Sunday, June 23, 2019

Pakistan shows ability by 49 runs win over south africa in world cup


జట్టుగా రాణించి సఫారీలపై గెలిచిన పాకిస్థాన్
ఇంటా బయట విమర్శల జడివానలో తడిసిముద్దయిన పాకిస్థాన్ బుద్ధి తెచ్చుకుని జట్టుగా రాణించి దక్షిణాఫ్రికాపై ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్-12 లండన్ లార్డ్స్ మైదానంలో ఆదివారం మ్యాచ్ నం.30లో దక్షిణాఫ్రికా జట్టుపై 49 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో సఫారీలు చతికిలబడి టోర్నీ నుంచే నిష్క్రమించారు. 2003 తర్వాత ద.ఆఫ్రికా నాకౌట్ దశకు చేరలేకపోవడం ఇదే తొలిసారి. 309 పరుగుల లక్ష్య ఛేదనకు ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు ఓపెనర్ హషీమ్ అమ్లా(2) త్వరగా అవుటవ్వడంతో తొలి దెబ్బ తగిలింది. మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీకాక్(47), కెప్టెన్ వన్డౌన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(63), రాసీవాన్డెర్ డస్సన్(36), అండైల్ ఫెహ్లుక్వాయొ(46) మాత్రమే రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 259 పరుగులు మాత్రమే చేయగల్గింది. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్, షాదబ్ ఖాన్ చెరో 3 వికెట్లు, స్టార్ పేసర్ మహ్మద్ అమిర్ 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్ చెరో 44 పరుగులు చేశారు. తొలి వికెట్ కు 14.5 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. ఫకర్ జమాన్ తర్వాత రెండో వికెట్ గా ఇమామ్ ఉల్ హక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో నెంబర్ బ్యాటర్ బాబర్ అజం(69), మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హరిస్ సోహాయిల్(89) జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు. సఫారీల స్టార్ స్ట్రయిక్ బౌలర్ కగిసొ రబాడ ఈ మ్యాచ్ లోనూ నిరాశ పరిచాడు. 65 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. మరో వైపు నిగిడి 64 పరుగులచ్చినా 3 వికెట్లు తీశాడు. టాప్ స్పినర్ ఇమ్రాన్ తాహిర్ 41 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. క్వాయో, మార్క్రమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో పాక్ సెమీస్ అవకాశాల మాటెలా ఉన్నా స్వదేశానికి సురక్షితంగా ఆ జట్టు ఆటగాళ్లు చేరుకోవడానికి మార్గం సుగమం కానుంది.

Cop burns alive as car catches fire after collision


కూతురు నిశ్చితార్థానికి వస్తుండగా కారు ప్రమాదం: ఎస్.ఐ. సజీవదహనం

విధులు ముగించుకుని కూతురు వివాహ నిశ్చితార్థానికి బయలుదేరిన ఓ ఎస్.ఐ. కారు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా లీమా చౌహాన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా పనిచేస్తున్న అశోక్ తివారీ ఆదివారం ఈ ఘోర ప్రమాదంలో మృత్యు ఒడికి చేరారు. అలహాబాద్ నుంచి కారులో బయలుదేరిన ఆయన భోపాల్ మీదుగా ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతున్న ఆనందంలో ఉన్న ఆయనను దుర్ఘటన బలి తీసుకుంది. రాజ్ గఢ్ జిల్లా పాన్ వాడి గ్రామ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారులో మంటలు వ్యాపించాయి. కారుతో పాటు ఎస్.ఐ.ను మంటలు చుట్టుముట్టడంతో మృతి చెందారు. ట్రక్కు ఢీకొన్న క్రమంలోనే కారులో మంటలు ప్రజ్వరిల్లినట్లు ఎస్.డి.ఒ.పి (సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్) నాగేంద్ర సింగ్ బియాస్ తెలిపారు.

