Saturday, August 17, 2019

PM Modi in Bhutan: RuPay card launched, 9 MOUs exchanged

భూటాన్ లో రూపే కార్డు సేవల్ని ప్రారంభించిన ప్రధాని మోది

భారత ప్రధాని నరేంద్ర మోది భూటాన్ లో శనివారం రూపే కార్డు సేవల్ని ప్రారంభించారు. మోది ఆ దేశ ప్రధాని డాక్టర్ లోటే షెరింగ్ తదితరులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య   విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి తొమ్మిది అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మాంగేదాచులో జలవిద్యుత్ కేంద్రాన్నీ ప్రధాని ప్రారంభించారు. అనంతరం థింపులో ఇస్రో ఎర్త్ స్టేషన్ నూ మోది ఆరంభించారు. హిమాలయ సానువుల రాజ్యంలో రూపే సేవలు ప్రారంభమవ్వడం పట్ల మోది సంతోషం వ్యక్తం చేశారు. `రూపే కార్డు సేవలు ఆరంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది` అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత మే లో ఆయన సింగపూర్ లోనూ ఈ కార్డును ప్రారంభించారు. దాంతో ఉభయదేశాల ప్రజలు డిజిటల్ వాలెట్ (పరస్పర నగదు మార్పిడి ఆమోదం) సేవల్ని వినియోగించే అవకాశం కల్గింది. తాజాగా భారత్ రూపే కార్డు డిజిటల్ సేవలు అమలవుతున్న రెండో దేశంగా భూటాన్ నిలుస్తోంది. మార్చి నుంచే భూటాన్ లో ఈ కార్డు సేవల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తద్వారా భారత్ భూటాన్ ల మధ్య వాణిజ్యం, పర్యాటక రంగాల్లో ఇతోధిక పురోగతిని ఆశిస్తున్నారు. సింగపూర్ లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ద్వారా డిజిటల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా భారత్ లో ఈ రూపే కార్డు ద్వారా రిటైల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ ఫర్ సేవల గొడుగులా ఎన్.పి.సి.ఐ. పనిచేస్తోంది. రూపే కార్డులు మరికొన్ని దేశాల్లోనూ అమలులో ఉన్నాయి.

Friday, August 16, 2019

UNSC to discuss Kashmir issue on China`s request


ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ పై చర్చ !
నాలుగు దశాబ్దాల అనంతరం కశ్మీర్ పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చైనా ఈ మేరకు భద్రతా మండలికి లేఖ రాయడంతో సుదీర్ఘకాలం అనంతరం కశ్మీర్ అంశం అంతర్జాతీయ వేదికపై చర్చకు రానుంది. ఈ చర్చలో పాకిస్థాన్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. అయితే ఈ చర్చను రహస్యంగా సాగించనున్నట్లు యూఎన్ఎస్సీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. భద్రతా మండలి అధ్యక్షుడు జోన్నా రొనెకా(పోలెండ్) ఈ రహస్య కీలక చర్చ చేపట్టే వేదిక, తేదీని నిర్ణయించనున్నారు. భారత అంతర్గత భూభాగమైన జమ్ముకశ్మీర్ లో 370-ఎ (స్వయంప్రతిపత్తి) అధికరణం రద్దు, రాష్ట్ర విభజన చేపట్టిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ యూఎన్ఎస్సీ వేదిక పైకి వచ్చింది. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశమైన చైనా ఇందుకు సంబంధించి పావులు కదిపింది. కశ్మీర్ అంశంలో భారత్ వైఖరిని చైనా మినహా యూఎన్ఎస్సీలో మిగిలిన నాలుగు శాశ్వత సభ్యదేశాలు రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సమర్ధించాయి. కశ్మీర్ భారత అంతర్గత విషయమని ఆ వివాదాన్ని భారత్, పాక్ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరాయి. బుధవారం (ఆగస్ట్14) నాడు భద్రతా మండలిలో సిరియా, మధ్య ఆఫ్రికాల అంశం చర్చకు వచ్చింది. అయితే అదే సమయంలో కశ్మీర్ అంశంపై చర్చ జరపాలంటూ చైనా లేఖ ఇచ్చింది. చైనా ఈ మేరకు పట్టుబట్టగా ఫ్రాన్స్ ఈ అంశంపై కింది స్థాయిలో (ద్వైపాక్షిక) చర్చలు జరిగితే చాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కశ్మీర్ అంశంపై భద్రతా మండలిలో చివరిసారిగా 48 ఏళ్ల క్రితం చర్చ జరిగింది. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) వాసులు పాకిస్థాన్ అరాచక పాలనకు తాళలేక వేలసంఖ్యలో శరణార్థులుగా సరిహద్దులు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చారు. మరో వైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగి భారత్ భూభాగంపై మోర్టార్ దాడులకు తెగబడింది. ఈ నేపథ్యంలో తూర్పు పాకిస్థాన్ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు భారత్ అండగా నిలవాల్సి వచ్చింది. శరణార్థుల సమస్యను పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకుంటుండగా పాకిస్థాన్ యుద్ధానికి తొడగొట్టి పరాజయం పాలైంది. అమేయ భారత సైన్యం శక్తియుక్తులకు పాకిస్థాన్ తోకముడిచింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రదర్శించిన ధైర్య సాహసాల వల్లే స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పడింది. బీజేపీ దివంగత అగ్రనేత వాజ్ పేయి సైతం నాడు ఇందిరను అపర కాళికామాతగా ప్రశంసించారు. ఆనాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్-పాకిస్థాన్ యుద్ధం, కశ్మీర్ అంశం చర్చకు వచ్చాయి.

