసేన వెతుకులాట ప్రారంభించింది. జోర్హాట్ నుంచి 13 మందితో మధ్యాహ్నం 12.25కు టేకాఫ్ అయిన ఎ.ఎన్-32కు అర్ధగంట తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత చేపట్టిన సెర్చ్ ఆపరేషన్స్ లో అరుణాచల్ ప్రదేశ్ అధికారులతో పాటు పర్వతారోహకులు, స్థానికులు పాల్గొన్నారు. జూన్ 19న అరుణాచల్ ప్రదేశ్ లోని లిపో ఉత్తర దిశలో విమాన శకలాలు గుర్తించారు. ఆ రోజు ఆరు మృతదేహాల్ని, మరుసటి రోజు జూన్ 20న మరో ఏడుగురి మృతదేహాల్ని వెలికితీశారు. విమానం బ్లాక్ బాక్స్, మృతులకు సంబంధించిన విలువైన వస్తువుల్ని ఐఏఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఈ విమానం జాడను ఐ.ఎ.ఎఫ్.కు తెలిపిన పాయూం గ్రామవాసి తదుత్ తాచుంగ్ కు రూ.1.5 లక్షలు, మొత్తం సహాయ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన పర్వతారోహకుడు తకాతాముత్ కు రూ.1లక్ష, కిషాన్ తెక్సెంగ్ కు రూ.20వేలు, తగుంగ్ తాముత్, తలిక్ దరుంగ్, ఒకెన్మా మిజేలకు రూ.15వేల చొప్పున, మిగిలిన వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాల్ని అందించనున్నారు.

Friday, September 13, 2019

Ganpati immersions: 18 dead across Maharashtra


మహారాష్ట్ర గణేశ్ నిమజ్జనాల్లో 18 మంది మృతి

మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం అనంత చతుర్దశి ప్రారంభమైన తర్వాత గణేశ్ నిమజ్జనాలు మొదలయ్యాయి. గురు, శుక్రవారాల్లో పెద్ద ఎత్తున విగ్రహ నిమజ్జనాలకు ఆయా ప్రాంతాల్లో భక్తులు తరలివెళ్లారు. థానేలో గురువారం రాత్రి 7.30 సమయంలో కసారాకు చెందిన కల్పేశ్ జాదవ్ అనే 15 ఏళ్ల బాలుడు గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.  అమరావతిలోని పూర్ణా నదిలో విగ్రహాల నిమజ్జన సమయంలో వటోల్ శుక్లేశ్వర్ గ్రామానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. నాసిక్ లోని గోదావరి నది స్నాన ఘాట్ రామ్‌కుండ్ సమీపంలో మునిగిపోయిన ప్రశాంత్ పాటిల్(38), పహిన్ గ్రామంలోని చెరువులో మునిగిపోయిన యువరాజ్ రాథోడ్(28) మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. సతారా జిల్లాలోని కరాడ్ వద్ద కోయనా నదిలో మల్కపూర్ నివాసి చైతన్య షిండే(20) కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. అకోలాలో నీటితో నిండిన క్వారీలో నిమజ్జనం చేస్తుండగా విక్కీ మోర్(27) అనే యువకుడు మునిగిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసినా భక్తులు విగ్రహాలతో అక్కడకు చేరుకుని నిమజ్జన కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. నాసిక్‌లోని సోమేశ్వర్ జలపాతం సమీపంలో లైఫ్‌గార్డులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ముగ్గుర్ని రక్షించారు. భండారా జిల్లాలోని డోల్సర్ గ్రామ చెరువులో సోమరా శివానకర్ అనే వ్యక్తి మునిగిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. అమరావతి, నాసిక్, థానే, సింధుదుర్గ్, రత్నగిరి, ధూలే, భండారా, నాందేడ్, అహ్మద్ నగర్, అకోలా, సతారాతో సహా 11 జిల్లాల్లో జరిగిన నిమజ్జనాల్లో మొత్తం 18 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలో నాలుగు; రత్నగిరిలో మూడు; నాసిక్, సింధుదుర్గ్, సతారాల్లో రెండేసి; థానే, ధూలే, బుల్ధనా, అకోలా, భండారాలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు నమోదయినట్లు వివరాలు వెల్లడించారు.

