Friday, January 15, 2021

Rahul Gandhi attends Tamilanadu Jallikattu Celebrations

జల్లికట్టుకు హాజరైన రాహుల్ గాంధీ

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  పొంగల్ వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మదురై సహా ఆయా ప్రాంతాల్లో జోరుగా జల్లికట్టు నిర్వహించారు. అవనియపురంలో వార్షిక జల్లికట్టు (బుల్ టామింగ్) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,  ద్రవిడ మున్నేట్రా కగం (డిఎంకె) యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే ఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణసామి సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతికి మద్దతుగా తను ఇక్కడకి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరుకావడంపై చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడివి అవకాశవాద రాజకీయాలని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధానికి యూపీఏ ప్రభుత్వం కారణమని అవనిపురానికి రావడానికి రాహుల్ కు నైతిక హక్కు లేదు అని విమర్శించారు.

Thursday, January 7, 2021

Cold Waves in Telangana next coming four days

గజగజ వణుకుతున్నతెలంగాణ

శీతల పవనాలకు తోడు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలికి  తెలంగాణ గజ గజ వణుకుతోంది. ఈరోజూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధ,గురువారాల్లో హైదరాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వానలు పడుతున్నాయి.  ద్రోణి కారణంగా తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు పొగమంచు కూడా కమ్మేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం ఆదిలాబాద్‌లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా, కామారెడ్డిలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా సంగారెడ్డి, నిర్మల్, కుమురం భీమ్, వికారాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలు సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

Tuesday, January 5, 2021

7th pay commission according to report central government employees likely to get four percent hike in dearness allowance from January

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2021 కొత్త సంవత్సరంలో ఏడో వేతన చెల్లింపుల సంఘం వారికి ఈ శుభవార్త చెప్పింది. జనవరి నుంచి వారి జీతాల్లో ఈ మేరకు పెంపు ఉండనుంది. జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కరవు భత్యం (డియర్ నెస్ అలవెన్సు-డీఏ) 4 శాతం అదనంగా పొందనున్నట్లు సమాచారం. అదేవిధంగా పెండింగ్ భత్యాలను వారికి సత్వరం పెంచి అందించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. 2020 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ అంశంపై చర్చించింది. జనవరి 2020 నుంచి అదనపు డీఏతోపాటూ, పెన్షనర్లకు ఉపశమన భత్యం (డియర్ నెస్ రిలీఫ్-డీఆర్) ఇచ్చేందుకు అదనపు నిధులను విడుదల చేసే ప్రతిపాదనను ఆమోదించింది. తాజా రిపోర్టుల ప్రకారం ఇప్పుడు బేసిక్ పే/పెన్షన్‌ కి ఇస్తున్న 17 శాతానికి అదనంగా మరో 4 శాతం కలపబోతున్నట్లు సమాచారం. ఈ పెంపు ద్వారా దేశవ్యాప్తంగా 48.34 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది.

Friday, December 25, 2020

Vaikuntha Ekadashi Dwara Darshanam started Tirumala

వైకుంఠాన్ని తలపిస్తున్న

తిరుమల

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం కాగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దాంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖుల్లో నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచినట్లుందన్నారు. 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని తెలిపారు.