Wednesday, September 11, 2019

BJP protest against Mamata govt over power tariff hike in Kolkata


పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపు సెగ

పశ్చిమబెంగాల్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బుధవారం తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రోడ్డెక్కారు. రాజధాని కోల్ కతాలోని సెంట్రల్ అవెన్యూ, ఎస్పానాడే తదితర ప్రధాన కూడళ్లలో చొచ్చుకువస్తున్న బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు జల పిరంగులు (వాటర్ కెనాన్) వినియోగించాల్సి వచ్చింది. పోలీసుల వలయాన్ని తప్పించుకుని ముందుకు చొచ్చుకువచ్చే క్రమంలో అయిదుగురు కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని కోలకతా మెడికల్ కాలేజీ, విషుదానంద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజు బెనర్జీ, సయాతన్ బసు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు దేబ్జిత్ సర్కార్ సహా వందమంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్న తరుణంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమౌతోంది. ఈ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఉద్యమాన్ని బీజేపీ ఓ అస్త్రంగా మలుచుకుని మమతా సర్కార్ పై ఎదురుదాడికి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలకు విద్యుత్  నిత్యావసర  సాధనం కావడంతో అదే ప్రధాన అజెండాగా వారితో మమేకం అయ్యేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 18 ఎంపీ సీట్లను గెలుచుకుని ఊపుమీద కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అసంబద్ధ విద్యుత్ విధానం అమలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ (సీఈఎస్సీ) యూనిట్ విద్యుత్ రూ.4.26కు కొనుగోలు చేసి వినియోగదారుల నుంచి రూ.7.33 (తొలి 100 యూనిట్లు) చొప్పున ఛార్జీలు వసూలు చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లయితే వినియోగదారులు తమకు ఆమోదయోగ్యమైన ధరకు విద్యుత్ ను పొందగల్గుతారని ఆ పార్టీ మమతా సర్కార్ కు సూచిస్తోంది.

Tuesday, September 10, 2019

Free helmets to offenders, roses for law-abiding persons


భువనేశ్వర్ లో వాహనచోదకులకు ఉచితంగా శిరస్త్రాణాలు
భువనేశ్వర్ పరిసరాల్లోని కొత్త మోటారు వాహనాల చట్టంపై పోలీసులు మంగళవారం అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. శిరస్త్రాణం లేని ద్విచక్ర వాహనదారులకు ఇక్కడ పోలీసులు జరిమానాలకు బదులు ఫ్రీగా హెల్మెట్లు అందిస్తున్నారు. స్థానిక కల్పనా స్క్వేర్ లో మంగళవారం ఈ కార్యక్రమంలో స్వయంగా పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జంట నగరమైన కటక్ లోనూ పోలీసుశాఖ ఈ స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టింది. కొత్త మోటారు వాహనాల చట్టం-2019 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించడంపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిబంధనల్ని మరో మూణ్నెల్లు దూకుడుగా అమలు చేయొద్దని పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీస్ శాఖ ఇప్పుడు రోడ్లపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. `ఎం.వి. చట్టం ఆదాయాన్ని సృష్టించే వ్యాపారం కాదు. ప్రజల భద్రతే మా లక్ష్యం` అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) సాగరికా నాథ్ అన్నారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పోలీసు సిబ్బంది ఉచితంగా శిరస్త్రాణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ముందు ఉల్లంఘనదారుల నుంచి రూ. 500 జరిమానా వసూలు చేసి వారికి చలాన్ తో పాటు ఫ్రీగా హెల్మెట్ అందిస్తున్నారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్, స్పీక్ ఆన్ మొబైల్ విత్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, విత్ అవుట్ హెల్మెట్, సీట్ బెల్ట్ డ్రైవింగ్, విత్ అవుట్ నెస్సెసరీ డాక్యుమెంట్స్ డ్రైవింగ్ చేయొద్దని వాహనచోదకుల్ని పోలీస్ కమిషనర్ సుధాన్షు సారంగి కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తున్న వాహనచోదకులకు గులాబీలు చేతికిచ్చి పోలీసులు అభినందించారు. 
బిహార్ లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే..
బీహార్‌ లోనూ పోలీస్ శాఖ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనచోదకులతో వినూత్న రీతిలో స్పందిస్తూ ఆశ్చర్య పరుస్తోంది. మంగళవారం తూర్పు చంపారన్ జిల్లాలోని మోతీహరి పట్టణంలో శిరస్త్రాణం ధరించని బైకర్లను పట్టుకుని దగ్గరుండి వారితో కొనిపించడం కనిపించింది. బీమా పునరుద్ధరణ చేయించని వారితోనూ అక్కడికక్కడే కార్యక్రమం పూర్తి చేయించింది.  ఇందుకు శిరస్త్రాణం అమ్మకందారులు, బీమా పాలసీ ఏజెంట్ల తో ఆయా తనిఖీ కూడళ్లలో స్టాల్స్ ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మోతీహరిలో ఛటౌని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ముఖేష్ చంద్ర కున్వర్ ప్రారంభించారు. ఉల్లంఘనదారులకు పోలీసులు జరిమానాలు విధించకపోవడం విశేషం. 1917 లో మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన మోతీహారి చారిత్రక ప్రాముఖ్యత తనకు ప్రేరణనిచ్చిందని ముఖేష్ చంద్ర కున్వర్ పేర్కొన్నారు.

