Tuesday, September 29, 2020

Allu Arjun Adorably Wishes His Wife, Sneha Reddy On Her Birthday, Calls Her, 'Most Special Person'

`అత్యంత ముఖ్యమైన వ్యక్తి`కి బన్నీ విషెస్

నా జీవితంలో `అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు` అంటూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాలో ఓ ఫొటో, కామెంట్ పోస్టు చేశారు. మంగళవారం బర్త్ డే జరుపుకుంటున్న భార్య స్నేహారెడ్డిపై ఆయన ఈవిధంగా ప్రేమాభిమానాల్ని కురుపిస్తూ ఈ మురిపించే పోస్ట్ పెట్టారు. అంతే అందమైన ఫొటోను పోస్ట్ కు జత చేశారు. అల్లు అర్జున్ తన దీర్ఘకాల ప్రేయసి స్నేహ రెడ్డిని మార్చి 6, 2011 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఏప్రిల్ 3, 2014 న అల్లు అయాన్ జన్మించాడు. ఆ తర్వాత వీరి కుటుంబంలోకి నవంబర్ 21, 2016 న అల్లు అర్హా వచ్చి చేరింది. బన్నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో లో ఇటీవల అర్హా  చూడముచ్చటైన వీడియోల సందడి అందరికీ తెలిసిందే.  ఇదిలావుండగా 35వ ఏట అడుగుపెట్టిన స్నేహ తన భర్త, పిల్లలు, లేడీ ఫ్రెండ్స్ తో బర్త్ డే ను సందడిగా జరుపుకున్నారు. ఇన్ స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లను కల్గిన ఆమె ఫొటోలకు లైక్ ల వర్షం కురుస్తోంది.

Saturday, September 26, 2020

Deepika Padukone reaches NCB office to record statement in drugs case

ఎన్సీబీ ఎదుటకు తారాగణం

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ఎదుటకు బాలీవుడ్ తారాగణం ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. శనివారం ఉదయం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయం తారామణుల రాకతో సందడి సంతరించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి (ఆత్మహత్య) కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం విదితమే. దాంతో ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో కేంద్ర నిఘా విభాగాల చొరవతో లోతైన విచారణకు తెరలేచింది. రియాను సుదీర్ఘంగా విచారించిన మీదట పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీపికాతో  పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. విచారణకు సెప్టెంబర్ 25, 26 (శుక్ర, శనివారాలు)తేదీల్లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగా దీపికా ఈరోజు అధికారుల ఎదుటకు వచ్చారు. అదే విధంగా మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు.  శుక్రవారమే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది ప్రముఖ నటుల పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది.

Friday, September 25, 2020

Another Honour killing in Telengana Hyderabad Gachibowli Area

 

తెలంగాణలో మరో పరువు హత్య

      ·        నాడు ప్రణయ్.. నేడు హేమంత్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గురువారం చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. స్థానిక చందానగర్‌లో నివసిస్తున్నయువజంట హేమంత్(28), అవంతిలపై రక్త సంబంధీకులే కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు. తొలుత కిడ్నాప్ చేసి అనంతరం అర్ధరాత్రి దాటాక హేమంత్ ఉసురు తీశారు. కేవలం కులం, అబ్బాయికి ఆస్తి లేదనే కారణాలతోనే అమ్మాయి తరఫు బంధువులు ఈ కిరాతకానికి తెగబడ్డారు. ఇందుకు తన చిన్న మేనమామ యుగంధర్ ప్రధానకుట్రదారని అవంతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు మూడు నెలల క్రితమే వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టారు. అప్పటి నుంచి హేమంత్ ను విడిచి రావాలని అవంతిపై ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో నిన్న చందానగర్ కు వచ్చిన దుండగులు అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్తున్నామని నమ్మబలికి ఈ జంటను కిడ్నాప్ చేశారు. అనుమానం వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ ఆర్) సమీపంలో కారులో నుంచి జంట కిందకు దూకి తప్పించుకున్నారు.  అదే సమయంలో హేమంత్ తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసి ఘటనా స్థలానికి చేరుకునే సరికి హేమంత్ ను మరోసారి అపహరించి దుండగులు అక్కడ నుంచి పరారయ్యారని అవంతి తెలిపింది. అనంతరం ఆమె తన భర్తను కిడ్నాప్ చేశారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. పోలీసులు గాలింపు చేపట్టిన కొద్ది గంటల్లోనే హేమంత్ శవంగా కనిపించాడు. సుపారీ తీసుకున్న దుండగుల చేతిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డిలో హేమంత్ ను దారుణంగా హత్య చేసి కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో శవాన్ని పడేశారు. గచ్చిబౌలిలో ఈ జంటను కిడ్నాప్ చేసిన దుండగులు సంగారెడ్డిలో హేమంత్‌ను హత్య చేశారు. గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం లో  మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు ఘటన మరువకు ముందే మరో పరువుహత్యా ఘటన రాష్ట్రంలో వెలుగుచూసింది. కుమార్తె అమృత తనకు నచ్చని వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నందుకే ఆమె తండ్రి సొంత అల్లుణ్ని చంపించిన సంగతి తెలిసిందే.

