Tuesday, October 6, 2020

US president Donald Trump leaves hospital to fly back to White House

వైట్ హౌస్ కి తిరిగొచ్చేసిన ట్రంప్

కరోనా బారిన పడి నాలుగురోజులుగా వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌ (సైనిక ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం శ్వేత సౌధానికి తిరిగి వచ్చేశారు. ఆయన భార్య దేశ ప్రథమ పౌరురాలు మెలానియా వైట్ హౌస్ లోనే కరోనా చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌నకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో అత్యవసరంగా ఆయనను వాల్టర్ రీడ్ కు తరలించి చికిత్స అందించారు. తొలుత ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయనను సైనిక ఆసుపత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చింది. గడిచిన 72 గంటలుగా ఆయనకు జ్వరం లేకపోవడం, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు సాధారణంగా ఉండడంతో డాక్టర్లు ఆయనను వైట్ హౌస్ కు తిరిగి పంపడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే ట్రంప్ ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం ఏమేరకు ఉంది? తాజా నిర్ధారణ పరీక్షల్లో అధ్యక్షుడికి నెగెటివ్ వచ్చిందా? లేదా? అనే అంశాలు ఇంకా  వెల్లడికాలేదు. ట్రంప్‌నకు ఆస్పత్రిలో మాత్రం రెండుసార్లు అత్యవసరంగా ఆక్సిజన్ అందజేసినట్లు తెలుస్తోంది. వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి సర్జికల్ మాస్క్ ధరించిన ట్రంప్ విజయ సంకేతం చూపుతూ బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా  మీడియా ప్రతినిధులు ప్రశ్నల నుంచి ట్రంప్ తెలివిగా తప్పించుకుని ముందుకు వెళ్లిపోయారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు. 20 ఏళ్ల క్రితం కంటే తను ప్రస్తుతం చాలా బాగున్నానంటూ ట్రంప్ పోస్టు చేశారు. నిజంగా నా ఆరోగ్యం చాలా బాగుంది అని వ్యాఖ్యానించారు. కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితంపై ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వొద్దు.. మనం మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం..` అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకుని ఉండకపోవచ్చు అని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ పి. కాన్లే తెలిపారు.

Thursday, October 1, 2020

Amitabh Bachchan Couldn't Afford 2 Rupees To Join His School Cricket Team, Shares Childhood Story


 రూ.2 లేక క్రికెట్ కోరిక తీరలేదు:అమితాబ్ 

చిన్నతనం మధురస్మృతులు.. చిట్టిపొట్టి బాధలు మనిషన్నాకా ఎన్నోకొన్ని ఉంటూనే ఉంటాయి. బిగ్ బి బాలీవుడ్ బాద్ షా అమితాబూ అలాంటివి చిన్నతనంలో అనుభవించారట. తన ప్రఖ్యాత `కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్-12 షోలో స్వయంగా బిగ్ బీనే ఆ  జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ తన బాల్యంలో బేల్ పూరి తినాలని ఉన్నా డబ్బు లేక నాడు ఆ కోరిక తీర్చుకోలేకపోయాననే బాధను అమితాబ్ ఎదుట వ్యక్తీకరించారు. అందుకు అమితాబ్ తనూ చిన్నతనంలో అటువంటి వెలితిని ఎదుర్కొన్నట్లు ప్రపంచానికి చాటారు. అదేమిటంటే కేవలం రూ.2 లేక స్కూల్ క్రికెట్ టీంలో ఆడలేకపోయిన సంగతిని చెప్పారు. క్రికెట్ ఆడతానని తన తల్లి తేజి బచ్చన్ ను అమితాబ్ అడగ్గా అందుకు ఆమె నిరాకరించారట. అప్పటికే అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ప్రఖ్యాత కవిగా పేరొందారు. చిన్నతనంలో అందరిలాగానే అమితాబ్ బాధలు, ఆనందాలు చవిచూశారు. యుక్త వయసుకు వచ్చాక సినిమాల్లో నటించాలనే కోరిక కల్గింది. కుటుంబ పరిచయంతో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లి సిఫార్సు లేఖ రాయించుకుని అమితాబ్ బాలీవుడ్ లో అరంగేట్రం చేశారు. పడుతూ లేస్తూనే.. ఆ పరిశ్రమలో నిలదొక్కుకుని అదే బాలీవుడ్ లో షెహన్ షాగా ఎదిగారు. ఫ్రెంచ్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ ట్రఫౌట్ అమితాబ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ `అతనే ఓ పరిశ్రమ`(ఇండస్ట్రీ) గా ప్రశంసించాడు. జీవితంలో తన విజయం వెనుక ఒక్కరు కాదు ఇద్దరు మహిళలున్నారంటారు అమితాబ్. ఒకరు తనతల్లి కాగా రెండు తన భార్య జయబాదురిగా బిగ్ బీ పేర్కొన్నారు. ఇటీవల తల్లి జయంతి సందర్భంగా తన నివాసభవన సముదాయం ప్రతీక్షాలో గుల్మొహర్ మొక్కను ఆమె జ్ఞాపకార్థం నాటారు. ఇంతకు ముందు అదే చెట్టు అక్కడ ఉండేదని అది కూలినచోటనే మరో మొక్కను తిరిగి నాటినట్లు అమితాబ్ తెలిపారు. తల్లి అంటే జ్ఞాపకం కాదని ఆరాధ్య దైవంగా ఆయన అభివర్ణించారు.

