Sunday, March 15, 2020

Third Coronavirus death in india 71 year old from maharashtra dead?

మహారాష్ట్రలో మరొకరు బలి?
మహారాష్ట్రలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ మధ్యనే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు సుగర్, బీపీ ఎక్కువకావడంతో ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ వృద్ధుడు కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ కాలేదు. కాగా ఇప్పటికే దేశంలో కరోనా కారణంగా చనిపోయిన ఇద్దరూ వృద్ధులే కావడం గమనార్హం. దేశంలో తొలి కరోనా మృతి కర్ణాటకలో సంభవించగా రెండో కేసు ఢిల్లీలో నమోదయింది. చనిపోయిన స్త్రీ,పురుషులిద్దరూ 65 ఏళ్లు పైబడినవారే.  మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి శనివారం మధ్యాహ్నం చనిపోయారు. బుల్దానా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఢిల్లీలో 69 ఏళ్ల కరోనా బాధితురాలు మృతి చెందింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ  ప్రకటించింది. ఢిల్లీలోని రామ్‌మనో‌హర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడయింది. అయితే ఆమెకూ బీపీ, సుగర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడి వల్లే ఆమెకు కరోనా వైరస్ సోకింది.  ఆ వృద్ధురాలి కుమారుడు విదేశాల్లో పర్యటించి వచ్చినట్లు సమాచారం.

Friday, March 13, 2020

Hyderabad techie safely came back from corona

కరోనా నుంచి తప్పించుకున్న హైదరాబాద్ వాసి
హైదరాబాద్ మహేంద్ర హిల్స్ కు చెందిన టెకీ సురక్షితంగా కోవిడ్-19 (కరోనా వైరస్) బారి నుంచి బయటపడ్డాడు. శుక్రవారం `గాంధీ ఆసుపత్రి` సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. బెంగళూరులో పనిచేస్తున్న టెకీ గత నెలలో దుబాయ్ కి వెళ్లి తిరిగివస్తూ కరోనాకు చిక్కాడు. ఈనెల 1న బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న టెకీకి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి `గాంధీ` వైద్యులు కంటికి రెప్పలా అతణ్ని కాపాడారు. మెరుగైన చికిత్స అందిస్తూ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈనెల 9న మళ్లీ అతనికి పరీక్షలు నిర్వహించగా ఆ రిపోర్టు ఈరోజు అందింది. అందులో అతనికి కరోనా నెగిటివ్ అని రావడంతో వైద్యులు సహా నగర వాసులు ఊపిరిపీల్చుకున్నారు. టెకీని ఇంటికి తరలించారు. అయితే కొంతకాలం అతను జనజీవన స్రవంతిలోకి రాకపోవడమే మంచిదని శ్రవణ్ కుమార్ కోరారు. ఒకసారి కరోనా సోకి చికిత్స పొందిన తర్వాత మళ్లీ ఆ వ్యాధి సంక్రమించే ప్రమాదం తక్కువన్నారు. అయినా కొంతకాలం ఇంట్లో సైతం అతను విడిగా ఉండడం మంచిదని చెప్పారు. ఎబోలా, నిఫా, స్వైన్ ఫ్లూ తదితర వైరస్ లు ప్రబలినప్పుడూ `గాంధీ` వైద్యులు ధైర్యంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ శ్రవణ్ కుమార్ తాజాగా కరోనా విషయంలోనూ అదే స్ఫూర్తితో సమర్ధంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. దాంతో హైదరాబాద్ లో ఏకైక కరోనా పీడితుణ్ని `గాంధీ` వైద్యులు కాపాడినట్లయింది.

Tuesday, March 10, 2020

Australian PM Morrison greets Indian diaspora on Holi

కరోనాను ఖాతరు చేయని హోలీ హేల
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గుబులు పుట్టిస్తున్నా భారత సంప్రదాయ హోలీ సంబరం యథావిధిగా కొనసాగింది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జనం రంగుల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరంగా గడిపారు. ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నా ప్రజలు లెక్కచేయకుండా హోలీ ఆడారు. గువాహటి, లక్నోల్లో రంగుల వేడుక ఘనంగా కొనసాగింది. ప్రవాస భారతీయులు ఆయా దేశాల్లో హోలీ జరుపుకున్నారు. అయితే క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈసారి కలర్ ఫెస్టివల్ ఊపు మాత్రం చాలా వరకు తగ్గినట్లే కనిపించింది. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఎన్.ఆర్.ఐ.లకు హోలీ శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా సమాజానికి హిందూ విశ్వాసాలు ఎంతో ముఖ్యం అనే విషయాన్ని ఈ హోలీ వేడుక సూచిస్తుందని ఆయన అన్నారు. `రంగుల పండుగను ప్రతి ఒక్కరూ ప్రేమ, ఆనందం, శాంతి, సమాజ శ్రేయస్సు దృష్ట్యా అమిత సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ హోలీ శుభాకాంక్షలు` అని మోరిసన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

Monday, March 9, 2020

TTD Official key suggestions to devotees who came tirumala due to coronavirus Effect

తిరుమల శ్రీవారిని వీడని కరోనా
జలుబు, దగ్గు, జ్వరం ఉన్నాయా? అయితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దివ్య దర్శనానికి నోచుకోలేనట్లే లెక్క. సోమవారం ఈమేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కొండకు నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా) వైరస్ అల్లాడిస్తోంది.  ఈ నేపథ్యంలో కొండకు వచ్చిన భక్తులు ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూంటే వారిని స్వామి వారి దర్శనానికి అనుమతించరాదని నిర్ణయించారు. సత్వరం ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న భక్తులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని పాలకమండలి పేర్కొంది. అదేవిధంగా తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ముందు జాగ్రత్తగా మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందరూ చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి చాకచక్యంగా తప్పించుకునేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. హోలీ వేడుకలకు కూడా దూరంగా ఉండాలని కోరుతోంది. ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. పదుల సంఖ్యలో జనం గుమిగూడ వద్దని కూడా సలహా ఇచ్చారు. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అందుకే టీటీడీ అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైరస్ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇదిలావుంటే తాజాగా కరోనా వైరస్ బాధిత దేశాల సంఖ్య 102కు చేరింది. ఇరాన్ లో ఆదివారం ఒక్కరోజే 49 మంది మృత్యువాత పడ్డారు. చైనా, దక్షిణకొరియా, ఇటలీ, తర్వాత ఇప్పుడు ఇరాన్ ను కరోనా కుదిపేస్తోంది.