Wednesday, September 23, 2020

Hyderabad based pharma Bharat biotech inks licensing deal with washington university for intranasal vaccine

ముక్కు ద్వారా కరోనా టీకా

ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వినూత్న కోవిడ్-19 టీకాను త్వరలో మార్కెట్ లోకి తీసుకురానుంది. ఆ దిశగా ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.  ముక్కు ద్వారా చుక్కల మందు రూపంలో వేసే టీకాను భారత్‌ బయోటెక్‌ రూపొందించింది. `కోరోఫ్లూ` పేరిట ఈ టీకాను యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మాడిసన్‌, ఫ్లూజెన్‌ అనే వ్యాక్సిన్‌ కంపెనీలతో సంయుక్తంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ టీకా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ వేగంగా జరుగుతున్నాయి. ముక్కు ద్వారా ఇచ్చే ఒక్క డోస్‌తోనే సమర్ధంగా వ్యాధినిరోధక శక్తి సాధించే అవకాశం కల్గనుంది. అంతేగాక చాలా వేగంగా విస్తృత స్థాయిలో జనాభాకు సులభంగా వ్యాక్సిన్ అందజేయొచ్చు. ఇది కరోనా నుంచి రక్షించడమే కాక ప్రధానంగా ముక్కు, గొంతు కణాల ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. `ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న చాలా ఇతర టీకాలు అలా చేయలేవు` అని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు డేవిడ్ టీ క్యూరేయల్ తెలిపారు. సురక్షిత, సమర్థ, ప్రభావశీల వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో  మా అనుభవం కచ్ఛితంగా ఉపకరిస్తుందని సంస్థ సీఈఓ కృష్ణ ఎల్లా  ఆశాభావం వ్యక్తం చేశారు. `కోవిడ్ -19కు అవసరమైన టీకాను అందించడానికి విభిన్నమైన మంచి ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం భారత్ బయోటెక్ గౌరవంగా భావిస్తుంది` అని ఆయనన్నారు. 100 కోట్ల (ఒక్క బిలియన్) టీకా డోస్‌లను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సీఈఓ వివరించారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ వల్ల సూది, సిరంజి వంటి పరికరాల వాడకాన్ని తగ్గించడంతో టీకా ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గనుందన్నారు.

Saturday, September 19, 2020

If you've got a runny nose you DON'T have Covid-19: Expert says

ముక్కు కారుతోందా..అయితే కరోనా లేనట్లే..!

కరోనా భయంతో అనవసర పరీక్షలు చేయిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు బ్రిటన్ వైద్య నిపుణులు ఊరట కల్గించే సంగతి చెప్పారు. ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని అభయం ఇచ్చారు. పిల్లలకు సాధారణంగా ముక్కు కారుతూ ఉంటుంది. సీజనల్ గా వచ్చే జలుబు సాధారణ లక్షణమది. ఆ లక్షణం కల్గి ఉన్న పిల్లలపై చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ జాడ కనిపించలేదు. దాంతో ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. కరోనా సోకిన వారి ముక్కు దిబ్బడ వేసినట్లు ఉంటుందన్నారు. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే పలువురు పిల్లలు జలుబుతో బాధపడుతున్నారు. వారిలో చాలామంది పిల్లలకు ముక్కు కారుతూండడంతో వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై అనవసరంగా టెస్టుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో  బ్రిటన్  ప్రభుత్వం తరఫున వైద్య రంగ నిపుణులు రంగంలోకి దిగి ఈ ఊరట నిచ్చే అంశాన్ని వెల్లడించారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ముక్కు కారుతుండడం సాధారణ జలుబుకు సంబంధించిన ఒక కచ్చితమైన సంకేతం అని తేల్చి చెప్పారు. ఇందుకు పలు శాంపిళ్లు, సర్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో జలుబుతో బాధపడుతున్న పిల్లల కోసం వారి తల్లిదండ్రులు క్రీకింగ్ టెస్ట్ లకు పరిగెడుతుండడంతో గందరగోళం నెలకొంటోందని వైద్య నిపుణుడు మాట్ హాన్కాక్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సింప్టమ్ స్టడీ యాప్‌ను నడుపుతున్న ప్రొఫెసర్ స్పెక్టర్ తన పరిశోధనలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. అలసట (55 శాతం), తలనొప్పి (55 శాతం), జ్వరం (49 శాతం) తదితర లక్షణాలు పిల్లల్లో కనిపించినట్లు వివరించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పెద్దల్లో లక్షణాలు ఇలా ఉన్నాయి. అలసట (87 శాతం), తలనొప్పి (72 శాతం), వాసన కోల్పోవడం (60 శాతం) లక్షణాలు కల్గి ఉన్నట్లు సర్వే వివరాలు వెల్లడించారు. పిల్లలు లేదా పెద్దల్లో జలుబు చేసినప్పుడు ముక్కు కారడం తరచుగా గమనించే విషయమేనని అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Friday, September 18, 2020

