Monday, February 3, 2020

Konaseema Villagers in grip of fear as gas leakage from Rig at Uppudi

గ్యాస్ లీకేజీతో ఉప్పూడిలో జనం గడగడ
ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పూడి గ్రామం గ్యాస్ లీకేజీ కారణంగా వణికిపోతోంది. కాట్రేనికోన మండలం లో గల ఈ గ్రామంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒ.ఎన్.జి.సి. గ్యాస్ పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహిస్తుండగా లీకేజీ సంభవించింది. 10 ఏళ్ల క్రితం ఒ.ఎన్.జి.సి. సంస్థ ఇక్కడ రిగ్ తవ్వింది. అయితే గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో 2016లో దీన్ని మూసివేశారు. సంస్థ ఇలా ఈ ప్రాంతంలో మూసివేసిన పలు రిగ్గుల నిర్వహణ బాధ్యతల్ని పి.ఎఫ్.హెచ్ అనే ప్రయివేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఉప్పూడి రిగ్ వద్ద నిపుణులు లేకుండా నిర్వహణ పనులు చేపట్టడంతో అకస్మాతుగా గ్యాస్ ఎగజిమ్ముతోంది. భారీ శబ్దాలతో గ్యాస్ వెలువడుతుండడంతో ఘటనా స్థలంలో ముగ్గురు గాయాలపాలయ్యారు. వీరికి సమీప ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మిగిలిన సిబ్బంది గ్రామస్థుల్ని హెచ్చరించడంతో వారంతా అక్కడ నుంచి తరలిపోయారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తం విద్యుత్‌ సరఫరా తో పాటు సెల్ టవర్ సిగ్నల్స్ నిలిపివేశారు. గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు నరసాపురం, రాజమండ్రి, తాటిపాక, విశాఖపట్నం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను అధికారులు రప్పిస్తున్నారు. లీకేజీ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితోపాటు ఒ.ఎన్.జి.సి. అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉప్పూడితోపాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. అగ్నిమాపక శకటాల్ని రప్పించి తీవ్ర ఒత్తిడితో లీక్‌ అవుతున్న గ్యాస్‌ను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ బావి వద్ద మరమ్మత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చమురు, సహజ వాయువుల వెలికితీతలో చోటు చేసుకుంటున్న గ్యాస్‌ లీకేజీలు, విస్ఫోటనాలు కోనసీమ వాసుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఏ క్షణానికి ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. గ్యాస్ లీకయిన ప్రాంతాన్ని మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం పరిశీలించారు. విశ్వరూప్ మీడియాతో మాట్లాడుతూ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఒ.ఎన్.జి.సి. అధికారులు ప్రమాద నివారణకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. లీకవుతున్న ఈ గ్యాస్‌ ఫైర్‌ అయ్యే అవకాశం లేదని జనం భయపడొద్దని  ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ధైర్యం చెప్పారు.

Saturday, February 1, 2020

Nirmala Sitaraman follows the same sentiment in 2020 Budget

సెంటిమెంటును కొనసాగించిన ఆర్థికమంత్రి సీతారామన్
బడ్జెట్-2020 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతేడాది సెంటిమెంట్ ను కొనసాగించారు. 2020-21 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి శనివారం ఆమె పార్లమెంట్ కు చేరుకునే ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. అనంతరం సీతారామన్ లోక్ సభ కు విచ్చేశారు. క్రితంసారి మాదిరిగానే ఆమె ఎర్రటి వస్త్రాల్లో చుట్టిన బడ్జెట్ ప్రతుల్ని తీసుకుని వచ్చారు. గతేడాది ఆమె ఎర్ర చీరను ధరించగా ఈసారి పసుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె కశ్మీరీ కవి దీనానాథ్ కౌల్ రాసిన కవితను చదవి వినిపించారు. నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం.. మానవత్వం.. దయతో కూడిన సమాజం అవసరం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిదిఅంటూ ఆ కవితకు అర్థాన్ని ఆర్థికమంత్రి వివరించారు. తమ బడ్జెట్ దేశ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని చెప్పడానికే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా ఆమె తమిళంలో చెప్పిన కథ ను మరోసారి గుర్తు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ప్రతుల బండిళ్లను ప్రత్యేక వాహనంలో పార్లమెంట్ కు తరలించారు. పార్లమెంట్ ఆవరణలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్‌జీ టీం బడ్జెట్ ప్రతుల భద్రతను పర్యవేక్షించారు.

