Monday, April 22, 2019

sri lanka receives brand new type of terrorism bombings death toll raises to 290 hurted 500 people


శ్రీలంకలో కొత్త తరహా ఉగ్రవాదం 


  • 290కు పెరిగిన మృతుల సంఖ్య 
  • 500 మందికి గాయాలు

శ్రీలంకలో దశాబ్దం తర్వాత భారీ సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. జాతుల సమరంలో నిత్యం రక్తమోడిన దేశం పదేళ్లుగా దాదాపు ప్రశాంతంగా ఉంది. ఆదివారం (ఏప్రిల్21) మళ్లీ రక్త చరిత్ర ప్రపంచం ముందు సాక్షాత్కారమయింది. పర్యాటక ప్రాంతాలు, విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు తాజా బాంబు పేలుళ్లకు తెగబడిన నేపథ్యంలో మృతుల సంఖ్య 290కు పెరగింది. అంతకు దాదాపు రెట్టింపు సంఖ్యలో 500 మందికి పైబడి క్షతగాత్రులయ్యారు. ఆదివారం ఉదయం నుంచి చర్చిలు, స్టార్ హోటళ్లు ఎనిమిది చోట్ల ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు బరితెగించింది. దాంతో దేశంలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. విమాన, రైలు, బస్ తదితర అన్ని రవాణా వ్యవస్థల్ని నిలిపివేసింది. దేశం నలుమూలలా ముమ్మర గాలింపు చేపట్టింది. అనుమానితులు 24 మందిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాజధాని కొలంబోలోని బండారు నాయకే విమానాశ్రయంలో ఓ బాంబు పేలకుండా భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. మొత్తంగా తొమ్మిది చోట్ల బాంబు(ఐ.ఇ.డి)లు ఉగ్రవాదులు అమర్చగా ఆఖరి బాంబును పేలకుండా నిర్వీర్యం చేసినట్లు సమాచారం. మొహ్మద్ సాహారన్ నాయకత్వంలోని జాతీయ తవాహిద్ జమాన్(ఎన్ టీ జే) ఉగ్రవాద సంస్థ నుంచి ముప్పున్నట్లు నిఘా వర్గాలు ముందుగానే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ముందుగానే ఉప్పందినా ప్రభుత్వ ఉదాసీనత కారణంగా శ్రీలంక భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.
భారత్ లో హైఅలర్ట్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఓ వైపు జరుగుతుండగా శ్రీలంక లో ఉగ్రవాదులు చెలరేగిపోయిన నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఉగ్రవాదుల ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో సుమారు ఏడుగురు భారతీయులు చనిపోయినట్లు రాయబార కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని విక్రమ్ సింఘేలతో ఫోన్ లో మాట్లాడారు. బాంబు దాడుల్ని తీవ్రంగా ఖండించి శ్రీలంక కు అవసరమైన సాయాన్ని అందించడానికి ముందుంటామని హామీ ఇచ్చారు. దాడులు ఆటవిక చర్యగా అభివర్ణించిన ప్రధాని మోదీ ఇవి ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన పేలుళ్లగా పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుగా చెప్పారు. ఇది ఓ దేశానికో ప్రాంతానికో కాక యావత్ ప్రపంచానికి సంబంధించిన పెను సమస్యని మోదీ పేర్కొన్నారు. శ్రీలంక-భారత మధ్య దూరం కేవలం 18 కి.మీ ఉండడంతో తమిళనాడు తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

No comments:

Post a Comment