Tuesday, January 18, 2022

Dhanush-Aishwarya`s marital life come to end

విడిపోయిన మరో స్టార్ జోడి

మరో సెలబ్రిటీ జంట తమ వివాహ బంధానికి బ్రేక్ అప్ చెప్పేశారు. ఇటీవల తెలుగునాట ప్రముఖ తారలు నాగచైతన్య, సమంతాల జోడి విడిపోగా ఇప్పుడు అదే బాటలో తమిళనాడుకు చెందిన సెలబ్రిటీలు స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్యాలు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె. ఆమె తమిళ సినీ నిర్మాతగా పేరొందగా ధనుష్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తాజాగా తమ 18 ఏళ్ల వివాహ బంధానికి తెరవేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫ్రెండ్స్ గా కొనసాగుతామని వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు.

Wednesday, January 12, 2022

Actor Siddharth apologies to Saina Nehwal for 'rude joke'

సైనాను క్షమాపణలు కోరిన సిద్ధార్థ్

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ను దక్షిణాది సినీ హీరో సిద్ధార్థ్ క్షమాపణ వేడుకున్నారు. ఇటీవల తను చేసిన రీ ట్వీట్ కు సంబంధించి ఆయన సారీ చెప్పారు. ఈనెల 5న భారత ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపంపై సైనా ట్వీట్ చేశారు. స్పందించి సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్ దుమారం రేపింది. దేశవ్యాప్తంగా నెటిజెన్లు సిద్ధార్థ్ కు స్త్రీద్వేషిగా ముద్ర వేసి  ట్రోలింగ్ కు దిగారు. దాంతో దిగవచ్చిన ఈ హీరో సైనాను క్షమించాల్సిందిగా కోరుతూ మంగళవారం రాత్రి మరో ట్వీట్ చేశారు. తను నిజానికి గొప్ప మహిళావాదినని పేర్కొన్నారు. సైనా అభిప్రాయాలు చాలా వాటితో తను విభేదిస్తానని చెప్పారు. అయినా ఆమె తన చాంపియన్ అన్నారు. తన రీట్వీట్ లో ఉపయోగించిన పదాలు బాగాలేదన్నారు. హాస్యం కోసం తను ప్రయోగించిన భాష చక్కగా లేకపోయి ఉండొచ్చని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. ఆ రీ ట్వీట్  తప్పేనని ఒప్పకున్నారు. అందుకే ఈ మొరటు హాస్యానికి గాను సైనా తనను మన్నించాలని కోరారు.

Friday, January 7, 2022

Chandrababu road show in Own constituency Kuppam

కుప్పంలో చంద్రబాబు విస్తృత పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఆయన కుప్పం విచ్చేశారు. ఇటీవల ఆయన తరచు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి గ్రామగ్రామాన ప్రజల సాధకబాధలను తెలుసుకునేందుకే బాబు విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చంద్రబాబు 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేస్తే ఓటమి పాలు కావడం ఖాయమని వైఎస్ ఆర్ సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీని సైతం పాలకపక్షానికి టీడీపీ కోల్పోవడం ఆ పార్టీని కుంగదీసింది. మంత్రి పెద్దిరెడ్డి ఈ విషయంలో తన పంతం నెగ్గించుకున్నట్లు పాలక వర్గాలు కాలరేగరేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తనపట్టు చెక్కుచెదరలేదని పార్టీ శ్రేణులకు సైతం స్పష్టం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కుప్పం తాజా పర్యటన చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమ అధినేతకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అదే ఉత్సాహంలో ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఈ పర్యటనకు వచ్చినట్లు బాబు స్వయంగా వెల్లడించారు. మూడ్రోజుల పాటు (శనివారం వరకు) నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు. తను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పాలకపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే ప్రతిదెబ్బ తనకు తగిలినట్లుగానే భావిస్తానని పేర్కొన్నారు.