Six Indians arrested for smuggling gold in Sri Lanka



కొలంబోలో బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఆరుగురి అరెస్ట్
శ్రీలంక రాజధాని కొలంబోలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్టయ్యారు. వీరంతా భారత్ కు చెందిన వారని సమాచారం. ఆదివారం బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీల్లో వీరు పట్టబడ్డారు. నిందితులు తమ బ్యాగులు, ప్యాంటుల్లో బంగారు బిస్కెట్లు దాచి ఉంచడం సోదాల్లో బట్టబయలయింది. వీటి విలువ రూ.30 లక్షలుంటుందని అంచనా. నిందితులందరూ 36-53 వయసు లోపు వారని డెయిలీ మిర్రర్ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ దందాపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సునీల్ జయరత్నే తెలిపారు.



Saturday, June 22, 2019

tough fight goes between westindies and newzealand in icc world cup match

ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై న్యూజిలాండ్ గెలుపు
వెస్టిండిస్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రపంచ క్రికెట్ అభిమానులు మరోసారి కళ్లారా వీక్షించారు. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓడినా వెస్టిండిస్ బ్యాటింగ్ ను ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. తొలుత గేల్ చెలరేగితే ఆ తర్వాత కార్లస్ బ్రాత్ వెయిట్ విజృంభించిన తీరు క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది. వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.29 మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను వెస్టిండిస్ దాదాపు ఓడించినంత పని చేసింది. వెస్టిండిస్ టాస్ గెలిచి న్యూజిలాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు పోగొట్టుకుని 291 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(148) టోర్నీలో వరుసగా రెండో సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండిస్ 292 పరుగుల లక్ష్య ఛేదనకు ఏమాత్రం వెరవలేదు. చాన్నాళ్లకు ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 6 సిక్సర్లు, 8 బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 84 బంతుల్లోనే 87 పరుగులు చేసి అయిదో వికెట్ గా ఔటయ్యాడు. మరో ఓపెనర్ కీపర్ షాయ్ హోప్(1), నికోలస్ పూరన్(1) ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ జాసన్ హోల్డర్(0) మరోసారి నిరాశ పరిచినా ఆ తర్వాత షిమ్రాన్ హెట్మయర్(54), కార్లోస్ బ్రాత్ వెయిట్(101) ఇన్నింగ్స్ ను నిర్మించిన తీరు అపురూపమనే చెప్పాలి. ముఖ్యంగా బ్రాత్ వెయిట్ 82 బంతుల్లోనే 5 సిక్సర్లు, 9 బౌండరీలతో సెంచరీ కొట్టాడు. సిక్సర్లు, బౌండరీలతోనే వెయిట్ 66 పరుగుల సాధించాడంటేనే అతని విజృంభణ ఏస్థాయిలో ఉందో చెప్పొచ్చు. చివర్లో 7 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో అందరూ వెస్టిండిస్ గెలుస్తుందనే అనుకున్నారు. ఒకే ఒక వికెట్ మిగిలి ఉన్నదశలో వెయిట్ భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. నీషం బౌలింగ్ లో బౌల్ట్ క్యాచ్ పట్టగా వెయిట్ వెనుదిరగడంతో వెస్టిండిస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు 4 వికెట్లు, లొకీ ఫెర్గుసన్ కు 3 వికెట్లు లభించగా మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, కోలిన్డె గ్రాండ్ హోమ్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(0), కోలిన్ మన్రో(0) డకౌట్లుగా వెనుదిరిగారు. అప్పుడు క్రీజ్ లో కొచ్చిన కెప్టెన్ విలియమ్సన్ జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచి భారీ స్కోరుకు తోడ్పడ్డాడు. అతనికి రాస్ టేలర్(69) అండగా నిలవగా నీషమ్ (28) చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. వెస్టిండిస్ బౌలర్లలో షెల్డన్ కోట్రెల్ 4 వికెట్లు, కార్లోస్ బ్రాత్ వెయిట్ 2 వికెట్లు పడగొట్టారు.