Tuesday, March 29, 2022

Tamil Nadu Young man buys dream bike of Rs 2.6 lakh with Rs.1 coins

రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు

తమిళనాడు సేలం జిల్లా అమ్మపేటకు చెందిన ఓ యువకుడు చిల్లర నాణేలతో బైక్ కొని వార్తల్లోకెక్కాడు. భూపతి అనే చిరుద్యోగి రూ.2.60 లక్షలతో బజాజ్ డొమినర్-400 బైక్ కొన్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ 29 ఏళ్ల యువకుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి బైక్ కొనాలనే ఆశ. మూడేళ్లు క్రితం అతను బజాజ్ షోరూంకు వెళ్లి బైక్ రేటు గురించి కనుక్కున్నాడు. అప్పటి నుంచి రూపాయి నాణేలను కూడబెట్టాడు. ఆ నాణేలన్నింటిని బస్తాల్లో కట్టి బజాజ్ షోరూంకు ట్రాలీలో తీసుకొచ్చాడు. తొలుత అంగీకరించని షోరూం సిబ్బంది భూపతి బ్రతిమలాడ్డంతో తర్వాత ఒప్పుకున్నారు. నాణేలు లెక్కించడానికి అతని స్నేహితులతో పాటు సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు. లెక్క సరిపోయాక బిల్లు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది అతనికి బైక్ ఇచ్చి పంపించారు. దాంతో హైఎండ్ బజాజ్ బైక్ పై భూపతి కేరింతలు కొడుతూ ఇంటికి చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన అతను స్నేహితులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Monday, March 28, 2022

Telangana CM KCR attended inauguration ceremony of reconstructed Yadadri temple

నవ వైకుంఠం యాదాద్రి

తెలంగాణ తిరుమలగా భక్త జనకోటిని అలరించనున్న యాదాద్రి ఆలయం పున:ప్రారంభమయింది. లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం అందరికీ ఈ సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. నవ వైకుంఠంగా భాసిల్లుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు దర్శన భాగ్య క్రతువులు సోమవారం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలు షురూ అయ్యాయి. ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు మొదలయ్యాయి. ఈ ఉదయం సీఎం దంపతులు, అసెంబ్లీ, మండలి సభాపతులైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్టామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టిన శోభాయాత్రలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి మాడ వీధుల్లో వైభవోపేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు, ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశిన ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం అయింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించారు. తర్వాత గర్భాలయంలోని మూలవరుల దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని తొలి పూజలు చేశారు. మరోవైపు నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్‌తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాలన్నింటిని భక్తుల కోసం సిద్ధం చేశారు.

Wednesday, March 23, 2022

Kodali Nani fires again on Chandra Babu in the AP Assembly

చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయిన మంత్రి కొడాలి

బూతుల మంత్రిగా, ఆవేశపరుడిగా ప్రతిపక్షాలు పేర్కొంటున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మాజీ బాస్ చంద్రబాబుపై మళ్లీ నోరుపారేసుకున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ, నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ తెలుగుదేశం శాసనసభ్యులు తాజాగా ఈరోజు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. చిడతలు కొడుతూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్య పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు ఎమ్మెల్యేలేనా? అసెంబ్లీ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు.. ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో మీ చేష్టలన్నింటిని చూస్తున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ దశలో మంత్రి కొడాలి జోక్యం చేసుకుంటూ చంద్రబాబుపై యథావిధిగా మాటల దాడి చేశారు. సన్నాసి, వెదవ అంటూ తిట్ల వర్షం కురిపించారు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారుణవాహిని అని పేరు పెట్టి అందరికీ సారాను అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు `చీప్` మినిస్టరని.. చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కొడాలి ఎద్దేవా చేశారు.

Saturday, March 19, 2022

10 died 25 injured in bus accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

·        10 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్ణాటకలోని ఓ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 26 మందితో ప్రయాణిస్తున్న ఎస్.వి.టి. బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు. వై.ఎన్.హోసకోట నుంచి పావగడకి బస్సు బయలుదేరింది. పలవలహళ్లి సమీపంలో ప్రమాదం బారినపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Monday, March 14, 2022

Chandrababu fires on Y.S.Jagan gov. visits West Godawari district today

కల్తీ సారా బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యుల్ని కలుసుకుని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కల్తీ మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఏరులై పారుతోందని ఇందుకు ప్రస్తుత వైఎస్ఆర్సీపీదే బాధ్యతన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అగ్నిమాపకకేంద్రం నుంచి అసెంబ్లీ హాల్ ప్రధాన ద్వారం వరకు ప్లకార్డులు, మద్యం సీసాలు చేతపట్టుకుని ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే కారణంతో అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేల్ని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, బుచ్చయ్యచౌదరి, పయ్యవుల కేశవ్ లు సస్పెండయిన వారిలో ఉన్నారు.

