Tuesday, July 2, 2019

As DMK backtracks congress mulling to send manmohan singh to Rajya Sabha from Rajasthan


రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మన్మోహన్:కాంగ్రెస్ యత్నం
మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన డా.మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపనున్నారు. ఎగువసభలో ఆయన ఇంతవరకు అసోం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. గత నెలలో రాజ్యసభలో ఆయన పదవీ కాలం పూర్తి అయింది. అసోం నుంచి ఆయనను తిరిగి ఎంపిక చేయడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు తగిన సంఖ్యా బలం లేదు. మిత్రపక్షం డీఎంకె చెయ్యిచ్చిన దరిమిలా కాంగ్రెస్ రాజస్థాన్ నుంచి ఆయనను ఎంపిక చేయాలని చూస్తోంది. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. రాజ్యసభలో రాజస్థాన్ నుంచి ఏకైక స్థానం ఖాళీ అయింది. బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ గత నెల24 మరణించడంతో రాజ్యసభ కు ఆ రాష్ట్రం నుంచి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన సాగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకె, కాంగ్రెస్ కూటమి లోక్ సభ కు గణనీయంగా అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగాయి. కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని డీఎంకె ద్వారా ఆశించింది. అయితే తమ కూటమిలోని ఎండీఎంకె అధినేత వి.గోపాలస్వామి (వైగో) కి ఆ స్థానాన్ని ఇవ్వనున్నట్లు తాజాగా డీఎంకె మెలికపెట్టింది. దాంతో మన్మోహన్ సింగ్ ను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా మన్మోహన్ రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెడితే 2024 వరకు సభ్యుడిగా కొనసాగుతారు.

Rain havoc in india`s financial capital Mumbai, 32 dead


ముంబయి మునక:32 మంది మృతి 75 మందికి గాయాలు
భారత వాణిజ్య రాజధాని ముంబయి వరుసగా రెండో రోజూ వరదల తాకిడికి అల్లాడుతోంది. కుంభవృష్టి కారణంగా మహారాష్ట్ర రాజధాని ముంబయి పరిధిలో 32 మంది మృత్యుపాలయ్యారు. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి పరిసర నగరాలు థానె, పుణె కూడా మునకేశాయి. కొంకణ్ ప్రాంతంలో మంగళవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, ఆఫీసుల్ని మూసివేశారు. ఎడతెగని వర్షాల కారణంగా రోడ్డు, రైలు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో(మంగళవారం) పింప్రిపడ ప్రాంతంలో కొండవాలులో నిర్మించిన భవనం ప్రహారీ కూలి 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్), ముంబయి అగ్నిమాపక సిబ్బంది శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. గడిచిన 12 గంటల్లో 300-400 మి.మి. వర్షపాతం నమోదైనట్లు సీఎం దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మలద్ సబ్ వేలో సోమవారం రాత్రి వరద నీటిలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాల్ని మంగళవారం కనుగొన్నారు. థానె జిల్లాలోని కల్యాణ్ పట్టణంలో జాతీయ ఉర్దూ పాఠశాల భవనం గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. జవహర్ నదీ ప్రవాహంలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు సమాచారం. ముంపునకు గురైన ఈశాన్య ముంబయి కుర్లా లోని క్రాంతినగర్ మురికివాడలో నేవీ బృందం లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లతో రక్షణ చర్యలు చేపట్టింది. ముంబయి పరిధిలోని రాయ్ గఢ్, థానె, పాల్ఘర్ జిల్లాల్లో నడుం లోతు వరద ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమయింది. దాదాపు 150 బ్రిహన్ ముంబయి రవాణా(విద్యుత్) బస్సులు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ మధ్యాహ్నం ఎడతెగని వాన తెరపి ఇవ్వడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి కూరగాయలు, పాలు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. భారత వాతావరణ శాఖ(ఐఎండి) హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని తెలియడంతో జనం భీతిల్లుతున్నారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గడంతో ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ విమానాశ్రయానికి రావాల్సిన 55 విమానాల్ని దారి మళ్లించారు. ఇందులో 26 అంతర్జాతీయ విమానాలున్నాయి. ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన 4 అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం 18 విమానాల్ని రద్దు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అంధేరి, జోగేశ్వరి, విలేపార్లే, దహిసర్ ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగి ఉండడంతో రోడ్డు మార్గం లో ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముంబయి-థానె మార్గంలో ట్రాక్ లన్నీ నీట మునగడంతో సెంట్రల్ రైల్వే పలు రైళ్లను దారి మళ్లించింది. పశ్చిమ రైల్వే జోన్ కు చెందిన రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి థానె మార్గంలో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. జులై 3,4 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ వర్గాలు హెచ్చరిక జారీ చేశాయి.