Thursday, September 12, 2019

It`s time to go to the people, says Sonia: Congress plans agitation in October on economic slowdown


`కాషాయి` పాలనను ఎండగట్టే సమయమొచ్చింది: సోనియా
కాషాయ దళపతి నరేంద్రమోదీ లోపభూయిష్ఠ పాలనపై దండెత్తాల్సిన సమయమొచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు. ముఖ్యంగా దేశంలో ఆర్థికవ్యవస్థ తిరోగమనం బాట పట్టడానికి ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సి ఉందని సోనియా పేర్కొన్నారు. ఎన్డీయే సర్కార్ వైఖరి వల్లే ఆర్థిక మాంద్యం నెలకొందనే అంశాన్ని ప్రజలకు తెలియచెబుతూ వచ్చే నెల అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ఉద్యమాల్ని ప్రారంభించాలని సూచించారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఈ సందర్భంగా సోనియా ఘాటుగా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల ఆమోదాన్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. మోదీ కేబినెట్ 100 రోజుల పాలన శూన్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇదివరకే పెదవి విరిచారు. ఇంతకుముందు ప్రియాంక గాంధీ కూడా మోదీ అనుసరిస్తున్న ఆర్థికవిధానాలు దేశానికి చేటు తెస్తున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈరోజు కాంగ్రెస్ కీలక సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన `మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు` ఏర్పాట్ల గురించి తాజా భేటీలో నాయకులు చర్చించారు.

Wednesday, September 11, 2019

BJP protest against Mamata govt over power tariff hike in Kolkata


పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపు సెగ

పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రోడ్డెక్కారు. రాజధాని కోల్ కతాలోని సెంట్రల్ అవెన్యూ, ఎస్పానాడే తదితర ప్రధాన కూడళ్లలో చొచ్చుకువస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు జల పిరంగులు (వాటర్ కెనాన్) వినియోగించాల్సి వచ్చింది. పోలీసుల వలయాన్ని తప్పించుకుని ముందుకు చొచ్చుకువచ్చే క్రమంలో అయిదుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని కోలకతా మెడికల్ కాలేజీ, విషుదానంద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజు బెనర్జీ, సయాతన్ బసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దేబ్జిత్ సర్కార్ సహా వందమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని బీజేపీ ఓ అస్త్రంగా మలుచుకుని మమతా సర్కార్ పై ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్  నిత్యావసర  సాధనం కావడంతో అదే ప్రధాన అజెండాగా వారితో మమేకం అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుని ఊపుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ విద్యుత్ విధానం అమలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ (సీఈఎస్సీ) యూనిట్ విద్యుత్ రూ.4.26కు కొనుగోలు చేసి వినియోగదారుల నుంచి రూ.7.33 (తొలి 100 యూనిట్లు) చొప్పున ఛార్జీలు వసూలు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లయితే వినియోగదారులు తమకు ఆమోదయోగ్యమైన ధరకు విద్యుత్ ను పొందగల్గుతారని ఆ పార్టీ మమతా సర్కార్ కు సూచిస్తోంది.

