Tuesday, July 9, 2019

Puppy beaten to death in Thane housing complex, 1 booked


కుక్క పిల్లే కదా అని చంపేసి.. ఆనక ఇరుక్కున్న ఘనుడు
మహారాష్ట్రలో ఓ వ్యక్తి కుక్క పిల్లే కదా అని కొట్టి చంపి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఈ ఘటన జులై3 బుధవారం జరిగింది. థానె సమీపంలోని శాంతినగర్ ప్రాంతంలో భయాందర్ గృహ సముదాయాల టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ ప్రాంగణంలోకి ఓ కుక్క పిల్ల జొరబడింది. దాన్ని చూసి ఆగ్రహం చెందిన సదరు వ్యక్తి దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. కుక్క పిల్ల కళేబరాన్ని చూసిన ఇరుగుపొరుగులు ఎలా చనిపోయిందో తెలియక తర్వాత అక్కడ నుంచి తొలగించారు. అయితే రెండ్రోజులు గడిచిన తర్వాత వాట్సాప్ లో ఆ వీడియో ప్రత్యక్షమయింది. కుక్కపిల్లను కొట్టి చంపుతున్న వీడియోను సదరు వ్యక్తే రికార్డు చేసి పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా తమ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన కుక్కలన్నింటికి ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానాన్ని జత చేశాడు. అతడికి ఈ మొత్తం వ్యవహారంలో స్నేహితుడొకరు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోను చూసి చలించిపోయిన అపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. థానె రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి కుక్క పిల్లను చంపిన సదరు వ్యక్తిపై నమోదు చేశారు. నోరు లేని మూగ జీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం నేరం కిందకే వస్తుంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్ 11 ప్రకారం, ఐ.పి.సి (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్428, 429 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయదగ్గ నేరంగా పరగణించి పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.

YSRCP party men do not exceed limits Chandrababu warns Cm Jagan


చంద్రబాబు ఓదార్పు యాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాల్లో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాల్ని కలుసుకుని పరామర్శించారు. తాడిపత్రి లోని వీరాపురం గ్రామంలో భాస్కరరెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భాస్కరరెడ్డి మృతికి పరహారంగా చంద్రబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు. అనంతరం ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ వై.ఎస్.ఆర్.సి పార్టీపై నిప్పులు చెరిగారు. ఆరుగురు తెలుగుదేశం కార్యకర్తల్ని వై.ఎస్.ఆర్.సి.పి. కి చెందిన వారు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సావంగ్ ను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇదేనా జగన్ అందిస్తున్న ఉత్తమ పాలన అని చంద్రబాబు నిలదీశారు. వై.ఎస్.ఆర్.సి.పి. దుందుడుకు పోకడలకు పోతోందని అది మంచిది కాదని చెప్పారు. ఆ పార్టీ వారి ఆగడాలు శ్రుతి మించుతున్నాయని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. సీఎం జగన్ సత్పరిపాలన అందించడానికి ఆరునెలల గడువు అడిగారు..వేచి చూస్తున్నాం.. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం.. అని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక 40 రోజుల్లో ఉత్తమ పాలన మాట అటుంచి ఆ పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. తక్షణం వై.ఎస్.ఆర్.సి.పి. శ్రేణుల్ని అదుపులో పెట్టుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు తేల్చిచెప్పారు.