Wednesday, March 9, 2022

CM KCR announces mega recruitment process for 91,142 jobs

కేసీఆర్.. సూపర్ హిట్

* అసెంబ్లీలో జాబ్స్ బాంబ్

* ప్రభుత్వ మెగా జాబ్ మేళా ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అదరగొట్టారు. సుమారు లక్ష ఉద్యోగాల భర్తీ ప్రకటనతో సూపర్ హిట్ కొట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాక యావత్ దేశం దృష్టిని ఆయన అలవోకగా సాధించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకి, అటు కేంద్రంలో మోదీ సర్కారుకి నోటమాట రానట్లుగా జాబ్ బాంబ్ పేల్చారు. బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ ఏకబిగిన గంట సేపు గుక్కతిప్పుకోకుండా మాట్లాడారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న మొత్తం 91142 ఉద్యోగాల్ని ఈరోజే నోటిఫై చేస్తున్నామన్నారు. తక్షణం 80039 నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు సభ్యుల చప్పట్ల మధ్య ఘనంగా ప్రకటించారు. అదేవిధంగా 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తున్నామన్నారు. ఇకపై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ప్రతి ఏడాది ఉద్యోగ భర్తీ కేలండర్ విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్క హోంశాఖలోనే 18334 ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అలాగే విద్యాశాఖలో 20వేల పైచిలుకు పోస్టుల నియామకం చేపట్టనున్నట్లు చెప్పారు. వైద్యశాఖలో 12,755, బీసీ సంక్షేమశాఖ 4311, రెవెన్యూశాఖ 3560, ట్రైబల్ వెల్ఫేర్ 2399 పోస్టులు భర్తీ చేయనున్నారు.  ఈ పోస్టుల్లో 95శాతం స్థానికులకు రిజర్వేషన్ ఉంటుందని మిగిలిన 5 శాతం ఓపెన్ కేటగిరీ భర్తీ చేస్తామని సీఎం సగర్వంగా ప్రకటించారు.  తెలంగాణలో 11 ఏళ్ల తర్వాత గ్రూపుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్-1: 503 పోస్టులు, గ్రూప్-2:582 గ్రూప్-3: కింద1373 గ్రూప్-4: 9168 ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు. ఓసీలకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా గరిష్ఠ వయో పరిమితిని ప్రకటించడం విశేషం.

Tuesday, March 8, 2022

CM Jagan introduces mourning resolution for late Gautam Reddy in AP Assembly

గౌతంరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి సంతాపం ప్రకటించింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ గౌతం రెడ్డి హఠాన్మరణం వై.ఎస్.ఆర్.సి.పి కి తమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2010 నుంచి తాము సన్నిహితంగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి అకాల మరణంతో దిగ్ర్భాంతి చెందినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒక సమర్థ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందంటూ బాధపడ్డారు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వారని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సంగం బ్యారేజీకి గౌతం పేరు

సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ సంగం బ్యారేజీకి గౌతంరెడ్డి పేరు పెడతామన్నారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం అని సీఎం చెప్పారు. గౌతం చిరస్థాయిగా జిల్లా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేస్తామన్నారు. మరో ఆరు వారాల్లో పూర్తికానున్నసంగం బ్యారేజీకి `మేకపాటి గౌతం సంగం బ్యారేజీ`గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.

Monday, March 7, 2022

About 700 students are still trapped in Sumi, Ukraine

ఇంకా బంకర్లలోనే కొందరు..

ఉక్రెయిన్ లో ఇంకా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. సుమీ లోగల బంకర్లలో వీరంతా తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్ లో నోఫ్లైజోన్ ఆంక్షలు నేటి నుంచి అమలు కావచ్చని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 700 మంది విద్యార్థులు సుమీలోనే  క‌నీస సౌక‌ర్యాలు లేక అల‌మ‌టిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి ఎదురుచూస్తున్నారు. అయితే రష్యా దాడులు తీవ్రమైన సమయంలో వారంతా ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. తొలుత వీరందర్ని రష్యా మీదుగా భారత్ కు తీసుకురావాలని మన రాయబార కార్యాలయం యత్నించింది. అయితే ప్రస్తుత తరుణంలో ఈ యత్నం ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ విద్యార్థుల్ని పోలెండ్, హంగేరీల మీదుగానే భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, March 4, 2022

CM YSJagan union minister Sekhawat Polavaram visit

కేంద్రమంత్రి పోలవరం సందర్శన

* సీఎం జగన్ తో కలిసి పునరావాస గృహాల పరిశీలన

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్ సందర్శించారు. శుక్రవారం ఉదయం సీఎం జగన్ తో కలిసి ఆయన ఇందుకూరిపేటలోని పునరావాస గృహాల్ని పరిశీలించి అక్కడ సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం అన్ని విధాలా సహకారాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా షెకావత్ హామీ ఇచ్చారు. `పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది.  కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇచ్చిన మాటకు మోదీ సర్కార్‌ కట్టుబడి ఉంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే. ప్రాజెక్టు పనుల పరిశీలనకు మధ్యలో మరోసారి పర్యటిస్తా`అని షెకావత్‌ తెలిపారు. సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం యావత్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఏర్పాటుకు చేయూతనిస్తామని కేంద్రమంత్రి మాట ఇచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పునరావాస పనులపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారుల్ని సీఎం కోరారు.