Monday, July 1, 2019

Srilanka great win against Westindies in a exciting match in ICC cup

పరుగుల పంటలో శ్రీలంకదే గెలుపు:23 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి
ఐసీసీ వరల్డ్ కప్ లో ఓ అద్భుతమైన మ్యాచ్ లో చివరకు శ్రీలంకనే విజయం వరించింది. 12వ వరల్డ్ కప్ లో సోమవారం చెస్టరీలీ స్ట్రీట్ రివర్ సైడ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ నం.39 లో వెస్టిండీస్ నువ్వానేనా అని తలపడగా శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలుపునందుకుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 338 భారీ పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యువ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవిష్క ఫెర్నాండో (104) సెంచరీతో జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. 339 పరుగుల ఛేదనకు దిగిన వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్(118) అండతో దీటుగా బదులివ్వడంతో ఆ జట్టు దాదాపు విజయపుటంచుల వరకు వచ్చింది. మొదటి, చివరి వరుస బ్యాట్స్ మెన్ అండ లేకపోవడంతో పూరన్ సెంచరీ వృథా అయింది. ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(35) స్థాయికి దగ్గ ప్రదర్శన కనబర్చలేదు. మరో ఓపెనర్ సునీల్ అంబ్రిస్(5), కీపర్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్(5) వెంటవెంటనే వెనుదిరిగారు. మరో హిట్టర్ షిమ్రాన్ హెట్మయర్ (29) రనౌట్ గా పెవిలియన్ బాటపట్టాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్(26), కివీస్ పై అద్భుత సెంచరీ చేసిన కార్లోస్ బ్రాథ్ వెయిట్(8 రనౌట్) త్వరగా అవుటయ్యారు. పూరన్ కు ఫాబియన్ అలెన్(51) హాఫ్ సెంచరీతో తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడం ఆరుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు అందుకోలేక పోవడంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్టార్ స్ట్రయిక్ బౌలర్ లసిత్ మలింగా ఈ మ్యాచ్ లోనూ 3 వికెట్లు తీసుకుని ప్రతిభ కనబర్చాడు. కసున్ రజిత, జెఫ్రె వండర్సే, యాంజిలో మాథ్యూస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 ఓవర్లలో 93 పరుగులు జత చేశారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే(32) ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో కీపర్ హోప్ కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ కుశాల్ పెరీరా(64), అవిష్క ఫెర్నాండో(104) మెరిశారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కుశాల్ మెండిస్(39), యాంజిలో మాథ్యూస్(26), లహిరు తిరుమనే(45) రాణించడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు, షెల్డన్ కోట్రెల్, ఒషానే థామస్, ఫాబియన్ అలెన్ తలో 1 వికెట్ పడగొట్టారు.



RSS chief Mohan Bhagwat, six top sangh leaders join Twitter


ట్విటర్ ఖాతా తెరవగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ కు 10 లక్షల పాలోవర్లు
లోకమంతా ట్విటర్ బాటను నడుస్తుంటే మేమెందుకు పోరాదనుకున్నారో ఏమో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) అధినేత మోహన్ భగవత్ కూడా ట్విటర్ ఖాతా తెరిచారు. సోమవారం ఆయనతో పాటు సంఘ్ కు చెందిన పదాధికారులు పలువురు ట్విటర్ బాట పట్టారు. సంఘ్ ప్రధానకార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, సంయుక్త కార్యదర్శి సురేశ్ సోని తదితర ఆరుగురు పదాధికారులు ట్విటర్ అకౌంట్లు తెరిచారు. సంఘ్ కు సంబంధించిన ప్రకటనలు విడుదల చేయడానికే ఆయన ట్విటర్ ఖాతా తెరిచారు.  @DrMohanBhagwat  పేరిట గల తన ట్విటర్ అకౌంట్ మనుగడలోకి వచ్చిందో లేదోనని భగవత్ ఓసారి తనిఖీ చేసి చూసుకున్నారు. అయితే ఆయన ఇంకా ట్వీట్ ఏదీ  చేయలేదు. ఆయన ఇంతవరకు ఒక్క ట్వీట్ చేయకున్నా 10 లక్షల 30 వేల మంది ఫాలోవర్లు వచ్చి చేరడమే విశేషం.