Friday, January 31, 2020

India won again in the nail biting T-20 fight

కివీస్ కు మళ్లీ భంగపాటు: సూపర్ ఓవర్లో భారత్ కు మరో గెలుపు
సూపర్ ఓవర్ ఫోబియా కివీస్ ను వదల్లేదు. స్వదేశంలో భారత్ తో జరుగుతున్న టీ20 సీరిస్ నాల్గోమ్యాచ్ లోనూ ఓటమి పాలయింది. వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం కొనసాగించింది. హమిల్టన్ లో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపు దశ నుంచి ఓటమి అంచులకు జారిపోయి సీరిస్ ను 3-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించినట్లు ఆ జట్టుకు సూపర్ ఓవర్ అచ్చి రాలేదు. బుధవారం ఓటమి పాలయిన జట్టు శుక్రవారం వరుసగా రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ లో భారత్ కు తలవంచింది. క్రితం మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన రోహిత్, జడేజా, షమి  లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇచ్చారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన నాల్గో టీ20 ఫలితం తేల్చే సూపర్ ఓవర్ లో బూమ్రా బంతితో కట్టడి చేస్తే రాహుల్ బ్యాట్ తో విజయాన్ని నిర్దేశించారు. మ్యాచ్ ఆద్యంతం భారత్ చెత్త ఫీల్డింగ్ చేసినా కివీస్ విజయతీరానికి చేరలేకపోయింది. సూపర్ ఓవర్లో సీఫెర్ట్, మన్రోలు బ్యాటింగ్ కు దిగారు. బూమ్రా విసిరిన తొలి రెండు బంతుల్లో సీఫెర్ట్ ఇచ్చిన క్యాచ్ ల్ని అయ్యర్, రాహుల్  అందుకోలేకపోయారు. బూమ్రా ఈ ఓవర్లో ఓ వికెట్ తీసి 13 పరుగులిచ్చాడు. ఇందులో రెండు బౌండరీలుండగా మెన్ఇన్ బ్లూ రెండు క్యాచ్ లు జారవిడిచారు. అనంతరం ఓపెనర్ రాహుల్ తో కెప్టెన్ కోహ్లీ 14 పరుగుల లక్ష్య ఛేదనకు క్రీజ్ లోకి వచ్చారు. రాహుల్ తొలిబంతికే సిక్స్, తర్వాత బంతికి బౌండరీ బాదాడు. అదే ఊపులో భారీ షాట్ కు యత్నించి అవుటయ్యాడు. కెప్టెన్ కోహ్లీకి సంజూశ్యాంసన్ జతకలిశాడు. కోహ్లీ సూపర్ ఓవర్ 4,5 బంతుల్లో వరుసగా డబుల్, ఫోర్ (2, 4) కొట్టి ఇంకో బంతి మిగిలివుండగానే భారత్ ను గెలిపించాడు. తొలుత టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. మనీష్ పాండే 50(36), రాహుల్ 39(26) రాణించారు. 166 పరుగుల ఛేదనకు దిగిన కివీస్ పటిష్టమైన స్థితి నుంచి తడబడి చివర్లో 165/7 పరుగుల వద్ద చేతులెత్తేయడంతో మ్యాచ్ టై అయింది. మన్రో 67(47), సీఫెర్ట్ 57(39) అర్ధ సెంచరీలు సాధించారు. శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్అవార్డు దక్కింది.

Thursday, January 30, 2020

SC Stays Proceedings Initiated By Woman Claiming To Be Daughter Of Singer Anuradha Paudwal

అనురాధ పౌద్వాల్ కు సుప్రీంలో ఊరట
ప్రముఖ గాయని అనురాధ పౌద్వాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ 45ఏళ్ల మహిళ ఆమె కుమార్తె నని చెప్పుకుంటూ రూ .50 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మహిళ ఫిర్యాదు మేరకు తిరువనంతపురం(కేరళ) ఫ్యామిలీ కోర్టులో అనురాధ పౌద్వాల్ పై కేసు విచారణ ప్రారంభమయింది. అయితే పౌద్వాల్ అభ్యర్థన పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసుపై గురువారం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బొబ్డే నేతృత్వంలోని జస్టిస్ గవై, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి సదరు మహిళకు నోటీసు జారీ చేసింది. ఈ కేసును తిరువనంతపురం కోర్టు నుంచి ముంబై కోర్టుకి బదిలీ చేయాలని కోరుతూ పౌద్వాల్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు ధర్మాసనం ఆ మహిళకు తాజాగా నోటీసు ఇచ్చింది. పౌద్వాల్ పద్మశ్రీ పురస్కారంతో పాటు జాతీయ ఉత్తమగాయనిగా పలు అవార్డులు అందుకున్నారు. ఆమె సంగీత స్వరకర్త అరుణ్ పౌద్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పౌద్వాలే తన తల్లి అంటూ సదరు మహిళ కేరళ ఫ్యామిలీ కోర్టుకెక్కారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు జనవరి 27న పౌద్వాల్ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరుకావాలని ఆదేశించింది. దాంతో పౌద్వాల్ ముంబై కోర్టుకు కేసు బదిలీ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.