TTD to set up lord Venkateswara temple at Ayodhya Rammandir primses

ప్రతి రాష్ట్రంలో శ్రీవారి కోవెల

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు దేశ, విదేశాల్లో కొలువుదీరి భక్తుల్ని అలరించనున్నాడు. దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని నెలకొల్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయోధ్యలో రామమందిరంతో పాటు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి కోవెలను నిర్మించనున్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. ఈ ప్రతిపాదన పట్ల యూపీ ప్రభుత్వం సానుకూలత కనబర్చినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 49 టీటీడీ అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం కాశీ, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణాలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు స్థలాల్ని కేటాయించాయి. స్వామి వారి వైభవం, హైందవ సనాతన ధర్మాల్ని ప్రపంచం నలుమూలలకు విస్తరింజేయాలని టీటీడీ సంకల్పించింది. మనదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించదలిచింది. డుమ్మీ, మజిన్ పరిసరాల్లో జమ్మూ ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఇంజినీరింగ్ అధికారుల బృందం ఆ స్థలాన్ని పరిశీలించడం కూడా పూర్తయింది. దాంతో త్వరలోనే జమ్మూలో శ్రీవారి ఆలయం కొలువుదీరబోతోంది. అదే విధంగా ముంబ బాంద్రా ప్రాంతంలో రూ.30కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఆలయ నిర్మాణానికి 650 గజాల స్థలాన్ని మహారాష్ట్ర సర్కారు కేటాయించింది. అదే క్రమంలో భువనేశ్వర్, వైజాగ్, చెన్నైలలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Thursday, September 17, 2020

Charles Chuk Feeney..The San Francisco business man donated 58 thousand crore rupees


 అపర దాన కర్ణ.. ఫీని

§  రూ.58వేల కోట్ల దానం

అపరదాన కర్ణుల జాబితాలోకి తాజాగా అమెరికా వ్యాపారవేత్త ఒకరు చేరారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్బెర్క్ షైర్ హాథ్వే చైర్మన్ వారెన్‌ బఫెట్‌ సరసన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కర్ణుడి పేరు ఛార్ల్స్ చక్‌ ఫీనీ. విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపర్స్‌సహవ్యవస్థాపకుడు. రూ.58వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) అధినేత. ఎంత సంపాదించామన్నది కాదు ఎంత దానం చేశామన్నదే ముఖ్యమంటారీయన. సంతృప్తి అనేది డబ్బు సంపాదనలో కాక దాన్ని పదుగురికి పంచడంలోనే ఉందనేది ఆయన ఫిలాసఫీ.  దాతృత్వంలోనే ఆనందాన్ని వెతుక్కున్న ధీశాలి. బిల్ గేట్స్బఫెట్‌ బాటలో.. కాదు..కాదు.. వారికే మార్గం చూపిన మహామనిషి.. స్ఫూర్తి ప్రదాత ఫీని. తన స్వచ్ఛంద సంస్థ అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌ద్వారా యావదాస్తిని దానం చేశారు. ఫీని తన ఆస్తిని విద్య, సాంకేతికరంగం, ఆరోగ్యం, మానవ హక్కుల రక్షణ కోసం అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, బెర్ముడా, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ ల్లో  వివిధ స్వచ్ఛంద సంస్థలకు అందజేయడం ద్వారా ఖర్చు చేశారు. ఈ మేరకు 2012లో ప్రకటించిన ఫీనీ, ఆ మాటను ఇప్పుడు నిలుపుకున్నారు. పదవీ విరమణ చేశాక కేవలం రూ.14కోట్లనే ఉంచుకుని తన భార్యతో కలిసి జీవిస్తున్నారు. ఓ సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. శానిఫ్రాన్సిస్కోలోని ఓ మామూలు అపార్ట్ మెంట్ ప్రస్తుతం ఈ దంపతుల ఆవాసం. దాదాపు రూ.58 వేల కోట్ల మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. దాంతో ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది. 1997లో ఆయన అట్లాంటిక్ ఫిలాంత్రోపీస్ ను ప్రారంభించారు. `జీవిత పరమార్థం గురించి చాలా నేర్చుకున్నా.. చాలా సంతోషంగా ఉంది.. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు బాగా అనిపిస్తోంది` అని ఫీని ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు. బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ తమ దాతృత్వాన్ని చాటుకోవడం గురించి చెబుతూ మేము సంపాదించిన అపార సంపదను దానం చేసేందుకు ఫీని మాకు ఓ దారిని ఏర్పరిచాడన్నారు. `మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలి`.. అంటూ ఫీని నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు.