Tuesday, September 10, 2019

Free helmets to offenders, roses for law-abiding persons


భువనేశ్వర్ లో వాహనచోదకులకు ఉచితంగా శిరస్త్రాణాలు
భువనేశ్వర్ పరిసరాల్లోని కొత్త మోటారు వాహనాల చట్టంపై పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులకు ఇక్కడ పోలీసులు జరిమానాలకు బదులు ఫ్రీగా హెల్మెట్లు అందిస్తున్నారు. స్థానిక కల్పనా స్క్వేర్ లో మంగళవారం ఈ కార్యక్రమంలో స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంట నగరమైన కటక్ లోనూ పోలీసుశాఖ ఈ స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. కొత్త మోటారు వాహనాల చట్టం-2019 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించడంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిబంధనల్ని మరో మూణ్నెల్లు దూకుడుగా అమలు చేయొద్దని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీస్ శాఖ ఇప్పుడు రోడ్లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. `ఎం.వి. చట్టం ఆదాయాన్ని సృష్టించే వ్యాపారం కాదు. ప్రజల భద్రతే మా లక్ష్యం` అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సాగరికా నాథ్ అన్నారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసు సిబ్బంది ఉచితంగా శిరస్త్రాణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ముందు ఉల్లంఘనదారుల నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి వారికి చలాన్ తో పాటు ఫ్రీగా హెల్మెట్ అందిస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీక్ ఆన్ మొబైల్ విత్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, విత్ అవుట్ హెల్మెట్, సీట్ బెల్ట్ డ్రైవింగ్, విత్ అవుట్ నెస్సెసరీ డాక్యుమెంట్స్ డ్రైవింగ్ చేయొద్దని వాహనచోదకుల్ని పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తున్న వాహనచోదకులకు గులాబీలు చేతికిచ్చి పోలీసులు అభినందించారు. 
బిహార్ లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే..
బీహార్‌ లోనూ పోలీస్ శాఖ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులతో వినూత్న రీతిలో స్పందిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. మంగళవారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరి పట్టణంలో శిరస్త్రాణం ధరించని బైకర్లను పట్టుకుని దగ్గరుండి వారితో కొనిపించడం కనిపించింది. బీమా పునరుద్ధరణ చేయించని వారితోనూ అక్కడికక్కడే కార్యక్రమం పూర్తి చేయించింది.  ఇందుకు శిరస్త్రాణం అమ్మకందారులు, బీమా పాలసీ ఏజెంట్ల తో ఆయా తనిఖీ కూడళ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మోతీహరిలో ఛటౌని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ముఖేష్ చంద్ర కున్వర్ ప్రారంభించారు. ఉల్లంఘనదారులకు పోలీసులు జరిమానాలు విధించకపోవడం విశేషం. 1917 లో మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహారి చారిత్రక ప్రాముఖ్యత తనకు ప్రేరణనిచ్చిందని ముఖేష్ చంద్ర కున్వర్ పేర్కొన్నారు.

Monday, September 9, 2019

ISRO more serious about fake accounts in social media on behalf of chairman Sivan


ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో సోమవారం ఇస్రో రంగంలోకి దిగి ఆయనకు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యక్తిగత ఖాతా లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేస్తూ `కైలాస్వాదివు శివన్` పేరిట సోషల్ మీడియాలో చాలా ఖాతాలు నడుస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాల నుంచి చంద్రయాన్-2 సమాచారం అంటూ అసత్యాలు వెలువడుతున్నాయని వాటిని నమ్మొద్దని కోరింది. చైర్మన్ డాక్టర్ కె. శివన్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతా ఒక్కటీ లేదని ఇస్రో ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. చైర్మన్ పేరిట నకిలీ ఖాతాల నుంచి వెల్లడవుతున్న సమాచారం ప్రామాణికం కాదని గమనించాలని కోరింది. ఎట్టి పరిస్థితిలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మరాదని ఇస్రో హెచ్చరించింది. చంద్రయాన్-2 మిషన్, చంద్రునిపై లాండర్ విక్రమ్ స్థితిగతులకు సంబంధించిన ఏదైనా నవీకరణ ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


