Monday, July 29, 2019

Financier 'kidnapped and freed' after paying Rs 1 crore in hyderabad


రూ.కోటి తీసుకొని ఫైనాన్షియర్ని విడిచిపెట్టిన కిడ్నాపర్లు

హైదరాబాద్ లో కిడ్నాపర్ల ముఠా రూ.కోటి వసూలు చేసి ఓ ఫైనాన్షియర్ ను సోమవారం విడుదల చేసింది. ఆదివారం రాత్రి దోమలగూడ లో గజేంద్ర ప్రసాద్ అనే ఫైనాన్షియర్ ను ఓ ముఠా కిడ్నాప్ చేసింది. అతని కుటుంబ సభ్యుల్ని రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఆ సొమ్ము ఇస్తేనే గజేంద్రను విడిచిపెడతామని హెచ్చరించారు. చివరకు కుటుంబ సభ్యులు రూ.కోటి చెల్లించడంతో ముఠా అతణ్ని అబిడ్స్ లో వదిలి పరారయింది. ఈ మేరకు గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గజేంద్ర తనకు ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో లావాదేవీల్లో వివాదమున్నట్లు తెలిపారు. గత రాత్రి తనను అపహరించిన కిడ్నాపర్లు తర్వాత నిర్భందించి దాడి చేశారన్నారు. గజేంద్ర ఒంటిపై గాయాలు కనిపిస్తున్నాయి. మొహం కూడా కమిలిపోయింది. కిడ్నాపర్లు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తుండగా రూ.5 లేదా 10 లక్షలు ఇస్తానని చెప్పగా తనను వాళ్లు తీవ్రంగా కొట్టారన్నారు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని వదిలివేయాలని కోరినా కనికరించలేదని చెప్పారు. తప్పక రూ.కోటి ఇస్తానని చెప్పడంతో అంగీకరించి తనను విడుదల చేశారని గజేంద్ర పోలీసులకు వివరించారు. తన స్నేహితుడు ఆ మొత్తాన్ని కారులో తీసుకొని వచ్చి సమీపంలోని ఓ స్కూల్ వద్ద పార్క్ చేశారన్నారు. అనంతరం ఆ డబ్బును ముఠాలోని ఇద్దరు సభ్యులు వెళ్లి తీసుకుని వచ్చారన్నారు. ఆ తర్వాతే నిర్బంధ ప్రాంతం నుంచి తనను కిడ్నాపర్లు అబిడ్స్ కు తరలించి పరారయినట్లు తెలిపారు.