Tuesday, September 29, 2020

Allu Arjun Adorably Wishes His Wife, Sneha Reddy On Her Birthday, Calls Her, 'Most Special Person'

`అత్యంత ముఖ్యమైన వ్యక్తి`కి బన్నీ విషెస్

నా జీవితంలో `అత్యంత ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు` అంటూ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇన్ స్టాలో ఓ ఫొటో, కామెంట్ పోస్టు చేశారు. మంగళవారం బర్త్ డే జరుపుకుంటున్న భార్య స్నేహారెడ్డిపై ఆయన ఈవిధంగా ప్రేమాభిమానాల్ని కురుపిస్తూ ఈ మురిపించే పోస్ట్ పెట్టారు. అంతే అందమైన ఫొటోను పోస్ట్ కు జత చేశారు. అల్లు అర్జున్ తన దీర్ఘకాల ప్రేయసి స్నేహ రెడ్డిని మార్చి 6, 2011 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఏప్రిల్ 3, 2014 న అల్లు అయాన్ జన్మించాడు. ఆ తర్వాత వీరి కుటుంబంలోకి నవంబర్ 21, 2016 న అల్లు అర్హా వచ్చి చేరింది. బన్నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో లో ఇటీవల అర్హా  చూడముచ్చటైన వీడియోల సందడి అందరికీ తెలిసిందే.  ఇదిలావుండగా 35వ ఏట అడుగుపెట్టిన స్నేహ తన భర్త, పిల్లలు, లేడీ ఫ్రెండ్స్ తో బర్త్ డే ను సందడిగా జరుపుకున్నారు. ఇన్ స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లను కల్గిన ఆమె ఫొటోలకు లైక్ ల వర్షం కురుస్తోంది.

Saturday, September 26, 2020

Deepika Padukone reaches NCB office to record statement in drugs case

ఎన్సీబీ ఎదుటకు తారాగణం

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారుల ఎదుటకు బాలీవుడ్ తారాగణం ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. శనివారం ఉదయం ముంబయిలోని ఎన్సీబీ కార్యాలయం తారామణుల రాకతో సందడి సంతరించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి (ఆత్మహత్య) కేసు విచారణలో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం విదితమే. దాంతో ఎన్సీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్‌ రియా చక్రబర్తితో పాటు పలువురికి డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నాయని తేలింది. దాంతో కేంద్ర నిఘా విభాగాల చొరవతో లోతైన విచారణకు తెరలేచింది. రియాను సుదీర్ఘంగా విచారించిన మీదట పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీపికాతో  పాటు ప్రముఖ నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లతో పాటు ఈ కేసులో సంబంధమున్న వాళ్లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. విచారణకు సెప్టెంబర్ 25, 26 (శుక్ర, శనివారాలు)తేదీల్లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. అందులో భాగంగా దీపికా ఈరోజు అధికారుల ఎదుటకు వచ్చారు. అదే విధంగా మరో నటి సారా అలీ ఖాన్ కూడా ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు.  శుక్రవారమే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ కూడా శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ డ్రగ్స్ కేసులో మరో 39 మంది ప్రముఖ నటుల పేర్లు బయటపడ్డట్లు తెలుస్తోంది.