Sunday, September 8, 2019

Prez, V-Prez, PM, Sonia mourn Jethmalni`s demise


రాంజెఠ్మలానీ మృతికి రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధాని,సోనియా సంతాపం
ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ (95) మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వెలిబుచ్చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాంజెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45కు న్యూఢిల్లీలోని నివాసగృహంలో మరణించినట్లు ఆయన తనయుడు సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. స్వతంత్ర భావాలు మెండుగా గల రాంజెఠ్మలానీ దేశంలోని పలు కీలక కేసులను వాదించి పేరుగడించారు. ముఖ్యంగా నేర సంబంధ వ్యాజ్యాల్ని వాదించడంలో దిట్ట. హత్య కేసులో ఇరుక్కున్న కె.ఎం.నానావతి (నేవీలో నిజాయతీ గల అధికారి)  తరఫున వాదనల్లో పాల్గొనడం ద్వారా రామ్ జెఠ్మలానీ ప్రముఖ క్రిమినల్ లాయర్ గా ఖ్యాతి పొందారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సీఎంత్రివేది, వై.వి.చంద్రచూడ్ లకు సహాయకునిగా వ్యవహరించారు. ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ లో రామ్ జెఠ్మలానీ తనదైన ముద్ర వేశారు. వృత్తి పరంగా వివాదాస్పద వ్యక్తుల కేసులు వాదించి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ హంతకులు తరఫున, భారత పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు పక్షాన కేసులు వాదించారు. అవినీతిపై పోరాడతానంటూ ఆయన 94వ ఏట న్యాయవ్యాది వృత్తి నుంచి పదవీ విరమణ ప్రకటించారు. దేశ విభజన కు ముందు సింధ్ ప్రాంతంలో జన్మించిన జెఠ్మలానీ 17 ఏళ్లకే న్యాయశాస్త్ర పట్టా పొందారు. కరాచీలో న్యాయవాది వృత్తి కొనసాగించారు. 18వ ఏట దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి రాణి, శోభ, మహేశ్ సంతానం. రాణి కొద్ది కాలం క్రితమే మరణించారు. శోభ అమెరికాలో ఉంటున్నారు. దేశ విభజన జరిగిన ఏడాదికి ఆయన కుటుంబంతో ముంబయి వలసవచ్చారు. అప్పుడే  రత్న అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి జనక్ అనే కొడుకు ఉన్నాడు. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్, బీజేపీల్లో పనిచేశారు. లోక్ సభకు రెండుసార్లు, ఓసారి  రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయి హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరించారు.

Saturday, September 7, 2019

Those who try, never give up: isro chairman Sivan


విజయం దిశగా ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతాయి: చైర్మన్ శివన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగాలు యథావిధిగా కొనసాగుతాయని చైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. `విక్రమ్` ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో మూగబోయిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు  ట్వీట్ చేశారు. ఈ ప్రయోగ ఫలితం వెల్లడయిన అనంతరం యావత్ భారత జాతి ఇస్రోకు బాసటగా నిలిచి ప్రోత్సహించింది. బాధను దిగమింగుకున్న చైర్మన్ శివన్ వరుస ట్వీట్లతో ఇస్రో సహచరుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. `విజయం అంతిమమైనది కాదు, అపజయం ప్రాణాంతకం కాదు: ప్రయత్నం అనేది ఆ గణనల్ని కొనసాగించే ఓ ధైర్యం` (Success is not final, failure is not fatal: it is the courage to continue that counts) అన్న బ్రిటన్ మాజీ ప్రధాని సర్ విన్ స్టన్ చర్చిల్ ప్రఖ్యాత సూక్తిని ఉటంకిస్తూ శివన్ ట్వీట్ చేశారు. అదే విధంగా ఇస్రో తదుపరి ప్రయోగాలు ఆదిత్య ఎల్-1, గగన్ యాన్, మంగల్యాన్-2, చంద్రయాన్-3 ప్రయోగాలు వరుసగా చేపట్టనున్నామని ప్రయత్నాన్ని విడిచిపెట్టబోమని తెలిపారు. ఇస్రో జులై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. అయితే చంద్రయాన్-2 ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్ శుక్రవారం మధ్యరాత్రి చంద్ర గ్రహ దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగాల్సి ఉన్న క్రమంలో స్తబ్ధుగా మారిపోయింది. సంక్లిష్టమైన దక్షిణ ధ్రువప్రాంతంలో మరో 2.1 కిలోమీటర్ల దూరాన్న సురక్షితంగా దిగాల్సిన దశలో `విక్రమ్` నుంచి మిషన్ కంట్రోల్ రూంకు సందేశాలు ఆగిపోయాయి. క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Friday, September 6, 2019

Fire at New Delhi railway station in Kerala bound train


ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్ ప్రెస్ రైలు బోగిలో అగ్నికీలలు వ్యాపించడంతో స్టేషన్ లో కలకలం రేగింది. కేరళకు బయలుదేరిన చండీగఢ్-కొచువల్లి (నం.12218) ఎక్స్ ప్రెస్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన (పవర్ కార్) బోగిలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం. అయితే ఒకరు గాయపడినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ప్లాట్ ఫారం నం.8 నుంచి రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే ఉవ్వెత్తున మంటలు ఎగసిపడినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1.40 కి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. 12 అగ్నిమాపక శకటాలు ప్లాట్ ఫారంపైకి చేరుకుని బోగిలో చెలరేగిన మంటల్ని ఆర్పివేసినట్లు అగ్నిమాపక శాఖాధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.