Monday, September 9, 2019

ISRO more serious about fake accounts in social media on behalf of chairman Sivan


ఇస్రో చైర్మన్ శివన్ పేరిట సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో సోమవారం ఇస్రో రంగంలోకి దిగి ఆయనకు సోషల్ మీడియాలో ఎటువంటి వ్యక్తిగత ఖాతా లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేస్తూ `కైలాస్వాదివు శివన్` పేరిట సోషల్ మీడియాలో చాలా ఖాతాలు నడుస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. ఈ ఖాతాల నుంచి చంద్రయాన్-2 సమాచారం అంటూ అసత్యాలు వెలువడుతున్నాయని వాటిని నమ్మొద్దని కోరింది. చైర్మన్ డాక్టర్ కె. శివన్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతా ఒక్కటీ లేదని ఇస్రో ఆ ట్వీట్ లో స్పష్టం చేసింది. చైర్మన్ పేరిట నకిలీ ఖాతాల నుంచి వెల్లడవుతున్న సమాచారం ప్రామాణికం కాదని గమనించాలని కోరింది. ఎట్టి పరిస్థితిలో అబద్ధపు ప్రచారాన్ని నమ్మరాదని ఇస్రో హెచ్చరించింది. చంద్రయాన్-2 మిషన్, చంద్రునిపై లాండర్ విక్రమ్ స్థితిగతులకు సంబంధించిన ఏదైనా నవీకరణ ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


Sunday, September 8, 2019

Prez, V-Prez, PM, Sonia mourn Jethmalni`s demise


రాంజెఠ్మలానీ మృతికి రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి, ప్రధాని,సోనియా సంతాపం
ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రాంజెఠ్మలానీ (95) మృతికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం వెలిబుచ్చారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాంజెఠ్మలానీ ఆదివారం ఉదయం 7.45కు న్యూఢిల్లీలోని నివాసగృహంలో మరణించినట్లు ఆయన తనయుడు సుప్రీంకోర్టు న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. స్వతంత్ర భావాలు మెండుగా గల రాంజెఠ్మలానీ దేశంలోని పలు కీలక కేసులను వాదించి పేరుగడించారు. ముఖ్యంగా నేర సంబంధ వ్యాజ్యాల్ని వాదించడంలో దిట్ట. హత్య కేసులో ఇరుక్కున్న కె.ఎం.నానావతి (నేవీలో నిజాయతీ గల అధికారి)  తరఫున వాదనల్లో పాల్గొనడం ద్వారా రామ్ జెఠ్మలానీ ప్రముఖ క్రిమినల్ లాయర్ గా ఖ్యాతి పొందారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సీఎంత్రివేది, వై.వి.చంద్రచూడ్ లకు సహాయకునిగా వ్యవహరించారు. ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ లో రామ్ జెఠ్మలానీ తనదైన ముద్ర వేశారు. వృత్తి పరంగా వివాదాస్పద వ్యక్తుల కేసులు వాదించి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ హంతకులు తరఫున, భారత పార్లమెంట్ పై దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు పక్షాన కేసులు వాదించారు. అవినీతిపై పోరాడతానంటూ ఆయన 94వ ఏట న్యాయవ్యాది వృత్తి నుంచి పదవీ విరమణ ప్రకటించారు. దేశ విభజన కు ముందు సింధ్ ప్రాంతంలో జన్మించిన జెఠ్మలానీ 17 ఏళ్లకే న్యాయశాస్త్ర పట్టా పొందారు. కరాచీలో న్యాయవాది వృత్తి కొనసాగించారు. 18వ ఏట దుర్గా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి రాణి, శోభ, మహేశ్ సంతానం. రాణి కొద్ది కాలం క్రితమే మరణించారు. శోభ అమెరికాలో ఉంటున్నారు. దేశ విభజన జరిగిన ఏడాదికి ఆయన కుటుంబంతో ముంబయి వలసవచ్చారు. అప్పుడే  రత్న అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి జనక్ అనే కొడుకు ఉన్నాడు. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జనతాదళ్, బీజేపీల్లో పనిచేశారు. లోక్ సభకు రెండుసార్లు, ఓసారి  రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వాజ్ పేయి హయాంలో న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా వ్యవహరించారు.