Monday, September 14, 2020

 

China spy Indian PM, President and CJI and around 10 thousand other Prominent persons

చైనా వెన్నులో భారత్ వణుకు

పొరుగుదేశంలో డ్రాగన్ గూఢ`చౌర్యం`

భారత్ అంటే చైనా జడుస్తోందా..? అందుకే దాదాపు 10 వేల మంది కీలక వ్యక్తులపై గూఢచర్యానికి పాల్పడుతోందా..? 1962 నాటి పరిస్థితులు కాదని.. భారత్ ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన దేశమని చైనాకు బాగా బోధపడినట్లుంది. దాంతో  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, కేంద్రమంత్రులు సహా వేల మంది ప్రముఖులపై  స్పైయింగ్ కు పాల్పడుతోన్నట్లు సమాచారం. వీరిలో భారత రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తులు, పాత్రికేయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరి డిజిటల్ జీవితాలపై చైనా కంపెనీలు కన్నేసి ఉంచాయి. అంతేకాకుండా వీరి కుటుంబ సభ్యులు, మద్దతుదారుల కార్యకలాపాల పైనా ఆ కంపెనీలు నిఘా పెట్టాయని నేషనల్ న్యూస్ ఏజెన్సీ తాజా కథనంలో పేర్కొంది. వీరి రియల్ టైం డేటాను చైనా కంపెనీలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. షెంజేన్ అనే సంస్థ ఈ కుట్రకు నేతృత్వం వహిస్తోంది.  షెంజాన్, చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్ట్ పార్టీ సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ డేటా స్థావరాన్ని నిర్మించి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నట్లు ఆ కథనంలో వివరించింది. భారత్‌ సరిహద్దుల్లో చొరబాట్లకు దిగడంతో పాటు చైనా చీటికి మాటికి కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం మరో భారీ కుట్రకు తెరలేపింది. గూఢచర్యం నెరిపేందుకు తమ దేశంలోని కొన్ని కంపెనీలతో చైనా ఒప్పందం కుదుర్చుకుంది.  గల్వాన్ ఘటన తర్వాత భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ దేశ వస్తువులు, యాప్‌లపై నిషేధం విధించి చైనాకు గట్టిగా బదులిచ్చింది. దాంతో ఉడికిపోతున్న చైనా ఈ దుశ్చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు.

Saturday, September 12, 2020

PubG ban B.tech student self elimination in anantapur


బీటెక్ విద్యార్థిని బలిగొన్న పబ్జీ గేమ్

ఎంతో భవిత ఉన్న ఓ బీటెక్ విద్యార్థి ఆన్ లైన్ గేమ్ కు బానిసై బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇది. అనంతపురం రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న నరసింహారెడ్డి పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి (23) గత కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. చెన్నైలో అతను బీటెక్ చదువుతున్నాడు. అక్కడ ఉండగానే ఈ పబ్జీ గేమ్ ఆడ్డానికి అలవాటు పడ్డాడు. లాక్ డౌన్ నేపథ్యంలో అనంత స్వగృహానికి చేరుకుని గత అయిదు నెలలుగా కుటుంబసభ్యులతోనే ఉంటున్నాడు. చైనాతో పరిణామాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ పబ్జీ గేమ్ నూ నిషేధించింది. పబ్‌జీ సహా 118 చైనా యాప్‌లపై భారత సర్కారు వేటు వేసింది. ఈ ఆట కు బానిసైన కిరణ్ గత కొద్ది రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం అతను కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు మూడో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే శనివారం  కిరణ్ సొంత ఇంట్లోని స్టోర్ రూమ్ లో శవంగా కనిపించాడు. అందులోనే ఉరివేసుకుని చనిపోయాడని తెలుస్తోంది. అయితే అతను ఈరోజే చనిపోయాడా మూడ్రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయమై పోలీసు విచారణ కొనసాగుతోంది. అనంత సర్వజన ఆసుపత్రికి కిరణ్ మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Monday, September 7, 2020