Thursday, August 15, 2019

Phone tapping: Cong demands probe as ruling BJP steps up



కర్ణాటకలో మళ్లీ ఫోన్ల ట్యాపింగ్ రగడ
కర్ణాటక మరో వివాదానికి వేదికయింది. తాజాగా కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాజా వివాదానికి తెరతీశారు. ప్రస్తుత సీఎం బి.ఎస్.యడ్యూరప్ప కాంగ్రెస్ నేతల ఆరోపణలకు స్పందిస్తూ విచారణకు ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ నేతలతో పాటు సీనియర్ పోలీసు అధికారుల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.ఎస్.సదానంద గౌడ విలేకర్లతో మాట్లాడుతూ అనధికారికంగా ఫోన్లను ట్యాప్ చేయడం క్రిమినల్ నేరంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణతో ట్యాపింగ్ దోషుల్ని పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు. సదానంద గౌడ స్వల్ప కాలం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగళూర్ ఉత్తర లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నగర అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో సీఎం యడ్యూరప్ప నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీఎంగా కుమారస్వామి పదవిలో ఉన్నప్పుడు నగరానికి కొత్త కమిషనర్ గా భాస్కర్ రావు నియమితులు కానున్నారంటూ ముందుగానే మీడియాకు విడుదలయిన ఆడియో టేప్ తాజా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతానికి కేంద్రబిందువయింది. కమిషనర్ తో పాటు ఇద్దరు ఐ.పి.ఎస్ ఆఫీసర్ల టెలిఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ ఉదంతంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైం) ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు (ఏప్రిల్ 18,23) ముగిశాక మే,జూన్ ల్లో మొత్తం మూడుసార్లు భాస్కర్ రావు ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు బట్టబయలయింది. కొత్త సీఎం యడ్యూరప్ప బెంగళూర్ సిటీ పోలీస్ కమిషనర్ గా అలోక్ కుమార్ సింగ్ (1994 బ్యాచ్) స్థానంలో భాస్కర్ రావు(1990 బ్యాచ్)ను ఆగస్ట్ 2న నియమించిన సంగతి తెలిసిందే. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు భాస్కర్ రావు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) హోదాలో కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కె.ఎస్.ఆర్.పి) విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు నిర్ధారణ అయింది. అలోక్ సింగ్ కమిషనర్ గా కనీసం మూడు నెలలు పనిచేయకుండానే కె.ఎస్.ఆర్.పి.కి బదిలీ అయ్యారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి సీఎల్పీ  నాయకుడు సిద్ధరామయ్య ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం తనకు తెలియదన్నారు.
1988లో ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ ల వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన జనతా పార్టీ లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. 1983 నుంచి 88 వరకు తిరుగులేని నాయకుడిగా రాష్ట్రాన్ని పాలించి చివరకు ఫోన్ల ట్యాపింగ్ వివాదం వల్ల పదవి నుంచి తప్పుకున్నారు.

Wednesday, August 14, 2019

Chandrayaan-2 Successfully Enters Lunar Transfer Trajectory


చంద్రుని పరిభ్రమణ కక్ష్యలోకి చంద్రయాన్-2 వ్యోమనౌక

చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని పరిభ్రమణ మార్గంలోకి ప్రవేశించింది. మంగళవారం రాత్రి 02.21కి విజయవంతంగా వ్యోమనౌక చంద్రుని కక్ష్య దిశగా ముందుకు సాగుతున్నట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన చంద్రయాన్-2ను జులై 23 న శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్) నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. జీఎస్ఎల్వీ ఎం.కె-3 ఎం-1 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక వివిధ దశలను దిగ్విజయంగా దాటుతూ పురోగమిస్తోంది. బెంగళూరులోని అబ్జర్వేటరీ కేంద్రం నుంచి వ్యోమనౌక స్థితిగతుల్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు. తాజాగా వ్యోమనౌక ఇంజిన్ లోని ద్రవ ఇంధనాన్ని 1,203 సెకన్ల పాటు మండించారు. ఆగస్ట్ 20న ప్రస్తుత చంద్రుని కక్ష్యలోకి వ్యోమనౌక చేరుకుంటుంది. మరోసారి ఆ రోజు వ్యోమనౌక ఇంజిన్ లో ద్రవ ఇంధనాన్ని మండించనున్నారు. అక్కడ నుంచి అయిదు దశల ప్రయాణం అనంతరం తుది లక్ష్యంలోకి అడుగుపెడుతుంది. తుది అయిదో దశలో చంద్రగ్రహ ఉపరితలానికి 100 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోకి వ్యోమనౌక చేరుకుంటుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.