కల్తీ సారా ఘటనపై సీఎం భేటీ

ఏపీ అసెంబ్లీ లో సీఎం వై.ఎస్.జగన్‌తో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని, నారాయణ స్వామి భేటీ అయ్యారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం వద్ద చర్చ జరిగింది. మరణాలకు కారణాలను మంత్రి ఆళ్ల నాని, ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి సీఎంకు వివరించారు. టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని జగన్ వారితో పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియపర్చాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ముఖ్యమంత్రి సూచించారు. ఘటనపై సభలో స్పందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Friday, March 11, 2022

Telangana CM KCR Diagnosed With 'Mild Chest Infection'

సీఎం కేసీఆర్ కి స్వల్ప అనారోగ్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనకు ఎడమవైపు ఛాతీలో కొద్దిగా నొప్పి వచ్చింది. దాంతో కేసీఆర్ ని హుటాహుటిన హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోగ్య పరీక్షలు ఏటా యథావిధిగా నిర్వహించేవేనని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. రెండ్రోజులుగా కేసీఆర్ కొంచెం నలతగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు డా.ఎమ్వీరావు చెప్పారు. ఆయన ఎడమచెయ్యి లాగుతుందని తెలిపారన్నారు. భయపడాల్సింది ఏమీ లేదని కొద్దిపాటి ఇన్ఫెక్షన్ మాత్రమేనని డాక్టర్ రావు చెప్పారు. పరీక్షల సందర్భంగా ఆసుపత్రిలో ఆయన వెంట సతీమణి శోభ, కుమార్తె కవిత, మనుమడు హిమాన్షు, ఇతర కుటుంబసభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఈరోజు ఏర్పాటైన కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దయింది. లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. 

Wednesday, March 9, 2022

CM KCR announces mega recruitment process for 91,142 jobs

కేసీఆర్.. సూపర్ హిట్

* అసెంబ్లీలో జాబ్స్ బాంబ్

* ప్రభుత్వ మెగా జాబ్ మేళా ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదరగొట్టారు. సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సూపర్ హిట్ కొట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక యావత్ దేశం దృష్టిని ఆయన అలవోకగా సాధించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, అటు కేంద్రంలో మోదీ సర్కారుకి నోటమాట రానట్లుగా జాబ్ బాంబ్ పేల్చారు. బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ ఏకబిగిన గంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మొత్తం 91142 ఉద్యోగాల్ని ఈరోజే నోటిఫై చేస్తున్నామన్నారు. తక్షణం 80039 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సభ్యుల చప్పట్ల మధ్య ఘనంగా ప్రకటించారు. అదేవిధంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీ కేలండర్ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్క హోంశాఖలోనే 18334 ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అలాగే విద్యాశాఖలో 20వేల పైచిలుకు పోస్టుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. వైద్యశాఖలో 12,755, బీసీ సంక్షేమశాఖ 4311, రెవెన్యూశాఖ 3560, ట్రైబల్ వెల్ఫేర్ 2399 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో 95శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉంటుందని మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తామని సీఎం సగర్వంగా ప్రకటించారు.  తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత గ్రూపుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1: 503 పోస్టులు, గ్రూప్-2:582 గ్రూప్-3: కింద1373 గ్రూప్-4: 9168 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ఠ వయో పరిమితిని ప్రకటించడం విశేషం.

Tuesday, March 8, 2022

CM Jagan introduces mourning resolution for late Gautam Reddy in AP Assembly

గౌతంరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి సంతాపం ప్రకటించింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ గౌతం రెడ్డి హఠాన్మరణం వై.ఎస్.ఆర్.సి.పి కి తమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2010 నుంచి తాము సన్నిహితంగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో దిగ్ర్భాంతి చెందినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒక సమర్థ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందంటూ బాధపడ్డారు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంగం బ్యారేజీకి గౌతం పేరు

సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ సంగం బ్యారేజీకి గౌతంరెడ్డి పేరు పెడతామన్నారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం అని సీఎం చెప్పారు. గౌతం చిరస్థాయిగా జిల్లా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేస్తామన్నారు. మరో ఆరు వారాల్లో పూర్తికానున్నసంగం బ్యారేజీకి `మేకపాటి గౌతం సంగం బ్యారేజీ`గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.

Monday, March 7, 2022

About 700 students are still trapped in Sumi, Ukraine

ఇంకా బంకర్లలోనే కొందరు..

ఉక్రెయిన్ లో ఇంకా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. సుమీ లోగల బంకర్లలో వీరంతా తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో నోఫ్లైజోన్ ఆంక్షలు నేటి నుంచి అమలు కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు సుమీలోనే  క‌నీస సౌక‌ర్యాలు లేక అల‌మ‌టిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రష్యా దాడులు తీవ్రమైన సమయంలో వారంతా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. తొలుత వీరందర్ని రష్యా మీదుగా భారత్ కు తీసుకురావాలని మన రాయబార కార్యాలయం యత్నించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ యత్నం ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల్ని పోలెండ్, హంగేరీల మీదుగానే భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, March 4, 2022

CM YSJagan union minister Sekhawat Polavaram visit

కేంద్రమంత్రి పోలవరం సందర్శన

* సీఎం జగన్ తో కలిసి పునరావాస గృహాల పరిశీలన

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సందర్శించారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ తో కలిసి ఆయన ఇందుకూరిపేటలోని పునరావాస గృహాల్ని పరిశీలించి అక్కడ సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం అన్ని విధాలా సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా షెకావత్ హామీ ఇచ్చారు. `పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది.  కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు పనుల పరిశీలనకు మధ్యలో మరోసారి పర్యటిస్తా`అని షెకావత్‌ తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం యావత్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఏర్పాటుకు చేయూతనిస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పునరావాస పనులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారుల్ని సీఎం కోరారు.