Wednesday, June 2, 2021

Petrol Diesel rates hike in Telangana

టీఎస్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్

తెలంగాణలో పెట్రోల్ సెంచరీ కొట్టింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పైసలుగా ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు, లీటర్ డీజిల్‌పై 23 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 17 సార్లు పెంచాయి. ఓ వైపు కరోనా లాక్ డౌన్ మరోవైపు ధరాఘాతంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో పాటు వంట నూనె, కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా పెట్రోల్ ధరల సెగ జనాలకు తాకుతోంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూంటాయి. ఈ నేపథ్యంలో పెట్రో ధరలు ఒక రోజు పెరగొచ్చు.. లేదా తగ్గొచ్చు.. స్థిరంగానూ కొనసాగవచ్చు. అందుకే పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Thursday, May 27, 2021

For Rs.18000 man flies single to UAE on 360 seat plane

విమానంలో.. ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు.. ముంబాయి టు దుబాయ్ .. గగనవిహారం.. అదేనండి ప్రయాణం. గల్ఫ్ యువరాజులు, షేక్ లకు తప్పా వేరెవ్వరికీ సాధ్యం కాని ప్రయాణం ఇటీవల అతని సొంతమయింది. కలలో తప్పా సాధ్యం కాని అదృష్టం ఆ యువకుడికి దక్కింది. 360 సీట్ల విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడిగా అతగాడు ప్రయాణించాడు. కరోనా బెడద వల్ల ఈ భాగ్యం అతనికి లభించింది. అదీ కారు చౌకగా.. లక్షలు ఖర్చు పెట్టినా దక్కని ప్రయాణం కేవలం రూ.18 వేల టికెట్ తోనే సాధ్యమయింది. అతని పేరు భవేష్ జవేరి.. వజ్రాల కంపెనీ స్టార్ జెమ్స్ సీఈఓ గా పని చేస్తున్నాడు. బోయింగ్ 777  ఎమిరేట్స్ విమానంలో ఒక ట్రిప్పు ఇంధనం ఖర్చు ఎనిమిది లక్షలు అవుతుందట. కానీ కరోనా నిబంధనల వల్ల జవేరి ఒక్కడే ముంబయి నుంచి బయలుదేరిన విమానంలో అనుభవించు రాజా అని పాడుకుంటూ ఖుషీగా ప్రయాణించాడు. దౌత్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్నవారు, అరబ్ జాతీయులు..అన్ని అనుమతులు ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దాంతో ఆ రోజు ఈ అర్హతలన్నీ ఉన్న ఏకైక ప్రయాణికుడు జవేరీ కావడంతో అతనికే ఆ అవకాశం దొరికింది. దాంతో నచ్చిన సీటులోకి మారుతూ విమాన సిబ్బందితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జవేరీ జాలీగా దుబాయ్ చేరుకున్నాడు.

Wednesday, May 26, 2021

Water From the Sea Enters Residential Areas in Bengal’s East Midnapore Ahead of Cyclone Yaas Landfall

యాస్​ తుపాను అలజడి

బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ అతి తీవ్ర తుపానుగా మారి అలజడి రేపుతోంది​. బుధవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్​ దక్షిణ ప్రాంతం తీరానికి చేరువయినట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. ఉత్తర ధమ్రాదక్షిణ బాలసోర్ (ఒడిశా) మధ్య యాస్​ తీరందాటనుంది. దీని  ప్రభావంతో భద్రక్​ జిల్లాలోని ధమ్రా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అంతేకాకుండా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీళ్లు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నాయి. ఏపీలో కూడా యాస్ తుపాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దుగరాజపట్నం (నెల్లూరు) నుంచి బారువ (శ్రీకాకుళం) వరకు తీరం వెంబడి సముద్రం అలజడిగా ఉంది. సముద్రపు అలలు 2.5 – 5.0 మీటర్ల ఎత్తులో‌ ఎగసి పడుతున్నాయి.  సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మరో రెండ్రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని రాష్ట్ర అధికార వర్గాలు ఆదేశించాయి. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరందాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రానికి చేరుకున్న 15 ఎన్డీఎఫ్ బృందాలు సహాయరక్షణ చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నాయి.

Monday, May 17, 2021

TTD vigilance officers found huge cash from begger`s house in Tirupati

ఈ యాచకుడు లక్షాధికారి!

కరోనాతో చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో బయటపడిన డబ్బుల కట్టలు సంచలనం రేపాయి. సోమవారం తిరుపతిలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విజిలెన్స్ అధికారుల దాడిలో ఈ విషయం వెలుగుచూసింది. తిరుమల స్వామి వారి సన్నిధిలో ఏళ్ల తరబడి భిక్షాటన చేసిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి గతేడాది కరోనాతో చనిపోయాడు. గతంలో ఈ యాచకుడు తిరుమలలోనే గుడిసె వేసుకుని భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేవాడు. అయితే టీటీడీ కొండపై ఈ విధంగా జీవనం సాగిస్తున్న వారినందర్ని తిరుపతికి తరలించి ఇళ్లను నిర్మించి ఇచ్చింది.  ఆ విధంగా రోజువారీ శ్రీనివాసాచారి తిరుమల నుంచి రాత్రికి తిరుపతి చేరుకుని టీటీడీ కేటాయించిన ఇంట్లో నివసించేవాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడని ఇరుగుపొరుగులు తెలిపారు. కరోనాతో చనిపోవడంతో అతనికిచ్చిన ఇంటిని వేరేవారికి కేటాయించేందుకు విజిలెన్స్ తనిఖీ కోసం ఆ ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లిన అధికారులకు  పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపించడంతో అవాక్కయ్యారు. టీటీడీ స్వాధీనం చేసుకున్న ఆ సొమ్ము రూ.10 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.