Hyderabad Metro Services Resume After Centres Unlock4 Guidelines Less Footfall Seen


మెట్రో ప్రారంభం.. పలుచగా జనం

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మెట్రో రైలు సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. మార్చి 22న ఆగిన మెట్రో రైలు కూత మళ్లీ ఈ ఉదయం నుంచే వినపడుతోంది. అయితే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. దేశంలోని 11 నగరాల్లో ఈ సోమవారం ఉదయం నుంచి మెట్రో సర్వీసుల్ని పునరుద్ధరించారు. అన్ లాక్ 4లో సడలించిన నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకున్న ప్రయాణికుల్నే మెట్రోలోకి అనుమతిస్తున్నారు. అదే విధంగా టికెట్ల ను క్యూఆర్ కోడ్ ద్వారా లేదా స్మార్ట్ కార్డ్  ద్వారా పొందే వీలు కల్పించారు. హైదరాబాద్‌లో సైతం మార్చి 22న ఆగిన మైట్రో రైళ్లు ఈరోజే  మళ్లీ ట్రాక్ ఎక్కాయి. కారిడార్-1 మియాపూర్- ఎల్బీనగర్ మధ్య మెట్రో కూత వినిపించింది. లాక్ డౌన్ కు ముందు వరకు హైదరాబాద్ మెట్రో ద్వారా నిత్యం దాదాపు లక్షమంది ప్రయాణించేవారు. ఇప్పుడు మూడో వంతు మందికి మాత్రమే అనుమతి ఉంది..అంటే కేవలం 30 వేల మందికే ప్రయాణించే అవకాశం కల్పించారు.

Friday, September 4, 2020

rummy the e-gambling ban in AP


ఆన్ లైన్ పేకాటపై ఏపీ కొరడా

రమ్మీ, పోకర్‌ తదితర ఆన్ లైన్  జూదాలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఈ జూదాల్ని ఆడేవారికి, నిర్వహించే వారికీ జైలు శిక్ష సహా జరిమానా విధించాలని జగన్ సర్కారు తీర్మానించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఏపీ గేమింగ్‌ యాక్టు (1974) సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారికి 6నెలలు జైలు శిక్ష విధిస్తారు. నిర్వాహకులకు మొదటిసారి ఏడాది శిక్షతో పాటు జరిమానా పడుతుంది. రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. ఆన్‌లైన్‌లో జూదాన్ని ప్రోత్సహించి యువతను పెడదోవ పట్టిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలని జగన్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Thursday, September 3, 2020

sightseeing re-starts in Hyderabad

చార్మినార్, గోల్కొండ కోటలకు మళ్లీ జన కళ

కరోనాతో అతలాకుతలం అయిన భాగ్యనగర పర్యాటక రంగం మెల్లగా కుదుట పడుతోంది. అన్ లాన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు చారిత్రక చార్మినార్, గోల్కొండ కోట తదితరాల్ని సందర్శించి ఆనందిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో మాత్రమే సందర్శకుల్ని ఈ ప్రాంతాలకు అనుమతిస్తున్నారు. దాంతో ఇప్పుడిప్పుడే చార్మినార్, గోల్కొండ కోటల్లో జనసందడి మొదలయింది. సిటీలోని ఈ సందర్శనాత్మక ప్రాంతాల్లో రోజుకు 200 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్-నవంబర్ నాటికి కరోనా మహమ్మారి పూర్తిగా సద్దుమణగవచ్చని.. అప్పటి నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజికి తగ్గరీతిలో పర్యాటక రంగం ఊపందుకోగలదని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 55 వరకు గల పర్యాటక ప్రాంతాల్లో కేవలం 10 వేల మంది సందర్శకులకు మాత్రమే అనుమతి లభిస్తోంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో క్రమేణా పెరగవచ్చని ఆశిస్తున్నారు.