Sunday, May 5, 2019

pakistan pm imran khan pays tribute to tipu sultan


టిప్పుసుల్తాన్ ను కొనియాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్
నాటి మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ అసమాన పోరాట యోధుడని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్లాఘించారు. మే4 టిప్పు సుల్తాన్ వర్ధంతి. ఆయన 220వ వర్ధంతి సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడ్డంలో టిప్పు సుల్తాన్ చూపిన తెగువ, సాహసాలు తననెంతో ముగ్ధుణ్ని చేశాయని ట్వీట్ చేశారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పులిలా పోరాడిన టిప్పు సుల్తాన్ ను టైగర్ అని పిలిచేవారు. సాయుధ పోరాటంలోనే కాక పరిపాలనలోనూ అనేక సంస్కరణల రూపశిల్పిగా టిప్పు సుల్తాన్ పేరు గడించారు. నాణేల ముద్రణ, కొత్త రెవెన్యూ విధానం అమలు, మైసూర్ లో పట్టుపరిశ్రమ అభివృద్ధి తదితరాల్లో ఖ్యాతి పొందారు. గత ఫిబ్రవరిలో భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ ఇమ్రాన్ పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశంలో టిప్పుసుల్తాన్ కీర్తిని కొనియాడిన సంగతి తెలిసిందే.

priyanka fires salvo at pm for his comment on rajiv gandhi


అవును..మోదీజీ..అవినీతిని దేశం సహించదు: ప్రియాంక
ప్రధాని మోదీ తన తండ్రి రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ తిప్పికొట్టారు. రాజీవ్ గాంధీ అవినీతి నంబర్.1 నేత గానే చనిపోయారంటూ మోదీ ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. అమేథి నుంచి మరోసారి మీకు ఎన్నికల ఫలితాల రూపంలో గుణపాఠం వెలువడుతుందన్నారు. తన తండ్రి గురించి దేశానికి, అమేథి ప్రజలకు బాగా తెలుసని ఎన్నోసార్లు ఓటు రూపంలో ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. దివంగత నేతని ఆయన త్యాగాన్ని మోదీ హేళన చేసి మాట్లాడారని ట్విటర్ లో పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ అమాయకులని, ఎంతో నిజాయతీ పరులని ఆయనపై మోదీ అసంబద్ధమైన, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.

burqa ban not demand of shiv sena or uddhav:sena leader raut


శివసేన బురఖా నిషేధం కోరలేదు
శివసేన పార్టీ గానీ అధినేత ఉద్దవ్ థాకరే గానీ బురఖా నిషేధం కోరలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రౌత్ పేర్కొన్నారు. మే4 శనివారం ముంబయికి చెందిన న్యాయవాది మున్సిఫ్ ఖాన్ ముస్లిం సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించి వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన థాకరే, రౌత్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ గురువారం మాట్లాడుతూ బురఖాను నిషేధించాలనుకుంటే రాజస్థాన్ లోని మహిళలు సంప్రదాయంగా ధరించే గున్ గాట్ ను నిషేధించాల్సి ఉంటుంది కదా అన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పెద్ద సంఖ్యలో బురఖాలు ధరించిన ముస్లిం మహిళలు ముంబ్రా లోని సామ్నా పత్రిక కార్యాలయం వద్ద నిరసనల హోరెత్తించారు. రౌత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించాలి..దేశాన్ని రక్షించాలి (Samvidhan Bachao, Desh Bachao) అంటూ నినదించారు. మారుతి డైలీకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రౌత్ సమస్య తీవ్రరూపం దాల్చకుండా వివరణ ఇచ్చారు. సామ్నాలో బుధవారం వచ్చిన సంపాదకీయంతో శివసేనకు లేదా ఉద్దవ్ థాకరేకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ సంపాదకీయం ప్రధాని మోదీని శ్రీలంకలో మాదిరిగా దేశంలోనూ బురఖాను నిషేధించాలని సూచించింది. శ్రీలంకలో భయానక వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఆ దేశం ఇటీవల తనిఖీల ఇబ్బందుల నేపథ్యంలో బురఖాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాంతక్రజ్ సీనియర్ ఇన్ స్పెక్టర్ శ్రీరాం కొర్గాంకర్ తమకు మున్సిఫ్ ఖాన్ ఫిర్యాదు అందిందని అయితే ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.


five BJP workers die as car falls into gorge in HP



కారు లోయలో పడి అయిదుగురు బీజేపీ కార్యకర్తల దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఆదివారం (మే5) కారు లోయలో పడిన దుర్ఘటనలో అయిదు భారతీయ జనతాపార్టీకి చెందిన కార్యకర్తలు దుర్మరణం పాలయ్యారు. భటిక్దర్ లో ముఖ్యమంత్రి జైరాం ఎన్నికల ర్యాలీకి హాజరయ్యేందుకు వీరంతా బయలుదేరినట్లు సమాచారం. కారు అదుపుతప్పి 300 మీటర్ల లోయలోకి జారి పడిపోయినట్లు తెలిసింది. ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయలుకావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.